‘ట్రంప’రితనం.. రష్యాపై కోపం.. భారత్ పై 500శాతం సుంకం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం వెర్రితలలు వేస్తోంది.  ఉక్రెయిన్ తో నాన్ స్టాప్ వార్ చేస్తోన్న ర‌ష్యాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఆయనొక కొత్త మార్గం క‌నిపెట్టారు. దానిపేరే భారీ ఎత్తున సుంకాల విధింపు. గ‌త కొంత కాలంగా భార‌త్ ర‌ష్యా నుంచి పెద్ద ఎత్తున చ‌మురు కొంటోంది. ఒక్క భారత్ మాత్ర‌మే కాదు ర‌ష్యా నుంచి చైనా, ట‌ర్కీ, ఇత‌ర ఆఫ్రిక‌న్ దేశాలెన్నో చ‌మురు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఇక్క‌డ విడ్డూర‌మేంటంటే.. ర‌ష్యాపై తాము అధిక సుంకాలు విధించి శిక్ష విధించ‌ద‌లుచుకున్నాం కాబ‌ట్టి.. ర‌ష్యా నుంచి చ‌మురు కొనే దేశాల నుంచి మా దేశంలో దిగుమ‌తి చేసే వ‌స్తువుల‌పై 500 శాతం మేర ప‌న్ను విధిస్తామంటున్నారు.  ఈ బిల్ల‌ును రిప‌బ్లిక‌న్ సెనెట‌ర్ గ్రాహం ఏప్రిల్ నెలలో ప్ర‌తిపాదించ‌గా.. దాన్ని ట్రంప్ కూడా    బాగానే ఉంద‌ని అన్నారు. కేబినెట్ మీటింగ్ త‌ర్వాత ఆయ‌న్ను అడిగిన మీడియా వారికి అవును ఇది నా ఎంపిక అంటూ బాహ‌టంగా కుండ బ‌ద్ధ‌లు కొట్టారాయ‌న‌. ఒక్క గ్రాహంతో పాటు 84 మంది సెనెట‌ర్లు.. ఈ ర‌ష్య‌న్ ఈ శాంక్ష‌న్ బిల్- 2025కి మ‌ద్ధ‌తుగా ఉన్నార‌ట‌. ఈ బిల్లు వ‌చ్చే ఛాన్సు లేదు కానీ.. ఒక వేళ వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చ కూడా మొద‌లైంది. ఒక వేళ ఇదే జ‌రిగితే.. ప్ర‌పంచం రెండుగా చీలినా ఆశ్చ‌ర్యం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికాతో ఉన్న దౌత్య, వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తింటాయి. అంతే కాదు ఇక‌పై వాషింగ్ట‌న్ పై ఆధార‌ప‌డే దేశాలు కాస్తా.. ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు చూస్తాయి. దీంతో పెద్ద ఎత్తున అమెరికా వ్యాపారులు, వినియోగ‌దారులు న‌ష్ట‌పోతారు. అంతేకాదు ఎల‌క్ట్రానిక్, ఆటోమొబైల్ వంటి యూఎస్ సెక్టార్స్ లో ద్ర‌వ్యోల్బ‌ణం వ‌స్తుంది. దీంతో అమెరికా తీవ్ర న‌ష్టాల పాలు అవుతుంది. అయితే ఇక్క‌డే భార‌త‌ పెట్రోలియం మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురీ.. ఇదంతా  ప్ర‌పంచానికే మేలు చేసేద‌ని అన్నారు. తాము ర‌ష్యా నుంచి చీపుగా పెట్రోలు కొన‌డం వ‌ల్ల‌.. ప్ర‌పంచ‌ పెట్రోలు ధ‌ర‌లు నియంత్రణలో,  అందుబాటులో ఉన్నాయ‌ని.. అదే ర‌ష్యా రోజుకు ఉత్ప‌త్తి చేసే 9 మిలియ‌న్ బ్యార‌ళ్ల చ‌మురు అలాగే నిలిచి పోతే.. ఆ మేర‌కు ఈ చ‌మురు ఇత‌రుల నుంచి కొనాల్సి వ‌స్తుంది. త‌ద్వారా.. చ‌మురు ధ‌ర‌లు బ్యార‌ల్ కి 120 నుంచి 130 డాల‌ర్లకు పెరుగుతుంది, కాబ‌ట్టి తాము చేసింది స‌రైన పనే అన్నారు కేంద్ర మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పురి. ఇక్క‌డ గుర్తించాల్సిన మ‌రో  విష‌య‌మేంటంటే.. చ‌మురు ధ‌ర‌ల‌పై ఆంక్ష‌లున్నాయి కానీ చ‌మురు కొనాలా  వ‌ద్దా అన్న కోణంలో ఆంక్ష‌లు విధించ‌లేద‌ని అంటారు మ‌న  కేంద్ర‌మంత్రి. అయితే ఈ విష‌యంపై ర‌ష్యా స్పందిస్తూ.. ఇలాంటి బిల్లులు అమెరిక‌న్ కాంగ్రెస్ పాస్ చేస్తే.. ఇక ఆ దేశాన్ని ఎవ్వ‌రూ కాపాడ‌లేర‌ని అంటోంది. అంతే కాదు.. ఉక్రెయిన్ కి తాము సైనిక‌ సాయం చేస్తామ‌ని అమెరికా ప్ర‌క‌టించినంత‌నే ర‌ష్యా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేసి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంటే యూఎస్ ఎంత ర‌ష్యాను క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తే ఆ దేశం మ‌రింత  రెచ్చిపోతుంది. ఈ విషయం ఇప్పటికే రుజువైంది.   అయినా రష్యాతో గొడ‌వ ఉంటే ఆ దేశంతో చూసుకోవాలి. కానీ ఇలా ఇత‌ర దేశాల మీద ప్ర‌తాపం  చూపిస్తామ‌న‌డ‌మేంటి? భార‌త్ -పాక్  మద్య సత్సంబంధాలు లేవు. అయినా  అలాంటి పాక్ అమెరికా అక్కున చేర్చుకుని సహకారం అందించడం లేదా?  అలాగే పాక్ కి డ్రోన్ సాయం చేసిన ట‌ర్కీకి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌లేదా? అమెరికా చేస్తే నీతి ప‌క్క‌నోళ్లు చేస్తే ద్రోహ‌మా? అంటూ అమెరిక‌న్ విధానాల‌ను దుమ్మెత్తి పోస్తున్నారు   అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.

విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టేసిన కొత్త కెప్టెన్ శుభమన్ గిల్

భారత జట్టు నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి మరీ ఈ రికార్డును సాధించాడు. భారత టెస్ట్ జట్టు నూతన సారథి శుబ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బ్యాట్‌కు ఒక రేంజ్లో పనిచెప్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గిల్ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో పలు పాత రికార్డులకు బ్రేక్ చేస్తూ ఫోకస్ అవుతున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో మరో క్రేజీ రికార్డు సృష్టించాడు శుబ్‌మన్. ఏకంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అతడు అధిగమించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులలో కలిపి  ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 585 పరుగులు చేసిన గిల్.. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 16 పరుగులు చేశాడు. దీంతో  ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ 601 పరుగులకు చేశాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు బాదిన వారి లిస్ట్‌లో లెజెండ్ రాహుల్ ద్రవిడ్  (4 ఇన్నింగ్స్‌ల్లో 602 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో గిల్ (601) నిలిచాడు. శుబ్‌మన్ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (593), సునీల్ గవాస్కర్ (542) ఉన్నారు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5 మ్యాచుల్లో 712 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నందున జైస్వాల్‌ను గిల్ అలవోకగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన గిల్.. మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్ లో  విఫలమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు గిల్.  స్పీడ్‌స్టర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే గిల్ ఔట్ అయినా ఒక ఎండ్‌లో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 నాటౌట్), మరో ఎండ్‌లో పించ్ హిట్టర్ రిషబ్ పంత్ (19 నాటౌట్) గట్టిగా నిలబడ్డారు. రెండో రోజు ఆటను విజయవంతంగా ముగించారు.

టీటీడీని అప్రతిష్ట పాలు చేసింది వైసీపీనే : భానుప్రకాష్ రెడ్డి

  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యల పై దుమారం రేపుతోంది. టీటీలో వెయ్యి మంది వరకు అన్యమతస్తులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. కరుణాకర్ రెడ్డి మాటల పై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. టీటీడీ ని అప్రదిష్ట పాలి చేసింది వైసీపీ అన్నారు. ప్రతి ఉద్యోగి ఇంటికి వెళ్ళి పరిశీలనకు బోర్డు సమావేశం లో చర్చించనున్నట్లు తెలిపారు.  మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలను  టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల నుంచి దేవాదాయశాఖకు సంబంధించిన ప్రక్షాళన ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు అర్చకుల సమస్యలు, భక్తులకు మెరుగైన సేవలందించేందుకు నేడు సమావేశం నిర్వహిస్తున్నట్టు మంత్రి ఆనం తెలిపారు

అరుణాచలంలో మోత్కూరు యువకుడి దారుణ హత్య

అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణహత్యకు గురయ్యాడు.  యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన  చిప్పలపల్లి రవీందర్ ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా అసెంబ్లీ ప్రాంగణం లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో నివశిస్తున్నారు.ఆయన కుమారుడు విద్యాసాగర్ (28) మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ కంపెనీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు. విద్యాసాగర్ గతం లో రెండు సార్లు స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లి వచ్చాడు. అయితే మూడో సారి ఒంటరిగా వెళ్లాడు. ఈ నెల 4న మోత్కూరు వచ్చి తాతను చూసి.. ఆ తరువాత 6వ తేదీన అరుణాచలం బయలుదేరి వెళ్లాడు.  అరుణాచలంలో ఆలయ గిరిప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో అక్కడకు వెళ్లిన విద్యాసాగర్  ఈనెల 8న రాత్రి వేళ గిరిప్రదర్శన చేస్తుండగా..  గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి గొంతు కోశారు. రాత్రంతా కొన ఊపిరితో  రోడ్డుపైనే పడి ఉన్న విద్యాసాగర్ ను 9వ తేదీ ఉదయం పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.  ఈ మేరకు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అరుణాచలం వెల్లారు. పోస్టుమార్టం తరువాత విద్యాసాగర్ మృతదేహాన్ని   స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.  

పాలిటిక్స్ చాలా కాస్ట్‌లీ.. వేతనం సరిపోవట్లేదు : కంగనా రనౌత్‌

ప్రస్తుత  రాజకీయాలపై హిమాచల్‌ప్రదేశ్ మండి ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాజకీయాలు ఖర్చుతో కూడినవి అని ఎంపీ జీతం సరిపోవటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో ఉండే సిబ్బందికి శాలరీలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని అన్నారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  నియోజకవర్గంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం కనీసం 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే చాలామంది లోక్ సభ్యులకు బిజినెస్ లు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని తెలిపారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం అవుతుంది కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమన్నారు.

కర్మణ్యే.. విజయసాయి పోస్టు ఆంతర్యమేంటి?

మద్యం కుంభకోణం కేసులో సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు మాజీ ఎంపీ. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వలన రాలేకపోతున్నట్లు విజయసాయి సమాచారం పంపారు.   రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి శనివారం (జులై 12)న సిట్ విచారణకు హాజరు కాలేదు. మరో రోజు వస్తాననీ, ఏ రోజు అన్నది ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాననీ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అంత కంటే ముందే విజయసాయి  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో   కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకం పోస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పోస్టు తెగ వైరల్ అవుతోంది. అంతకు మించి ఆసక్తి రేకెత్తిస్తోంది.   విజయసాయి రెడ్డి ముందు ముందు ఏం చేయబోతున్నారనడానికి ఈ పోస్టు ఒక సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మద్యం కుంభకోణం విషయంలో తనకు తెలిసిన అన్ని వివరాణలూ ఫలితాలు, పరిణామాల గురించి ఆలోచించకుండా సిట్ కు నివేదించడానికి విజయసాయిరెడ్డి తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నారనడానికి ఈ పోస్టు ఒక నిదర్శనంగా చెబుతున్నారు.   జగన్ మోహన్ రెడ్డిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని విజయసాయి రెడ్డి గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండే అవకాశాలు ఇసుమంతైనా లేవనడానికి ఈ పోస్టే సాక్ష్యంగా పేర్కొంటున్నారు.  అంటే విజయసాయిరెడ్డి ఈ పోస్టు ద్వారా తాను మద్యం కుంభకోణంలో జగన్ పాత్రపై సిట్ కు వాంగ్మూలం ఇవ్వడానికి రెడీ అయిపోయిన సంగతిని పరోక్షంగా భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేయడం ద్వారా చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్గున్నారు. విజయసాయి మళ్లీ  జగన్ పంచన చేరుతారనీ, పార్టీలో మళ్లీ కీలకంగా వ్యవహరిస్తారనీ వస్తున్న వార్తలన్నీ ఊహాగాన సభలే అనడానికి కర్మణ్యేవాధికారస్య పోస్టు తిరుగులేని నిదర్శనంగా చెబుతున్నారు. 

టాస్క్ ఫోర్స్ పోలీసుల దారిదోపిడీ

ఖమ్మంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కంచే చేను మేసిన చందంగా వ్యవహరించారు. దోపిడీలను అరికట్టాల్సిన వారే.. దారిదోపిడీకి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.  ఖమ్మంలో రాజస్థాన్ కు చెందిన మిర్చి వ్యాపారి గమస్తా రూ. 10లక్షల నగదు తో రాత్రి సమయంలో వెళ్తుండగా టాస్క్ ఫోర్సు పోలీసులు అడ్డగించారు.  గంజాయి కేసులో ఇరికిస్తామంటూ బెదరించి ఆ వ్యాపారి వద్ద ఉన్న పది లక్షల రూపాయలలో ఆరు లక్షల రూపాయలు తీసేసుకున్నారు. ఆ తరువాత అతడిని విషయం ఎవరికీ చెప్పవద్దని బెదరించి విడిచిపెట్టారు.  ఖమ్మంలో జరిగిన ఈ సంఘటనను రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి అసోసియేషన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసోసియేషన్ నాయకులు విషయాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ తెలియజేశారు. దీనిపై విచారణ జరిపించిన కమిషనర్ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మరో అధికారిని డీఐజీ ఆఫీసుకు సరెండర్ చేశారు. అలాగే వ్యాపారి గుమస్తా నుంచి పోలీసులు అపహరించిన ఆరు లక్షల రూపాయలను రికవర్ చేసి వ్యాపారికి అప్పగించారు.  

గ్రామ పెద్దల అమానుషం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను ఎలా శిక్షించారంటే..?

ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలూ అంగీకరించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసినా కూడా ఆచారం పేరిట గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. పెద్దల అంగీకారంతో ప్రేమపెళ్లి చేసుకున్న ఓ జంట ఏదో చేయకూడని ఘోర అపరాధం చేసిందన్నట్లుగా గ్రామ పెద్దలు అమానుష శిక్ష విధించారు. ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ప్రేమపెళ్లి గ్రామ ఆచారం ప్రకారం పెద్ద తప్పు అంటూ కంజమజ్జిరా గ్రామ పెద్దలు ఆ జంటకు దారుణమైన శిక్ష విధించారు. ఆ జంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. ఆ తరువాత పాపపరిహారం అంటూ ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి చిత్రహింసలకు గురి చేశారు.  పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు ఇంతటి అమానుష శిక్ష విధించిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

ఢిల్లీలో కుప్ప కూలిన మరో భవనం.. శిథిలాల కింద జనం

ఢిల్లీ ఆజాద్ మార్కెట్‌లో ఓ బిల్డింగ్ కుప్పకూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది. శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ మధ్య కాలంలో భవనాలు కుప్పకూలుతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఓ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో రెండు బిల్డింగులు కూలిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆజాద్ మార్కెట్ ఏరియాలో ఓ బిల్డింగ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 45 ఏళ్ల పప్పు అనే వ్యక్తి చనిపోయాడు. బిల్డింగ్ సమీపంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెట్రో పనుల కారణంగా బిల్డింగ్ కుప్పకూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆజాద్ మార్కెట్‌లో బిల్డింగ్ కూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది.   శనివారం (జులై 12) ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.  సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు ఉన్నట్లు సమాచారం. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే..  ప్రమాదానికి గల కారణాలు  తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని భీకర దృశ్యాలు కలచి వేస్తున్నాయి. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఆ ఇళ్లులు కూడా బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిన్న రజత్ భార్గవ - నేడు విజయసాయి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఎవరూ ఊహించనంత లోతుగా వెళ్తోంది.  చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణం ఎలా జరిగిందో.. డబ్బులు ఎలా రూట్ అయ్యాయో మొత్తం తెలుసుకున్న సిట్..  ఇప్పుడు అందులో పాత్రధారులు, సూత్రధారుల్నే కాదు..  డమ్మీలుగా వాడుకున్న అధికారులతో కలిపి డాట్స్ కలుపుతోంది.  దీంతో కేసు దర్యాప్తు అసలు కింగ్ పిన్ దగ్గరకు చేరువ అవుతోంది.  కొన్ని నెలల కిందటే రిటైర్ అయిన  సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు  చాలా సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు తన పర్యటనలలో రజిత్ భార్గవను ఆయనను పక్కన పెట్టుకునే ఎక్కువ దేశాలకు తిరిగేవారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం రజత్ భార్గవ పరిస్థితి తారుమారైంది. జగన్ రజత్ భార్గవను ఆయనను ముందు పెట్టి మద్యం కుంభకోణం వ్యవహారం నడిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ హయాంలో ఉన్నతాధికారిగా రజత్ భార్గవ  పాత్ర పరిమితం అయిపోయిం దంటారు. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా సిట్ దర్యాప్తులో బయటకు వస్తున్నది. సిట్ ఎదుట రజత్ భార్గవ్ మద్యం కుంభకోణం గుట్టు రట్టు చేశారని, పూసగుచ్చినట్లు జరిగిందేమిటో చెప్పేశారని అంటున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన క్లూస్ అన్నీ రజత్ భార్గవ సిట్ కు ఇచ్చేశారని అంటున్నారు.   ఇక పోతే ఈ కేసులో ఏ5గా ఉన్న విజయసాయిరెడ్డి శనివారం (జులై 12)న సిట్ ముందు హాజరయ్యారు. ఆయన గతంలోనే  ఈ కుంభకోణం విషయంలో తనను తాను విజిల్ బ్లోయర్ గా చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్నదానికి సార్థకత రావాలంటే..  ఇంకా చాలా చాలా చెప్పాల్సి ఉంటుందని  సిట్ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియాఅంతా రాజ్ కేసిరెడ్డే అని అంటున్నారు.. కానీ  కుంభకోణంలో  డబ్బంతా జగన్ రెడ్డికి చేరిందంని మాత్రం చెప్పడం లేదు. అలాగని చేరలేదని కూడా చెప్పడం లేదు. ఆ విషయం తనకు తెలియదంటున్నారు.  నేరుగా కాకపోయినా.. కొన్ని క్లూస్  ఆయన దర్యాప్తు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రాకూడదనే విజయసాయిరెడ్డి ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు.  తాజా విచారణలో సిట్ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని విజయసాయిరెడ్డి ఇస్తారని భావిస్తున్నారు.  రూ.32 కోట్ల వరకూ లిక్కర్ స్కామ్ సొమ్మును జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ జరిగిన స్కాంలో ఇది చాలా చిన్న మొత్తం. వందల కేజీల బంగారం, అంతకు మించి షెల్ కంపెనీల్లో నగదు. భారతి సిమెంట్స్, పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్  లోకి చేరిన నగదు, ఇంకా డెన్‌లలలో మిగిలి ఉన్న నోట్ల కట్టల బండిల్స్ ను సిట్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బయటకు తీసుకు రావడం చాలా అవసరం.  

భగవద్గీత శ్లోకం ట్వీట్ చేసిన విజయసాయి

కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు.. కానీ వాని ఫలితముల మీద లేదు... నీవు కర్మఫలములకు కారణం కారాదు... అట్లని కర్మలను చేయుట మానరాదు ...  విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో తాజా పెట్టిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు విజయసాయి శనివారం (జులై 12) ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.    ఇదిలా ఉండగా.. సిట్ నోటీసుల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  ‘కర్మణ్యే వాధికారస్తే’ అంటూ భగవద్గీత శ్లోకాన్ని  పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పడు తెగ వైరల్ అయ్యింది.  

బ‌ద్రీ, నందా మ‌ధ్య డిష్యూం డిష్యూం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు ప్ర‌కాష్ రాజ్. జ‌స్ట్ ఆస్కింగ్ ద్వారా ఈ స్థాయిలో అమ్మ‌క‌మా అంటూ ప‌వ‌న్ పై మ‌రో మారు విమ‌ర్శ‌లు గుప్పించారాయ‌న‌. గ‌త మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ని అధ్య‌క్షుడిగా చేయ‌డం కోసం మెగా కాంపౌండ్ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. నాగ‌బాబు ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ ఎన్నిక‌ల్లో ఫైట్ చేశారు. ప‌వ‌న్ కూడా ప్ర‌కాష్ రాజ్ కే స‌పోర్ట్ చేశారు. ఒక్క ఈ ఇద్ద‌రే కాదు మెగా కాంపౌండ్ మొత్తం ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ త‌రుఫున నిల‌బ‌డ్డారు. అయితే అది వేరు- ఇది వేర‌ని అంటారు ప్ర‌కాష్ రాజ్. బేసిగ్గా ఆయ‌న నాస్తికుడు. కొంత వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న వ్యక్తి ప్రకాశ్ రాజ్.  ఆయ‌న నేప‌థ్యం అలాంటిది. డీప‌ర్ కర్ణాట‌క నుంచి త‌న తండ్రి బెంగ‌ళూరు రావ‌డం.. అక్క‌డ ఆరోగ్యం బాగ‌లేక ఆస్ప‌త్రిలో చేరితే.. అక్క‌డొక న‌ర్సుతో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి ఆపై ఆమెనే పెళ్లాడారాయ‌న‌. ఆ త‌ర్వాత పుట్టిన సంతానంలో ఒక‌రు ప్ర‌కాష్ రాజ్.  ఎన్నేసి హిందూ సినిమాల్లో హిందూ పాత్ర‌లు చేసినా.. స‌రే ఆయ‌న బ‌య‌ట మాత్రం యాంటీ హిందూ- యాంటీ మోడీ- యాంటీ బీజేపీ-  లాంగ్వేజ్ లో మాట్లాడ‌తారు. అయితే ఇక్క‌డ ప‌వ‌న్ కి ప్ర‌కాష్ రాజ్ కి ఉన్న గొడ‌వేంట‌ని చూస్తే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా హిందుత్వాన్ని భుజానికెత్తుకుని మోస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.  మొన్న‌టి మురుగన్ మానాడు, అటు పిమ్మ‌ట హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో  హిందుత్వ నినాదం.. ఇలా సినిమా ప‌రంగా, రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న హిందుత్వాన్ని ప‌బ్లిగ్గానే హ్యాండిల్  చేస్తున్నారు. వ‌క్ఫ్ బోర్డులాగా స‌నాత‌న్ బోర్డు ఉంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే కాషాయంలో తిర‌గ‌డానికైనా వెన‌కాడ్డం లేదు. దేవాల‌యాల‌కు కూడా విరివిగా తిరుగుతున్నారు. వీట‌న్నిటినీ చూసిన ప్ర‌కాష్ రాజ్.. ఆయ‌నపై గ‌త కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా కూడా అమ్ముడ‌వుతారా? అంటూ ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఈ కామెంట్ల కాట్లాట‌లో చివ‌రికి ఎవ‌రు గెలుస్తారు? అస‌లు ప‌వ‌న్ స్కెచ్ ఏంటి? మ‌ధ్య ప్ర‌కాష్ రాజ్ ఈ గిచ్చుడేంట‌న్న‌ది ఇటు పొలిటిక‌ల్ అటు సినిమా ఇండ‌స్ట్రీలో వాడీ వేడిగా చ‌ర్చ న‌డుస్తోంది.

మోడీకి ఆర్ఎస్ఎస్ ఎసరు?

ప్రధాని నరేంద్రమోడీకి బీజేపీ మెంటార్ గా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎసరు పెడుతోందా?  బీజేపీలో, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మోడీ వ్యక్తిపూజ పీక్స్ చేరిందని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆయన పదవి దిగిపోవాలని కోరుకుంటోందా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు, ఆ తరువాత దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి కొనసాగుతున్న ప్రధాని మోడీని ఆ పదవి నుంచి దిగిపోవాల్సిందేననీ, ఆ టైమ్ ఇచ్చేసిందనీ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ గుర్తు చేస్తుండటం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నారు. వచ్చే సెప్టెంబర్ తో ప్రధాని మోడీకి 75 ఏళ్లు వస్తాయి.  ప్రధాని మోడీ హవా బీజేపీలో మొదలైన తరువాత ఆయనే 75 ఏళ్ల వయస్సు నిబంధనను తీసుకువచ్చారని చెప్పాలి. 75 సంవత్సరాలు వచ్చిన  వారెవరూ పార్టీ, ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా నిబంధన విధించారు. ఇప్పుడు మోడీ 75 సంవత్సరాల నిబంధన పరిధిలోకి వస్తున్నారు. ఇక్కడ వయస్సు నిబంధన విషయంలో మోడీకి మినహాయింపు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం మోడీకి వయస్సు గురించి గుర్తు చేస్తూ వారసుడి అన్వేషణ అనివార్యం అని హెచ్చరిక లాంటి సూచన చేస్తోంది.   ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్‌భ‌గ‌వ‌త్‌.. ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని  ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఆయన వయస్సు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీకి ఓ హెచ్చరికేనని అంటున్నారు.   స్థాయితో సంబంధం లేకుండా నాయకుడనే వారు ఎవరైనా సరే నిబంధనలు పాటించి తీరాలి. అలా పాటించకపోతే అసలు నిబంధనలు ఎందుకు? అంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ ప్రధానిగా కొనసాగే విషయంలో ఆయన విస్పష్టంగా తన అభ్యంతరాన్ని చెప్పినట్లుగానే ఉన్నాయి. 75 ఏళ్లు వచ్చిన తరువాత ఎవరైనా సరే తమ పదవులు త్యాగం చేయాల్సిందేనని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు. దీంతో    న‌రేంద్ర మోడీ ప్రధాని పదవిలో కొనసాగడంపై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ ఏడాది సెప్టెంబర్ తో ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. ఈ క్ర‌మంలో నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌ధాని ప‌ద‌విని వ‌దులు కోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌గా ఉన్న మోహ‌న్‌భ‌గ‌వ‌త్ కూడా అదే నెల‌లో ప‌ద‌వీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబ‌రు నాటికి ఆయ‌న మోడీ కంటే కూడా.. ముందే 75వ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌నున్నారు. దీంతో ముందు ఆయ‌న రిజై న్ చేసి..కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. ప్ర‌ధాని మోడీకి కూడా తాను తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుందని అంటున్నారు.  కానీ..  బీజేపీని మూడుసార్లు వ‌రుస‌గా అధికారంలోకి తెచ్చిన నాయ‌కుడిగా మోడీ పదవి నుంచి తప్పుకోవడానికి బీజేపీ అంగీకరిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ప్ర‌పంచ దేశాల‌కు కూడా ‘విశ్వ‌గురు’గా గుర్తింపు పొందిన మోడీ.. ఇప్పటి కిప్పుడు అధికారం నుంచి దిగితే? ఎలా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.   ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, వ‌న్ నేష‌న్‌-వన్.. ఇలా దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ సాధించాలని ప్రయత్నిస్తున్న లక్ష్యాలను మోడీ తనహయాంలో సాధించి చూపారు.  ఈ నేపథ్యంలో మోడీకి దిగిపోవాలంటూ  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్ష హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మోడీకి సన్నిహితుడు.. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు కుడి భుజంగా ఉంటూ వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను ప్రధాని రేసులో లేనని విస్పష్టంగా చెప్పేశారు. తాను రాజకీయ రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో మోడీని కొనసాగించడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. కానీ ఇక్కడే ఆ పార్టీకి గట్టి చిక్కు వచ్చి పడింది. బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వారి విషయంలో మోడీషా ద్వయం అనుసరించిన విధానంపై బీజేపీలోనే తీవ్ర అసంతృప్తి ఉంది. అటువంటి నాయకుల విషయంలో వయస్సు నిబంధనను కఠినంగా అమలు చేసి వారిని రాజకీయాలకు దూరం చేసిన తీరు పట్ల జనసామాన్యంలో కూడా ఒకింత అసహనం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ కూడా స్టెప్ డౌన్ అయి.. వయస్సు నిబంధన అన్నది తనకు కూడా వర్తిస్తుందని రుజువు చేసుకోవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద 75 ఏళ్ల వయస్సు నిబంధన ఇప్పుడు మోడీ విషయంలో అమలు అవుతుందా? లేదా అన్న ఉత్కంఠ దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. 

యలమంచలి వైసీపీలో గుడివాడ వివాదం

వైసీపీలో జరుగుతున్న  పరిణామాలు గమనిస్తే.. ఇదంతా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అన్న అనుమానం కలగక మానదు. వైసీపీకి ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలవా అన్నట్లు ఆ పార్టీ నేతలు అంతర్గత విభేదాలను రచ్చకీడ్చి కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీ నియామకం వైసీపీలో రచ్చకు కారణమౌతోంది. కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ హైకమాండ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.    చాలా కాలంగా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొనసాగుతున్నారు.  గత ఎన్నికల్లో తనకు బదులు తన కుమారుడు సుకుమార వర్మ కు ఎలమంచిలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని జగన్మోహన్రెడ్డిని కోరారు కానీ..  ఆయన నిరాకరించడంతో కన్నబాబు రాజు స్వయంగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ వ్యతిరేక పవనాలలో పరాజయం పాలయ్యారు.  ఓటమి తరువాత కన్నబాబురాజు రాజకీయంగా పెద్ద యాక్టివ్ గా లేరు. అయితే గత రెండు నెలలుగా ఆయన మళ్లీ చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.  ఈ దశలో ఆయన వచ్చే ఎన్నికలలో తన కుమారుడిని పోటీకి నిలబెట్టాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా ఉంటున్నారు. అయితే..  ఈ దశలో ఉన్నట్టుండి కరణం ధర్మశ్రీని ఎలమంచిలి సమన్వయకర్తగా పార్టీ హైకమాండ్ నియమించింది.  ఈ ప్రకటనకు కొన్ని రోజులు ముందు  కన్నబాబు రాజును వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మాట్లాడారు.  ఆ సందర్భంగా ఈ సారి కన్నబాబు రాజుకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   అయితే మొదటి నుంచీ కూడా కన్నబాబురాజు ప్రత్యక్ష ఎన్నికలో తన కుమారుడిని గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకు కావలసిన పట్టు కన్నబాబురాజుకు యలమంచలి నియోజకవర్గంలో ఉంది కూడా. అందుకే జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ కు కన్నబాబురాజు అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో  సరిగ్గా తన పుట్టినరోజు రోజున పార్టీ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ ప్రకటన వెలువడటంపై కన్నబాబురాజు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీలోని ఒక వర్గం తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని కన్నబాబురాజు భావిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనవసరంగా తన నియోజకవర్గ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో కూడా గుడివాడ అమర్నాథ్   బొడ్డేడి ప్రసాద్ ద్వారా తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగించారని ఈ సందర్భంగాకన్నబాబురాజు గుర్తు చేస్తున్నారు.  పార్టీ పరాజయం తరువాత గుడివాడ అమర్నాథ్ ను పార్టీ అధినేత జగన్ చోడవరం ఇన్చార్జిగా నియమించారు. దీంతో అప్పటి వరకూ అక్కడ ఇన్ చార్జ్ గా ఉన్న కరణం ధర్మశ్రీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇక్కడే గుడివాడ చక్రం తిపపారని కన్నబాబురాజు వర్గం అనుమానిస్తోంది. తన వయస్సును కారణంగా చూపి పక్కన పెట్టే విధంగా గుడివాడ తనకు వ్యతిరేకంగా పావులు కదిపారనీ, ఆ కారణంగానే  యలమంచలి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా కరణం ధర్మశ్రీ నియామకం జరిగిందని కన్నబాబు రాజు వర్గం అంటున్నది. వాస్తవానికి కన్నబాబు రాజు తన స్థానంలో తన కుమారుడిని తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కన్నబాబురాజు కుమాడుడు సుకుమార్ వర్మ గత దశాబ్దంగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉంటున్నారు. ఇప్పుడు ఉరుములేని పిడుగులా నియోజవర్గ సమన్వయకర్తగా జగన్ కరణం ధర్మశ్రీని నియమించడం వెనుక గుడివాడ అమర్నాథ్ ఉణ్నారని కన్నబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.  కరణం ధర్మశ్రీ నియామకంతో ఉత్తరాంధ్ర వైసీపీలో సామాజిక సమతుల్యం కూడా దెబ్బతిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక పోతే  యలమంచలిలో కరణం ధర్మశ్రీకి సహకారం అందే పరిస్థితి ఇసుమంతైనా లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో నియోజవకర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. 

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి

భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి చేరువలో ఇక్కడ నీటిమట్టం ఉంది.  ప్రజలు నదిలోకి దిగకుండా, లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం 40.40 అడుగులకు చేరింది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 

ఫ్యుయెల్ స్విచ్ లు ఆఫ్ కావడంవల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి వందల మంది మరణించడానికి కారణం టేకాఫ్ అయిన తరువాత ఇంజిన్లకు ఫ్యుయెల్ సరఫరా చేసే స్విచ్ లు ఆఫ్ కావడమేనని తేలింది. టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఈ స్విచ్ లు ఆగిపోయాయని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.   విమానం టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయాయనీ..  వెంటనే అప్రమత్తమైన పైలట్ వాటిని ఎందుకు ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడనీ, దానికి ఆ రెండో పైలట్ తాను ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చాడనీ నివేదిక వెల్లడించింది. అలాగే పైలట్ మేడే కాల్ చేశాడనీ,  అయితే ఆ కాల్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి  స్పందన వచ్చేలోపే విమానం కూలిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.  

రాజాసింగ్ రాజీనామా ఆమోదం... బీజేపీకీ మైనస్సే

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఆ పార్టీతో పదేళ్ళ అనుబంధం ముగిసింది. ఈ పదేళ్ల కాలంలో రాజాసింగ్ తెలంగాణలో బీజేపీకి ఫేస్ గా ఎదిగారు. హిందుత్వకు రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణలో రాజాసింగ్ బీజేపీని మించి ఎదిగారు. ఆ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని నాయకులుగా గుర్తింపు పొందిన అందరి కంటే ఎక్కువ జనాదరణ పొందారు. ఇదే ఆయనను బీజేపీకి దూరం చేసింది. ఆ పార్టీ తలుపులు రాజాసింగ్ కు శాశ్వతంగా మూసుకుపోయేలా చేసిందా?  అంటే రాజకీయ పరిశీలకుల నుంచీ, బీజేపీ శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది.   అయితే రాజాసింగ్ పార్టీలో ఇంతలా ఎదగడానికి కారణం ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే. స్వపక్షం, విపక్షం అని లేకుండా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటమే అంటారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర పార్టీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిపై ఘాటు విమర్శలే చేశారు. ఇవన్నీ క్రమశిక్షణ గీత దాటడమేనని బీజేపీ అధిష్ఠానం భావించింది. ఈ క్రమంలో రాజాసింగ్ కు, పార్టీకీ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయినా రాజాసింగ్ రాజీనామా అంటే గతంలో కూడా పలుమార్లు ప్రకటించారు. అయితే అప్పడు ప్రతి సందర్భంలోనూ పార్టీ ఆయనను బుజ్జగించింది.  ఓ సారి సస్పెండ్ చేసి కూడా.. మళ్లీ ఆ సస్పెన్షన్ ను రద్దు చేసి మరీ గత ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అందుకు కారణంగా రాష్ట్ర బీజేపీలో రాజాసింగ్ కు ఉన్న పాపులారిటీ మరో బీజేపీ నేతకు లేకపోవడమే. అయితే.. రాష్ట్రంలో పార్టీని మించి రాజాసింగ్ పాపులారిటీ పెరగడంతో ఇక ఆయనను భరించలేమన్న నిర్ణయానికి వచ్చేసిన హై కమాండ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది.  ఇప్పుడు రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. హిందుత్వ ముద్ర పడిన ఆయన మరో పార్టీలో చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. మైనారిటీలను దూరం చేసుకోవడానికి బీజేపీ వినా మరో పార్టీ ధైర్యం చేసే పరిస్థితి తెలంగాణలో.. ఒక్క తెలంగాణ అనేమిటి? దేశంలో ఏ పార్టీకి లేదు.  ఇక ఇప్పుడు ఆయన ముందు మిగిలినది ఒకే ఒక్క ఆప్షన్. స్వతంత్రంగా గోషామషల్ లో తన పాపులారిటీ పోకుండా కాపాడుకోవడం. అయితే అదేమంత సులువు కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలింతకీ బీజేపీ రాజాసింగ్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి రావడానికి పలు కారణాలున్నా.. ప్రధానంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆయన అధిష్ఠానన్నే ప్రశ్నించేలా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలే అని చెప్పాలి.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపినను వ్యతిరేకించిన రాజాసింగ్.. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తానంటూ ముందుకు వచ్చారు. అయితే కారణాలేమైనా ఆయన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. ఇందుకు తన మద్దతుదారులను బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బెదరించారని ఆరోపణలు చేశారు. అంతే కాదు.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేసేశారు. సరిగ్గా ఇక్కడే బీజేపీ రాష్ట్ర నేతలు ఒక అవకాశం దొరికిందని భావించి రెండో ఆలోచన లేకుండా ఆయన రాజీనామాను హైకమాండ్ కు పంపేశారు. ఆయనను పార్టీ భరించలేదని నివేదిక కూడా ఇచ్చారని చెబుతారు. దీంతో పార్టీ హై కమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించేసింది.  ఈ ఆమోదం రాజాసింగ్ కే కాదు, రాష్ట్రంలో బీజేపీకీ మైనస్సేనని పరిశీలకులు అంటున్నారు. అ గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించడం వల్ల ఎలా పార్టీ నష్టపోయిందో.. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా ఆమోదం వల్ల కూడా అంతటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. 

కాకినాడ GGH లో నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్

  కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై  నలుగురు ఆర్ఎంసి  ఉద్యోగులు  సస్పెన్షన్ విధించారు. ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్ చక్రవర్తి,  టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అజ్ఞాతంలో A1 నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు.  ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నివేదిక ఆధారంగా నిందితులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్‌పి బిందుమాధవ్‌ మాట్లాడుతూ నిందితులను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నామన్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు