ఉభయ సభలు రేపటికి వాయిదా

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతునే ఉంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), గోవా అసెంబ్లీలో  ఎస్టీలకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. ఎంత చెప్పిన సభ్యులు వినకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొంది.  బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలకు దిగారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ హరివంశ్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో ఇరు సభలు రేపటికి వాయిదా వేశారు. 

మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో గురువారం (జులై 24) భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్,  కొండా సురేఖ, వాకిటి శ్రీహరీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా , ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో  ఆమెదించి  గవర్నర్ ద్వారా  రాష్ట్రపతికి  పంపిన బిల్లు, అలాగే  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం, ఆర్డినెన్స్ తదితర అంశాలపై చర్చించారు.  

ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క ప్రజా ప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ 2021లో సీతక్క ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా సీతక్క గురువారం (జులై 24) నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజాప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు.  కోవిడ్ సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి  సీతక్క చేపట్టిన నిరసనకు సంబంధించిన కేసు విచారణకు హాజరైన సీతక్క కోర్టులో పదివేల రూపాయలతో కూడిన రెండు పూచికత్తులను దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.  

తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

    బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్‌ కేక్‌ కట్‌ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు.ఈ రోజు ఉదయం కేటీఆర్  బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నరు. మరోవైపు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎంవో అధికారిక ఎక్స్ ద్వారా తెలిపారు ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్ ట్వీట్టర్ వేదికగా నా సోదరుడు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

చంద్రబాబుకు జస్ట్ 5 నిముషాలు చాలు

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికీ, పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పారిశ్రామిక వేత్తలను కన్విన్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జస్ట్ ఐదంటే ఐదు నిముషాలు చాలు. ఈ విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా బెంగళూరు, చెన్నైలకు దీటుగా మార్చడంలో ఆయన పాత్ర కీలకం. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు కేవలం ఆయనపైనా, అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్న విజన్ పైనా నమ్మకంతో హైదరాబాద్ కు తరలి వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి అమరావతిలో కనిపిస్తున్నది.  ఐదేళ్ల జగన్ పాలన ఏపీలో  పరిశ్రమల రంగానికి ఒక చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. ఒక్క‌ చాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రప్రజలకు నరకం చూపించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ ఆయన పీడిత పాలన బాధితులే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అంతకు ముందు చంద్రబాబు పాలనలో అంటే 2014-19 మధ్య కాలంలో  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను జగన్ తన విధానాలతో  రాష్ట్రం నుంచి తరిమేశారు. దీంతో  జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్ర పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఏపీలో కూడా ప్రారంభించేందుకు క్యూకడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద వచ్చిందంటే.. అది సీబీఎన్ పై ఉన్న నమ్మకమే కారణం అనడంలో సందేహం లేదు. చంద్రబాబు పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకానికి  విజయవాడలో  ఇన్వెస్టోపియా గ్లోబల్ ఈవెంట్ సాక్షిగా యూఏఈ మంత్రి  చెప్పిన మాటలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఈవెంట్ కు గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ సదస్సుకు హాజరైన  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ  దావోస్ లో చంద్రబాబుతో ఐదు నిముషాలు భేటీ అయ్యాననీ, ఆ సందర్భంగా ఆయన విజన్ పట్ల ఆకర్షితుడినై పెట్టుబడితో ఏపీకి వచ్చేశామని చెప్పారు. ఇది చాలదూ రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్ కు, చిత్తశుద్ధికీ. యూఏఈ తన ఆర్థిక వ్యూహాల్లో భాగంగా పర్యాటకం, సాంకేతికత, ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్

  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆయన కోడలు ప్రీతి రెడ్డి, కొడుకు భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలల సీట్ల కేటాయింపులో భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మించి విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందినట్టు సమాచారం.విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో వచ్చిన ఆదాయాన్ని సరిగా చూపకపోవడం.. ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించడం వంటి అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి ఫ్యామిలీ సంబంధించి పలు ప్రాపర్టీల్లో సోదాలు కొనసాగుతున్నాయి.  మరోవైపు ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏమన్నారంటే. ఐటీ అధికారులు ఇళ్లపై రైట్స్ చేస్తున్న విషయంలో నిజం లేదని తెలిపారు. 2022లో పీజీ సీట్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడకి వచ్చారని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు అందజేశారని అన్నారు. ఉదయం 6 గంటలకు అధికారులు రావడంతో ఐటీ అధికారులుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేర్కొన్నారు

రష్యాలో విమాన ప్రమాదంలో 49 మంది మృతి

  రష్యాలో అదృశ్యమైన అంగార ఎయిర్‌లైన్స్ ఫ్యాసింజర్ విమానం కూలిపోయిందని ఎయిర్‌లైన్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనల్లో  49 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి సంబంధించి శిథిలాలను అధికారులు గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతేడాది హెలికాప్టర్ కూడా మిస్ అవడం గమనార్షం.ఎయిర్ పోర్టుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయని, ప్రమాద తీవ్రతను గమనిస్తే ప్రయాణికులలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని చెప్పారు. అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది.  టిండాలోని ఎయిర్ పోర్టులో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యారని సమాచారం. ఎయిర్ పోర్ట్ చుట్టూ తిరిగి మరోమారు ల్యాండింగ్ కు పైలట్ ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. 

ఢిల్లీలో రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్.. దేనిపైనంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం (జులై 24) రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై పార్లమెంటులో లేవనెత్తాల్సిందిగా రేవంత్ ఈ సందర్భంగా రాహుల్, ఖర్గేలను కోరారు. అసలు బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకే ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులతో ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (జులై 24) సాయంత్రం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. తెలంగాణలో కులగణన జరిగిన తీరు, అనుసరించిన విధానం వంటి అంశాలపై ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ఇవ్వనున్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాలలో తెలంగాణ దేశానికే మోడల్ గా నిలుస్తుందని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ఇవే అంశాలపై రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ప్రాథాన్యత సంతరించుకుంది.   

తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు

తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరిగే ఈ సదస్సు నిర్వహణపై ఆయన గురువారం (జులై 24) సమీక్ష నిర్వహించారు. తొలుత ఈ సదస్సును విశాఖలో నిర్వహించాలని భావించినప్పటికీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.   ఈ సదస్సుకు  ఈ సదస్సుకు ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుంచీ ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.  300 మందికి పైగా ఈ సదస్సుకు హాజరౌతారనీ.. ఈ సదస్సులో చర్చించిన అంశాల నివేదికను పార్లమెంటు, అసెంబ్లీల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెడతారని అయ్యన్నపాత్రుడు వివరించారు.  

సీఎం చంద్రబాబు ట్వీట్‌.. పవర్ స్టార్ హర్షం

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా సూపర్ సక్సెస్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు   ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.  మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు గురువారం (జులై 24)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం (జులై 23)   రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు (#HariHaraVeeraMallu) చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు... చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన 'హరిహర వీరమల్లు' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే...  సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం ఆ పోస్టులో పేర్కొన్నారు.   ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ.. 'సీఎం చంద్రబాబు గారూ, నేను గత పదేళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు  హరిహర వీరమల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను  అని  పేర్కొన్నారు.

కాంగ్రెస్ గూటికి కొండబాల?

డిప్యూటీ సీఎం భట్టితో సంప్రదింపులు! తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  రెండు రోజుల క్రితం  కొండబాల కోటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో  ఉన్నంత కాలం ఆయన తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా కొనసాగారు.  గతంలో మధిర ఎమ్మెల్యే గా కూడా కొండబాల పనిచేశారు. దీంతో ఆయనకు   అనుచరగణం కూడా ఉంది. భట్టితో భేటీ సందర్భంగా కొండబాల తనకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమని కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో భట్టి నుంచి ఆయనకు స్పష్టమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తోంది. కొండబాల అడిగిన దానికి భట్టి  హామీ ఇవ్వలేననీ,  ఎప్పటి నుంచో   పార్టీలో కొనసాగుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే.. ఆరు నెలల తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనికి  కొండబాల కూడా సుముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం కొండబాల తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన  అనుచరుల నుంచి పార్టీ మార్పునకు విముఖత వ్యక్తమౌతోందని అంటున్నారు. 

గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 50మంది ప్రయాణికులతో చైనా లోని టిండా నగరం వైపు వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో  సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.  ఆ విమానం  గాల్లోనే పేలిపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది.   ర‌ష్యాలోని అంగారా విమాన‌యాన సంస్థ‌కు చెందిన ప్ర‌యాణికుల‌ విమానం 50 మందితో వెడుతూ చైనా స‌రిహ‌ద్దులో   గ‌ల్లంతైంది.  చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళుతుండ‌గా  . గ‌మ్య‌స్థానానికి  కొద్ది దూరంలో అదృశ్యమైంది.  విమానం అదృశ్యమైన విషయాన్ని అధికారులు ధృవీకరించారు.    

లిక్కర్ స్కామ్ కేసు.. ఇక ఈడీ దూకుడు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలకు నిప్పుడు ఉప్పు తోడైనట్లుగా ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇక చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తునకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇక ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తునకు నడుం బిగించింది. సిట్ నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించింది. మనీ ల్యాండరింగ్ నిరోథక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మద్యం కుంభకోణంతో సంబంధాలున్న పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి శార్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్  చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొంది.  

అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలలో ఈడీ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం (జులై 24) సోదాలు చేపట్టారు. ఢిల్లీ, ముంబయిలోని ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాదాపు 50 ప్రదేశాలలో ఏకకాలంలో ఈ దాడులు చేస్తున్నారు.   ఎస్‌బీఐ  ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాథాన్యత సంతరించుకుంది.   అనిల్ అంబానీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీల్యాండరింగ్ పై దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై దృష్టి సారించింది   అనిల్ అంబానీ  నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు   కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాలు ఎందుకు, ఏ అవకతవకలకు సంబంధించి జరుగుతున్నాయనే విషయంపై ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఈడీ వెలవరించలేదు. 

ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైంది.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా  ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించి సభా నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు.   అలాగే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్రవేయనుంది.  అదే విధంగా ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనపై కూడా కేబినెట్ చర్చిస్తుంది.  ఇక ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సీఆర్డీఏ ప్రతిపాదనలపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.  అదే విధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  ప్రభుత్వంలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలాజీ   శాఖ ఏర్పాటుపై  చర్చించే అవకాశం ఉంది.  

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు

మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌కు   పోలీస్‌ లు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు  మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో నోటీసులు జారీ చేశారు.   కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో తనను అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 26న ఉదయం పది గంటలకు కోవూరు పోలీసు స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసు అంటించి వెళ్లారు.  ఇలా ఉండగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఆ కేసులో కూడా మాజీ మంత్రికి ఒకటి రెండు రోజులలో నోటీసులు  ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  

ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నది.. 84 ఏళ్లలో ఇదే తొలిసారి

కావేరీ నది పొంగి ప్రవహిస్తున్నది. దాదాపు 84 ఏళ్ల తరువాత ఈ నదిలో ఈ స్థాయి నీటిమట్టం రావడం ఇదే మొదటి సారి. ఈ నదిపై 1932లో కృష్ణసాగర్ డ్యాం నిర్మించిన తరువాత ఇక్కడ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఇది రెండో సారి మాత్రమే. ఎప్పుడో 1941లో కావేరీ నదికి ఉధృతంగా వరదలు వచ్చిన సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మళ్లీ ఇంత కాలానికి ఈ ఏడాది జులైలో కావేరీ నది నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేఎస్ఆర్ డ్యాం వద్ద కావేరీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్యామ్ నిర్మాణం తరువాత తొలి సారిగా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 124.4 అడుగుల స్థాయికి చేరుకుంది.    

అడుసుతొక్కనేల.. సామెతను గుర్తు చేస్తున్న కొలికిపూడి!

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును వివాదాలు వెంటాడతాయా? లేక ఆయనే వివాదాల వెంటపడతారా తెలియదు కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన తరచూ వివాదాలతోనే సహవాసం చేస్తున్నారని అనిపించక  మానదు. తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై కొలికిపూడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తో సఖ్యత లేకుండా చేసుకున్న కొలికిపూడి శ్రీనివాసరావు తన చర్యలు, తీరుతో అధిష్ఠానం ఆగ్రహానికీ గురయ్యారు. ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో  కలిసి మాట్లాడిన వీడియో బయటకు రావడం సంచ లనంగా మారింది.  ఇప్పటికే పార్టీలోని సీనియర్లు కొలికపూడి చర్యలతో సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే మద్యం స్కాం లో పీకల లోతు కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను పెద్దిరెడ్డి రామచందరారెడ్డితో మాటలు కలిపిన వీడియో మొత్తం పది సెకండ్లేనని, యాథృచ్ఛికంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురుపడిన పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డిని కేవలం పలకరించాననీ కొలికిపూడి వివరణ ఇస్తున్నప్పటికీ, టీడీపీ శ్రేణుల, నేతల ఆగ్రహం చల్లారడం లేదు. పలు అవినీతి కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డిని, అందులోనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కనిపించగానే అత్యుత్సాహంతో ఆయన వెంటపడి మరీ పలకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని పార్టీ నాయకులు కొలికిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంలో తెలుగుదేశం అధిష్ఠానం కూడా కొలికిపూడిపై సీరియస్ గా ఉందంటున్నారు.   ఇప్పటికే తిరువూరు  పార్టీ శ్రేణులలో పరపతి పోగొట్టుకున్న కొలికిపూడిపై ఇప్పటికే చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డితో మాటామంతీ కారణంగా ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా కోల్పోయారని అంటున్నారు.  

బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి.. రేవంత్ డిమాండ్ తో బీజేపీ ఇరుకున పడ్డట్టేనా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  తన తాజా డిమాండ్ తో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ నే కాదు, బీజేపీ హైకమాండ్ ను కూడా ఇరుకున పడేశారు. తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి.. కేంద్రంలో తీవ్ర ఒత్తిడి తీసుకుస్తున్నారు. కులగణనపై కేంద్రం మెడలు వంచుతామంటూ గర్జించారు.  హస్తినలో మీడియా సమావేశం పెట్టి మరీ ఉపరాష్ట్రపతి పదవిని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవిని బీసీలతో లింక్ పెట్టి కేంద్రాన్ని ఇరుకున పెట్టారు.   దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా బీసీలను గౌరవించినట్లే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లు అవుతుందని రేవంత్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బీసీల నాయకత్వాన్ని అణచివేస్తున్నారని ఆరోపణ చేయడమే కాకుండా..ఈ సందర్భంగా బండి సంజయ్ ను ప్రస్తావించారు.  బీసీలకు పెద్ద పీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండియా  కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు లభించేలా చేస్తానన్నారు.  బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి అంటూ రేవంత్ చేసిన డిమాండ్ బీజేపీకి గొంతులో పచ్చవెలక్కాయపడినట్లు చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో బీజేపీ చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వ్యూహాత్మకంగా పలు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నది. అయితే బీజేపీ ప్రచారంలోకి తీసుకువస్తున్న పేర్లలో బండారు దత్తాత్రేయ పేరు మాత్రం లేదు.   బండారు దత్తాత్రేయకు పదవీవిరమణ వయస్సు దగ్గరపడుతోంది. ఇప్పటికే హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా పని చేశారు.  ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ పరిశీ లించే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా  బీసీల విషయంలో బీజేపీ అన్యాయం చేస్తున్నదంటూ ఆ పార్టీ హైకమాండ్ ను ఎండగట్టడమే లక్ష్యంగా రేవంత్ ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.