తురకా కిశోర్‌‌ అరెస్ట్ నిబంధనలకు విరుద్దం..విడుదల చేయాలి : హైకోర్టు

  వైసీపీ నేత తూరకా కిశోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్‌ను అరెస్ట్ చేశారని  హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందినట్లు రిమాండ్‌ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. అరెస్టుతో పాటు రిమాండ్‌ విధింపు విషయంలో చట్టనిబంధనలు ఉల్లంఘిస్తే నిందితుడిని ఒక్క నిమిషం కూడా జైలులో ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది.  ఓ దశలో రిమాండ్‌ ఉత్తర్వులను రద్దు చేసేందుకు సిద్ధమైంది. కిశోర్‌ విడుదలకు ఆదేశాలిస్తామని తెలిపింది. కిశోర్‌ను అరెస్టు చేసే సమయంలో బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌-47 (అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం), సెక్షన్‌-48 (అరెస్టుకు గల కారణాల) కింద ఇచ్చిన నోటీసులు నిరాకరించి ఉంటే మధ్యవర్తి సమక్షంలో ఆ విషయాన్ని నమోదు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.   

చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ : సీఎం చంద్రబాబు

    చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటిచెప్పేలా హ్యాండ్లూమ్  మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేత కార్మికులు సీఎం అన్నారు.  టీడీపీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందని.. నేతన్నాలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ చేనేత అని చంద్రబాబు తెలిపారు. వారికి 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు.  నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారినపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలే ప్రతీకలని ముఖ్యమంత్రి కొనియాడారు. వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు. చేనేత రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. గతంలో 55,500 మంది కార్మికులకు రూ. 27 కోట్ల రుణాలు అందించామని, 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు.  ఈ మద్దతును మరింత విస్తరిస్తూ మరమగ్గాల కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మరమగ్గాలకు 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని, వారికి ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో దీనిని 500 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 వేల చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికాకు చుక్కలు చూపేలా మోడీ వ్యూహం!?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.  రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయకుంటే పన్నుల కొరడా ఝుళిపిస్తానంటూ  భారత్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ తాను కేవలం హచ్చరికలతో ఊరుకునే రకాన్ని కాననీ, చేసి చూసుతాననీ అదనంగా పాతిక శాతం సుంకాల విధింపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి చూపించారు. దీంతో అప్రమత్తమైన ఇండియా.. ప్రతి వ్యూహాలతో సిద్ధమైంది.   అమెరికాతో లక్ష కోట్లు విలువగల ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే కౌంటర్ అటాక్ ఇచ్చింది.  అక్కడితో ఆగకుండా అమెరికాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో పడింది.  ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారును రష్యా పర్యటనకు పంపింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 31న రెండు రోజుల పర్యటన కోసం చైనా బయలుదేరుతున్నారు. పేరుకు అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు అని చెబుతున్నా.. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తో భేటీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.  డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌, రష్యా, చైనాలకు వ్యతిరేకంగా చేస్తున్న ట్రేడ్ వార్ కు దీటైన సమాధానం ఇచ్చే విషయంలో ఈ మూడు దేశాలూ ఉమ్మడిగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాయనడానికి అజిత్ దోవల్  రష్యా పర్యటన, మోడీ చైనా పర్యటనలు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ మూడు దేశాలూ చేతులు కలిపి ట్రంప్ ట్రేడ్ వార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే.. అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు. ఇదే వ్యూహంతో  ప్రధాని మోడీ ట్రంప్‌పై ఒత్తిడి పెంచి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. 

కాంగ్రెస్ నేతని వాటర్ బాటిల్‌తో కొట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్ధానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్యామ్ నాయక్ తనను అవమానించారంటూ వాటర్ బాటిళ్లతో ఆయనపైకి విసిరింది ఎమ్మెల్యే. దీంతో ఆయనపైకి వాటర్ బాటిల్ బలంగా విసరడంతో శ్యామ్‌కు దెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది.  రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.  అయితే, పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఇక్కడే కాదు.. ఇటీవల ఇలాంటి ఘటనలు  చాలా చోట్ల జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోతుంది. ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చ రేపుతోంది.  మొన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా తీవ్ర ఘర్షణ జరిగింది.

కేసీఆర్ స్వార్థపరుడు.. గువ్వల బాలరాజు

 మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడిచిందో లేదో.. తాను ఇంత కాలం ఉన్న పార్టీపై, ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను స్వార్థజీవిగా అభివర్ణించారు.  కేసీఆర్ స్వార్థానికి తాను బలయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి కేసీఆర్ అసమర్ధ నాయకత్వమే కారణమని దుయ్యబట్టారు.  కేసీఆర్ ఎక్కడికక్కడ రాజీపడి పార్టీ భవిష్యత్ ను, తన వంటి నాయకుల రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.   తాను అమ్ముడుపోయానని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారనీ, అయితే అది పూర్తి అవాస్తవమని గువ్వల బాలరాజు అన్నారు. ఈ గువ్వల బాలరాజు ఒకరి మోచేతి నీళ్లు తాగే రకం కాదన్నారు. తాను వంద కోట్లకు అమ్ముడు పోయానంటున్న వారు ఆధారాలు చూపి నిరూపిస్తే ముక్కు నులకు రాస్తాననీ, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని సవాల్ చేశారు.  తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ మీద  గౌరవంతోనే బీఆర్ఎస్ లో చేరాన్న గువ్వల.. కేసీఆర్ స్వార్థజీవిగా మారడంతోనే ఆయనను వదిలేశానని చెప్పారు.   గత ఎన్నికల్లో తనను మాయ చేసి టికెట్ అమ్ముకున్నారనీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా విపక్ష నేతగా కేసీఆర్ తన పాత్రను సమర్ధంగా పోషించడం లేదనీ, ఫామ్ హౌస్ కే పరిమితమై పార్టీని గాలికొదిలేశారన్నారు.  ప్రజల తరఫున గళమెత్తాలనే బీఆర్ఎస్ నుంచి వైదొలిగాన్న గువ్వల.. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయం త్వరలో వెల్లడిస్తానన్నారు.  

ట్రంప్ టారిఫ్ వార్.. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలి.. ఆనంద్ మహీంద్రా

క్షీర సాగర మథనంలో అమృతం పుట్టినట్లుగా ట్రంప్ సుంకాల సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కొంటే భారత్ కు కూడా అమృతం వంటి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు.   రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్నదుగ్ధతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  భారత్ పై సుంకాలను 50 శాతానికి పెంచడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా  ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలనీ, ఇందు కోసం ఇండియా బలంగా రెండు అడుగులు ముందుకు వేయాలని అభిప్రాయపడ్డారు.  ట్రంప్ ప్రారంభించిన టారిప్ వార్ తీవ్ర పరిణామాలకు దారి తీసు అవకాశాలున్నాయన్న ఆయన..  జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ట్రంప్ టారిఫ్ వార్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెట్టాయనీ, ఫలితంగా   ప్రపంచ అభివృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయన్నారు. భారత్ కూడా ఈ సంక్లిష్ట పరిస్థితిని అవకాశంగా మలచుకోవాలన్నారు.  1991లో  భారత్ లో నెలకొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభం  లిబరలైజేషన్  దారి తీసిందనీ, అలాగే ఇప్పుడు ట్రంప్ సుంకాల కారణంగా తలెత్తిన క్లిష్ట పరిస్థితులను నుంచి బయటపడి కొత్త అవకాశాలకు బాట ఏర్పడుతుందనీ అన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ అవతరించాలంటే..  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సత్వరమే మెరుగుపరచాలని సూచించారు.  అలాగే టూరిజం రంగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.  

హస్తినలో రేవంత్ సింహగర్జన.. సౌత్ నుంచి ఏకైక నాయకుడు!

ఎటు నుంచి ఎటు చూసినా కాంగ్రెస్ కి హైప‌ర్ యాక్టివ్ గా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే క‌నిపిస్తున్న‌ట్టుంది చూస్తుంటే. ఇక్క‌డి బీసీ రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లి.. అక్క‌డ స‌భ‌లు- స‌మావేశాలు- ధ‌ర్నాలు- వ‌గైరా ఏర్పాటు చేసి.. దీన్ని అమ‌లు చేయ‌కుంటే మోడీ ముక్కు నేల‌కేసి రాసి.. గ‌ద్దె దింపుతాం అంటూ హెచ్చరిస్తున్నారు రేవంత్.  ఒక్క‌మాట‌లో చెప్పాల్సి వ‌స్తే రేవంత్ కాంగ్రెస్ కాంగ్రెస్ సింహంలా గర్జిస్తున్నారు. జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ ప‌రంగా చూస్తే రాహుల్ త‌ర్వాత ఆ స్థాయిలో ఐకానిక్ లీడ‌ర్షిప్ క‌నిపిస్తోంది ఒక్క రేవంత్ రెడ్డిలోనే అని పరిశీలకులు అంటున్నారు.   రేవంత్ రాజకీయ జీవితం ప్రారంభమైనది ఏబీవీపీలో.. రాజ‌కీయ పుట్టుక తీస ఏబీవీపీలో, అటు పిమ్మ‌ట కేసీఆర్ కి శిష్యుడిగానూ త‌యార‌వ్వాల‌ని చూసి..  ఆపై టీడీపీలోకి వ‌చ్చి.. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశంలో ఉండటం వల్ల  ఉండ‌టం వ‌ల్ల యూజ్ లేద‌ని గుర్తించి.. కాంగ్రెస్ లో చేరారు. చేరడంతోనే  టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టారు. ఇదేమంత మామూలు విషయం కాదు. దీంతో  రేవంత్ రెడ్డి   కాంగ్రెస్ లీడ‌ర్ల‌లోనే హైప‌ర్ యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు. ఢిల్లీ గ‌డ్డ మీద మోడీగా తొడగగొట్టి సవాల్ విసురుతున్నారు.   గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సరిగ్గా ఇలానే ఉండేవారు.  ఇక్క‌డి నుంచి అధిక మొత్తంలో ఎంపీ సీట్లు గెలిచి.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చేలా చేశార‌న్న పేరు సంపాదించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా గే క‌నిపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించే తెలంగాణ‌లో ఆ స్థాయిలో ఎంపీ సీట్ల సాధ‌న‌కు స్కోప్ పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఆ దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.   ప్ర‌స్తుతం కాంగ్రెస్ కి కూడా ఏమంత గొప్ప నాయ‌క‌త్వ ప‌టిమ లేదు. ఇంటా బ‌య‌టా రాహుల్ ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. ఇందిర‌ను పోలి ఉన్న ప్రియాంక కూడా ఏమంత గొప్ప వాయిస్ వినిపించ‌లేక పోతున్నారు. ఆమె స్టామినా అంతంత మాత్రంగానే క‌నిపిస్తోంది. ఇక కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్ ఎంపీలైతే.. పార్టీ వ్య‌తిరేక వాయిస్  వినిపిస్తున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో మోడీని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి రివ‌ర్స్ లో కాంగ్రెస్ కే కౌంట‌ర్లు వేశారు. అయితే రేవంత్ ఒక్కరే కాంగ్రెస్ లో గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు.  రాహుల్ ఆయ‌న్ను ఒక్కో సారి దూరం పెడుతున్నా.. వెన‌కాడ‌క రాహుల్ తోటిదే ప్ర‌యాణం అంటూ భ‌రోసా అందిస్తున్నారు. దీంతో  ప్రస్తుతం  సౌత్ నుంచి రేవంత్ ఫ్లాగ్ షిప్ లీడ‌ర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ గా మారిన దృశ్యం ఆవిష్కృతమైతోంది.

తిరుపతిలో చెలరేగిపోతున్న వైసీపీ చోటా నేతలు.. షాపు కాంట్రాక్ట్ కోసం గిరిజన యువకుడిపై దాడి

అధికారం కోల్పోయినా కూడా వైసీపీ దాష్టికాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట వైపీపీయులు దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతిలో ఓ వైసీపీ చోటా నేత గిరిజన యువకుడిపై దాష్టీకం చేశాడు.  తిరుపతి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్టును తనకు రాసి ఇవ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ ఓ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనిల్ రెడ్డి గిరిజన యువకుడు పవన్ ను ఇష్టం వచ్చినట్లు కొడుతుంటూ.. అనిల్ రెడ్డి స్నేహితులు దానిని వీడియోగా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనిల్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. అయితే అనిల్ రెడ్డి దాడితో భయపడిన బాధితుడు పవన్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. బాధితుడు పవన్ ది పులిచర్ల మండలం అని గుర్తించారు. పవన్ పేరుపై ఉన్న కాంటాక్ట్ ను తన పేరు మీద రాసివ్వాలని అనిల్ రెడ్డి ఈ దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  

సమాధిగా మారిన సగం ధరాలీ

ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు అవరోధం ఉత్తరాఖండ్ ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్  కారణంగా ధరాలీ గ్రామాన్ని బురద ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విళయంలో గల్లంతైన వారీ ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పది మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించిన అధికారులు 190 మందిని ప్రాణాలతో కాపాడినట్లు ప్రకటించారు. అయితే ఇంకా వందల సంఖ్యలో గల్లంతైన వారి జాడ కోసం ప్రతికూల పరిస్థితుల్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.   ఐటీబీపీ, ఎస్ఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు గాలింపు చర్యలలో నిమగ్నమై ఉన్నారు.  హార్సిల్లోని ఆర్మీ  క్యాంప్ కు చెందిన 11 మంది జవాన్ల జాడ ఇంకా తెలియలేదు.  అలాగే గంగోత్రి ధామాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 28 మంది యాత్రికుల బృందం గల్లంతైంది.   దీంతో వారి బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  ఇలా ఉండగా ఈ ఘటనలో ధరాలీలోని అత్యంత పురాతనమైన  కేదార్ శివాలయం పూర్తిగా బుదరలో కూరుకుపోయింది.  ధరాలీ దాదాపు సగభాగం సమాధిలా మారిపోయింది. ఈ గ్రామన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ  బుధవారం (ఆగస్టు 6) సందర్శించారు.  ధరాళీలో ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్ స్టేలు, చెట్లు.. ఇలా అన్నీ బురదలో కూరుకుపోయాయి.  బాధితులకు ఆహారం, ఔషధాలు అందజేస్తున్నామని సీఎం చెప్పారు. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.  

ట్రంప్ టారీఫ్ ల మోత.. ప్రభావితమయ్యే రంగాలేంటో తెలుసా?

భారత్‌పై అదనంగా పాతిక శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీంతో  భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం మేర  సుంకాలను విధించినట్లైంది. ట్రంప్ నిర్ణయం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా  లెదర్, వజ్రాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమౌతాయి. ఆయా రంగాలు సంక్షోభంలో కూరుకుపోయే ముప్పు కూడా ఉంది.  ఇప్పటికే ఉన్న సుంకానికి అదనంగా, బుధవారం (ఆగస్టు 6) నుంచి పాతిక శాతం,  ఆగస్టు 27 నుంచి మరో పాతిక శాతం టారిఫ్ పెరుగుతుంది.  దీనితో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు దాదాపు 50 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  అంతే కాకుండా  అమెరికా మార్కెట్లో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా వాటికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.    ప్రధానంగా టెక్స్‌టైల్స్, వజ్రాలు, అర్నమెంట్స్, ఫుట్ వేర్, ఫ్రాన్స్, రసాయనాలు, యంత్ర పరికరాల రంగాలపై ఈ టారిఫ్ పెంపు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భారత్ ఎగుమతులలో ముఖ్యంగా, భారత ఎగుమతుల్లో కీలక మూర డైమండ్స్, ఆర్నమెట్స్  పరిశ్రమ నష్టాలలో కూరుకుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఈ టారిఫ్ పెంపు.. ఈ రంగంలో పని చేసే కార్మికుల ఉపాధి, ఉద్యోగావకాశాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు.   

31 నుంచి మోడీ రెండు రోజుల చైనా పర్యటన

ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 1 వరకూ ప్రధాని మోడీ చైనాలో పర్యటిస్తారు.  షాంగై సహకార సదస్సులో మోడీ పాల్గొననున్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత నేపథ్యంలో మోదీడీ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ చైనా నుంచి అందిన ఆహ్వానం మేరకు మోడీ ఈ దేశ పర్యటనకు వెడుతున్నారు.  2019లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత కూడా పలు సార్లు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఆ ఘటన తరువాత మోడీ చైనా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.  ఇప్పుడు ట్రంప్ టారీఫ్ టెర్రర్ నేపథ్యంలో భారత్ చైనాలు సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి.  ఈ క్రమంలోనే మోడీ చైనా పర్యటనకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.  ఈ పర్యటనలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు సంబంధించి కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

టిటిడీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. కోటి విరాళం

  తిరుమల తిరుపతి దేవస్థానం  శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌ కి సీకేపీసీ ప్రాపర్టీస్  ఎండీ చిరాగ్ పురుషోత్తం కోటి రూపాయల విరాళాన్ని అందించారు.  దీనిపై ఆయనను అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ వేదికగా ఆయనను అభినందించారు.  చిరాగ్ పురుషోత్తం, మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ విరాళాన్ని అందజేశారు. పేద ప్రజలకు ఉచితంగా మెదడు, గుండె, మూత్రపిండాల శస్త్ర చికిత్సలను అందించే ప్రాణదానం ట్రస్ట్ సేవా దృక్పథానికి చిరాగ్ పురుషోత్తం ఇచ్చిన విరాళం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. పేదలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రాణదాన ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ సందర్భంగా చిరాగ్ పురుషోత్తం ప్రశంసించారు.   గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది పేదలకు ఉచిత సేవలందిస్తున్న ప్రాణదాన ట్రస్ట్ కు ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.   

ట్రంప్ టారిఫ్ టెర్రర్.. వినాశకాలే విపరీత బుద్ధి!

ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పడుతుంది.  అందుకే మన పెద్దలు పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. అయితే.. అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  చాణక్యుడు చెప్పిన ఈ నీతి  వాక్యం విని ఉండక పోవచ్చును. అందుకే..  అసలే ట్రంప్  ఆపైన,పోయే కాలం తరుముకోస్తోంది అన్నట్లుగా.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. ఇది.. ఎవరో అమెరికా ఆగర్భ శతృవులో   ట్రంప్ ను వ్యక్తిగతంగా వ్యతిరేకించే వారో చేస్తున్న వ్యాఖ్యలో విమర్శలో కాదు.   నిజానికి..  భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై ఇంటా, బయటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి వాణిజ్యం కొనసాగిస్తున్న ఐరోపా దేశాల పట్ల ప్రేమ కనబరుస్తున్న ట్రంప్..  భారత్ విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారని.. అనేక మంది అమెరికన్లు విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు దెబ్బతీసుకోకూడదని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ హితవు పలికారు. అయితే..  ట్రంప్ కు మంచి   మాటలు రుచించడం లేదు. అందుకే ట్రంప్ విరీత పోకడలు పోతున్నారు. బారత దేశాన్ని సుంకాలతో దెబ్బ తీయాలని, అలా దెబ్బతీసి తన దారికి తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు.  అందులో భాగంగానే..  ట్రంప్  భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే ఉన్న పాతిక శాతం సుంకాలతో పాటు, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం విధించడంతో మొత్తం టారీఫ్ 50 శాతానికి చేరుకుంది. ఈ మేరకు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.అయితే..  ట్రంప్ విపరీత ప్రకటనలపై ప్రధాని మోదీ ప్రభుత్వంతో పాటుగా, పారిశ్రామిక వర్గాలు అదే స్థాయిలో స్పందించాయి.  భారత విదేశాంగ శాఖ అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇది అన్యాయం, అసమర్థనీయం, అసమంజసమైన చర్యగా అభివర్ణించింది.  రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్ ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా దిగుమతులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. 1.4 బిలియన్ల భారతీయుల ఇంధన భద్రతను కాపాడే లక్ష్యంతో జరుగుతాయి. అనేక దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ..  అమెరికా భారతదేశంపై అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరం. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది అని విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవంక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరో 25 శాతం మేర సుంకాలు విధించడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా..   భారత్‌ ఎవరికీ తలవంచదని పేర్కొంటూ  ఎక్స్‌ లో పోస్టు పెట్టారు.  మీరు మా ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో గానీ.. మా సార్వభౌమాధికారంపై కాదు. మీ ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యం. డిస్కౌంట్లనే మేం ఎంచుకుంటాం.మీరు సుంకాలు పెంచండి.. మేం మా సంకల్పాన్ని పెంచుకుంటాం. మెరుగైన ప్రత్యామ్నాయాలు కనుగొని స్వావలంబనను సాధిస్తాం.  అని పేర్కొన్నారు. మరోవంక భారత్‌పై అదనంగా పాతికశాతం సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం స్వీయ విధ్వంసకరమని ఆర్థికరంగ నిపుణుడు శరద్‌ కోహ్లీ అన్నారు. దాని వల్ల జరిగే పరిణామాలేంటో ట్రంప్‌నకు తెలియదన్నారు. బలమైన మిత్రదేశంతో ఆయన శత్రుత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత్‌, అమెరికా సహజ మిత్రులు. అమెరికా ప్రజలు తమ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో, వైద్యరంగానికి సంబంధించినంతవరకు భారత్‌పైనే ఆధారపడతారనే వాస్తవాన్ని ట్రంప్‌ మరిచిపోతున్నట్లున్నారని భావిస్తున్నా. ట్రంప్ మిగతా ప్రపంచం నుంచి తనను తాను దూరం చేసుకుంటున్నారు’’ అని విశ్లేషించారు.

ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన సరే ఎక్కువ సీట్లు  గెలుచుకోవాలని అస్త్రాలను సిద్దం చేస్తోంది. సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ముందుగా పార్టీ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని రాష్ట్ర నేతలను ఆదేశించింది. తొలుత పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది.  మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్‌గా 25 మంది సభ్యులతో  ఏపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏఐసీసీ నియామించింది. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జేడీ శీలం మస్తాన్ వలీ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ జననల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తాం : లోకేష్

  మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్ లో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో “సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడం, సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీని తీర్చిదిద్దడమే కాదు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ  భవిష్యత్ ను శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహించడం జరుగుతోంది. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అందరం కష్టపడి పనిచేస్తున్నాం దేశంలో ఏ పార్టీ సాధించని విధంగా కూటమి ప్రభుత్వం 94శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇందుకోసం అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. క్లస్టర్ విధానంలో పెట్టుబడులను ఆకర్షిస్తాం.  ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. అనంతలో ఆటోమొబైల్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, కడప, చిత్తూరును ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, నెల్లూరులో ఎయిర్ కండిషనర్స్ వంటి స్పెషలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, గుంటూరు, కృష్ణాను క్యాంటమ్ వ్యాలీ హబ్ గా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా, ఉత్తరాంధ్రను ఫార్మా, డేటా సెంటర్, ఐటీ హబ్ గా, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం. ప్రతి వంద కి.మీలకు ఓ క్లస్టర్ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్ 20 కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీంతో పాటు నైపుణ్యం పెంపు, నవీన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.   సెప్టెంబర్ 1వ తేదీన నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తాం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ప్రైవేటు సెక్టార్ తో నైపుణ్యం గల యువతను అనుసంధానించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించడం జరుగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, సీడాప్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.  పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రం చొరవ తీసుకుని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తాం. అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నా ఛాలెంజ్ ను స్వీకరించి సుజ్లాన్ సంస్థ ఇప్పటికే 2 నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా యువతకు విస్తృత అవకాశాలు గ్రీన్ ఎనర్జీ రంగం ద్వారా మహిళలకు వారి గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువగళం పాదయాత్ర సమయంలో అనంత జిల్లాలోని కియా యాన్సిలరీ యూనిట్స్ లో మహిళలు పనిచేయడం చూశాను. ఓ మహిళ నా వద్దకు వచ్చి నాతో పాటు నడిచారు. ఏం చేస్తున్నారని ఆ మహిళను ప్రశ్నించగా.. తాను కియా యాన్సిలరీ యూనిట్స్ లో పనిచేస్తున్నానని, గతంలో సాధారణ గృహిణిగా ఉన్న తాను ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలిచానని గర్వంగా చెప్పారు.  ఇప్పుడు కుటుంబంలో తనకు ఎంతో గౌరవం దక్కుతోందని చెప్పారు. ఒక్క కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లాలో వచ్చిన మార్పు ఇది. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. అందుకే విండ్, సోలార్, రెన్యువబుల్, పంప్డ్ స్టోరేజీ, సీబీజీ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై  సీఎం చంద్రబాబు  చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాం. ఇందుకోసం ప్రైవేటు సెక్టార్ తో కలిసి పనిచేస్తాం. ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు  

విశాఖ జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం

  విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. మొత్తం 10 స్థానాల్లో తొమ్మిది కైవసం చేసుకున్న కూటమి కేవలం ఒక్క స్థానం మాత్రం వైసీపీకి దక్కింది. అంటే 8 స్థానాల్లో టీడీపీ, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అతి కష్టం మీద ఈ సీటును గెలుచుకుందని తెలుస్తోంది. ఇక ఈ జీవీఎంసీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొత్తం 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే గతేడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం కూటమి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. జీవీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను ఇప్పటికే కూటమిలోని పార్టీలు కైవసం చేసుకున్నా సంగతి తెలిసిందే. 

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

  తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.  అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.  అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.