టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి : బండి సంజయ్

  తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ దేవస్థానంలో 1000 మందికి పైగా అన్య మతస్తులు ఉన్నారు.. వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదన్నారు. వారికి స్వామి వారి మీద విశ్వాసం, నమ్మకం లేదు.. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదని కేంద్ర అన్నారు. అలాంటి వాళ్లకు టీటీడీలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు.. వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యాగాల్లో కొనసాగుతున్నారని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు.  ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని పురాతన ఆలయాలను గుర్తించి, టీటీడీ నిధులను కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నానని అన్నారు. కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట రామాలయం ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందునే ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందని సంజయ్ అన్నారు. స్వామిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదని అన్నారు. బొట్టు పెట్టుకుని వెళితే మసీదులు, చర్చిల్లో ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు. హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురద్రుష్టమేమిటంటే టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అట్లాంటోళ్లకు ఉద్యోగాలివ్వమేంటి? వాళ్లను కొనసాగించడమేంటి? ఇట్లాంటి పద్దతి మంచిది కాదు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందిని ఆయన పేర్కొన్నారు

హెచ్‌సీఏ స్కాంలో దూకుడు పెంచిన సిఐడీ.. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్!

హెచ్‌సీఏ స్కాంలో సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత భర్త.. క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్‌ చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించింది సీఐడీ. అలాగే రిమాండ్ రిపోర్టులో నిందితులపై సీఐడీ సంచలన అభియోగాలు మోపింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు నియామకాన్నే తప్పుబట్టింది. మరింత దర్యాప్తు చేసేందుకు ఈ రోజు సీఐడీ అధికారులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. మరోవైపు నిందితులు కూడా బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ స్కాంలో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు చర్లపల్లి జైలులో ఉండగా.. కవిత చంచల్‌ గూడ మహిళా జైలులో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్‌సీఏకు సంబంధించిన అవకతవకలు, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్కాంలో సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు, రాజేందర్ యాదవ్, కవిత కలిసి శ్రీచక్ర క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఫోర్జరీ డాక్యమెంట్లను సృష్టించి.. ఆ క్రికెట్‌ క్లబ్‌కు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ జ‌గ‌న్మోహ‌న‌రావు ఎవ‌రో తెలుసా?

ఎవ‌రో ఊరూ పేరు లేని జ‌గ‌న్మోహ‌న రావు ఏ క్ల‌బ్ లో మెంబ‌ర్ కూడా కాని జ‌గ‌న్మోహ‌న రావు.. రాజ‌కీయ క్రీడ త‌ప్ప మ‌రే క్రీడా తెలియ‌ని జ‌గ‌న్మోహ‌న రావు.. ఇంత స్థాయికి తిమ్మిని బ‌మ్మిని చేసి ఇక్క‌డి వ‌ర‌కూ ఎలా వ‌చ్చారో మీకు తెలుసా?  ఇంతకీ ఈయ‌న మ‌రెవ‌రో కాదు హ‌రీష్ రావు పెద్ద‌మ్మ కొడుక‌ట‌. దీంతో అప్ప‌టి వ‌ర‌కూ గ‌డ్డం వినోద్, అజ‌ర్ చేతుల్లో ఉన్న హెచ్ సీ ఏ కాస్తా.. త‌న అధికార బ‌లం ఉప‌యోగించి.. అక్ర‌మంగా శ్రీ చ‌క్ర అనే ఒకానొక క్ల‌బ్ లో ఫోర్జ‌రీ సంత‌కాల‌తో మెంబ‌ర్ గా మారి.. ఆ పై కేవ‌లం 2 ఓట్ల తేడాతో  2023లో అధ్య‌క్షుడ‌య్యాడు. ఆ త‌ర్వాత  అయ్య‌గారి ఆగ‌డాలు ఏమంత త‌క్కువ లేవట. ఏకంగా  రూ. 170 కోట్ల‌కు టెండ‌ర్ పెట్టారు. బీసీసీఐ  నిధులు గోల్ మాల్ చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. అస‌లీ నాన్ ప్లేయ‌ర్స్ కి ఇలాంటి క్రీడా సంఘాల్లో ప‌నేంటి? అన్న‌దొక చ‌ర్చ. 1934 నాటి హెచ్ సీ ఏ.. చ‌రిత్ర గ‌త‌మెంతో ఘ‌నం. ఎంఎల్ జ‌య‌సింహ‌, అజ‌ర్, శివ‌లాల్ యాద‌వ్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, ప్ర‌జ్ఞాన్ ఓజా, అంబ‌టి రాయుడు వంటి మేటి క్రికెట‌ర్లు ప్రాతినిథ్యం వ‌హించిన సంఘం. ఇది బీసీసీఐకి అఫిలియేటెడ్. ఎన్నో రంజీ మ్యాచ్ ల‌లో   హైద‌రాబాద్ క్రికెట్ టీమ్ ని ఆడిస్తుంది హెచ్ సీఏ. దీని హోం గ్రౌండ్ ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం. అలాంటి అసోసియేష‌న్లోకి ఎప్పుడైతే రాజ‌కీయ బేహారులు అడుగు పెడుతున్నారో అప్ప‌టి నుంచి ఇది పూర్తి ప‌త‌నావ‌స్త‌కు చేరుకునేలా ప‌య‌నిస్తోందని అంటారు. మీకు తెలుసా? ఇక్క‌డ ఆడేవాళ్ల‌ను ప‌క్క‌న  పెట్టి డ‌బ్బులిచ్చేవాళ్ల‌ను సెలెక్ట్ చేస్తుంటారట‌. ప్లేయ‌ర్స్ పేరంట్స్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ వీరు భారీ ఎత్తున డ‌బ్బు గుంజారట‌. అంతేనా మొన్న‌టి  మార్చిలో ఎస్ ఆర్ హెచ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేశారు. అస‌లు గొడ‌వంతా బ‌య‌ట ప‌డిందే ఈ ఎస్ ఆర్ హెచ్, ఎల్ ఎస్ జీ మ్యాచ్ ద్వారా.  ఉప్ప‌ల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ్గా.. ఇందులో 39 వేల కెపాసిటీ  ఉంటుంది. ఈ కెపాసిటీలో  టెన్ ప‌ర్సెంట్ ఫ్రీగా హెచ్ సీ ఏ కి ఇచ్చింది ఎస్ ఆర్ హెచ్. ఇది చాల‌ద‌న్న‌ట్టు మ‌రో ప‌ది శాతం కావాల‌ని డిమాండ్ చేయ‌డ‌మే కాదు.. ఎఫ్ 3 అనే బ్లాక్ ని క్లోజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిందట హెచ్ సీ ఏ. ఈ గొడ‌వ చినికి చినికి గాలివాన‌గా మారి.. తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ వ‌ర‌కూ వెళ్లింది. దీంతో సీఎం రేవంత్ విచార‌ణకు ఆదేశించారు. త‌ద్వారా.. జ‌గ‌న్మోహ‌న‌రావు అండ్ కో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ‌ట్టు తేలింది. తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్టు.. ఈ వ్య‌వ‌హారంర‌తో పాటు ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఒక అధ్య‌క్షుడు ఇలా అరెస్టు కావ‌డం అంటే..  అది ఈ క్రీడా సంఘానికే మాయ‌ని మ‌చ్చ అంటారు మాజీ అధ్య‌క్షుడు అజ‌రుద్దీన్. ఈ మొత్తం ఎన్నిక‌ను క్యాన్సిల్ చేసి కొత్త‌గా ఎంపిక చేయాల‌ని.. త‌న‌కు మ‌రోమారు అవ‌కాశ‌మిస్తే మంచిగా పాల‌న సాగిస్తాన‌ని.. గ్రామీణ స్థాయిలో క్రికెటర్లు వెలుగు చూసేలా చేస్తాన‌ని అంటున్నారు మాజీ క్రికెట్ కెప్టెన్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ సీ ఏ- అజ‌రుద్దీన్. 2017లో ఒక టీ ట్వంటీ టోర్మమెంటు త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్ప‌డ‌లేదు ఈ క్రీడా సంఘం. ఎప్పుడు చూసినా ఏవో ఒక వార్త‌లు. హెచ్ సీ ఏలో అవినీతి, రాజ‌కీయాలంటూ వివాదాలు. ఒక స‌మ‌యంలో ఈ జ‌ట్టు నుంచి రంజీ ఆడ‌మంటే ఆడ‌న‌ని మొండికేశాడు అంబ‌టి రాయ‌డు. అదీ దీని ఘ‌న‌త‌. మ‌రి చూడాలి ఇక‌నైనా ఈ క్రికెట్ సంఘం.. ప్ర‌క్షాళ‌న‌కు గురై మంచి మంచి ఆట‌గాళ్లు వెలుగు చూస్తారా లేదా  తేలాల్సి ఉంది.

ఆర్ఎంసీ ఘటనపై సీఎం సీరియస్... నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్

కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను ల్యాబ్ అటెండెంట్‌ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫొటోలు తీసి వాట్సాప్‌లకు పంపించేవాడని, రూమ్‌కు రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగగా.. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని విద్యార్థి నులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు చంద్రబాబుకు ఈ ఘటనకు సంబంధించి అంతర్గత విచారణలో తేలిన అంశాలతో నివేదిక సమర్పించారు.   మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. దీనిపై అదే రోజు కమిటీని నియమించి విచారణ చేపట్టారు.  విద్యార్థినులతో విచారణ కమిటీ మాట్లాడి నివేదిక సిద్దం చేసింది. చక్రవర్తితోపాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాల కృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ నలుగురిపై పోలీసు కేసు నమోదు చేశారు.  

వన్డే పగ్గాలూ శుభమన్ గిల్ కే?

టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జట్లుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పుడు మూడో టెస్టు జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి టెస్టులో అద్భుతంగా ఆడినా చివరికి ఓటమి తప్పలేదు. అయితే రెండో టెస్టులో అద్భుతంగా పుంజుకుని ఎడ్జ్ బాస్టన్ వేదికపై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ తోనే టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న శుభమన్ గిల్ బ్యాటర్ గా అద్భుతంగా రాణించడమే కాకుండా, స్కిప్పర్ గా కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే  వన్డే సారథ్య బాధ్యతలు కూడా శుభమన్ గిల్ కే   అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా టెస్టు, టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డేలలో మాత్రం కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని ప్రకటించాడు. దీనిపై బీసీసీఐ రోహిత్ శర్మను 2027 వరల్డ్ కప్ వరకూ వన్డేల్లో క్రీడాకారుడిగా కొనసాగిస్తూనే.. సారథ్య బాధ్యతలు మాత్రం యువ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ గా సత్తా చాటుతున్న శుభమన్ గిల్ కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.   ఇందులో భాగంగా శుభమన్ గిల్‌కు త్వరలో జరిగే శ్రీలంక వన్డే సిరీస్‌  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు.   టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని ఆలోచించడం ఏంటన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  . రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. టెస్టుల్లోనూ పలు విజయాలను అందుకున్న సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే రోహిత్ ను వన్డే కెప్టెన్ గా తొలగించడంపై పునరాలోచించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అయితే  రోహిత్‌ను సీనియర్ ఆటగాడిగా కొనసాగించి.. కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం గిల్‌కు అప్పగించాలని నిర్ణయానికి వచ్చేసిన సెలక్షన్ కమిటీ ఈ విషయంపై ఇప్పటికే రోహిత్ తో చర్చించారనీ, రోహిత్ కూడా అంగీకరించాడనీ అంటున్నారు.  వన్డే కెప్టెన్సీ మార్పుపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.  

ధవళేశ్వరం వద్ద వరద గోదావరి ఉగ్రరూపం

ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతుండగా, ధవళేశ్వరం వద్ద మాత్రం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజి గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో దాదాపు 2 లక్షల 600 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. గోదావరి వరద కారణంగా లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. కోనసీమలోని లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో వాటికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  రానున్న 24 గంటలలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

ఏపీని కుదిపేస్తున్న‌ థూ.. ‘ఫ్యాన్’ మెయిల్

ఏపీకి అప్పులు పుట్ట‌కుండా,  పెట్టుబ‌డులు రాకుండా ఒక కుట్ర‌. అది కూడా విదేశాల నుంచి వైసీపీ  చేస్తోన్న పన్నాగం.   జ‌ర్మ‌నీలో ఒక ప్రముఖ సంస్థలో ప‌ని చేసే ఉద‌య్ భాస్క‌ర్ అనే ఒక వైసీపీ మ‌ద్ధ‌తుదారు చేత బాంబే ఎక్స్ ఛేంజీకి ఏకంగా 200 మెయిళ్లు పంపేలా చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని ఏపీ  ఆర్ధిక మంత్రి ప‌య్యావుల  కేశ‌వ్ సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాల‌తో స‌హా చూపించారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విచార‌ణ‌కు ఆదేశించారు. అంతే కాదు దీని వెన‌క ఎంత‌టి వారున్నా వ‌ద‌ల‌కూడ‌ద‌ని  స్పష్టం చేశారు. దీంతో పాటు.. ఈ విష‌యం ప‌బ్లిక్ లోకి మ‌రింత‌గా తీసుకెళ్లే బాధ్య‌త కూట‌మి నేత‌లు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.   ఈ విష‌యంపై స్పందించిన ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గ‌న‌... త‌మ హ‌యాంలో కూడా ఎంద‌రో ఇలాంటి క‌థ‌నాలు వండి వార్చారు. అలాగ‌ని మేము ఆగామా?  అంటూ లైట్ తీసుకునే మాట‌లు మాట్లాడారు. అంతే కాదు.. ఒక మెయిల్ వ‌ల్ల మీ రుణాలు, పెట్టుబ‌డులు ఆగిపోతాయా? అని ప్రశన్నించారు. అయితే.. బుగ్గన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి  ప‌య్యావుల కేశ‌వ్.. ఇది స్టేట్ ఫైనాన్షియ‌ల్ క్రెడిబిలిటీకి సంబంధించిన విష‌యంమన్నారు.  గ‌తంలో మీ హ‌యాంలో 2024 మార్చిలో 7 వేల కోట్ల‌కు ఇలాగే రుణం  కోసం ప్ర‌య‌త్నించారు. మీపై న‌మ్మ‌కం లేక పెట్టుబ‌డి దారులు రుణం ఇవ్వ‌లేదు. ఇది విశ్వాసానికీ, విశ్వసనీయతకూ సంబంధించిన అంశం కనుకే.. ఇటువంటి చర్యలను   దేశ ద్రోహం కింద తీసుకుని.. త‌ద్వారా.. కేసులు న‌మోదు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబును కోరామని చెప్పారు.   వైసీపీకి తొలి మొదటి నుంచీ ఇలాంటి అల‌వాటు ఉంద‌నీ, వారు రాష్ట్ర ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బ తీయ‌డ‌మే ధ్యేయంగా  ప‌ని  చేస్తుంటార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కూ అదే జ‌రిగింద‌నీ అన్నారు. ఈ విష‌యంపై పూర్తి విచార‌ణ చేసి.. దీని వెన‌క ఎవ‌రున్నారో క‌నిపెట్టి తీరాల‌ని  పయ్యవుల కేశవ్ అన్నారు.  అయినా ఇలాంటి వాటి ద్వారా కూడా న‌ష్టం జ‌రుగుతుందా? అంటే ఇది వ‌ర‌కు హిడెన్ బ‌ర్గ్ రిపోర్ట్ అదాని సంస్థ‌ల‌ను తీవ్రంగా దెబ్బ తీయ‌లేదా? ఇదీ అలాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో  చూడాలి మరి  అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలా విద్వేషపూరిత పనులు చేసే వారికి  విదేశాల్లో చాలా పెద్ద శిక్ష‌లే వేస్తారు. దానికి తోడు ఇది నైతిక‌త‌కు సంబంధించిన విష‌యం. ఇటీవ‌లి కాలంలో కొంద‌రి ఉద్యోగాలు స‌రిగ్గా ఇలాంటి అనైతిక కార్య‌క‌లాపాల  వ‌ల్లే పోయాయని గుర్తు చేస్తున్నారు.  ఉదయ్ భాస్క‌ర్ వంటి వారు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే ముందు ఆలోచించాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేయ‌డం వేరు. ఇలా ప‌క‌డ్బందీగా  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీసేవిధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వేర‌ని.. ఇలాంటి వారికి గ‌ట్టిగా బుద్ధి చెప్ప‌కుంటే  కష్ట‌మ‌నీ సూచిస్తున్నారు రాష్ట్ర శ్రేయోభిలాషులు.

