మైలవరంలో మర్డర్స్ మిస్టరీ.. ఉమా ఖాతాలో ఒకటి, వసంత ఖాతాలో రెండు!

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే, ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయ నాయకుల విమర్శలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఒకరిపై ఒకరు హత్యారోపణలు చేసుకుంటూ కొత్త చర్చలకు దారి తీస్తున్నారు. 2019 ఎన్నికలలో కృష్ణా జిల్లా మైలవరంలో టీడీపీ తరపున దేవినేని ఉమా, వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ బరిలోకి దిగగా.. వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. ఎన్నికల ముందు నుంచే ఉప్పు-నిప్పులా ఉన్న వీరి మాటల యుద్ధం, ఎన్నికల తరువాత మరింత తీవ్రతరమైంది. ఇక రాజధాని అంశంతో వీరి మాటల యుద్ధం మరోస్థాయికి వెళ్ళిపోయింది. రాజధానిగా అమరావతిని మారిస్తే.. రాజీనామా చేస్తానన్న కృష్ణప్రసాద్.. తరువాత యూటర్న్ తీసుకొని మూడు రాజధానులు జై కొట్టారు. అంతేకాదు, మూడు రాజధానులకు మద్దతుగా.. వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలీని కూడా ప్రారంభించారు.  ఈ నేపథ్యంలో దేవినేని ఉమా.. వసంత కృష్ణప్రసాద్ మరియు ఆయన తండ్రి పై విమర్శలు గుప్పించారు. ప్రజల్ని అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు వంచించారని.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగలేదు. బినామీ ఆస్తుల కోసం సొంత బంధువు పొదిలి రవిని వసంత నాగేశ్వరరావు పొట్టన పెట్టుకున్నారన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని వసంత ఇంట్లో పని చేస్తున్న బాపట్ల మేరీ ఎలా చనిపోయిందో చెప్పాలని ఉమా డిమాండ్‌ చేశారు. ఉమా వ్యాఖ్యలపై వసంత నాగేశ్వరరావు కూడా అదే స్థాయిలో స్పందించారు. బాపట్ల మేరీ చనిపోయిన రోజు కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నాడని రుజువు చేస్తే నేను తల తీసుకుంటా లేదంటే నువ్వు తల తీసుకుంటావా అని సవాల్ చేశారు. అంతటితో వదిలి పెట్టలేదు.. వదినను చంపిన దేవినేని ఉమాకు సవాల్ చేయాలంటే సిగ్గుగా ఉందన్నారు. మొత్తానికి ఇప్పుడు.. పొదిలి రవి, బాపట్ల మేరీ, ఉమా వదిన మరణాలు చర్చనీయాంశమయ్యాయి. ముందు ముందు వీరి మాటల యుద్ధం ఇంకే స్థాయికి వెళ్తుందో ఏంటో!.

ఢిల్లీ అల్లర్లలో 20కి చేరిన మృతులు.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం...

ఢిల్లీలో గత కొన్నిరోజులుగా కొనససాగుతున్న అల్లర్లు అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు ఢిల్లీ అల్లర్లపై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ అల్లర్లకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ డిమాండ్ చేశారు. అల్లర్లను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమైనప్పుడు సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు రంగంలోకి దించలేదని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్లకు నిరసనగా రేపు దేశ రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని సోనియాగాంధీ ప్రకటించారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవర్ స్పందించారు. ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుటోందని, ఇప్పటికే అల్లర్లను అదుపులోకి తీసుకురావడంతో పాటు టీవీల్లో రెచ్చగొట్టే కథనాలు, వ్యాఖ్యలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చామని సమాచార, ప్రసారమంత్రి కూడా అయిన జవదేకర్ వెల్లడించారు. కేంద్రం బాధ్యత వహించాలని కోరుతున్న సోనియాగాందీకీ ఇంత జరుగుతుంటే ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారో కూడా చెప్పాలన్నారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లపై లక్నోలో మాట్లాడిన సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ.. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఢిల్లీ అల్లర్లు యూపీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పిన ప్రియాంక.. ప్రజలు కీలక సమయంలో విజ్ఞతతో వ్యవహరించి రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపీకి అల్లర్లు విస్తరించకుండా రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు. హస్తినలో అల్లర్లపై హైదరాబాద్ లో ఏఎన్ఐ వార్తాసంస్ధతో మాట్లాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. దీనికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే పరిస్ధితి చక్కదిద్దాల్సింది పోయి హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో తనపై విమర్శలు చేస్తున్నారని ఓవైసీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు అల్లర్లను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఓవైసీ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఘర్షణలను అదుపుచేయాలన్నారు. మరోవైపు అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం అవసరమైతే సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల ప్రజల్లో స్ధైర్యం నింపేందుకు ఇవాళ పోలీసులు కవాతు నిర్వహించారు. అదే సమయంలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజన్స్ అధికారి మృతదేహం ఓ డ్రైనేజీ సమీపంలో లభ్యం కావడం కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అల్లర్ల సమయంలో విదులు నిర్వహించేందుకు వెళ్లిన అంకిత్ శర్మను ఎవరు హతమార్చి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని మోడీ ట్విట్టర్ లో కోరారు.

ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర.. అమిత్ షా రాజీనామా చేయాలి!!

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 20కి చేరింది. 189 మంది చికిత్స పొందుతున్నారని జీటీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గౌతమ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొనసాగుతున్న హింసపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో అల్లర్లు జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఈ అల్లర్లకు బీజేపీనే కారణమని విమర్శించారు. ఢిల్లీలోని ఈ హింస వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇటువంటి ఘటనలనే ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ దేశం యావత్తూ చూసింది. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, వారిలో భయపూరిత వాతావరణం నెలకొనేలా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అల్లర్లకు హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం కేజ్రీవాల్ దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సాయం చేయాలని సోనియా పిలుపునిచ్చారు.

నదిలో పడిన పెళ్లి బస్సు.. 24మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూండీ జిల్లాలోని కోటలాల్‌సోట్ దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి మేజ్‌ నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. బూండీలోని కోటకు చెందిన వరుడి కుటుంబ సభ్యులు 40 మంది ఒకే బస్సులో సవాయ్‌మాదోపూర్‌లో జరగనున్న పెళ్లి మండపానికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సు లకేరీ పట్టణం పరిధిలోని వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 24 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నా వల్ల కాదంటూ పారిపోయిన రాహుల్ గాంధీకే మళ్లీ కాంగ్రెస్ పగ్గాలా?

దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాని నిలుపుకోవడానికి కూడా సతమతమవుతోంది. దానికి ప్రధాన కారణం నాయకత్వ లేమి. నరేంద్ర మోడీ- అమిత్ షా ద్వయం బీజేపీకి వరుసగా రెండోసారి ఘన విజయాన్ని అందించి దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ని అలా ముందుండి నడిపించే నాయకుడు లేక.. వరుసగా రెండోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది. అదికూడా కేవలం పదుల సంఖ్యలో సీట్లు తెచ్చుకుంటూ.. ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. దీంతో కాంగ్రెస్ ని ఆదుకునే నాయకుడు ఎవరు?, కాంగ్రెస్ కి మళ్లీ పూర్వవైభవం ఎప్పుడొస్తుందని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ బరిలోకి దిగింది. 2014 సమయంలో పప్పు అనే ముద్ర వేసుకున్న రాహుల్ గాంధీ.. రాను రాను ఆ ముద్ర పోగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే మోడీకి ధీటైన నాయకుడిగా మాత్రం ఎదగలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ ఓటమితో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. గాంధీ కుటుంబంతో సంబంధం లేని బలమైన నేతని ఎంపిక చేయాలని సూచించారు. అసలే ఓటమి, దానికితోడు పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడంతో.. పార్టీ శ్రేణులు ఢీలాపడిపోయాయి. పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అయినా రాహుల్ మాత్రం అధ్యక్ష పదవిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోనియాగాంధీ పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా తీసుకున్నారు. అయితే సోనియా గాంధీ తరువాత పార్టీని నడిపించేది ఎవరు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్ని వేధిస్తున్న ప్రశ్న. ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు ఇవ్వాలని కొందరు కోరుతున్నా.. ఆమెకున్న ఈ కొద్ది రాజకీయ అనుభవంతో.. ఓ జాతీయ పార్టీని ముందుండి నడిపించి మోడీ-షాలను ఢీ కొట్టగలరా? అంటే అనుమానమే. పోనీ గాంధీ కుటుంబంతో సంబంధం లేని.. ఎవరైనా సీనియర్ నేతకి ఇద్దామా అంటే వర్గపోరు మొదలయ్యే అవకాశముంది. పీసీసీ చీఫ్ పదవి కోసం రాష్ట్రాలలో జరిగే వర్గపోరుతోనే కాంగ్రెస్ అధిష్టానం వేగలేకపోతుంది. ఇక జాతీయస్థాయిలో వర్గపోరు మొదలైతే ఇంకేమైనా ఉందా? పార్టీ పూర్తిగా బలహీనపడే ప్రమాదముంది. అందుకే కాంగ్రెస్ శ్రేణులు గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్నాయి. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకోవాలని నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పార్టీ బలోపేతమవుతుందని, ఆయనకు పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి అప్పగించాలంటూ సోనియాగాంధీకి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ లాయలిస్టు ఫోరం సైతం లేఖ రాసింది. ఇలా పలు రాష్ట్రాలలోని నేతలూ డిమాండ్ చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ వీరి కోరిక మేరకు పార్టీ పగ్గాలు చేపడతారా?. ఒకవేళ చేపట్టినా.. ఒకసారి నావల్ల కాదంటూ పార్టీ పగ్గాలు వదిలేసిన రాహుల్ గాంధీపై.. సామాన్య కార్యకర్తలకు, ప్రజలకు అంత త్వరగా నమ్మకం కలిగే అవకాశంలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి కాంగ్రెస్ భవిష్యత్తుకి భరోసానిచ్చే నాయకుడు రాహుల్ అవుతాడో లేక మరెవరైనా అవుతారో చూద్దాం.

ఏపీలో స్ధానిక ఎన్నికలు మరింత ఆలస్యం? బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమగ్ర సర్వే చేయకుండా బీసీ రిజర్వేషన్లు పెంచిన వ్యవహారంలో నిబంధనలు పాటించలేదంటూ మంగళవారం హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తీర్పు వచ్చే నెల మొదటి వారానికి వాయిదా పడింది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల నిర్వహణపై తీర్పును సైతం హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. వాస్తవానికి స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం... హైకోర్టు తీర్పు వాయిదా నేపథ్యంలో అశెంబ్లీపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి. ఏపీలో స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గత డిసెంబర్ 28న ప్రభుత్వం జీవో జారీచేసింది. దీని ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో రిజర్వేషన్ల శాతం 59.85కు చేరింది. అయితే రిజర్వేషన్లు ఎట్టి పరిస్దితుల్లోనూ 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైకోర్టు కూడా వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్లను 2011 జనాభా గణన ఆధారంగా రూపొందించిన అంచనాలతో ఖరారు చేయడాని కూడా హైకోర్టు తప్పుబట్టింది. ఎప్పుడో 2011లో జరిగిన జనగణనను ఆధారంగా చేసుకుని అంచనాలతో బీసీ రిజర్వేషన్లు ఎలా ఖరారు చే్స్తారని కోర్టు ప్రశ్నించింది. సమగ్ర సర్వే జరపకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల మొదటివారానికి వాయిదా వేసింది. స్ధానిక సంస్ధల ఎన్నికలపై హైకోర్టులో అభ్యంతరాలు తొలగిపోతే వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వానికి తాజా పరిణామాలతో ఇబ్బందికర పరిస్ధితి ఎదురవుతోంది. హైకోర్టులో కేసుల విచారణ వాయిదా దృష్ట్యా చూస్తే మార్చి మెదటి వారంలో ఎన్నికల నిర్వహణ కష్టమని తేలిపోయింది. కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 2 లేదా 3వ తేదీల్లోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వీలుంది. ఆ తర్వాత వారం లేదా పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత కోర్టు తీర్పు ఆధారంగా స్ధానిక ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతోంది. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపై పూర్తి స్ధాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

పులివెందుల సతీష్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా?

కడప జిల్లాలో వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా వరుస విజయాలు అందుకుంటున్నా వారికి కొరుకుడు పడని నేత ఎవరైనా ఉన్నారంటే సతీష్ రెడ్డి మాత్రమే. రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో ఆయనతోనూ, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ తోనూ ముఖాముఖీ తలపడిన సతీష్ రెడ్డి కొంతకాలంగా సొంత పార్టీ టీడీపీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీతో పెట్టుకోవడం ఎందుకని భావిస్తున్నారో లేక ఆ పార్టీతో రాజీపడ్డారో తెలియదు కానీ కొన్ని నెలలుగా సతీష్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. దీంతో త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారనే ప్రచారం మొదలైంది. ఇది ఆయన దృష్టికి వెళ్లినా ఖండించకపోవడం చూస్తుంటే టీడీపీ పులివెందులలో కొత్త ఇన్ ఛార్జ్ ను వెతుక్కోక తప్పదా అనిపిస్తోంది. చాలా కాలం క్రితం కడప జిల్లాలో జరిగిన మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్దులుగా ఉన్న కొందరు రాజారెడ్డిని కాపు కాసి నరికిచంపారు. అయితే ఈ హత్య కేసు న్యాయస్దానాల్లో సుదీర్ఘకాలం విచారణ జరిగింది. ఇందులో పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి పాత్ర ఉందని వైఎస్ బలంగా నమ్మేవారు. అంతే కాదు తన తండ్రి హంతకులు పులివెందులలో తన కళ్లముందు తిరుగుతున్నా వదిలేశానని వైఎస్ చెప్పుకునేవారు. అయితే వైఎస్ తండ్రి హత్యలో తన పాత్ర లేదని సతీష్ రెడ్డి కూడా చెప్పుకునేవారు. అయినా వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పులివెందుల నియోజకవర్గంలో 1999 నుంచి 2019వరకూ అదే వైఎస్ కుటుంబీకులపై పోటీ చేస్తూనే ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి కీలక నేతగా మారిపోయారు. ఒకప్పుడు పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసే అభ్యర్ధులకు బూత్ ఏజెంట్లు కూడా ఉండే వారు కాదు. అలాంటిది వైఎస్ కుటుంబంపై టీడీపీ నుంచి పోటీ చేయడమే కాకుండా బూత్ ఏజెంట్లను కూడా పెట్టుకునే పరిస్ధితికి తీసుకొచ్చారు సతీష్ రెడ్డి. అలాంటి నేత తాజాగా మౌనం వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చని చెబుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్ధానాల్లో 49 సీట్లు గెల్చుకుని వైసీపీ జోరు మీదుంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఎంత చెబితే అంతగా రాయలసీమలో పరిస్ధితులు ఉన్నాయి. గతంలో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి మీద చేసిన పోరాటం వేరు, ఇప్పుడు జగన్ మీద పోరాటం చేయడం వేరు. జగన్ ది తన తాత రాజారెడ్డి మనస్తత్వమని స్వయానా తన పార్టీ అధినేత చంద్రబాబే నేరుగా ఆరోపిస్తున్న తరుణంలో జగన్ కు ఎదురు వెళ్లడం మంచిదా కాదా అనే విషయంలో సతీష్ రెడ్డి ఓ క్లారిటీకి వచ్చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తాజాగా కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా నిర్వహించిన సమావేశానికి మాత్రమే ఆయన హాజరయ్యారు. పార్టీ సమన్వయ కమిటీల భేటీలకు సైతం సతీష్ రెడ్డి దూరంగాన ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారిపోవడం లేదా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవచ్చని చెబుతున్నారు. సతీష్ రెడ్డి యాక్టివ్ కాకపోతే ఆయన స్ధానంలో ఎమ్మెల్సీ బీటెక్ రవిని చంద్రబాబు పులివెందుల ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశముంది.

రేవంత్ టార్గెట్‌గా తెరపైకి భూ-వివాదం... డిప్యూటీ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో తప్పుడు డాక్యుమెంట్ల ఆధారంగా అక్రమ మ్యుటేషన్లు చేసిన శేరిలింగంపల్లి మాజీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. గోపనపల్లి సర్వే నెంబర్ 127లో అత్యంత ఖరీదైన భూమిని అక్రమంగా తమ పేర రాయించుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్‌ ‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మొత్తం 6.24 ఎకరాల భూమిని మ్యుటేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, శేరిలింగంపల్లి మాజీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటేశారు. హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని గోపనపల్లిలో అత్యంత విలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి భూదందాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, తన సోదరుడి పేరుమీద మ్యుటేషన్‌ చేయించుకున్నారన్న అభియోగాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అయితే, శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో ఏడెకరాల భూమిని రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమమార్గంలో దక్కించుకున్నట్టు రంగారెడ్డి జిల్లా అధికారులు తమ విచారణలో తేల్చారు. దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదికను అందజేశారు. దాంతో, నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్‌ చేసిన అప్పటి తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.  గోపనపల్లి సర్వే నంబరు 127లో 10.21 ఎకరాల భూమి ఉన్నది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి క్రయవిక్రయాలు జరిగినట్టు కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వే నంబర్‌ 127లోని భూమిలో తమకు హక్కు ఉన్నదని, రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొల్లా అరుణ ...2017లో హైకోర్టులో 17542, 17637 నంబర్లతో రిట్‌పిటిషన్‌ వేశారు. అలాగే అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి జిల్లా సివిల్‌ కోర్టులో 780/2015 నంబర్‌తో పిటిషన్‌ దాఖలుచేశారు. వీటిపై నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ముందుగా ఈ భూమిని వేరేవారి పేరుమీద రాయించి... తర్వాత వారి నుంచి రేవంత్‌రెడ్డి, అతడి సోదరుడు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 6 ఎకరాల 39.5 గుంటలను ఎంపీ రేవంత్‌రెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డి తమపేరు మీద రాయించుకున్నట్టు తేల్చారు. రేవంత్‌రెడ్డి పేరు మీద రెవెన్యూ అధికారులు వివిధ మ్యుటేషన్ల ద్వారా బదిలీచేసి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టు విచారణలో తేలింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారానే ఈ మ్యుటేషన్లు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. 127 సర్వే నంబర్‌లోని భూమికి నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేయడంతోపాటు, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన నాటి శేరిలింగంపల్లి తాసిల్దార్‌ శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్‌.. రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక పంపించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌/తాసిల్దార్‌ డీ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక, వివాదంలో ఉన్న భూమి, ఎకరం విలువ పాతిక కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు.

ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు... ఇప్పటివరకు 13మంది మృతి...

దేశ రాజధాని ఢిల్లీ రణరంగంగా మారింది. సీఏఏ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల ఘర్షణల్లో ఇప్పటివరకు 13మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అల్లర్ల నేపథ్యంలో, ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించి, కనిపిస్తే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఢిల్లీ-గజియాబాద్ రహదారిని మూసివేశారు. ఈశాన్య ఢిల్లీ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. 13 పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. పది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాలను మోహరించారు. అయితే, కేంద్ర బలగాలను పెద్దఎత్తున మోహరించినా, ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు షాపులను, వాహనాలను తగలబెడుతున్నారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. మౌజ్‌పుర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో డ్రోన్ల ద్వారా అల్లరి మూకలను గుర్తించి, వాళ్ల పని పట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. స్పెషల్ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాత్సను నియమించింది. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా... అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు, ఈశాన్య ఢిల్లీలో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో, మీడియాకి కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది. దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్‌ను, వీడియోలను ప్రసారం చేయొద్దని సూచించింది. అలాగే, ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించపర్చేలా ఉన్న వీడియోలు గానీ... పదాలను గానీ, టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్లే చేయకూడదని ఆదేశించింది. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలిపింది.

ఇచ్చినప్పుడే తీసుకుందాం.. తొందరేముంది? టీపీసీసీపై ఆశావహుల విచిత్ర కామెంట్స్ 

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి ఎంపికపై అధిష్టానం నాన్చుతూ పోతోంది. అదిగో కొత్త సారధి... ఇదిగో న్యూ పీసీసీ చీఫ్ అంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నా, హైకమాండ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నిర్ణయం తీసుకోలేకపోతోంది. అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించి ఐదారు నెలలు గడిచిపోతున్నా, కొత్త పీసీసీ చీఫ్‌ను మాత్రం నియమించలేకపోతోంది.  అయితే, మొన్నటివరకు పీసీసీ పదవి కోసం హోరాహోరీగా తలపడ్డ ఆశావహులు కూడా, హైకమాండ్ ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదన్న తరహాలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పు ఎప్పుడు ఉంటుంది, మిమ్మల్నే వరిస్తుందా? అంటూ ఆశావహులను ఎవరైనా అడిగితే, విచిత్రమైన సమాధానం చెబుతున్నారట. తొందరేముంది, ఇచ్చినప్పుడే తీసుకుందామంటూ ఆశావహులు వ్యాఖ్యానిస్తున్నారట.   సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లకు పైగా టైమున్నా, త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే పీసీసీ అధ్యక్షుడికి ఆర్ధిక భారం తప్పదు. ఒకవేళ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు వెంటనే పీసీసీని మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. దాంతో, అప్పుడే పీసీసీ పదవి ఎందుకనే భావనలో ఆశావహులంతా ఉన్నారని, అందుకే అధిష్టానంపైనా కూడా ఒత్తిడి తేవడం లేదని టీకాంగ్రెస్ నేతలు అంటున్నాయి. మొత్తానికి నిన్నమొన్నటివరకు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన ఆశావహులంతా, ఇప్పుడు సడన్‌గా సైలెంట్ అయిపోవడంపై గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు.

అమెరికా ప్రెసిడెంట్ టూర్ ఫుల్ సక్సెస్.. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండ్రోజుల భారత పర్యటన విజయవంతమైంది. మొదటి రోజు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైన దగ్గర్నుంచి.... తిరిగి అమెరికాకు పయనమయ్యేంతవరకు ట్రంప్‌కు అడుగడగునా ఘనస్వాగతం లభించింది. మొదటి రోజు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టగా, ఇక, మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమం అయితే... అమెరికా అధ్యక్షుడిని ఫుల్ ఖుషీ చేసింది. ట్రంప్ తోపాటు సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకాలు... అహ్మదాబాద్‌లో లభించిన అతిథి మర్యాదలకు ట్రంప్‌, మెలానియా ఉబ్బితబ్బిబైపోయారు. ఇక, తాజ్ అందాలను చూసి ట్రంప్ దంపతులు మైమరిపోయారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా అయితే, తాజ్ అందాలకు ఫిదా అయిపోయారు. రెండు గంటలకుపైగా తాజ్ దగ్గర గడిపి తనివితీరా ఆస్వాదించారు. ఇక, రెండో రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు గ్రాండ్ వెల్‌కమ్‌ లభించింది. భారత త్రివిధ దళాల నుంచి ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, రాజ్ ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించి అక్కడ ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత, ట్రంప్-మోడీ మధ్య సుమారు రెండు గంటలపాటు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం, మోడీ, ట్రంప్ కలిసి సంయుక్త సమావేశం నిర్వహించి ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలను వివరించారు.  ఇక, చివరిగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.... రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందు అనంతరం నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ్నుంచి అమెరికా బయల్దేరారు. ఎయిర్‌ ఫోర్స్ వన్ ప్రత్యేక విమానంలో తిరుగుపయనమైన ట్రంప్, మెలానియా దంపతులకు కేంద్ర పెద్దలు వీడ్కోలు పలికారు.

ఉగాదికి పేదలకు ఇళ్ల స్ధలాల వ్యవహారంలో ట్విస్ట్.. రంగంలోకి జగన్ టీమ్

వచ్చే ఉగాది నాటికి ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న వైసీపీ సర్కారుకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. పలు జిల్లాల్లో ప్రభుత్వ స్ధలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు స్దలాలను కొనుగోలు చేయడం, గతంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేసి మరీ తాజాగా వాటిని సేకరించడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో భూసేకరణ కోసం క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. మరోవైపు సమయం కూడా తక్కువగా ఉన్నందున సమస్య పరిష్కారానికి సీఎం జగన్ నేరుగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలో దాదాపు పాతిక వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి 25 లక్షల పేదలకు ఉగాది సందర్భంగా ఒక్కో సెంటు చొప్పున పంచేందుకు వైసీపీ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నవరత్నాలు- పేదలకు ఇళ్ల స్ధలాలు పథకం కింద చేపడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లాల్లో భూసేకరణలో పలు ఇబ్బందులు తలెత్తాయి. అనుకున్న స్ధాయిలో ప్రభుత్వ భూముల లభ్యత లేకపోవడంతో గతంలో పేదలకు ఇచ్చిన స్ధలాల్లో ఇళ్లు నిర్మించని వాటని వెనక్కి తీసుకుని తిరిగి వారికే ఇచ్చే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. దీంతో పేద ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. భూసేకరణ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. పలు జిల్లాల్లో రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడే పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మందుగా అనుకున్న ప్రకారం ఉగాది నాటికి భూసేకరణ పూర్తయితే కానీ పథకం అమలు చేయడం సాధ్యం కాదు. దీంతో తాజా పరిస‌్ధితిపై మంగళవారం జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్… క్షేత్రస్ధాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఏకంగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. సీఎస్ నీలం సాహ్ని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇతర కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోక్య రాజ్ వంటి వారికి పలు జిల్లాల బాధ్యతలను సీఎం అప్పగించారు. నీలం, ప్రవీణ్ ప్రకాష్ లకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించిన సీఎం... అజయ్ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను, ఆరోక్య రాజ్ కు రాయలసీమ జిల్లాలను, ధనుంజయరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలను కేటాయించారు. ఆయా జిల్లాల్లో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేయడం వీరి బాధ్యత. మార్చి 1 నాటికి ఇళ్ల స్ధలాల కోసం భూములన్నీ పొజిషన్ లోకి తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ తన టీమ్ కు టార్గెట్ పెట్టారు. ప్లాట్లు మార్కింగ్ చేస్తే వెంటనే లాటరీ ద్వారా కేటాయించాలని వారికి సూచించారు. భూసేకరణలో జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఎవరి ఉసురూ తగలకుండా చూడాలని సైతం సీఎం జగన్ కోరారు. కలెక్టర్లు ఉదారంగా వ్యవహరించాలని సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పదేపదే కోరారు.

విజయవాడలో ఐటీ పంజా.. కార్పోరేట్ హాస్పటల్స్ పై మెరుపు దాడులు

దేశవ్యాప్తంగా ఐటీ ఎగవేత దారులపై వరుస దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ఇవాళ విజయవాడలోని కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా మెరుపు దాడులు చేపట్టారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్పోరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నగరంలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు పలుచోట్ల ఇవాళ ఐటీ దాడులు కొనసాగాయి. ఇందులో పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రోగుల నుంచి లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తన్న కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా ఇవాళ విజయవాడలో ఐటీ అధికారులు మెరుపు దాడలు చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిరోజులుగా వీరిపై నిఘా పెట్టిన ఐటీ బృందాలు ఇవాళ మెరుపు దాడులకు దిగాయి. దీంతో కార్పోరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఐటీ దాడుల్లో వివిధ ఆస్పత్రులకు సంబంధించిన కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో ఆదాయపన్ను చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కోట్లాది రూపాయల ఆదాయం చూపుతున్నా పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ సోదాల్లో తేలింది. ఇవాళ ఉదయం నుంచి విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఐటీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఐటీలో ఆదాయాన్ని తక్కువగా చూపుతున్న వారితో పాటు భవిష్యత్తులో రిటర్న్స్ దాఖలు చేయని ఆస్పత్రుల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

అనుకున్నదొకటి అయిందొకటి.. రాజధాని తరలింపుతో వాళ్ళెంత నష్టపోయారు?

“చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా” అన్న సామెత అందరికీ తెలిసిందే..అచ్చు అలానే ఉంది కొందరి పరిస్థితి. మింగలేక కక్కలేక అన్నట్లుంది వారి స్థితి. పైకి చెప్పలేరు లోపల దాచుకోనూలేక సతమతం అవుతున్నారు. ఇంతకీ వీరెవరు అనుకుంటున్నారా? రాజధాని గ్రామాల ప్రజలు.. ఆ ప్రజల్లో కూడా 15 వేల కుటుంబాలు.. ఈ 15 వేల కుటుంబాల ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? వీరంతా రెడ్లు.. అమరావతి నుంచి రాజధాని తరలిపోతే వీరంతా అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేరు. జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సిందే. ఏం చేయాలో అర్ధం కాక రెడ్లంతా జుట్టుపీక్కుంటున్నారు. పైకి విమర్శించలేరు. ఊరుకోనూ లేరు. అలా అని రాజధాని ఉద్యమంలో పాలుపంచుకోనూ లేరు..పాపం. అసలేం జరిగిందో చూద్దాం.. ఈ కుటుంబాలు రాజధాని గ్రామాలలో తరతరాలుగా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి ఇక్కడ ఎకరం నుంచి 20 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి. ఇంతకాలం పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని వారు కూడా అనుకోలేదు. రాష్ట్ర విడిపోవడం రాజధాని రావడం జరిగిపోయింది. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ లో ఈ 15 వేల కుటుంబాలూ పాలు పంచుకున్నాయి. కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మరికొందరు అన్ని బేరీజు వేసుకుని చివరిలో ఇచ్చారు. మరి కొందరు సగం భూమి అమ్ముకున్నారు.. సగం ఉంచుకున్నారు. ఎప్పుడైతే రాజధాని వచ్చేసి భూముల విలువ పెరిగిందో అప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చిన ఈ 15 వేల కుటుంబాలలోని వారు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఏదో కోట్ల రూపాయల టర్నోవర్ చేసేంత కాదు. తమకు పరిచయం ఉన్నవారి భూములు అమ్మిపెట్టడం, తమకు తెలిసిన వారు వస్తే భూములు కొనిపించడం.. మధ్య వర్తులుగా కొంత కమిషన్ తీసుకోవడం.. అంతే. ఏదోలా వ్యవసాయంపై తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు భూముల అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా పూర్తి అయినందున ఫ్లాట్లు, ఇళ్లు అమ్మకాలపై వీరు ఆధారపడ్డారు. ఇంతవరకూ బాగానే ఉంది గత ఎన్నికల్లో వీరంతా చందాలు పోగేసుకుని మరీ వైసిపి అభ్యర్ధులను గెలిపించుకున్నారు. కమ్మ వాళ్ల రాజ్యం అంతరించిందని సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది. 15 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వేల మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాదాపు 12 నుంచి 14 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చింది రెడ్డి కులస్తులే. ఇటు భూమీ పోయింది..అటు రియల్ ఎస్టేట్ వ్యాపారమూ పోయింది.. కమ్మ రాజ్యం అంతరించిందని, రెడ్డి రాజ్యం వచ్చిందని సంతోషించే లోపే వారి ఆనందం కూడా ఆవిరైంది. రెడ్డి రాజ్యాన్ని విమర్శిస్తే కమ్మోళ్ల దృష్టిలో చులకన అవుతామని, విమర్శించకపోతే జీవనోపాధి పోతోందని రెడ్లు అంతర్గతంగా కుమిలిపోతున్నారు.

ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జ్‌లకు స్వైన్ ఫ్లూ!

ఒక వైపు చైనా, కొరియా వంటి దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంటే, మరోవైపు మన దేశంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా హైదరాబాద్ లో ఓ మహిళ కూడా మృతి చెందింది. అయితే ఈ స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ ఈ సుప్రీం కోర్టుకూ తాకింది. తాజాగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. స్వైన్‌‌ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా, న్యాయవాదులకు స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించాలని నిర్ణయించినట్టు జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.

ఏపీ రాజ్యసభ ఎన్నికల రేసులో అనూహ్యంగా కొత్త పేర్లు?

రాజ్యసభలో ఈ ఏడాది ఖాళీ అవుతున్న 55 స్ధానాల భర్తీ కోసం వచ్చే నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్ధానాలకూ వచ్చే నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నాలుగు స్ధానాలను అధికార వైసీపీ దక్కించుకునే అవకాశముంది. దీంతో ఆ పార్టీలో నాలుగు బెర్తుల కోసం గట్టి పోటీ నెలకొంది. వీటిని బీసీ, ఓసీ, ఎస్సీ, మైనారిటీలకు తలొకటి చొప్పున కేటాయించాలని సీఎం జగన్ గతంలో నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో తీవ్ర పోటీ కారణంగా మార్పులు చేర్పులు తప్పవని భావిస్తున్నారు. ఏపీ నుంచి ఈసారి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల కోసం అధికార వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలు, సామాజిక సమీకరణాలు, పార్టీ విదేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నాలుగు బెర్తులకు అభ్యర్ధులను ఖరారు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నాలుగు సీట్ల కోసం పార్టీలో పలువురు సీనియర్లతో పాటు సామాజిక వర్గాల వారీగా చాలా మంది రేసులో ఉన్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు శాసనమండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న సీఎం జగన్ సన్నిహిత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు వైవీ సుబ్బారెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన బావ అయోధ్య రామిరెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే బీజేపీ కోటాలో ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. బీసీ కోటాలో నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు ఓ బెర్తు దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైనారిటీ కోటాలో వైసీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు మహబూబ్ పేరు వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న మహబూబ్ కు ఈసారి రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎంపిక చివరి నిమిషంలో సమీకరణాల ఆధారంగా ఉండొచ్చనే వాదన కూడా ఉంది. మండలి కోటాలో మంత్రులుగా ఉన్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లలో ఒకరికి రాజ్యసభ ఇచ్చి మరొకరికి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్ పదవి కట్టబెట్టొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో వారం రోజుల్లో తుది నాలుగు పేర్లను జగన్ ఖరారు చేసే అవకాశముంది.

ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదు!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందకపోవడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై తాజాగా మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో ఈరోజు చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. జగన్ సైకో లాగా మారిపోయారన్నారు. తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన ఒప్పందం!!

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక చర్చలు జరిపారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం.. ట్రంప్‌-మోదీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. తన భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనదని, ఈ పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలకమైన ఒప్పందాలపై అవగాహనకు వచ్చామని ట్రంప్ చెప్పారు. 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ పై చర్చించామని తెలిపారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించామన్నారు. భారత్ కు పెద్ద మొత్తంలో సహజ వాయువు (ఎల్ఎన్ జీ) సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ఇరు దేశాల పౌరులకు భద్రత కల్పించుకునే విషయంపైనా చర్చించామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ట్రంప్‌కు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌ సతీసమేతంగా భారత్‌ రావడం ఆనందం కలిగించిందని, గత 8 నెలల్లో తానూ, ట్రంప్‌ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. అమెరికా-భారత్‌ మధ్య స్నేహ బంధం పెరిగిందని, ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.

ఇన్ని నెలల తరువాత ప్రజా వేదిక ఫర్నీచర్ వేలం!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేసిన విషయం తెలిసిందే. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అని కూల్చివేసింది ఏపీ సర్కార్. ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించుకోవాలని పలువురు సూచించినా వినకుండా జగన్ సర్కార్ ప్రజావేదికను కూల్చి వేసింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది. అయితే కూల్చివేసిన ఎనిమిది నెలల తరువాత ప్రజావేదిక మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్రజా వేదికకి సంబంధించిన సామాగ్రిని వేలం వేయాలని సీఆర్‌‌డీఏ నిర్ణయించింది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత.. అక్కడ ఉన్న కూలర్లు, ఏసీలు, ఫర్మీచర్ ఇతర విలువైన సామాగ్రిని అధికారులు పక్కన పెట్టేసారు. అయితే ఇప్పుడు ఆ పరికరాలను రక్షించడంలో ఇబ్బందులు కలుగడంతో పాటు, ఆ పరికరాలను స్టోర్ చేస్తే పాడైపోయే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సీఆర్డీఏ ప్రజావేదిక సామాగ్రిని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆసక్తి ఉన్న బిడ్డర్లు వచ్చే మర్చి మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మార్చి 4న వేలం నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రజా వేదిక సామగ్రిని వేలం వేయాలన్న నిర్ణయంపై టీడీపీ సీనియర్‌‌ నాయకుడు నక్కా ఆనంద్ బాబు స్పందించారు. ప్రజా వేదిక కూల్చివేసిన 8 నెలల తర్వాత అందులోని సామగ్రిని వేలం వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కూల్చిన వెంటనే ఈ పని చేస్తే కొన్ని కోట్ల రూపాయలైనా వచ్చేవన్నారు. ఇప్పుడు అందులో పది శాతం కూడా రాదని నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.