వచ్చే మార్చి లోపు ముఖ్యమంత్రిగా కేటీఆర్! 

తెలంగాణలో కీలక మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. వరుస విజయాలతో బీజేపీ దూకుడు, టీపీపీసీకి కొత్త బాస్ వంటి పరిణామాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతుండగా.. రాజకీయాలతో పాటు ప్రభుత్వ పాలనలోనూ సమూల మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. వచ్చే మార్చి లోపే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉండబోతున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఈ చర్చ కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. వచ్చే మార్చిలోపు కేటీఆర్‌ సీఎం అయ్యే అవకాశం ఉందని మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ తాజాగా చెప్పడం ఇందుకు బలాన్ని ఇస్తోంది. డోర్నకల్‌లో మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీనియర్ ఎమ్మెల్యే.. ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్‌ని కలిసి కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ నెలకొల్పాలని కోరినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మంజూరు చేయాలంటూ విన్నవించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్‌ అంటూ రెడ్యానాయక్‌ వ్యాఖ్యానించారు. సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వ్యాఖ్యలతో కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెబుతున్నారు. చాలా కాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలో వచ్చినప్పుడే కేటీఆర్ సీఎం అవుతారని భావించారు. కాని కేసీఆరే మరోసారి బాధ్యతలు చెపట్టారు. లోక్ సభ ఎన్నికలకు ముందు తాను జాతీయ స్థాయి రాజకీయాలకు వెళతానని, ఫెడరల్ ఫ్రంట్ పెడతానని కేసీఆర్ ప్రకటించారు. దీంతో కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి కేసీఆర్ ఢిల్లీకి వెళతారని భావించారు. కాని లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దీంతో అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కాని అది జరగలేదు. తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే అయిన జూన్ 2న.. తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు తీసుకోవచ్చనే మరో ప్రచారం జరిగింది. అయితే కరోనా మహమ్మారి రావడంతో.. అందరూ దానిపైనే దృష్టి సారించారు. దీంతో జూన్ ముహుర్తం కూడా దాటి పోయింది. గ్రేటర్ ఎన్నికల సమయంలో మళ్లీ కేటీఆర్ ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చింది. 2016 తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ కారు పార్టీకి బంపర్ విజయాన్ని అందించి.. తర్వాత ముఖ్యమంత్రి సీటును కేటీఆర్ తీసుకుంటారని కొందరు అభిప్రాయపడ్డారు. అదే  జరుగుతుందని అంతా అనుకున్నారు. కాని ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కేటీఆర్ సీఎం అంశం మరుగునపడింది. అయితే తాజాగా సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రకటనతో.. టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలతో ఈ విషయంపై కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి మార్పుతో పాటు మంత్రివర్గంలో సమూల మార్పుల దిశగా కేసీఆర్ కసరత్తు చేశారని చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే బీజేపీ పెద్దలతోనూ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే అంశంపై కేసీఆర్ మాట్లాడి ఉండవచ్చని  చెబుతున్నారు.  

దేశంలో 2022లో జమిలి ఎన్నిక ? రాష్ట్రాలు చుట్టేస్తున్న సీఈసీ అరోరా !

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా?  మోడీ సర్కార్ అనుకుంటున్నట్లే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగబోతోందా ?  అసలు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?  ఈ అంశాలపైనే గత ఏడాది కాలంగా  దేశంలో చర్చ జరుగుతోంది.  జమిలి ఎన్నికలు రాబోతున్నాయని కొందరు .. మన దేశంలో అలా నిర్వహించడం సాధ్యం కాదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు చూస్తుంటే దేశంలో 2022లోనే జమిలి ఎన్నికలు రావడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఆయన హైదరాబాద్ కూడా వస్తున్నారు.  దేశంలో ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల కసరత్తులో భాగంగానే  సీఈవో రాష్ట్రాలు తిరుగుతున్నారనే చర్చ జరుగుతోంది.  జమిలి ఎన్నికల గురించి జాతీయస్థాయిలో సీరియస్ చర్చే జరుగుతోంది. కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల పాట పాడుతోంది. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. లోకసభకు, శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని 1982లో ఎన్నికల కమిషన్ ప్రతిపాదన చేసింది. 1999లో లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.  ప్రధాన మంత్రి ఈ అంశాన్ని తన ప్రసంగాలలోనూ, మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల్లోనూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. జమిలి ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం, లా కమిషన్ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఏయే పార్టీలు అనుకూలంగా ఉన్నాయో నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు  కసరత్తు కూడా మొదలు పెట్టింది.  దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా ఉండే విధంగా దృష్టి పెట్టింది. ఇన్నేళ్లూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ తయారు చేసిన జాబితా, మునిసిపల్‌, కార్పొరేషన్‌, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు లు సిద్ధం చేసిన జాబితాలను విడివిడిగా వాడుతున్నారు.  జమిలి ఎన్నికలే నిర్వహించాల్సి వస్తే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని ఎలా ఖరారు చేయాలనేదాని మీద సందేహాలున్నాయి. కొన్నిచోట్ల మధ్యంతరంగా అసెంబ్లీని ముగించాల్సి వస్తుంది. మరికొన్నిచోట్ల గడువును పొడిగించాల్సి ఉంటుంది. ఇలాంటి లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలో ఎలాంటి సవరణ చేయాలన్నదానిపై కూడా కసరత్తు జరిగింది. నీతి ఆయోగ్ అనేక కోణాల నుంచి ఆలోచించి నివేదికను రూపొందించింది. లా కమిషన్, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేశాయి. రాజ్యాంగం నుంచి వచ్చే చిక్కులపై ఆటార్నీ జనరల్ నుంచి అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. 2022 ,2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి దేశ వ్యాప్తంగా లోక్‌ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోడీ సర్కార్‌ వ్యూహం.   ఎన్డీఏ పక్షాలన్ని ఇప్పటికే జమిలి ఎన్నికలకు జై కొట్టగా.. యూపీఏ పక్షాల్లో కొన్ని వ్యతిరేకించగా.. మరికొన్ని ఏ నిర్ణయం చెప్పలేదు. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు సంబంధించి కేంద్రం నుంచి క్లారిటీ రావడం లేదు.  అందుకే టీఎంసీ, డీఎంకే  పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, టీడీపీ, టీఆర్ఎస్ లు జమిలి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరు నెలల నుంచే జమిలి ఎన్నికల గురించి చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొద్ది రోజుల క్రితం జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  2022 చివరలో జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రతిపాదిస్తోంది. దాని వల్ల కేసీయార్ అయితే ఏడాది పాటు అధికారం కోల్పోతారు. ఏపీలో ఏడాదిన్నర ముందే అధికారాన్ని వైసీపీ పోగొట్టుకోవాల్సివస్తుంది. అందుకే  వైసీపీ జమిలి ఎన్నికలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని భావిస్తున్నారు.   దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల అభిప్రాయాలూ తీసుకోవాలి. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే దేశంలోని  రెండొంతుల రాష్ట్రాలు అందుకు అంగీకరించాలి. పార్లమెంటులో చర్చ జరగాలి. అక్కడా మూడులో రెండొంతుల అంగీకారం రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి అంగీకరించాలి. ఇక్కడ బీజేపీ తలచుకుంటే ఇవేమి అసాధ్యం కాదు. ప్రస్తుతం దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో అంగీకరిస్తే మొదటిదశ పూర్తయినట్టే. మిత్రపక్షాల మద్దతుతో అది కూడా పెద్ద సమస్య కాదు.  అందుకు బీజేపీ దగ్గర వ్యవస్థలున్నాయి.  పార్లమెంటులో చర్చించి వాటిని దారికి తీసుకురావడం పెద్ద సమస్య కాబోదు. అందుకే 2022లో  దేశంలో కచ్చితంగా జమిలి ఎన్నికలు జరగడం ఖాయమనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు సీఈవో రాష్ట్రాల పర్యటనకు ప్రాధాన్యత ఏమి లేదంటున్నారు  ఎన్నికల సంఘం అధికారులు రొటిన్ విజిట్ లో భాగంగానే ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

బ్రిటన్‌లో మరో కొత్త స్ట్రెయిన్ కరోనా.. ఇది మరింత ప్రమాదకరం..

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ తో ఇప్పటికే సతమతమవుతున్న బ్రిటన్ లో తాజాగా అంతకంటే ప్రమాదకరమైన మరో కొత్త రకం కరోనా వైరస్ బయటపడింది. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పలువురు పర్యాటకులకు కరోనా టెస్టులు చేయగా, వారిలో ఇద్దరికి ఈ ప్రమాదకర కొత్త కొవిడ్‌ వైరస్ సోకినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. దీంతో గత రెండువారాల వ్యవధిలో దక్షిణాఫ్రికా నుంచి యూకేకు వచ్చిన వారందరినీ వెంటనే ఐసొలేట్‌ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ మరిన్ని జన్యుమార్పులకు గురైందని, దీని వ్యాప్తిరేటు చాలా ఎక్కువని పేర్కొన్నారు. తాము తాజాగా గుర్తించిన కొత్త రకం కొవిడ్‌ వైరస్‌.. దక్షిణాఫ్రికాలో వ్యాపిస్తున్న వైరస్‌ వేరియంట్‌ కంటే భిన్నంగా ఉందని హన్‌కాక్ అన్నారు. కొత్త రకం వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించింది. తాజా పరిణామాల నేపథ్యంలో.. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన లాక్‌డౌన్‌ను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా కరోనా కొత్త స్ట్రెయిన్‌ వైరస్ ఇప్పటికే చాలా దేశాలకు పాకి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కొత్త స్ట్రెయిన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో కొన్ని జన్యుమార్పులు జరిగినా, కరోనా వ్యాక్సిన్లతో వచ్చే రోగ నిరోధక శక్తిని ఎదురించి అవి నిలువలేవని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ జన్యుక్రమాలపై లోతైన అధ్యయనంతో శక్తివంతమైన వ్యా క్సిన్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒక్క భారతదేశమే ఇప్పటివరకు 3 లక్షల జన్యుక్రమాల సమాచారాన్ని అంతర్జాతీయ పరిశోధనల డాటాబే్‌సకు అందించిందని ఆమె చెప్పారు.

భారత్ లో వచ్చే వారమే కరోనా టీకా? ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు గ్రీన్ సిగ్నల్ 

ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు రూపు మార్చుకుని మరింతగా విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ తో దేశాలన్ని మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లాయి. ఇప్పటికే చాలా దేశాలు రెండో సారి సంపూర్ణ లాక్  డౌన్ ప్రకటించాయి. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణి ముమ్మరంగా సాగుతోంది. భారతీయులు  కరోనా టీకా కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.  అయితే త్వరలోనే ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి రాబోతుంది. అత్యవసర వినియోగం కింద తమ వ్యాక్సిన్‌కు అనుమతినివ్వాలని కోరడంతో.. టీకా రక్షణ, భద్రతకు సంబంధించి భారత వైద్యాధికారులు ఆస్ట్రాజెనెకా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చేవారం ఈ టీకాకు అత్యవసర అనుమతులు రావొచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.  ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపిందని , అత్యవసర వినియోగానికి వారంలో అనుమతి రానుందని తెలుస్తోంది.  వచ్చే వారమే భారత్ లో కరోనా టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.    అమెరికా, బ్రిటన్‌ లో ప్రస్తుతం  ఫైజర్‌ టీకాను అక్కడి ప్రజలకు వేస్తున్నారు. అయితే ఫైజర్  టీకాను భద్రపరిచేందుకు మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. అందుకు తగ్గ వసతులు ఇండియాలో తక్కువగా ఉండటంతో కేంద్రం ఆక్స్‌ఫర్డ్‌ టీకా వైపునకు చూస్తోందని చెబుతున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. దీని ధర డోసుకు రూ.250 వరకు ఉంటుందని అంచనా. సాధారణ ఫ్రిజ్‌లో కూడా దీనిని సుదీర్ఘకాలం భద్రపరిచే వీలుంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తుది దశ ట్రయల్స్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి.  రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్న వలంటీర్లపై టీకా 62 శాతం సమర్థమంతంగా పనిచేయగా, ఒకటిన్నర డోసు  తీసుకున్న వలంటీర్లపై టీకా 90 శాతం సమర్థమంతంగా పనిచేసింది. అయితే  కేంద్రం ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులను ఇస్తే, రెండు డోసుల టీకా వినియోగానికి సిద్ధపడుతుందా? లేక ఒకటిన్నర డోసుకు సానుకూలంగా ఉంటుందా? అనే చర్చ తెరపైకి వస్తున్నది.  వ్యాక్సిన్‌ రెండు డోసుల వినియోగానికే కేంద్రం మొగ్గు చూపవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద వచ్చే వారం కేంద్రం అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని చెబుతున్నారు. వ్యాక్సిన్ వచ్చాకా దేశ వ్యాప్తంగా పంపిణి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్రం గైడ్ లైన్స్ లో రాష్ట్రాలు కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగానే ఉన్నాయి.   

కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్.... మళ్ళీ లాక్ డౌన్ దిశగా భారత్..!

బ్రిటన్ లో కరోనా రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెపుతున్న నేపధ్యంలో వివిధ ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో భారత్ కూడా అప్రమత్తమై తక్షణమే అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులలో బ్రిటన్ తదితర దేశాల నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్టీపిసిఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒకపక్క పండుగ సీజ‌న్, మరోపక్క చ‌లికాలం దృష్ట్యా దేశంలోని ప‌లు రాష్ట్రాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. మన దేశంలోని ఒక్కో రాష్ట్రం మెల్లమెల్లగా మళ్ళీ రాత్రిపూట క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర, గుజ‌రాత్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తుండగా… తాజాగా క‌ర్ణాట‌క‌లో కూడా రాత్రిపూట క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి 10గంట‌ల నుండి ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు మినహా అన్నింటికి క‌ర్ఫ్యూ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తెలిపింది. నైట్ కర్ఫ్యూకి రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫంక్షన్లను, ఈవెంట్లను అనుమతించబోమని అన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై కూడా దీని ప్రభావం పడుతుందని తెలిపారు. తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్ప‌టికే బ్రిట‌న్ నుండి వ‌చ్చిన వారి వివ‌రాలు ట్రాక్ చేస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాలలో ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌క‌పోయినప్ప‌టికీ వచ్చే రెండు వారాలు అల‌ర్ట్ గా హెచ్చరికలు వస్తుండడంతో మ‌ళ్లీ లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తారా నే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సత్యప్రమాణం! అనపర్తిలో తగ్గని హై టెన్షన్ 

తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి నియోజకవర్గంలో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే  సత్తి సూర్య నారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాళ్లతో ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు నేతలు అన్నట్లుగానే బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి తన భార్యతో కలిసి ఆలయానికి వచ్చి మొదట సత్యప్రమాణం చేసి వెళ్లారు. తర్వాత  10 నిమిషాలకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సతీసమేతంగా వచ్చి సత్యప్రమాణం చేశారు. మైనింగ్ అంశంలో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న  నేతలు గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకున్నారు. ఇద్దరు నేతలు వచ్చి సత్యప్రమాణం చేసి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తాజా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిల మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు  చేసుకుంటున్నారు. బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి రూ. 400 కోట్లు దోచుకునేందుకు  ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అక్రమ గ్రావెల్ మైనింగ్ చేసేందుకు ఆలోచన లేకపోతే నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి  కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు.  ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్‌పై టీడీపీ ఫిర్యాదు చేయటం వల్ల మైనింగ్ అధికారులు స్పందించారని అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై ఒక కోటి 22 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు.  అయితే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఆరోపణలకు తాజా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కౌంటరిచ్చారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న  రామకృష్ణా రెడ్డి ఐదేళ్ళ పాటు అవినీతికి పాల్పడ్డారని సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. నల్లమిల్లి హయాంలో కలెక్షన్ కింగ్‌లు, క్వీన్స్ ఉన్నారని ఆరోపించారు. నల్లమిల్లి తనపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, ఆధారాలు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతల రాక సందర్భంగా  బిక్కవోలులో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 పోలీసు చట్టాన్ని అమలు చేశారు. 

రైతులు వద్దన్నవి తీసేస్తామన్న తోమర్ ! వ్యవసాయ చట్టాలపై దిగొస్తున్న సర్కార్ 

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి కేంద్రం దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. నిరసన చేస్తున్న రైతులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్ర నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న సందిగ్ధానికి వీలైనంత తొందరగా పరిష్కారం కావాలని, దానికోసం తాను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తానని తోమర్ అన్నారు.వ్యవసాయ రంగంలో లోటు పాట్లను సరి దిద్దుతామని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  అన్నారు. ప్రస్తుతం కొన్ని సంస్కరణలు చేపట్టామనీ..భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకు వస్తామని తెలిపారు. రైతులకు మెరుగైన పంట ధర లభించేలా సంస్కరణలు చేపడతామని వెల్లడించారు.  రైతు సంఘాలు తమ చర్చల ప్రతిపాదనను అంగీకరిస్తారని భావిస్తున్నానని తెలిపారు. చట్టాల్లో వారు కోరుకున్న మార్పులు, చేర్పులు తమకు తెలియబరచాలని కోరారు. రైతులు కోరకున్న సమయంలో చర్చలకు తాము సిద్దమని ప్రకటించారు నరేంద్ర సింగ్ తోమర్. 'మాప్రతిపాదనలపై రైతులు చర్చిస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్లు ఏం కావాలనుకుంటున్నారు, ఏం వద్దనుకుంటున్నారో చెప్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వారు కొరుకున్నవి చట్టంలో చేర్చి, వద్దన్నవి తీసేస్తాం. ఈ విషయమై వారితో చర్చిందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తేదీ, సమయం రైతులే నిర్ణయించుకోనివ్వండి. వారు కోరినప్పుడే చర్చలు చేస్తాం. ప్రస్తుతం ఉన్న సందిగ్ధానికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను ' అని కేంద్ర మంత్రి తోమర్ అన్నారు.  

రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు! వైసీపీ సర్కార్ పై చంద్రబాబు

పదిమందికి అన్నం పెట్టే రైతులు ఎప్పుడూ బాగుండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతుండటం, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉండటం విషాదకరమన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదంటారని పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు.ప్రజారాజధాని అమరావతి కోసం రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారని ఈ సందర్భంగా  ఆయన గుర్తు చేశారు. వీరిలో 110 మందికిపైగా అన్నదాతలు అమరులయ్యారన్నారు చంద్రబాబు.  ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవడం కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుపై మరింత భారం వేయబోతోందని చంద్రబాబు మండిపడ్డారు. వరదలు, భారీ వర్షాలు, నివర్‌ తుపాను విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో బైఠాయించి పట్టుబట్టే వరకు పంట బీమా ప్రీమియం కట్టలేదంటే రైతుల పట్ల పాలకులకెంత నిర్లక్ష్యమో అర్థమవుతోందన్నారు టీడీపీ అధినేత.  రైతుకు పరిహారం అడిగితే సభలో తమపై ఎదురుదాడికి తెగబడ్డారని ఆయన ఆరోపించారు. ఇకనైనా పాలకులు తీరు మార్చుకుని పంటకు గిట్టుబాటు ధరలు అందించాలని, పంట కొనుగోళ్లలో అవినీతికి స్వస్తి చెప్పాలని, రైతుల బకాయిలను తక్షణమే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లుగా సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందించాలని  ప్రభుత్వానికి సూచించారు. సబ్సిడీ ఇచ్చి సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు చంద్రబాబు. 

మై హోం.. యశోద.. తర్వాత అక్కడేనా?  కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నారా? 

తెలంగాణ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిస్తోందా? గులాబీ బాస్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టబోతున్నారా?. అంటే అవుననే తెలుస్తోంది. తెలంగాణలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పొర్లు దండాలు పెట్టినా  కేసీఆర్ తప్పించుకోలేరన్నారు చెబుతున్నారు. కేసీఆర్ అవినీతి బాగోతమంతా బయటపెడతామని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ నేతల కామెంట్లు అలా ఉండగానే హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ పై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. యశోద హాస్పిటల్స్ యాజమాన్యంతో  సీఎం కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని  విపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో  తెలంగాణ బీజేపీ నేతలు కొన్ని రోజులుగా చేస్తున్న  ప్రకటనలకు.. తాజాగా జరిగిన ఐటీ దాడులకు  ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.   మంగళవారం రోజంతా య‌శోద ఆస్ప‌త్రుల్లో ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు.  య‌శోద ఆస్ప‌త్రికి చెందిన ప‌లువురు వైద్యుల ఇళ్ల‌లోనూ ఐటీ శాఖ సోదాలు జరిపింది. హైద‌రాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 20కి పైగా బృందాల‌తో ఈ  సోదాలు జరిగాయి. ఆదాయ ప‌న్ను చెల్లింపుల్లో తేడా ఉన్న‌ట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథ‌మికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.  ఇటీవల కరోనా చికిత్స పేరుతో రోగుల నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూల్ చేశారని హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్  పై ఆరోపణలు వచ్చాయి. అయితే కొన్నింటిపై చర్యలు తీసుకున్న కేసీఆర్ సర్కార్.. ఎక్కువ ఆరోపణలు వచ్చిన యశోద హాస్పిటల్స్ పై మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తులు కాబట్టే చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ వైఖరిని హైకోర్టు కూడా తప్పుపట్టింది. ఇంతగా తెలంగాణ సర్కార్ అండదండలున్న హాస్పిటల్స్ పై  జరిగిన ఐటీ దాడులకు... రాజకీయ లింకు ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయమే  నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.  గత సంవత్సరం తెలంగాణలో దిగ్గజ  నిర్మాణ రంగ సంస్థ ‘మై హోం కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యజమాని జూపల్లి రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయంలో  ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. నందగిరి హిల్స్‌లోని రామేశ్వరరావు ఇల్లు, బేగంపేట, హైటెక్‌ సిటీలోని కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మై హోంలో  కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. మై హోం రామేశ్వరరావు కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చాలా కార్యక్రమాల్లో మై హోం కీలకంగా ఉందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు సన్నిహితులుగా ఉండే వ్యాపార ప్రముఖులే టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతుండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం పనులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థలపైనా త్వరలో దాడులు జరగవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ సహా ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మెగా సంస్థతో  కలిసే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.  తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఇటీవల ఎక్కువ ఫోకస్ చేసింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని చెబుతోంది. ఇందులో భాగంగానే  కేసీఆర్ చుట్టు  ఢిల్లీ పెద్ద ఉచ్చు బిగిస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే  లక్ష్యంగా ఆయన సన్నిహితులను టార్గెట్ చేస్తూ ఉండవచ్చంటున్నారు.   మెఘాతో పాటు యశోద, మై హోంలో  సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు భారీగా పెట్టుబడులు ఉన్నాయని  కొందరు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తెలంగాణలో చేపట్టిన మెగా ముఖ్యమైన ప్రాజెక్టులన్ని  వాటాల కోసం వారికే కట్టబెడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్స్ పై దాడులు జరగడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది.  తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేసీఆర్ అవినీతి చిట్టాలు, ఆర్థిక మూలాల తీగ లాగేందుకే కేంద్ర ప్రయత్నిస్తుందా లేక రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఐటీ దాడులు జరిగాయా అన్నదానిపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.

ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలి! స్థానిక ఎన్నికలపై హైకోర్టు అదేశాలు 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి  హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎస్‌ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కరోనా పరిస్థితులపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈనెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.    కరోనా కారణంగా ఎన్నికల వాయిదా విషయంపై ఎన్నికల కమిషన్‌కే లేఖ రాయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండూ ప్రజలకు సంబంధించినవేనని.. దీనిపై కూర్చోని మాట్లాడుకుంటే బాగుంటుంది హైకోర్టు తెలిపింది. అలా కాని పక్షంలో ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని.. కమిషన్‌తో అధికారుల భేటీపై కమిషనర్ ఒక వేదికను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి కేంద్రం షెడ్యూల్‌ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.   

క్రమబద్దీకరిస్తామని చెప్పి కొలువులే పీకేసిన కేసీఆర్! రోడ్డున పడ్డ ఉద్యోగులు

తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు..  అంతా సర్కార్  ఉద్యోగులే ఉంటరు.. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టిన్రు.. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరిని రెగ్యులర్ చేస్త.. ఇదీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాట..   కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు  అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిండు.. ఏండ్ల తరబడి పని చేయించుకున్నరు. హోంగార్డుల పరిస్థితి అయితే దారుణంగా ఉండేది. కనీస వేతనాలు ఇచ్చేది కాదు. లేబర్ కేసు పెట్టమని నేనే చెప్పిన. నెలో, వారం రోజులో అంటే ఏదో అనుకుంటం. ఏండ్ల తరబడి పని చేయించుకుని ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే ఎట్ల బతుకుతరు? ఇది దుర్మార్గం.. వాళ్లందరినీ రెగ్యులర్ చేస్తం. ఇది 27 అక్టోబర్ 2017న నిండు శాసనసభలో  ముఖ్యమంత్రిగా  కేసీఆర్ చేసిన ప్రకటన..  గత ప్రభుత్వాల్లో  అర్థాకలితో అలమటించిన  ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడంతో .. తెలంగాణలో లక్షకు పైగా ఉన్న కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగులు ఆనందపడిపోయారు.  కానీ ఆరేండ్లయినా కేసీఆర్ హామీ అమలు కాలేదు.. వారి ఆశలు తీరలేదు. ఆర్థిక శాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను 2017లోనే సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుమారు లక్షా 28 వేల  మంది ఇలా పని చేస్తున్నట్లు లెక్క తేల్చింది. అయితే  రెగ్యులరైజేషన్ ప్రక్రియ మాత్రం అడుగు ముందుకు పడలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, డాక్టర్లు, నర్సులు ఇలా .. ఏ ఒక్కరినీ కూడా పర్మినెంట్ చేయలేదు కేసీఆర్ సర్కార్. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని మరోసారి  ప్రకటించారు కేసీఆర్. ముందుగా ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నామన్నారు. ఐకేపీ ఉద్యోగులను ఆహార శుద్ది కేంద్రాల్లో వాడుకుంటామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ మొదలే కాలేదు..  ఆరేండ్లుగా  కొలువులు క్రమబద్దీకరణ కాకపోగా.. చివరకు ఉన్న ఉద్యోగాలు కూడా  పోయే ప్రమాదం తెలంగాణలో నెలకొంది. గత ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసిన సీఎం కేసీఆర్.. తన పాలనలోనూ అదే వైఖరి అవలంబిస్తున్నారు.  కరోనాతో ఏర్పడిన ఆర్థిక లోటును సాకుగా చూపి వాళ్లపై  కఠినంగా వ్యవహరిస్తోంది.  ఖజానాపై భారం పడుతుందనే కారణంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సెక్షన్ల లెక్కన  తీసేస్తూ ఇంటికి పంపిస్తోంది. 3 నెలల టైమ్‌‌లో ఉపాధి హామీ, భగీరథ, హార్టికర్టిల్చర్ డిపార్ట్‌ మెంట్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. కమర్షియల్ ట్యాక్స్ ,జీఎస్టీ విభాగాల్లో పని చేస్తున్న  ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు డిసెంబర్ తో లెక్క సరి చేస్తోంది. కొత్త సంవత్సరంలో కొలువుకు రావద్దని కమర్షియల్ ట్యాక్స్ కాంట్రాక్టు ఉద్యోగులకు సందేశాలు ఇచ్చారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో పని చేస్తున్న మరో 11 వేల మంది చిరుద్యోగులకు ‘నో వర్క్.. నో పే విధానాన్ని అమలు చేస్తోంది.  ఇంకొన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తోంది కేసీఆర్ సర్కార్. జాతీయ ఉపాధి హామీ పథకం కింద  తెలంగాణలో 7,500మంది ఫీల్డ్ అసిస్టెంట్లు  పనిచేస్తుండేవారు. వీళ్లంతా తమ డిమాండ్ల కోసం మార్చి 12న సమ్మె  చేశారు. కరోనా వ్యాప్తితో 10 రోజుల్లోనే సమ్మె విరమించి డ్యూటీలో చేరడానికి వెళ్లగా అధికారులు చేర్చుకోలేదు. సమ్మె టైమ్‌‌లో డ్యూటీ చేసిన 247 మందినే తీసుకున్నారు. వీళ్ల కాంట్రాక్టునూ రెన్యువల్ చేయలేదు. సంబంధిత మంత్రిని, అధికారులను ఈజీఎస్‌‌ సిబ్బంది కలిసినా  స్పందన లేదు. మిషన్ భగీరథ పథకం కోసం బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లను 2015లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. 11 నెలలుగా జీతాలివ్వకున్నా రేపో, మాపో ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయన్న ఆశతో వాళ్లంతా పనిచేస్తూ వస్తున్నారు. వీళ్లనూ జూలై 1న ప్రభుత్వం ఇంటికి పంపింది. హార్టికల్చర్ డిపార్ట్‌ మెంట్లో ఔట్‌‌ సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా సుమారు 500 మంది పని చేసేవారు. బడ్జెట్ సాకుగా చూపి వీళ్లందరిని తొలగించింది.               కరోనా వల్ల మూతబడిన స్కూళ్లు, కాలేజీలు, వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పని లేకపోవడంతో సర్కారు జీతాలివ్వడం లేదు. రాష్ట్రంలోని 2,245 ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ వర్కర్లు 8 వేల మంది, ఎస్సీ గురుకులాల్లో పని చేసే అసోసియేట్ లెక్చరర్లు 300మంది, గిరిజన గురుకులాల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ వెయ్యి మంది, పార్ట్ టైమ్‌‌టీచర్లు 1,500 మంది, గురుకులాల్లో పని చేసే ల్యాబ్ అసిస్టెంట్లు 450 మంది, గిరిజన డిగ్రీ గురుకులాల లెక్చరర్లు 300 మంది ఉన్నారు. వీళ్లంతా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వీళ్లలో చాలా మందికి ఏటా ఏప్రిల్‌‌లో చేసే కాంట్రాక్టు రెన్యువల్ కూడా కాలేదు. ఈ విద్యాసంస్థల్లో పని చేసే పర్మనెంట్ స్టాఫ్‌‌కు మాత్రం ప్రభుత్వం జీతాలిస్తోంది. టూరిజం డిపార్ట్‌ మెంటులో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆ శాఖ సగం జీతమే ఇస్తోంది.  కరోనా పేరుతో ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తీసేయడంతో వందలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇంతకాలం పని చేయించుకుని వదిలించుకోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో కొందరు ఉద్యోగుల కూలీ పనికి వెళుతున్నారు. కొన్ని  నెలలుగా జీతాలు రాకపోవడంతో వేలాది మంది  కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగులు దిక్కులు చూస్తున్నారు. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియక, జీతం వస్తుందో రాదో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారు. తమను తెలిసిన చోటల్లా అప్పులు చేసి కాలం వెల్లదీస్తున్నారు. క్రమబద్దీకరణ కాదు ముందు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. జీతాలు సక్రమంగా చెల్లించి తమ జీవితాలు చీకటిమయం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీళ్లు కార్చుతున్నారు తెలంగాణ  కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు.  కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో  సీఎం కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు..ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరిని రెగ్యులర్ చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించకపోగా.. వాళ్ల కొలువులనే తీసేస్తుండటంపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.  ముఖ్యమంత్రి వెంటనే స్పందించి  కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.

తిరుమల కొండపై సిగరెట్ తాగిన వైసీపీ కార్యకర్త! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బరి తెగిస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు తిరుమలకు సిగరెట్లు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజంపేట వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే  అమర్‌నాథ్ రెడ్డి కాలినడకన అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.  అయితే ఆయన అనుచరులు కొంతమంది కారులో అలిపిరి రోడ్డు మార్గం మీదుగా నిషేధిత వస్తువు అయిన సిగరెట్లతో తిరుమలకు చేరుకున్నారు. వారి వాహనాలను అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలి పెట్టినట్లుగా సమాచారం. ఇక పార్వేటి మండపం సమీపంలో అమర్‌నాథ్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై సిగరెట్ తాగుతూ కనిపించాడు. వైసీపీ కార్యకర్తలు పార్వేటి మండలం సమీపంలో సిగరెట్ తాగుతున్నా  టీటీడీ భద్రతా సిబ్బంది  పట్టించుకోలేదు. తిరుమల పరిసరాల్లో గుట్కాలు, పొగాకు వాడకంపై నిషేధం ఉంది. అయినా వైసీపీ నేతలు వెంకన్న క్షేత్రానికి సిగరెట్లు తీసుకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. అమర్‌నాథ్ రెడ్డి కాలినడక యాత్రలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరా వినియోగించడం వివాదాస్పదమైంది. తిరుమలలో భద్రత కారణంగానూ, అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆ నిబంధనలలో ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం పై  నిషేధం ఉంది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడడం తీవ్ర దూమారం రేపింది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. ఈసారి కూడా ఆయన అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు.   రెండు రోజులుగా తిరుమలపై కొండపై జరుగుతున్న ఘటనలతో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం బట్టబయలైంది. అధికారపార్టీ నాయకులు కావడంతో అటు టీటీడీ విజిలెన్స్ కానీ, ఇటు పోలీసులు కానీ అభ్యంతరం చెప్పలేకపోవడంతోనే ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. భద్రత పేరుతో సామాన్యు భక్తులను నానా ఇబ్బందులకు గురిచేసే భద్రతా సిబ్బంది.. అధికారపార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా! తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు

తెలంగాణలో మరో ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా సోకింది. గత రెండు రోజుల నుంచి నీరసంగా ఉండడంతో ఆయన  కరోనా పరీక్షలు చేయించుకున్నారు.  తన రిపోర్టులో పాజిటివ్‌గా తేలిందని ప్రకాష్ గౌడ్  చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తాను ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని, కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయొద్దని తెలిపారు. తనను కలవటానికి కూడా ప్రయత్నాలు చేయవద్దని కోరారు ప్రకాష్ గౌడ్.  దేవుడి ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని, మళ్లీ ప్రజల ముందుకు వస్తానని చెప్పారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.  మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో  తెలంగాణలో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మంగళవారం మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 1522కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,467 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

కుమ్ములాటల్లో తెలంగాణ కమలం !  ఎంపీ కామెంట్లతో కలకలం 

ఆలు లేదు చూలు లేదు.. కాని కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లుగా తయారైంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. రాష్ట్రంలో  బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలం పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. అదే జోష్ తో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పార్టీలోకి వలసలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతలు మాత్రం గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. అత్మ విశ్వాసమే, అతి విశ్వాసమో తెలియుదు కాని..  కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ కమలంలో  కాక రేపుతున్నారు. పార్టీ లైన్ తప్పి మరీ తమ ఇష్టమెచ్చిన ప్రకటనలు చేస్తున్నారు. తమకు అధికారం ఖాయమని చెప్పడమే కాదు.. పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా చెప్పేస్తున్నారు కొందరు నేతలు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫలానే వ్యక్తే సీఎం అవుతారనే ప్రకటనలు ప్రాంతీయ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడే సుప్రీమ్ కాబట్టి.. ఇలాంటి స్టేట్ మెంట్లతో ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండదు. నాయకులకు కొంత స్వేచ్ఛ ఎక్కువుండే కాంగ్రెస్ పార్టీలోనూ ఇలాంటి కామెంట్లు కామనే. కాని అత్యంత క్రమశిక్షణ గల సంస్థగా పేరున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంతో పని చేసే భారతీయ జనతా పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండవు. ఎన్నికలు పూర్తై పలితాలు వచ్చాక.. పార్టీ హైకమాండ్ ముఖ్యంగా ఆరెస్సెస్ ఆశీస్సులు ఉన్నవారికే పదవులు వస్తుంటాయి. ఇది ఇప్పటివరకు జరుగుతున్నది.. రాబోయే కాలంలో జరగబోయేది కూడా. కాని తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపైనే సంచలన ప్రకటన చేశారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం కేంద్రమంత్రిగాఉన్న కిషన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఎంపీ సోయం బాపురావు చేసిన సీఎం ప్రకటన ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో కలకలం రేపుతోంది.   వరుస విజయాలతో దూకుడు మీదున్న తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కమలం గూటికి చేరేందుకు క్యూడుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీకి వలసలతో పాటు వర్గపోరు పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం ఉంది. సంజయ్ కి పార్టీ పగ్గాలు వచ్చే వరకు తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డిదే హవా. బండి వచ్చాక పార్టీలో ఆయన  ప్రాధాన్యత తగ్గిందంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంజయ్ దూకుడే పార్టీకి ప్లస్ అయిందనే భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో రోజు రోజుకు సంజయ్ గ్రాఫ్ పెరిగిపోతుండగా.. పార్టీలో కిషన్ రెడ్డి నామమాత్రంగా మారిపోతున్నారు. ఇది గ్రహించిన కిషన్ రెడ్డి కూడా దూకుడు పెంచారని చెబుతున్నారు. అందులో భాగంగానే సోయం బాపురావు  ముఖ్యమంత్రి పోస్టుపై ప్రకటన చేశారనే చర్చ బీజేపీ కార్యాలయంలో జరుగుతోంది. కిషన్ రెడ్డి చొరవతో బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీ అయ్యారు సోయం. అందుకే కిషన్ రెడ్డిని లైవ్ లో ఉంచే లక్ష్యంతోనే ఆయన ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు.  తెలంగాణ బీజేపీలో  నేతల మధ్య ఆధిపత్య పోరే  కాదు.. క్యాస్ట్ కుమ్ములాటలు తీవ్రమయ్యాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ పార్టీకి రాజీనామా చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పాలమూరు జిల్లా బీజేపీలో ప్రస్తుతం మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పినట్లే జరుగుతుందట. బీసీ నేతలను వాళ్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో అది బహిర్గతమైందని తెలుస్తోంది. తనను పట్టించుకోలేదనే మనస్తాపంతోనే.. బండి సంజయ్ జిల్లాలో ఉండగానే రాజీనామా చేసిన బీజేపీలో అలజడి రేపారు ఎర్ర శేఖర్. సంజయ్ బుజ్జగించడంతో ఆయన తిరిగి మనసు మార్చుకున్నా.. బీసీ, రెడ్డి నేతల మధ్య బీజేపీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది  ఆ ఘటనతో బయటపడినట్లైంది.  గ్రేటర్ హైదరాబాద్ లోని తార్నాకలో రెండు వర్గాలు నడిరోడ్డుపైనే కొట్టుకోవడం కమలం పార్టీలో వర్గపోరుకు అద్దం పట్టింది. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లానే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందంటున్నారు. పాత నేతలు, కొత్త నేతలకు పొసగడం లేదట. సామాజిక వర్గాల వారీగా నేతలు గ్రూపులు కడుతున్నారని తెలుస్తోంది. వరుస విజయాలతో పార్టీ నేతల్లో కనిపిస్తున్న ఆత్మ విశ్వాసం, భారీగా వచ్చి చేరుతున్న వలస నేతలతో తమకు ప్రయోజనం ఉంటుందో లేక వర్గ విభేదాలతో అసలుకే మోసం వస్తుందో తెలియడం లేదని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే .. ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి గురించి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన ప్రకటనపై  పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు చెబుతున్నారు. సోయం వ్యాఖ్యలపై బండి సంజయ్ వర్గం గరంగరంగా ఉందని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీని.. పార్టీలో జరుగుతున్న ఘటనలు పరేషాన్ చేస్తున్నాయని తెలుస్తోంది.   

యూకే నుండి భారత్ వచ్చిన వారిలో 18 మందికి పాజిటివ్.. ఈ వైరస్ కొత్తదో... పాతదో..?

బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ తో సహా పలు దేశాలు బ్రిటన్ తో విమాన సంబంధాలను కూడా రద్దు చేసాయి. అయితే ఇప్పటికే వచ్చిన, వస్తున్న వారికి దేశంలోని పలు విమానాశ్రయాల్లో చేస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అవుతోంది. నిన్న మంగళవారం నాడు పలుచోట్ల చేసిన టెస్టులలో 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఈ నెల 11, 13 తేదీలలో యూకే నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్‌ గా తేలింది. ఈ ఇద్దరితో కలుపుకుని మంగళవారం వరకు మొత్తం 18 మందికి వైరస్‌ సోకినట్లయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టులో వీరికి పాజిటివ్‌ రావడంతో గచ్చిబౌలిలోని టిమ్స్‌లో ఉంచి చికిత్స అందిస్తునట్లు సమాచారం. అయితే వీరికి సోకింది కొత్త స్ట్రెయినా? లేక పాత రకందేనా? అన్నది తేలాల్సి ఉంది.   ఇది ఇలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చేవారు కొత్త కరోనా వైరస్ బారినపడినట్టయితే, వారిని టిమ్స్‌లో చేర్చి, వారితో కాంట్రాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు మాత్రం అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా వివిధ దేశాల నుంచి తెలంగాణకు మూడువేల మందికిపైగా వచ్చినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది. దీంతో వీరిలో ముందుగా వచ్చిన 1500 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు మరో 1500 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మరోపక్క కేంద్రం కొత్త స్ట్రెయిన్‌ విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రధానంగా కొత్త స్ట్రెయిన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ వస్తే వారి నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని కోరింది. వాటిని జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించింది. ఆ నమూనాల్లో వైరస్‌ తీవ్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌ మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమాన ప్రయాణికులందరికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు .  నిన్న ఎయిరిండియా విమానంలో లండన్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుల్లో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు. మరొకరు విమాన సిబ్బంది ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేసిన పరీక్షల్లో ఐదుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇదే విమానంలో ఢిల్లీ ద్వారా చెన్నై వెళ్లిన ప్రయాణికుడికి అక్కడ చేసిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మరోవైపు, 222 మంది ప్రయాణికులతో యూకే నుంచి కోల్‌కతాకు వచ్చిన విమానంలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది.  కొత్త స్ట్రెయిన్ తో పిల్లలకు ముప్పు ఎక్కువ.. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కరోనా ముప్పు పిల్లలకు తక్కువే. దీనికి కారణం వైరస్‌ ప్రవేశించే ఎస్2 రిసెప్టర్లు చిన్నారుల్లో తక్కువగా ఉండటమే. కానీ, కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ ఏస్‌2 రిసెప్టర్ల ను ఛేదించి చొచ్చుకెళ్తోంది. దీంతో పిల్లలకు కూడా ఇది చాలా సులభంగా సోకుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

తిరుమలలో నిబంధనల ఉల్లంఘన.. డ్రోన్ కెమెరాలతో వైసీపీ నేతల హల్చల్ 

తిరుమలలో భద్రత కారణంగానూ, అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆ నిబంధనలలో ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం పై ఉన్న నిషేధం. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడడం తాజాగా తీవ్ర దూమారం రేపుతోంది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. తాజాగా అయన మూడు రోజుల క్రితం అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు. అయితే ఈ పాదయాత్ర కార్యక్రమంలో అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్.. మున్సిపల్ శాఖకు శ్రీలక్ష్మి

ఆంధ్రప్రదేశ్  కొత్త  ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈనెల 31వ తేదీన ప్రస్తత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. దాంతో అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు. ఇక సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆదిత్యనాథ్‌ దాస్‌. నిజానికి  నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి సతీష్‌ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. ఆయనను సీఎస్‌ గా చేయడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్న నీరబ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే  నీరబ్‌కు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్‌ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అంతేకాదు జగన్ కు మొదటి నుంచి ఆధిత్యనాథ్ నమ్మకస్తుడిగా ఉన్నారు. అందుకే జగన్ కూడా  ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.  ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన మైనింగ్ స్కాంలో అరెస్టై జైలుకు వెళ్లిన సీనియర్ ఐఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకువచ్చిన జగన్... ఆమెకు కీలకమైన మున్సిపల్ శాఖ అప్పగించారు. అత్యంత కీలకమైన  అమరావతి, మూడు రాజధానులపై వివాదం జరుగుతున్న సమయంలో.. ఆ వ్యవహారాలు చూసే మున్సిపల్ శాఖ సెక్రటరిగా శ్రీలక్ష్మి నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు.  ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షిణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి.  తెలంగాణ కేడర్ లో ఉన్న శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకురావడం కోసం సీఎం జగన్  కేంద్రం దగ్గర లాబీయింగ్ చేశారు. .అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్‌పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది.  సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో  ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్‌లోనే పనిచేయాల్సి వచ్చింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించారు శ్రీలక్ష్మి. క్యాట్ అదేశాలతో ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకే జగన్ కీలక పోస్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి.   సీనియర్లను కాదని కొందరు జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి.    

ఆరుగురు యూకే ప్రయాణికులకు కరోనా? ఇండియాకు  కొత్త వైరస్ వచ్చేసిందా? 

యునైటెడ్ కింగ్ డమ్ ను వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను హడలెత్తిస్తోంది. యూకే నుంచి సోమవారం రాత్రి ఇండియాకు వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. వీరికి రూపాంతరం చెందిన వైరస్ సోకిందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. యూకే నుంచి ఎయిర్ ఇండియా విమానం సోమవారం రాత్రి 10.40గంటలకు న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ ఆరుగురు ప్రయాణికుల్లో ఒకరు చెన్నైకి కనెక్టింగ్ విమానం ద్వారా వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ విమానంలో క్రూ సిబ్బందితో సహా మొత్తం 266 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి సోకింది కొత్త వైరస్ అనే విషయమై ఇంకా స్పష్టత లేదని ప్రభుత్వ అధికారి అవనీశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాప్ పంపించామని.. పరీక్షల ఫలితాలు వచ్చాకే కరోనా సోకింది లేనిది తెలుస్తుందని చెప్పారు.       యూకే నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా నిర్దారణ కావడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. యూకేలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా ఆ దేశం నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి యూకే నుంచి వచ్చే అన్నిరకాల విమానాల రాకపోకలపై భారత్ కూడా నిషేధం విధించింది. ఈ నిషేధ డిసెంబర్ 31వరకు అమలులో ఉంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

కేసీఆర్, జగన్ బీజేపీ మిత్రులేనా ? మమత అందుకే పిలవడం లేదా? 

ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్న నేతకు దిక్కు లేకుండా పోయిందా?ఏపీ,  తెలంగాణ ముఖ్యమంత్రులను ప్రాంతీయ పార్టీల నేతలెవరు నమ్మడం లేదా? జగన్, కేసీఆర్ ను కమలం పార్టీ మనిషిగానే చూస్తున్నారా?.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో ఇదే నిజమేనని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో త్వరలో సమావేశం కాబోతున్నారు. కోల్ కతాలో జరగనున్న ఈ సమావేశానికి పలు పార్టీ నేతలను మమత ఆహ్వానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోల్ కతా ఆహ్వానం రాలేదు. మమతా బెనర్జీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నేతలకు ఆహ్వానం రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మమత ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది.  ప్రస్తుతం బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య యుద్దమే నడుస్తోంది. బెంగాల్ లో పనిచేస్తున్న ఐపీఎస్ లను రాష్ట్ర సర్కార్ తో సంబంధం లేకుండా కేంద్రం బదిలీ చేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంలో డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భగల్, అశోక్ గెహ్లాట్‌ మమతకు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ మాత్రం స్పందించలేదు. అటు జగన్ కూడా మాట్లాడలేదు.  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ, అమిత్ షా లాంటి వారు నిప్పులు చెరుగుతుంటే ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతకు అండగా నిలిచారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మద్దతుగా నిలవలేదు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమతను కలిసిన కేసీఆర్.. బీజేపీపై యుద్దం చేస్తానన్న కేసీఆర్.. బీజేపీతో చిక్కులు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి బాసటగా నిలవకపోవడం ఇతర ప్రాంతీయ పార్టీ నేతలను విస్మయపరిచిందని చెబుతున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన్ను బీజేపీ సపోర్టర్ గానే చూస్తున్నారట ప్రాంతీయ పార్టీల నేతలు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన కూడా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకే బీజేపీ డైరెక్షన్ లో వచ్చిందేనని కొందరు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే కేసీఆర్ ను తన సమావేశానికి మమత బెనర్జీ పిలవలేదని తెలుస్తోంది. రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పుడూ ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.  బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతానని పలు సార్లు ప్రకటించారు గులాబీ బాస్. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంత వర్కవుట్  కూడా చేశారు. భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్, చెన్నైలో స్టాలిన్ ను కలిశారు కేసీఆర్. బెంగళూరులో కుమారస్వామి, లక్నోలో మాయావతిని కలిసి చర్చించారు. కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపారు కేసీఆర్. శరద్ పవార్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోనూ సంప్రదింపులు జరిపానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హడావుడి చూసిన వారంతా ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెట్టడం ఖాయమనుకున్నారు. కాని లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడంతో  గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎయిరిండియా, బొగ్గు గనులు వంటివి ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రభుత్వంపై ఒక యుద్ధమే ప్రకటించారు గులాబీ బాస్. అయితే  గ్రేటర్ ఎన్నికల తర్వాత మళ్లీ మెత్తబడ్డారు కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలో రైతు సమస్యలను ప్రస్తావించలేదని సమాచారం .  కేసీఆర్ తీరు, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియకపోవడంతో ప్రాంతీయ పార్టీ నేతలెవరు ఆయనను నమ్మడం లేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ముందు నుంచి బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో సమర్ధించింది వైసీపీ. జగన్ కూడా ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. దీంతో జగన్ ను కూడా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదని తెలుస్తోంది. అందుకే వీరిద్దరిని మమతా బెనర్జీ సమావేశానికి ఆహ్వానించలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మమతా బెనర్జీ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశర్ రెడ్డి కూడా  హాట్ కామెంట్స్ చేశారు. మమతతో పాటు, శరద్ పవార్, స్టాలిన్, నవీన్ పట్నాయక్‌లు కేసీఆర్‌ను నమ్మడం లేదని చెప్పారు.  బీజేపీ మరియు టీఆర్ఎస్‌లు రెండు రహస్య ఒప్పందంపై పయనిస్తూ ప్రజలను పిచ్చివారిని చేస్తున్నాని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడ్డారేమో అందుకే ఢిల్లీ వెళ్లి రాజీ చేసుకున్నారని కొండా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు ఉన్నఫలంగా స్టాండ్ మార్చుకుంటున్నారని కొండా విశ్వేశర్ రెడ్డి ప్రశ్నించారు.