15 ఏళ్ల తరువాత తెరుచుకున్న పాఠశాల!

వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని బోజ్యానాయక్ తండాలో గత దశాబ్దంనరగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు తెరుచుకుంది. ఈ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు.  గ్రామ యువకుల కృషితో పాఠశాల పున: ప్రారంభమైంది. యువకుల కృషినీ, ఆదర్శాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ పాఠశాల పున: ప్రారంభంలో గ్రామ యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సైతం ప్రత్యేకంగా ప్రశంసించారు.  గ్రామ యువత అంతా ఏకతాటిపైకి వచ్చి ఒక కమిటీగా ఏర్పడి గ్రామ అభివృద్ధి కోసం పని చేయడం ముదావహమన్న కలెక్టర్..  విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ పాఠశాల ముందుంటుందన్న ఆశాభావం వ్యక్త  చేశారు.  అదే విధంగా ఈ గ్రామం నుంచి చదువుకొని ఉన్నత స్థాయికి చేరిన వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు.  భవిష్యత్తులో స్కూల్‌కి అవసరమైన పుస్తకాలు, యూనిఫారంలు అన్నీ అందజేస్తామని కలెక్టర్ చెప్పారు.   ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారంటూ సోదాహరణంగా చెప్పిన ఆమె  ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంఈవో సారయ్య.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.  అలాగే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు.. పాఠశాల పునః ప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు. 

విశాఖలో ట్రైన్ హోటల్.. అచ్చం రైల్లోలాగే

 రైల్లో ప్రయాణం,  రైల్లో ఆహారం అన్నది ఒక విభిన్న అనుభూతి. అదో సరదా.. అదో హాయి.. అటువంటి అనుభూతి, సరదాను విశాఖ వాసులకు అందుబాటులోకి తీసుకు వస్తోంది ఓ హోటల్. అదే ట్రైన్ క్యాప్సుల్. విశాఖ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫామ్ మొదటి అంతస్తులో ఈ హోటల్ ఏర్పాటు చేశారు. అచ్చం రైలులోలాగే ఈ హోటల్ లో సింగిల్ ప్యాడ్, బడుల్  ప్యాడ్ లుఉంటాయి.  స్క్రానింగ్ ప్యాడ్లు సైతం ఏర్పాటు చేశారు.   ఒక వరుసలో పైన కింద ఎదురెదురుగా ఈ బెడ్లు డిజైన్ చేశారు.  కర్టెన్లు కూడా ఉంటాయి.  24 గంటలకు రూ600లు ధరగా నిర్ణయించారు.  రైలు బోగి తరహాలో నిర్మించిన ఈ హోటల్లో 73 సింగిల్ ప్యాడ్లు 15 డబుల్ బెడ్ ప్యాడ్లు ఉంటాయి . 18 పడకలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఉచితంగా వైఫై స్నానానికి వేడి నీరు అందుబాటులో ఉంటుంది సింగిల్ బెడ్ కు మూడు గంటలకు 200 రూపాయలు అక్కడి నుంచి 24 గంటల వరకు 400 రూపాయలు వసూలు చేస్తారు.  డబుల్ బెడ్ అయితే 3 గంటలకు 300 ఆ తర్వాత 24 గంటల వరకు అయితే 600 వసూలు చేస్తారు. ఈ కొత్త తరహా రైల్ హోటల్ ను డిఆర్ఎం లలిత్ బోహారా గురువారం (జులై 10) ప్రారంభించారు

విశాఖలో వైసీపీకి షాక్!

మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది విశాఖలో వైసీపీ పరిస్థితది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా తయారౌతోంది. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆ పార్టీ కార్పొరేటర్లు.. రాష్ట్రంలో అధికారం మారగానే.. రివెంజ్ తీర్చుకున్నారు. పలువురు పార్టీ ఫిరాయించి మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించారు. ఇక ఇప్పుడు  జెడ్పీ చైర్ పర్సన్ విషయంలో నూ అదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లాలో అత్యధిక జడ్పిటిసిలను గతంలో వైసీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జడ్పీచైర్ పర్సన్ గా గిరిజన ప్రాంతానికి చెందిన జల్లిపల్లి సుభద్ర  ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో వైసీపీ జడ్పీటీసీలలో పలువురు ఆమె తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  నిధులు కేటాయింపు తమ ద్వారా కాక నేరుగా చేస్తున్నారన్నది  వీరి ఆరోపణ.  అయితే ఆమె  ఆ అంశాన్ని అంగీకరించడం లేదు కేవలం స్వపక్షంలో కొందరు పదవి కోసం  చేస్తున్న ఆరోపణలుగా కొట్టి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో  రెండు రోజుల కిందట జరిగిన   జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి  వైసీపీకి చెందిన 22 మంది జడ్పీటీసీలు గైర్హాజరయ్యారు.  నిజానికి జిల్లా పరిషత్ లో అనంతగిరిలో సిపిఎం, మాకవరపాలెం లో తెలుగుదేశం మినహాయిస్తే మిగిలిన జడ్పీటీసీలందూ వైసీపీ సభ్యులే. వారిలో అత్యధికులు జడ్పీ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడం చూస్తుంటే స్వపక్షంలోనే జడ్పీ చైర్పర్సన్ తీరుపై ఎంత అసంతృప్తి గూడుకట్టుకుందో అవగతమౌతుంది. ఈ నేపథ్యంలో త్వరలో అంటే సెప్టెంబర్ తరువాత జడ్పీ చైర్సన్ పదవి కూడా వైసీపీ చేజారడం ఖాయమని అంటున్నారు. అంత వరకూ ఎందుకంటే.. ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే.. నాలుగేళ్ల పాలనా కాలం ముగియాల్సి ఉంటుంది. అది సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది. ఆ వెంటనే జడ్పీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసీపీ జడ్పీటీసీలు భావిస్తున్నారు.  ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ విషయంలో చేతులు కాల్చుకున్న వైసీపీ.. జడ్పీ చైర్ పర్సన్ విషయంలో అలా జరగకూడదని భావిస్తున్నది.  దీంతో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు రంగంలోకి దిగి వైసీపీ అసంతృప్త జడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  మరి కురసాల కన్నబాబు బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా చూడాల్సి ఉంది. 

భద్రాచలం వద్ద ఉరకలేస్తున్న వరద గోదావరి

గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద వరద గోదావరి స్నానఘట్టాలను ముంచేసింది. బుధవారం (జులై 9) 24.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతంగా పెరుగుతోంది. గురువారం(జులై 10)  23 అడుగులకు తగ్గింది. అయితే  శుక్రవారం (జులై 11) ఉదయానికి వరద మళ్లీ పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 33.30 అడుగులకు చేరింది. ఇక 5 లక్షల 45 వేల 600 క్యూసెక్కుల నీరు దిగువకు తరలిపోతున్నది. శుక్రవారం సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పోతే గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తoగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

బంగారు పాళ్యంలో జగన్‌ పర్యటనపై కేసు నమోదు

  చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్‌ పర్యటన  సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించారు. హెలిప్యాడ్‌ వద్ద 30 మందికి, యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిచ్చినా.. నిబంధనల్ని పాటించలేదంటూ ఓ కేసు పెట్టారు.  ఇందులో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, బంగారుపాళ్యం మండల వైసీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ కుమార్‌రాజా పేర్లను ప్రస్తుతానికి చేర్చారు. జగన్‌ వచ్చేటప్పుడు ఆ మార్గంలో రోడ్డు మీద మామిడి కాయల్ని పారబోసిన ఘటనలో అక్బర్‌, ఉదయ్‌కుమార్‌ అనే ఇద్దరిపై రెండో కేసును నమోదు చేశారు. మీడియా ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌పై దాడికి సంబంధించి మూడో కేసు నమోదైంది. BNS 223, 126(1)r/w 3(5) సెక్షన్లు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టనున్నారు. నిందితులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..4 గురు స్మగ్లర్లు అరెస్టు

  అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు  ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్  అధ్వర్యంలో  డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ ఎం. మురళీధరరెడ్డి టీమ్ బుధవారం  రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు.  గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు కనిపించాయి. సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని చుట్టు ముట్టే క్రమంలో  వారు పారిపోదానికి ప్రయత్నించారు.  అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. అక్కడ పరిశీలించగా  22ఎర్రచందనం దుంగలు కనిపించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లార్డ్స్ టెస్టులో అదరగొట్టిన నితీశ్..ఒకే ఓవర్లో 2 వికెట్లు

  ప్రతిష్ఠాత్మక లార్డ్స్  మైదన వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి అదరగొట్టారు. తాను వేసిన తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపేనర్లు డకెట్ (23) క్రానే (18)ను పెవిలియన్‌కు పంపారు. ఇదే ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్  గిల్ పట్టి ఉంటే వికెట్లు పడేవి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లపై పేస్ బౌలింగ్ భారం ఉండగా, వారికి ఆకాశ్ దీప్ సహకారం అందించనున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో టీమిండియా పేస్ విభాగం మరింత బలోపేతమైంది.  

జూబ్లీ ఉప ఎన్నిక.. మాగంటి ఫ్యామిలీకి బీఆర్ఎస్ మొండి చేయి ?

  సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ రాజకీయ భవిష్యత్’ను నిర్ణయించడంలో జూబ్లీహిల్స్ గెలుపు ఓటములు టర్నింగ్ పాయింట్ అవుతుందని, రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సర్వశక్తులు ఒడ్డి అయినా సరే, జుబ్లీ సీటు గెలిచి తీరాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతోందని అంటున్నారు. అలాగే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడంతో పాటుగా, పడి లేచిన కెరటంలా రాష్ట్ర రాజకీయాల్లో  దూసుకు పోవాలని చూస్తున్న బీఆర్ఎస్’ పార్టీకి కూడా జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక గెలుపు అత్యంగా కీలకంగా బావిస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, సిట్టింగ్ సీట్’ ను నిబెట్టుకునెందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక,తెలంగాణలో ఏపీ కూటమి ప్రయోగానికి సిద్దమవుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గాన్ని, లాంచింగ్ ప్యాడ్’గా భావిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, మూడు ప్రధాన పార్టీలు, వ్యూహ రచనతో పాటుగా, అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా,గెలుపు ఓటములను నిర్ధారించడంలో కీలకంగా భావిస్తున్న ముస్లిం మైనారిటీ ఓటు టార్గెట్’గా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహ రచన చేస్తుంటే,బీజేపీ హిందూ ఓటు బ్యాంకు’ ను కన్సాలిడేట్’ చేసే దిశగా పావులు కదుపుతోందని  అంటున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసంగతంలో పోటీచేసి ఓడిపోయినా, మాజీ క్రికెటర్ అజారుద్దీన, బీఆర్ఎస్’నుంచి కాంగ్రెస్’లోకి జంప్ చేసిన జీహెచ్ఎంసీ’ మాజీ మేయర్. బొంతు రామ్మోహన్’ సహా మరి కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  అయితే, ఎంఐఎం  నిర్ణయం పై కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక ఆధారపడి ఉంటుందని, పార్టీ వర్గాల సమాచారం.ఇక బీజేపీ అభ్యర్ధి విషయానికి సమబందించి,గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా లంక దీపక్ రెడ్డి పేరుతొ పాటుగా, గతంలో కూకటపల్లి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసిన, నందమూరి సుహాసిని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేయాలో తేలిన తర్వాతనే, అభ్యర్ధి ఎంపిక పై, కూటమి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నాయకులు అంటున్నారు.   అదలా ఉంటే, మాగంటి మరణం మొదలు, అదే కుటుంబం నుంచి పార్టీ అభ్యర్ధిని బరిలో దించాలని భావించిన, బీఆర్ఎస్’ మనసు మార్చుకుని,ముస్లిం అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్’ అధినేత కేసీఆర్’ ముందు నుంచి కూడా మాగంటి సతీమణి సునీతను బరిలో దించాలని భావించారు. నిజానికి, ఆమె పోటీకి అంత  సుముఖంగా లేక పోయినా,ఆమెను ఒప్పించారని పార్టీవర్గాల సమాచారం. అయితే, అంతలోనే అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్’ పోటీకి సిద్ధం కావడంతో, కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే, వ్యూహం మార్చి ముస్లిం అభ్యర్ధిని బరిలో దించాలని బీఆర్ఎస్ బాస్’ నిర్ణయించినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలో నిన్న (జూలై 9) బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ మైనార్టీ విభాగం సమావేశంలో ముస్లిం మైనారిటీ అభ్యర్ధిని పోటీకి దించాలన్న నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెపుతున్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.సమావేశంలో హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్’  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తమది సెక్యులర్‌ ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్‌, 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదన్నారు.హైడ్రా, మూసీ పేర్లతో రేవంత్‌ సర్కార్‌ ముస్లింల ఇళ్లను కూల్చి వారికి గూడులేకుండా చేసిందన్నారు. మైనార్టీల కోసం ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్’కు బుద్ధిచెప్పాలని మైనార్టీలను కోరారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, బీఆర్ఎస్’ ప్రస్తుతానికి ముస్లిం మైనారిటీ వైపు మొగ్గుచుపుతున్నట్లు తెలుస్తోందిని పరిశీలకులు అంటున్నారు. అయితే,ఇదే తుది నిర్ణయం కాకపోవచ్చని,పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ‘తెలుగు వన్’ కు చెప్పారు. మరో వంక, రాజకీయ పార్టీ చక చక వ్యూహాలను మార్చుకుంటున్న నేపధ్యంలో   జూబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక మరిత్న ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు.  

మా కుమారుల్ని రక్షించండి..పవన్‌కు మహిళ వినతి

  ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ   గండబోయిన సూర్యకుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని  కలిసి వినతిపత్రం సమర్పించారు. విజయనగరానికి చెందిన ఆమె– మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని వేడుకున్నారు. బుధవారం  పవన్‌ని కలసి.. తమ ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు వివరించారు.  ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయిన తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఆరుగురు యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ఎలాగైనా కాపాడాలని ఆమె కన్నీటితో వేడుకున్నారు.దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.  మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన హామీ ఇచ్చారు. పవన్ చొరవపై కేంద్ర విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది. బాధితులను వీలైనంత త్వరగా గుర్తించి, సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది.