ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి : సిద్దరామయ్య

  కర్ణాటకకు తానే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్దరామయ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవని సీఎం అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టబడి ఉంటామని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌కు సీఎం అవ్వాలన్న ఆశ ఉండటంలో తప్పు లేదని సిద్దరామయ్య తెలిపారు."ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా సీఎం పదవికి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే 'ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు' అని ఆయనే అన్నారు కదా" అని సిద్ధరామయ్య గుర్తు చేశారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు విషయంలో సిట్ కీలక నిర్ణయం

  ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా సిట్ బృందాన్ని ముప్పతిప్పలు పెడుతున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును  సిట్ అధికారులు ఐదుసార్లు విచారించారు. ఐదు సార్లు సుమారు నలభై గంటలపాటు ప్రభాకర్‌రావును విచారించింది సిట్. అయితే విచారణలో సమాధానాలు చెప్పకుండా అధికారుల సహనాన్ని పరీక్షించారు ఎస్‌ఐబీ మాజీ చీఫ్. ఈ క్రమంలో ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. పిటిషన్‌లో ప్రభాకర్ రావు మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ సిట్ అధికారులను ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించే విధంగానే సమాధానాలు చెబుతూ వచ్చారు.  తనకేమీ సంబంధం లేదని, తన పైస్థాయి అధికారులు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేశానని, వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ చేయమంటూ ఎవరికీ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఇదంతా చేశామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. సిట్ అధికారులకు ఆయన డిఫెన్సివ్ మోడ్‌లోనే సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం ఇచ్చిన మినహాయింపులను రద్దు చేస్తే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను కస్టోడియల్ విచారణకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రభాకర్ రావుకు ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు.

లోకేశ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు

    మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. లోకేశ్ ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థుల విషయంలో టీచర్లదే కాదు.. తల్లిదండ్రులది కూడా బాధ్యత ఉంటుందన్నారు.   మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్య పాఠశాల చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతకొంత సాయం చేయాలి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలిని పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశ్యంతోనే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి తెలిపారు. వేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. మెగా పేరెంట్స్​మీటింగ్​తో గిన్నిస్​రికార్డు నెలకొల్పామన్నారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే పుస్తకాలు, బ్యాగులపై కూడా గత పాలకులు బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు.  నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం ఇక్కడ వచ్చిందన్నారు. పేరెంట్స్​ కమిటీ ఏర్పాటు చేయాలని 1998‌లో అనుకున్నానని తెలిపారు.  విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్​కు అభినందనలు తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఒక టీచర్​ను కూడా నియమించలేదన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగన్​ చెప్పాలన్నారు. ఆంగ్ల మాధ్యమం పెట్టామంటూ లేనిపోని సమస్యలు తీసుకొచ్చారని ఆరోపించారు. టీచర్లను తాము గౌరవంగా చూస్తాం.. నూతన సంస్కరణలను తీసుకు వస్తామని అన్నారు. ఇప్పటికే 12 డీఎస్సీలు పెట్టి లక్షా 66 వేల మందికి టీచర్ ​ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవలే ఇంకో డీఎస్సీ వేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.   

బంగారు పాళ్యానికి..దండు పాళ్యం ముఠా

  ఇదీ జ‌గ‌న్ బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న‌కు ప‌త్రిక‌ల్లో పెడుతోన్న క్యాప్ష‌న్స్. జులై 9న జ‌గ‌న్ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మామిడి రైతుల ప‌ర‌మార్శ‌కు వ‌చ్చారా? లేక త‌న హంగూ ఆర్భాటం చూపించ‌డానికి వ‌చ్చారా? ఎవ‌రికీ అర్ధం కాలేదు. అద‌స‌లు ప‌ర‌మార్శ యాత్ర‌లా లేదు. దండ‌యాత్ర‌ను త‌ల‌పిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది. అధ్య‌క్షుడినే ఏకంగా చొక్కా ప‌ట్టుకుని లాగుతున్నారు, ముట్టుకుంటున్నారు. ఎవ‌రూ ఎవ‌రి మాట విన‌డం లేదు. జ‌గ‌న్ అరుస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదెవ‌రూ. 10 ల‌క్ష‌ల జ‌నాభా వ‌చ్చినా టీడీపీ స‌భ‌లు స‌జావుగా  జ‌రిగిన‌వి ఎన్ని లేవు. అదే వైసీపీ.. ఆ అరుపులేంటి? కేక‌లేంటి? ర‌చ్చ రావ‌ణ్య‌మేంటి? కొంద‌ర‌న‌నే మాట‌లేంటంటే అర‌లుంగీలు క‌ట్టి వ‌దిలితే వీళ్లు అచ్చం ఆ దండుపాళ్యం బ్యాచీలా లేరూ.. అన్న మాట వినిపించింది స‌ర్వ‌త్ర‌ .అటుమొన్న పొదిలి, మొన్న తెనాలి, నిన్న సత్తెనపల్లి, నేడు బంగారుపాళ్యం.. అంతా ఒక‌టే బ్యాచ్, ఒక‌టే లుక్. ఎలాంటి తేడా లేదు. అల‌జ‌డి  సృష్టించ‌డానికి అంద‌రూ క‌ల‌సి క‌ట్టు క‌ట్టుకుని మూకుమ్మ‌డిగా దిగిన‌ట్టుగా క‌నిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.ఇది మామిడి రైతుల క‌ష్టాలు తెలుసుకోవ‌డం కాదు.. మ‌న్నాంగ‌డ్డి కాదు. ఇది అదే. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌కు విఘాతం క‌లిగించేదే.. కాబ‌ట్టి దీన్ని కంప‌ల్స‌రిగా క‌ట్ట‌డి చేయాలంటారు కొంద‌రు. మ‌రి కొంద‌రైతే ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా స‌మ్య‌ల‌ను తెలుసుకుని.. ప్ర‌జా వేదిక‌లైన అసెంబ్లీకి వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం  క‌నుగొన‌డం ఒక రూట్ మ్యాప్. ఆయ‌న‌స‌లు అసెంబ్లీకే వెళ్ల‌కుండా  ఏం సాధించేట‌ట్టు? అదీ నిజ‌మే క‌దా అంటారు ఇంకొంద‌రు. జ‌గ‌న్ ఇప్ప‌ట్లో అప్ప‌ట్లో అసెంబ్లీకి వ‌చ్చేది లేదు. అక్క‌డ రైతులు కాదు.. ఇత‌రులెవ‌రి స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించే అవ‌కాశమే లేదు. ఇదంతా త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేస్తున్న పోరాటం ఆరాటం.  అయినా సీజ‌న్ అయిపోయాక వ‌చ్చి ప్ర‌యోజ‌న‌మేంటి? అంటారు కొంద‌రు రైతులు. ఒక వేళ జ‌గ‌న్ నిజంగా చేయాల్సి వ‌స్తే ఇప్ప‌టికే జిల్లాలోని ఫ్యాక్ట‌రీల్లో నిల్వ ఉన్న ల‌క్ష కిలోల ప‌ల్ప్ ని కొనాలి. ఎందుకంటే త‌మ ద‌గ్గ‌ర అంత నిల్వ ఉంది కాబ‌ట్టి.. ఈ సీజ‌న్ కి ప‌ల్ప్ వ‌ద్ద‌న్న‌ది ఫ్యాక్ట‌రీల మాట‌. ఎప్పుడైతే ఉన్న నిల్వ అమ్ముడ‌వుతుందో ఆపై తాము కొంటామ‌ని అంటారు వారు. ఈ సీజ‌న్ లో కూడా అదేమంత సేల్ కాలేదు. వాళ్లు అప్ప‌ట్లో ముప్పై రూపాయ‌లు ప‌ర్ కిలో కొంటే ఇప్పుడు ఐదు రూపాయ‌ల‌కు కూడా కొనే నాథుడే లేరు. దీంతో వారు కాయ కొన‌డం లేదు. ఇక్క‌డ చూస్తే ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు కొంటున్నాయి క‌దాని.. టేబుల్ ర‌కాలు ప‌క్క‌న పెట్టి, తోతాపురి ర‌కం ఎక్కువ‌గా వేసేశారు రైతులు.  ఈ క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్ల వ‌చ్చిన తంటా ఇది. దానికి తోడు త‌న హ‌యాంలో ఈ రైతుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. జ‌గ‌న్. వారికి ఏదైనా సాయం చేసిన దాఖ‌లాలు కూడా లేవు. ఈ  సారి వ‌ర్షాలు కూడా బాగా ప‌డ్డంతో.. పంట ఏపుగా ఎదిగింది. దీంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. ఇది జ‌నానికి అర్ధం కావ‌ల్సిన విష‌యం. కానీ  జ‌గ‌న్ ఏం చేస్తున్నారు? బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికో వేదిక చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీంతో స‌మ‌స్య ఏంటో అర్ధంకాక ఒక గ‌జిబిజి గంద‌ర‌గోళానికి ఆస్కార‌మేర్ప‌డుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయ్. ఇది మామిడి రైతుల కష్టాలు తెలుసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదిక ఇద్దాం,దీనిపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడదాం అన్న ఆలోచనతో చేసిన పర్యటన లాగా వుందా? ఆ ఆలోచనే లేకపోతే ఈ సమస్యను అధికారంలో లేని నీవు పరిష్కరిస్తావా?ఎంత దండగ మారిన గోల ఇది. ఇదేమన్నా కోటప్పకొండ తిరనాళ్ళా?ఈ పోకడ రాష్ట్రానికి క్యాన్సర్ కంటే ప్రమాదకరం!  

చర్చ రచ్చ ఏదైనా ..చివరకు మిగిలేది శూన్యం

  తెలంగాణలో ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన సవాళ్ల రాజకీయం మలుపులు తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతోంది. సూది కోసం సోది కెళితే. అన్నట్లుగా అసలు చర్చ పక్కకుపోయి,రాజకీయ రచ్చ, పొంగి పొరలుతోంది. సాగుతోంది.   నిజానికి, సవాళ్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం రైతు సమస్యల వరకే పరిమితం అయ్యారు. ‘రైతులకు ఎవరు ఎంత మేలు చేశారు తేల్చుకుందాం రండని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’కు,బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు బహిరంగ వేదిక నుంచి ఒకే సారి సవాలు విసిరారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారణాలు ఏవైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాలును ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీముఖ్యమంత్రి కేసీఆర్, పెద్దగా పట్టించుకోలేదు. కానీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,కేటీఆర్’ రియాక్ట్ అయ్యారు. సోమాజీగూడ గూడ ప్రెస్ క్లబ్  వేదికగా   చర్చకు సై ..అన్నారు. ఇక అక్కడి నుంచి చర్చ,రచ్చగా మారింది. చర్చ జరగవలసింది, చట్ట సభల్లో కానీ, క్లుబ్బుల్లో, పబ్బుల్లో కాదని, అసలు ముఖ్యమంత్రి సవాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్’ కు కానే కేటీఆర్’కు కాదని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు  కేటీఆర్’ విమర్శలను తిప్పి కొట్టారు. నిజమే, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు,కాంగ్రెస్ నాయకులు లేటెస్ట్’గా చెపుతున్నట్లుగా ప్రజాసమస్యలు, ప్రభుత్వ విధానాలు చర్చించేందుకు సరైన వేదిక చట్ట సభలే..నిజానికి  సమస్య లేదా విషయం ఏదైనా, చర్చ జరగవలసింది, చట్టసభల్లోనే,..అందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు,ప్రజా సమస్యలపై చర్చలు జరగవలసింది చట్టసభల్లోనే..మరో వేదిక అది ఎంత పవిత్రమైనది అయినా, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు అది తగిన వేదిక కాదు. నిజమే కావచ్చును,చట్టసభలు ఎంత చక్కగా జరుగుతున్నాయో,గౌరవ ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంత గౌరవ ప్రదంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం..అయినా సరే చట్ట సభల తీరు ఎంత సుందర ముదనష్టంగా ఉన్నా సరే,పభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై చర్చ జరగవలసింది చట్ట సభల్లోనే.. క్లబ్బుల్లోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో కాదు. ఈ విషయంలో   అధికార, విపక్షాలకు ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు,ఉండరాదు.ఉన్నా అది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని, న్యాయస్థానాలు,రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాలో స్పష్టం చేశారు.    కానీ, ఇప్పడు రాష్ట్రంలో, రైతులకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసింది’ అనే విషయంపై చర్చ పేరిట జరుగతున్నరచ్చ, విషయానికి వస్తే.. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.సవాళ్లు ప్రతి సవాళ్లుగా సాగుతున్నరాజకీయం,రాజకీయమ పార్టీలు, నాయకులు   గమనిస్తున్నాయో లేదో  సామాన్యులకు చీదర పుట్టిస్తోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారని మీడియా చర్చల్లో పాల్గొంటున్న పెద్దలు హెచ్చరిస్తున్నారు.నిజానికి, రాజకీయ పార్టీల తీరు, అధికార విపక్ష సభ్యుల ప్రవర్తన అంతా శ్రీ వైష్ణవులే ..అన్నట్లు, ఉందని, సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యంతో కూడిన అవేద వ్యక్తపరుస్తున్నారు.  అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున రాజకీయ రచ్చలో అసలు విషయం పక్కకు పోయి, కేవలం రాజకీయ రచ్చ మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఇదలా ఉంటే ఇప్పడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ఎజెండాతో కొత్త ప్రపోజల్’తో ముందుకొచ్చారు. కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌‌కు రమ్మంటే వస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు.  అలాగే, ‘‘మీ సుదీర్ఘ అనుభవాన్ని, ఆలోచనల్నీ తెలంగాణ ప్రజలకు సూచన కింద ఇస్తే స్వాగతిస్తాం. మీరు ఏ తారీకు చెప్పినా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా, గోదావరి జలాలపె ఉమ్మడి రాష్ట్రంలో, తొమ్మిదిన్నరేళ్ల మీ పాలనలో, గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకశంగా చర్చిద్దాం. స్పీకర్‌ అనుమతితో నిపుణులను కూడా పిలిచి అభిప్రాయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు, ఈ ప్రతిపాదనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడవలసి వుంది.అయితే, చర్చ అయినా, రచ్చ అయినా, ఏమి జరిగిన ఏమి జరగక పోయినా, చివరకు మిగిలేది శూన్యం.  

తెలంగాణ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో కోర్టు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసిన కోర్టు 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని  నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  

యశోద ఆస్పత్రికి కేసీఆర్.. మరోసారి వైద్య పరీక్షలు

    బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మాజీ సీఎంకు మరోసారి  డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరగ్గానే ఉందని బ్లడ్‌ షుగర్, సోడియం స్థాయిలు కొద్దిగా పెరిగాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు.  ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్‌ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ వైద్య పరీక్షల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు.  కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఒపెన్ కోర్టుకు తాను రాలేనని.. ఇన్‌సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్‌కు గులాబీ బాస్ స్పష్టం చేశారు.  జస్టిస్ పీ చంద్రఘోష్ నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ మాజీ మంత్రి హరీశ్ రావు  విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరుకావడం లేదని కమిషన్‌కు హరీశ్ రావు సమాచారం అందజేశారు. అయితే, కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజున విచారణకు హాజరవుతానని జస్టిస్ పీ చంద్రఘోష్‌కు సమాచారం అందజేశారు హరీశ్ రావు    

ట్రంప్ టార్గెట్ భారత్.. ఫార్మా, కాపర్‌లపై టారిఫ్‌ బాదుడు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలు టారిఫ్‌ల విషయంలో డీల్స్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండగా.. రోజుకో దేశానికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. లెటెస్ట్‌గా భారత్‌ను ఈ లిస్ట్‌లో చేర్చారు. ఓ వైపు ట్రేడ్‌ డీల్‌పై ఓ అవగాహనకు వస్తున్న సమయంలో భారత్‌ ఎగుమతి చేసే కాపర్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం.. కాపర్‌పై 50 శాతం టారిఫ్‌ విధిస్తామని ఓ బాంబు పేల్చారు.   నిజానికి ట్రంప్‌ గతంలో సైతం భారత స్టాక్‌ మార్కెట్‌ను అల్లకల్లోలం చేసే వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో అమలైనవి చాలా తక్కువే. కానీ ఈసారి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే మాత్రం భారత్‌కు పెద్దదెబ్బే అంటున్నారు. ఎందుకంటే భారత్‌ ఫార్మా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది భారత ఫార్మా ఉత్పత్తిలో 40 శాతం. ఇక కాపర్ విషయానికి వస్తే.. టెక్, కన్‌స్ట్రక్షన్‌తో పాటు అనేక రంగాల్లో ఉపయోగించే కాపర్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్ డాలర్ల విలువైన కాపర్‌ను ఎగుమతి చేసింది. ఆ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలు నిజంగా అమలైతే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి.  ట్రంప్‌ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధించారు. ఇప్పుడు ఆయన చూపు కాపర్, ఫార్మాపై పడింది. ఫార్మా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ అంటున్నారు. దీని కోసం ఏడాది సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత వారిపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెబుతున్నారు.  ఇప్పటికే బ్రిక్స్‌ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందులోని దేశాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డాలర్‌ ఆధిపత్యం చేలాయించాలనేది ట్రంప్ ఆలోచన. కానీ బ్రిక్స్ దేశాలు అమెరికా ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయనేది ఆయన భయం. అందుకే  తన అమ్ములపొదిలోని అత్యంత బలమైన అస్త్రంగా భావిస్తున్న టారిఫ్‌లను ప్రపంచదేశంపైకి వదులుతున్నారు.  ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే ట్రేడ్‌ డీల్‌పై అమెరికాతో మంతనాలు జరుపుతుంది భారత్. ఇక ఇండియన్ ఫార్మా కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ను అమెరికాకు తరలించలేకపోయినా.. లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని.. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ తన టెంపరితనంతో నిజంగానే నిజంగానే టారిఫ్‌లను విధిస్తే మొదట ఆయా దేశాలకు తిప్పలు తప్పవు. అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవనేది వాస్తవం. ఫార్మా కంపెనీలు ఏసియా దేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే మరింత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికన్లపై మరింత భారం మోపుతాయన్న చర్చ కూడా ఉంది. మరి ట్రంప్‌ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

చంద్రబాబు క్లాసులో విద్యార్థిగా మారిన లోకేష్

  ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం.. మెగా పీటీఎం 2.0 నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ ఒక చోటకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు.  మెజా పీటీఎం-20 కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తి విద్యార్థులకు ‘వనరులు’ అన్న సబ్జెక్ట్‌పై క్లాస్ చెప్పారు. సహజ వనరులు, పునరుత్పాదక వనరుల వినియోగం, సంరక్షణ గురించి విద్యార్థులకు సీఎం బోధించారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్ధులకు వివరించారు. విద్యార్ధులు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా ఇతరులు మరోమారు వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ స్టూడెంట్స్‌కు చెప్పారు చంద్రబాబు.  కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలన్నారు. అందరూ ఉద్యోగాలే కాదు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగానూ మారాలన్నారు. నారా లోకేశ్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. విద్యార్థులతోపాటు బల్లపై కూర్చుని సీఎం చెప్పే పాఠాన్ని ఆసక్తిగా వినడం విశేషం.  

తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

తెలుగు రాష్ట్రాలలో గురువారం (జులై 10) ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో అలాగే కరీంనగర్ జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలో ఒక చిన్నారి సహా ఐదుగురు మరణించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి మైదుకూరు వెడుతున్న స్కార్పియో వాహనం అతి వేగంగా ముందు వెడుతున్న ఓ ట్రాక్టర్ ను ఢీ కొంది. ఈ దుర్ఘటనలో  ఇద్దరు సంఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్ను మూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద బైక్ పై వెడుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ సంఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. 

రాణా, దేవరకొండ విజయ్ సహా పలువురు నటులపై ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది. ఇందుకు సంబంధించి   29 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం  కింద కేసులు నమోదు చేసింది. ఈడీ కేసులు నమోదు చేసిన వారిలో ప్రముఖ నటులు దగ్గుబాటి రాణా,  విజయ్ దేవరకొండ,, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ఉన్నారు. గతంలోనే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ..వీరంతా భారీ పారితోషికాలు తీసుకుని నిషేధిత బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారని నిర్ధారణకు వచ్చింది.  అలాగే ఈ కేసులో ప్రముఖ యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, , సిరి హనుమంతు సహా  పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు  కూడా ఉన్నారు. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసి విాచరణకు పిలిచే అవకాశం ఉంది. 

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జులై 9) శ్రీవారిని మొత్తం 76 వేల 501 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 33 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది. ఇలా ఉండగా తిరుమలలో బిగ్, జనతా  క్యాంటీన్ల ఏర్పాటుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరమలలో హోటళ్లు, క్యాంటీన్ల నిర్వాహకులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి  సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మిన్ భవనంలో  ఈ సమావేశం జరిగింది. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23న టీటీడీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తిరుమలలో గుర్తింపు పొందిన హోటళ్లు, క్యాంటిన్ల నిర్వాహకులతో టీటీడీ ప్రిబిడ్ మీటింగ్ నిర్వహించింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని ఈ సందర్భంగా టీటీడీ ఈవో, ఏఈవోలు ఆదేశించారు. భక్తులకు లాభాపేక్ష లేకుండా, సేవా దృక్ఫథంతో నిర్దేశిత ధరలకే నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పారు. 

నటుడు ఫిష్ వెంకట్ కు తెలంగాణ సర్కార్ చేయూత

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ను బుధవారం (జూన్ 9) మంత్రి శ్రీహరి పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడమే కాకుండా..తక్షణ ఖర్చుల కోసం ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించారు. రెండు కిడ్నీలూ పూర్తిగా దెబ్బ తినడంతో ఇన్నాళ్లూ డయాలసిస్‌తో నెట్టుకొచ్చిన వెంకట్ పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు కిడ్నీ  ట్రాన్స్ ప్లాంట్ చేయక తప్పని పరిస్థతి ఏర్పడింది. చికిత్స చేయించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఇప్పుడు వెంకట్ కుటుంబ సభ్యులు కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నారు.  

అనుమానాస్పద స్థితిలో జర్నలిస్టు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒక ప్రముఖ దినపత్రిలో గత కొన్ని రోజులుగా క్రైమ్ వార్తలు రాస్తున్న మెట్ల కుమార్ గత నెల 23న తన బైక్, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కుటుంబ సభ్యులు బొమ్మూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచీ కనిపించకుండా పోయి మెట్ల కుమార్ గురువారం (జులై 8) ఈస్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో శవంగా కనిపించాడు. మెట్ల కుమార్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి వయస్సు 45 సంవత్సరాలు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ కు తరలించారు.  మెట్ల కుమార్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

కేసీఆర్, జగన్ బంధంతో తెలంగాణకు తీవ్ర నష్టం : సీఎం రేవంత్

  గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ఇందుకు శిక్షించాల్సి వస్తే… ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కెసీఆర్ చేసిన పనికి వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిన పరిస్థితిని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీ అనుభవం సూచనలు రాష్ట్రానికి ఉపయోగపడితే పరిగణలోకి తీసుకుంటాం అవసరమైతే ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. మా మంత్రులకు పంపిస్తా కేసీఆర్ పిలిస్తే నేను కూడా వస్తా. దయచేసి నన్ను పబ్బులు, క్లబ్బుల్లో చర్చకు పిలవొద్దు అన్నారు. ఎవరు పెరిగిన నేపథ్యం వారిని అలా మాట్లాడిస్తుంది. అని పేర్కొన్నారు.

యాపిల్‌ సీఈఓగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్‌ ఖాన్‌కి బాధ్యతలు

  ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ విలియమ్స్‌ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. విలియమ్స్‌ సీవోవో బాధ్యతలను యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సబిప్‌ ఖాన్‌‌కు  ఈ నెల చివర్లో అప్పగించనున్నారు. ఈ క్రమంలో డిజైనింగ్‌ టీమ్‌  బాధ్యతలను నేరుగా టిమ్‌కుక్‌ స్వీకరించనున్నారు.  సబిప్‌ ఖాన్‌ మాలాలు భారత్‌లో ఉన్నాయి. ఆయన యూపీ మొరాదాబాద్‌ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్‌ గ్రేడ్‌ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్‌కు  వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికా కు వెళ్లారు.  1995లో ఆయన యాపిల్‌ ప్రొక్యూటర్‌మెంట్‌ గ్రూప్‌లో పనిచేశారు.

ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు

  గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.  ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి.   ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.  

వైకుంటపురం ఆలయ హుండీలో రద్దైన నోట్లు

  గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ. 1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది.  గత జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి. కాగా బుధవారం హుండీ, మ్రొక్కుబడుల లెక్కింపు చేపట్టగా  113 రోజుల కాలపరిమితికి గాను స్వామి వారికి భక్తుల నుండి కానుకుల రూపంలో  46 లక్షల 76 వేల, 204 రూపాయల నగదు, 19 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 319 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి.