క‌మ‌లానికి కిష‌న్ మార్క్.. చీడ ప‌ట్టిందా?

  తెలంగాణ బీజేపీలో అస‌లేం  జ‌రుగుతోంది? మ‌నం నానాటికీ ఇక్క‌డ  ఎందుకు దిగ‌జారిపోతున్నాం? అంటూ ప్ర‌ధాని మోదీ వాక‌బు చేశారంటే ఇక్క‌డి  పార్టీ ప‌రిస్థితి  ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఇంత‌కీ  తెలంగాణ బీజేపీ ప్ర‌స్తుతం ఎలా ఉంది? అంటే రాజాసింగ్ ఉదంత‌మే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. రాజాసింగ్ పార్టీలోని  ప్ర‌తి అంశాన్ని బ‌య‌ట  పెడుతూనే వ‌చ్చారు. ఇంకా అదే ప‌ని మీదున్నారాయ‌న‌.  రాజాసింగ్ మాట‌ల‌ ప్ర‌కారం చూస్తే, పార్టీ వ్య‌క్తి కోసం  న‌డుస్తోన్న వ్య‌వ‌స్థ కాదు అవ‌స్థ‌గా  తయారైన‌ట్టు తెలుస్తోంది. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు కిష‌న్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్. కిష‌న్ ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నా.. ఆయ‌న ఆడింది ఆట  పాడింది పాటగా పార్టీలో చ‌లామ‌ణీ అవుతున్న‌ట్టు కొడుతోంద‌ని అంటారు రాజాసింగ్. ఒక‌ప్పుడు తెలంగాణ బీజేపీకి  ఇటు కిష‌న్ తో పాటు ద‌త్త‌న్న‌, ల‌క్ష్మ‌న్న అనే ఇద్ద‌రు సీనియ‌ర్లు త్రిమూర్తుల్లా  క‌నిపించేవారు. ద‌త్త‌న్న దాదాపు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ బీజేపీ అంత‌ర్గ‌త  రాజ‌కీయాల‌కు బాగా దూరంగా ఉన్నారు.  కిష‌న్ ఒక్క‌డే ప్ర‌స్తుతం దిక్కు మొక్కుగా  ఉన్నారు. ప్రెజంట్ కిష‌న్ కి బండి సంజ‌య్ రూపంలో మ‌రో నాయ‌క‌త్వం తోడున్న‌ట్టే క‌నిపించినా.. అందులోనూ ఏమంత  బండి మార్క్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక్క‌డ  కిష‌న్ మార్క్ ప‌రిపాల‌నే అధికంగా  కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. పేరుకు రామ‌చంద్ర‌రావు పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నా.. ఆల్ ఇన్ వ‌న్ గా కిష‌న్ త‌న‌దైన క‌మ‌ల  చ‌క్ర వ్యూహం ర‌చిస్తూనే  ఉన్నార‌ట‌. కిష‌న్  కేంద్ర మంత్రి కావ‌డంతో కొంత  బిజీ బిజీగా ఉన్నమాట వాస్త‌వ‌మే  అయినా... పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో మాత్రం త‌న ప‌ట్టు కోల్పోకుండా జాగ్ర‌త్త  వ‌హించ‌డంతోనే అస‌లు ముప్పు త‌లెత్తిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇక్క‌డ ఎవ‌రికి వారే యుమ‌నా తీరే  అన్న‌ట్టుగా  త‌యారైందట‌. అంత‌ర్గ‌త  ప్ర‌జాస్వామ్యం అనే  విష‌యంలో ఈ 40 ఏళ్ల పార్టీ ఏకంగా 140 ఏళ్ల‌ కాంగ్రెస్ తో పోటీ  ప‌డుతోందంటున్నారు కొంద‌రు క‌మ‌ల‌నాథులు. మోడీ అడుగుతున్న‌ట్టు.. బీజేపీ ప‌త‌నం ఎలా ప్రారంభ‌మ‌య్యిందో చూస్తే.. నాడు బీఆర్ఎస్ అధికార పార్టీగా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండ‌గా.. ఆ త‌ర్వాతి స్థానంలో ప్ర‌జ‌ల దృష్టిలో నిలిచిన పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ ఎక్క‌డో మూడో స్థానంలో ఉన్న‌ట్టు క‌నిపించింది. అయితే ఇటు క‌ర్ణాట‌క ఫ‌లితాలు రావ‌డంతో కాంగ్రెస్ లో ఒక ర‌క‌మైన జోష్ మొద‌లైంది.  మ‌న పొలంలోనూ మొల‌కలొస్తాయ్ అన్న ఆశ ఇక్క‌డి హ‌స్తంపార్టీ  నేత‌ల్లో చిగురించ‌డం మొద‌లైంది. దీంతో అప్ప‌టి  వ‌ర‌కూ అసంఘటితంగా  ఉన్న  కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులంతా ఒక్కసారిగా చేయి చేయి క‌లిపారు. ఫ‌లితంగా 2023 అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ బీజేపీ మూడో స్థానానికి ప‌డిపోయి.. అక్క‌డే స్థిర‌ప‌డిపోయింది. ఇక్క‌డ బీజేపీ ప‌త‌నానికి మ‌రో కీల‌క‌మైన  కార‌ణం  క‌విత  వ్య‌వ‌హారంగానూ  చెబుతారు. క‌విత‌ను అరెస్టు చేయ‌కుంటే బీఆర్ఎస్, బీజేపీ  కూడ‌బ‌లుక్కుంటున్నాయిన  జ‌నం అనుకుంటున్న‌ట్టు ఒకానొక‌ అనుమానం వ్య‌క్తం చేశారు కొండా  విశ్వేశ్వ‌ర్ రెడ్డి అప్ప‌ట్లో. దీనికి తోడు ఆనాడు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా  బండి సంజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. నాలుగు సీట్ల గ్రేట‌ర్ ని 48 సీట్ల వ‌ర‌కూ లాగారు. దీంతో బీజేపీలో కొత్త  ర‌క్తం వ‌చ్చింద‌ని  పాత ర‌క్తం క‌నుమ‌రుగ‌య్యింద‌నే అనుకున్నారంతా. ఇలాగైతే  త‌న బండార‌మంతా బ‌ట్ట‌బ‌య‌లై  పోతుంద‌ని భావించిన కిష‌న్, మోడీతో త‌న‌కున్న సాన్నిహిత్యాన్ని వాడి.. ఎలాగోలా రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. కిష‌న్ పై రాజాసింగ్ చేసే ఆరోప‌ణ‌ల‌ను బ‌ట్టీ చూస్తే ఆయ‌న  ఎన్న‌టికీ  పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకోరు. ఎవ‌రు అధికారంలో ఉంటే వారితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని.. వ్య‌క్తిగ‌త ల‌బ్ధి పొంద‌డానికే ఎక్కువ ప్ర‌యారిటీ  ఇస్తార‌ని అంటారు. దీంతో కేసీఆర్ కి అనుకూల కిష‌న్ రెడ్డి రావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్ర క‌మ‌ల‌ద‌ళంలో ఉన్న జోష్ మొత్తం నీరుగారిపోయిన‌ట్టు అంచ‌నా. అప్ప‌టికీ.. రాష్ట్రంలో బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఆద‌ర‌ణ కొద్దీ ఇటు ఇద్ద‌రు సీఎం అభ్య‌ర్ధులు పోటీ చేసిన కామారెడ్డిలో ఢంకా  బ‌జాయించ‌డంతో పాటు మొత్తం ఎనిమిది చోట్ల అసెంబ్లీ  స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఆపై 2024 లోక్ స‌భ  ఎన్నిక‌ల్లోనూ స‌త్తా  చాట‌డంతో 8 ఎంపీల‌ను గెల‌వ‌గ‌లిగింది. ఇక  ఎమ్మెల్సీల ప‌రంగానూ  గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. స్థానిక సంస్థ‌ల్లోనూ  ప్ర‌భావం చూపించాల్సిన క‌మ‌లం పార్టీ చ‌తికిల ప‌డింది. కిష‌న్ రెడ్డి పుణ్య‌మాని.. పార్టీలో ఎక్క‌డిక్క‌డ బ్యాచ్ లు గా విడిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇటు ఎంపీలు ఒక గ్రూప్, ఎమ్మెల్యేలు మ‌రో గ్రూప్, ఆపై సీనియ‌ర్లు ఒక గ్రూప్, కొత్త‌గా  వ‌చ్చిన వారు ఇంకో గ్రూప్ లుగా విడిపోయి.. ప్ర‌స్తుతం ద‌శ- దిశ..  క‌ర‌వై నానా  అగ‌చాట్లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం గుర్తించిన ప్ర‌ధాని మోడీ రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం  చేయ‌డం ఒక స్వ‌యంకృతాప‌రాధం.  ఎందుకంటే  కిష‌న్ రెడ్డి స్వ‌భావం గురించి తెలిసి కూడా  పార్టీలోని  ప్ర‌తి ఎంపిక క‌ద‌లిక‌ల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షించేలా చేయ‌డంతోనే అస‌లుకే మోసం వ‌చ్చేలా  క‌నిపిస్తోంద‌ని వాపోతున్నారు రాజాసింగ్ వంటి వారు. అస‌ల‌క్క‌డ ఉన్న‌ది భార‌తీయ  జ‌న‌తాపార్టీ కాదు.. కిష‌న్ రెడ్డి  జ‌న‌తా పార్టీ అంటారు రాజాసింగ్. మ‌రి  ఈ విష‌యాలేవీ మోడీకి తెలీద‌నుకోవాలా? ఏంట‌న్న‌ది  పార్టీ  అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ట్టు తెలుస్తోంది.  

గ్లోబంత సంబ‌ురం.. పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

రెండు రోజుల పాటు జ‌రిగిన  తెలంగాణ రైజింగ్- గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో  5. 75 ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డుల‌కు ఎంఓయూలు కుదిరాయి. ఈ కార్య‌క్ర‌మానికి దేశ విదేశాల నుంచి పలువురు వ్యాపార‌, రాజ‌కీయ‌, సినీ, కార్పొరేట్, ఆర్ధిక రంగ అతిర‌థ మ‌హార‌థులు ఏతెంచ‌గా.. అంగ‌రంగ వైభ‌వంగా  న‌భూతో ..   అన్న స్థాయిలో జ‌రిగిందీ గ్లోబల్ సంబురం.   ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో  కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌  రెండో విజ‌య‌వంత‌మైన  ఏడాది  ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక  గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది.  తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది. ఇది రాజ‌కీయాల‌కు అతీతంగా కేవ‌లం అభివృద్ధీకి మాత్ర‌మే పెద్ద పీట వేయడంతో ప్ర‌పంచ వ్యాప్తంగా   ఫోక‌స్ అంతా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వైపు చూసింది.  అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు వినీవినీ విసిగి వేసారిన జ‌నాన్ని ఫ‌క్తు ప్రొఫెష‌న‌ల్ గా సాగిన ఈ స‌మ్మిట్ విపరీతంగా ఆకర్షించింది. రాజ‌కీయాల‌కు అతీతంగా సినీ, క్రీడా, వ్యాపార, ఆర్ధిక రంగ ప్ర‌ముఖుల‌తో కూడిన‌ మేథో మ‌థ‌నం జ‌ర‌గ‌డంతో తెలంగాణ భ‌విష్య‌త్ బంగారమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ప్ర‌పంచంలోనే భార‌త్ యువ‌ర‌క్తంతో కూడున్న దేశ‌మైతే.. అందులో తెలంగాణ మ‌రింత యువ రాష్ట్ర‌మ‌ంటూ  శంత‌ను నారాయ‌ణ్ వంటి ప్ర‌ముఖ  కార్పొరేట్ దిగ్గ‌జాలు పేర్కొన్నారు. ఇక 2047 నాటికి  తెలంగాణ మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక శ‌క్తిగా ఎద‌గాల‌న్న ల‌క్ష్యం  అతిశ‌యం ఏమీ కాద‌నీ,  ఈ విష‌యంలో తెలంగాణ ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డ్డం చాలా గొప్ప విషయమనీ ప్ర‌ముఖ ఆర్ధిక  వేత్త‌ అర్వింద్ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ అన్నారు. కేవ‌లం  రాష్ట్రాలే  కాదు న‌గ‌రాల మ‌ధ్య కూడా పోటీ ఉండాల‌నీ, ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో బెంగ‌ళూరు అర్బన్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే,  హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీ  వంటి  విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌పంచ దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంద‌న్నారాయన. తెలంగాణ   గొప్ప‌గా ట్రాన్స్ ఫార్మింగ్ జ‌రుగుతోందనీ, ఇటీవలి కాలంలో  విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోందన్నారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు. ఇక మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ ఎద‌గ‌డానికి మూడంచ‌ల వ్యూహం అనుస‌రిస్తున్న‌ట్టు త‌న  విజ‌న్ డాక్యుమెంట్ లో  ఆవిష్క‌రించింది రేవంత్ సర్కార్.  అందులో భాగంగా భావిత‌రాల కోసం తెలంగాణ‌ను తీర్చిదిద్ద‌డంతో పాటు, ఆర్ధిక స‌మ్మిళిత‌, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర వార‌స‌త్వ‌, సాంస్కృతిక క‌ళా వైభ‌వాల‌కు పెద్ద పీట వేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.  5 వేల కోట్ల‌తో సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల రంగంలో తాము పెట్టుబడులు పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు యూపీసీ సీఈవో అలోక్ కుమార్. 1100 కోట్ల‌తో వింటేజ్ కాఫీ ప్లాంట్ తెలంగాణ‌లో ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారుఆ సంస్థ ఎండీ బాల‌కృఫ్ణ‌న్.  ఇక మహీంద్రా అండ్ మహీంద్రా  చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర  అయితే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కాలేజీకి త‌న‌ను బాధ్య‌త వ‌హించ‌మ‌ని  కోర‌డంతో కాద‌న‌లేక పోయాన‌ని, అందుకు కార‌ణం సీఎం రేవంత్ విజన్, సునిశిత ఆలోచ‌నా స‌ర‌ళి, ఆపై పేద‌రిక నిర్మూల‌న‌పై ఆయ‌న‌కున్న నిబ‌ద్ధ‌త అంటూ పొగడ్తలు గుప్పించారు. తెలంగాణ నిజంగానే ఒక రోల్ మోడ‌ల్ అన్నారు బ్రిట‌న్ మాజీ  ప్ర‌ధాని  టోనీ బ్లేయ‌ర్.  మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధ్య‌మేన‌ని ప్ర‌పంచ‌మంతా చెప్పింద‌ని ప్ర‌క‌టించారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామ‌కృష్ణారావు. ఈ ఫ్యూచ‌ర్ సిటీ  కోసం  2027 వ‌ర‌కూ ఎదురు చూడ‌క్క‌ర్లేదు.. అంత‌క‌న్నా ముందే సాకార‌మ‌వుతుంద‌న్నారు ప్రముఖ  నిర్మాత అల్లు అర‌వింద్. ఇక ఇదే ఫ్యూచ‌ర్ సిటీ ద్వారా  ఏకంగా 13 ల‌క్ష‌ల ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు రానున్న‌ట్టు తెలుస్తోంది. 13, 500 ఎక‌రాల్లో నిర్మిత‌మ‌య్యే ఈ న‌గ‌రం ఒక ఆర్కిటెక్ అద్బుతం కానుంద‌ని, ఏకంగా 9 ల‌క్ష‌ల మందికి ఆవాస యోగ్యం కానుంద‌ని ప్ర‌క‌టించారు స‌మ్మిట్ నిర్వాహ‌కులు. మూసీ పున‌రుజ్జీవం ప్రాజెక్టు పూర్తైతే.. ప్ర‌పంచ‌మే హైద‌రాబాద్ కి త‌ర‌లి వ‌స్తుంద‌ని అన్నారు వాట‌ర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్.   ప‌ర్యాట‌కంగా మాత్ర‌మే  కాకుండా సినిమా ప‌రంగా కూడా తెలంగాణ‌ను అద్భుతంగా తీర్చిదిద్దే  బాధ్య‌త‌ల‌ను తీసుకుంటున్న‌ట్టు ఈ స‌ద‌స్సు ద్వారా  ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం తెలుగు వారికి ఉన్న స్టూడియోలే కాక స‌ల్మాన్, అజ‌య్ దేవ‌గ‌న్ వంటి బాలీవుడ్ తార‌లు సైతం ఇక్క‌డ స్టూడియోలు పెట్ట‌డానికి ముందుకొచ్చారు. భార‌త‌దేశంలోనే స‌మ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్న హైద‌రాబాద్ దేశంలోని అన్ని సినిమా రంగాల వారికి భూత‌ల స్వ‌ర్గంతో స‌మానం కావ‌డంతో  అందరినీ ఇక్క‌డికి ఆక‌ర్షించి వ‌ర‌ల్డ్ మూవీ హ‌బ్ గానూ తీర్చిదిద్దేందుకు త‌మ వంతు య‌త్నం  చేస్తామ‌ని ప్రకటించింది ప్ర‌భుత్వం. ఐటీ విప్ల‌వానికి తెలంగాణ పుట్టినిల్లు లాంటిద‌ని, స్టార్ట‌ప్ హ‌బ్ గానూ హైద‌రాబాద్ కు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయ‌నీ ప్ర‌శంసించారు ప‌లువురు ఆర్ధిక నిపుణులు. ఇక దువ్వూరి అయితే తెలంగాణ అన్ బీట‌బుల్ గ్రోత్ సాధిస్తోంన్నారు. ఏటా 6-9 శాతం స్థిర‌మైన వృద్ధి రేటు సాధిస్తోందని గుర్తు చేశారు.  మొత్తంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి  రెండో ఏడాది దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న  శుభ సంద‌ర్భంలో  5 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చేలా  ఎంఓయూలు జ‌ర‌గ‌డం ఏమంత సాధార‌ణ విష‌యం కాదు. అయితే ఈ ఎంఓయూల‌ను పెట్టుబ‌డులుగా మ‌ల‌చ‌డంలో ప్ర‌భుత్వం త‌గిన బాధ్య‌త తీసుకోవ‌ల్సిన అవ‌స‌ర‌ముంది. ఆ మాట‌కొస్తే ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను నిర్వ‌హిస్తున్న దుద్దిళ్ల  శ్రీధ‌ర్ బాబు ఇందుకోసం ప్ర‌త్యేక రూట్ మ్యాప్ ని త‌యారు చేయాల్సి ఉంది. ఒక స్పెష‌ల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా ఒప్పందం కుదుర్చుకున్న  సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా ఇవ్వాల్సిన రాయితీలు, ఇత‌ర‌త్రా సౌల‌భ్యాల‌ను వారికి అందేలా  సింగిల్ విండో ఏర్పాటు చేయాల్సి ఉంది.   వ‌చ్చాం- ఒప్పందాలు చేసేశాం- వెళ్లామ‌ని కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో అప్ ల‌తో ఈ పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌లో గ్రౌండ్ అయ్యేలా చేడాల్సి ఉంది.  అలా జరిగితే..  ఫ్యూచ‌ర్ సిటీ ద్వారా 13 ల‌క్ష‌లేం ఖ‌ర్మ అంత‌క‌న్నా మించి  ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు తెలంగాణ‌ను వెతుక్కుంటూ రావ‌డం  ఖాయం అంటున్నారు పరిశీలకులు. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్. ఇలాగే మ‌రిన్ని వ‌సంతాలు మ‌రిన్ని  స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌తో ల‌క్ష‌ల  కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా  ఎద‌గాల‌ని.. కోరుకుందాం. సీఎం రేవంత్ క‌ల‌లు గ‌న్నట్లుగా దావోస్ త‌ర‌హాలో ప్ర‌పంచ పెట్టుబ‌డులను ఆక‌ర్షించే వేదిక‌గా ఫ్యూచ‌ర్ సిటీ రూపుదిద్దుకోవాల‌ని ఆశిద్దాం.  మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్యానాదెళ్ల సైతం హైద‌రాబాద్ కేంద్రంగా ఏఐ ఇన్వెస్ట్ మెంట్ చేస్తామన్నారు. సుమారు ల‌క్ష‌న్న‌ర కోట్ల  పెట్ట‌బడులు భార‌త్ లో పెట్ట‌నుండ‌గా వీటిలో అత్య‌ధిక శాతం హైద‌రాబాద్ లోనే అని సంకేతాలిచ్చారు. 

జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?

కేంద్ర మంత్రత్వ శాఖలన్నిటిలోనూ అత్యంత రిస్కీ శాఖ అంటూ ఏదైనా ఉందంటే అది పౌర విమానయాన శాఖ మాత్రమే. ఇటీవలి కాలంలో ఈ శాఖను కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ తెలుగువారికే అప్పగిస్తోంది. అది కూడా భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం కే ఈ శాఖ కేటాయిస్తోంది. గతంలో అంటే 2014-19లో ఎన్డీయే కూటమి తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎంపీ అయిన అశోక గజపతి రాజుకు ఈ శాఖ కట్టబెట్టింది. ఇప్పుడు 2024లో మళ్లీ ఈ శాఖను తెలుగుదేశం యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడికి అప్పగించింది. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనదీ కూడా.  ప్ర‌మాదాలు, వివాదాలు సాంకేతిక లోపాలు వంటివి విమనాయానాల్లో సహజం.  దేశంలో ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా, సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సర్వీసు రద్దైనా పౌర విమానయాన శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.     ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.  విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శాఖాపరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరిగేలా చూస్తున్నారు. అందరూ ఆయన పని తీరును భేష్ అంటూ ప్రశంసిస్తున్నారు.  అదలా ఉంటే.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమానాలలో సాంకేతిక లోపాల వంటి కారణాలు పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా పరిణమించాయి.  తాజాగా ఇండిగో వ్య‌వ‌హారం మరొ పెద్ద సమస్యగా పరిణమించింది. డీజీసీఏ నిబంధ‌న‌లు పైలట్లకు విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తే.. అవి కాస్తా ఆ శాఖా మంత్రి అయిన రామ్మోహ‌న్ నాయుడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చయడం కోసం జాతీయ మీడియా పౌర విమానయాన సంస్థ మంత్రిని స్కేప్ గోట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నది.  జాతీయ మీడియా ఉద్దేశ పూర్వకంగా దక్షిణాది మంత్రులపై దాడి చేస్తున్నదా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇండిగో సంస్థ ప్రణాళికా లోపం, నిర్వహణ వైఫల్యం కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దై ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు బాధ్యత వహించాల్సింది పూర్తిగా ఇండిగో సంస్థ. ఇప్పటికే ఆ సంస్థపై చర్యలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉపక్రమించారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలను సమర్థించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయినా జాతీయ మీడియా మాత్రం ఇండిగో సంక్షోభాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి వైఫల్యంగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నది.  ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ మీడియావాటికి ఆ శాఖ మంత్రిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వండి వార్చలేదు. ఇప్పుడు ఇండిగో వ్యవహారంలో మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ గగ్గోలు పెడుతోంది. అంటే జాతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

కేసీఆర్ భోజనాలు.. జగన్ గాలి తిరుగుళ్లు.. ప్రజాధనం దుబారాలో ఇద్దరూ ఇద్దరే!

ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే. ముందుగా తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2023 వరకూ  ప్రగతి భవన్ లో భోజనాలు, తినుబండారాల కోసం చేసిన ఖర్చు వెయ్యి కోట్లు. ఔను అక్షరాలా వెయ్యి కోట్లు. ఇది ఏదో కాకిలెక్క కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో నిత్య సంతర్పణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి అని దీని ద్వారా తెలుస్తోంది. నిత్యం మటన్, చికెన్, కౌజు పిట్టలు, కుందేలు మాంసం కూరలతో పాటు కోడి గుడ్లతో వైరైటీ వంటలతో విందులు చేసుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక  విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిళ్లు కూడా ఇందులోకే వస్తాయి. విషయానికి వస్తే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నిత్యం దాదాపు 50 మంది నిత్యం ఈ విందు భోజనాలకు హాజరయ్యేవారట. పెట్టేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు ఇక్కడ వంట, వడ్డన సాగేదట.   ఏ ఫైవ్ స్టార్ హోట‌ల్ కీ తీసి పోని విధంగా ఇక్క‌డి  వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉండేవ‌ట‌.కేసీఆర్ తనతో ఉన్న అందరికీ ప్రతి రోజూ, ప్రతిపూటా రకరకాల నాన్ వెజ్ లతో ఇచ్చే ఈ విందు పెళ్లి దావత్ ను మించి ఉండేదంట. అంటే జనం సొమ్ముతో కేసీఆర్ తన, తన కుటుంబ సభ్యుల జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాకుండా, తనతో ఉన్న వారికీ విందు భోజనాలు పెట్టేవారన్న మాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేంటంటే.. ఈ గ్రాండ్ విందు భోజనం కొందరికే.. ఇక సీఎం భద్రతా సింబ్బంది, పనివాళ్లకు మాత్రం శాఖాహార వంటలే వడ్డించేవారట. ఇది కూడా పెద్ద సారు ఆర్డర్ ప్రకారమేజరిగేదంట.  కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు బంధువులందరికి ప్రతిరోజు మాంసాహారం వంటలు తప్పనిసరి అన్న  ఆదేశాలుండేవ‌ట‌. కేవలం భోజనాల కోసమే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారంటున్నారు పరిశీలకులు. మరో విషయం ఇప్పుడు చెప్పిన వెయ్యి కోట్ల లెక్క కేవలం ప్రగతి భవన్ విందు భోజనాలకిసంబంధించినది మాత్రమే. ఇది కాకుండా   ఎర్రవల్లి ఫాంహౌజ్ లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం ప్రయాణాలకే 222.85 కోట్ల ప్రజాధనం వెచ్చించారని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. జ‌గ‌న్హయాంలో  విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు సైతం చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్- ఏపీఏసీఎల్  ద్వారా ఏకంగా రూ.222.85 కోట్లు వెచ్చించారని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం.జగన్ విమానయానం ఖర్చులు 2019-20- రూ.31.43 కోట్లుకాగా.. 2020-21- రూ.44 కోట్లు, 2021-22- రూ.49.45 కోట్లు, 2022-23- రూ.47.18 కోట్లు, 2023-24- రూ.50.81 కోట్లుగా చెబుతున్నాయి లెక్క‌లు. ఈ ఐదేళ్లలో జగన్ విమానాల చార్జీలు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ చార్జీలకు రూ.87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రూ.23.31 కోట్లు చెల్లించిన‌ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ చార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు వెల్ల‌డిస్తున్నాయి రికార్డులు. జ‌గ‌న్ ఐదేళ్ల కాలంలో గాలి మోటారు ఖ‌ర్చుల‌ను ఏకంగా 220 కోట్ల మేర పెట్ట‌గా ఈ ప‌ద్దెనిమిది  నెల‌ల కాలంలో లోకేష్ పెట్టిన ఖ‌ర్చు జీరో అంటూ తెలుగుదేశం  సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.   అంతే కాదు.. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా మంత్రి నారా లోకేష్ 77 సార్లు హైద‌రాబాద్ ప్ర‌యా ణించ‌గా.. ఆ విమాన ఖ‌ర్చులు పూర్తి సొంతంగానే పెట్టార‌ని ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌లే ద‌ని తేలింది.ఇటు తెలంగాణ‌లో కేసీఆర్, అటు ఏపీలో జ‌గ‌న్ ఇరువురూ వారి వారి హ‌యాంలో ప్ర‌జ‌ల సొమ్ము ఎంత‌గా వృధా ఖ‌ర్చు రూపంలో వెచ్చిస్తున్నారో ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మేనంటున్నారు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు. కేసీఆర్, జగన్ లు ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరు చూస్తుంటే, తన సొమ్ము సోమవారం ముప్పొద్దుల తింటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అంటూ ఏదో సినిమాలో ఆరుద్ర రాసిన పాటలో పంక్తులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. 

చెక్కు చెదరని స్నేహ బంధం!

పదవిలో ఉన్నవాళ్లు, మరీ ముఖ్యంగా దేశాధిపతులు ఏదైనా చేయగలరన డానికి తాజా ఉదాహరణ శుక్రవారం (డిసెంబర్ 5) భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. సాక్షాత్తు రష్యా అధినేత బయలుదేరాడంటే "రాజు వెడలె,రవితేజములరరగా" అన్నట్లు వందిమాగధులు, రక్షకసముదాయం బయలుదేరుతారు ఆయన రక్షణకు ఐదంచల వ్యవస్థ ఉంటుంది.ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది  తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు. ఆయన పండ్ల రసాలు,మాంసాహారం తీసుకుంటారు. భద్రతకు సంబంధించి ఇంతటి జాగ్రత్తలు అగ్రరాజ్యాధినేత తరువాత రష్యా అధ్యక్షుడి విషయంలోనే ఉంటాయి.   రష్యా నుంచి భారత్  చమురు  కొనుగోలు చేస్తున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  .భారత్ వచ్చిన పుతిన్ భారత్,రష్యా మధ్య చమురు ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారు.అలాగే మరో ఐదేళ్లపాటు అమలులో ఉండే ఆర్ధిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు జరిగాయి.  అలాగే రష్యా,భారత్ ఒప్పందాలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఏకధృవ ప్రపంచంలో భారత్, రష్యా,చైనాల మైత్రి నిస్పందేహంగా అమెరికాకు కంటగింపే. .భారత్, చైనా,రష్యా ఒకటిగా ఉంటే అమెరికా జీరో అంటూ ఇప్పటికే చైనా వ్యాఖ్యానించింది కూడా.  .గతంలో కూడా ఈ మూడు దేశాలు ఇదే మాట ట్రంప్ కు పరోక్షంగా ఎరుకపరిచిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి.  1992 లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేవరకూ అమెరికాకు దీటుగా అన్ని విషయాల్లో రష్యా పోటీగా ఉండేది.  ప్రచ్ఛన్న యుద్ద కాలంలో  భారత్, రష్యాల మధ్య సహకారం తెలిసిందే.  సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా భారత్, రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రధానంగా యుద్ధ పరికరాల సరఫరా  విషయంలో ఇరు దేశాల మధ్యా బంధం చెక్కు చెదరలేదు. . ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పీచమణచడంలో రష్యా ఆయుధాలు కీలక పాత్రపోషించాయి. రష్యా అధినేతగా  వాద్లిమిర్ పుతిన్ పాతికేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసా గుతున్నారు. సోవియట్ పతనం తదననంతరం..  ప్రపంచ దేశాలలో రష్యా ప్రాధాన్యత, ప్రాముఖ్యతను  కొనసాగించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు.   అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా రష్యాను నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలలో కూడా   కీలకంగా వ్యవహరిస్తున్నారు.  భారత్ కు చిరకాల,సాంప్రదాయ మిత్రుడు గా దాదాపు ఏడు దశాబ్దాలుగా రష్యా ఉంది.  పుతిన్,మోదీ భేటీ ఇదే తొలిసారి కాదు.   వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న   మోదీ అప్పట్లో పుతిన్ తో భేటీ అయ్యారు.అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతునే ఉంది.  భారత్, రష్యాల స్నేహ బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన నిస్సందేహంగా మోడీ దౌత్య విజయంలో ఒకటిగా చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన అనగానే ఉక్రోషంతోనో, ఆందోళన వల్లో తెలియదు కానీ.. అమెరికా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు.  పుతిన్ భారత పర్యటన ఈ సమయంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  రష్యా నుంచి భారత్‌  తన అభీష్ఠానికీ, ఆదేశాలకూ విరుద్ధంగా చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ భారత్ పై టాక్స్ వార్.. సుంకాల యుద్ధానికి దిగారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది.   భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు పెట్టేలా మారాయి. రష్యా, చైనాలతో భారత దోస్తీ గట్టిపడింది.     పుతిన్‌ భారత పర్యటనలో భాగంగా  కుదిరే అవకాశం ఉన్న ఒప్పందాల కారణంగా అమెరికా మరిన్ని ఆర్థిక చిక్కుల్లో పడే అవాకశం ఉంది.   ట్రంప్‌ రష్యా చమురు దిగుమతిని ఆపమని భారత్ ను ఆదేశిస్తే.. అది కొనసాగిస్తూనే ఇప్పుడు తాజాగా రష్యాతో  ఆయుధ కొనుగోళ్లఒప్పందానికి రెడీ అయ్యింది.   ఇది కచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా మళ్లీ సుంకాలతో, విసాలపై మరిన్ని కఠిన ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాటిని లెక్కచేయడానికీ, అమెరికా హెచ్చరికలు, ఆంక్షలకుభయపడే పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడో బయటపడింది. ఇదంతా మోడీ దౌత్య  విధానాల కారణంగానే సాధ్యమైందన్నది అంతర్జాతీయ సమాజం చెబుతున్నమాట.  మొత్తంగా ట్రంప్ అరాచక, అహేతుక విధానాలనుంచి భారత్ ను బయటపడేయడమే కాకుండా.. ఏక ధృవ ప్రపంచం అన్న భ్రాంతి నుంచి ట్రంప్ బయటపడక తప్పని పరిస్థితిని క్రియోట్ చేసే దిశగా ప్రధాని మోడీ దౌత్యపరంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దేవతలారా దీవించండి!

ఈ మధ్య కాలంలో   దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో   చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.  బేసిగ్గా రేవంత్ రెడ్డికి ఆంజనేయస్వామివారంటే చాలాచాలా భక్తి. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఒక పురాతన ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజ చేసి మరీ తన నామినేషన్  వేయడం ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఆచారం.  ఇప్పటికీ ఆ సెంటిమెంటు కొనసాగుతూనే ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి పొరబాటున వివిధ విభాగాల అధిదేవతలైన హిందూ దేవతలకూ, కాంగ్రెస్ లోని మల్టిపుల్ లీడర్షిప్ కి  పోలిక తెస్తూ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మచారులకు, పెళ్లయిన వారికి, ఇద్దరు భార్యలు కలవారికీ.. ఇలా హిందూ సంప్రదాయంలో  దేవుళ్లు ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. ముఖ్యంగా హిందూ వాదులు బీజేపీ లీడర్లు రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇలా ఈ ఒక్క అంశం మాత్రమే కాదు పలు అంశాల్లో  కాషాయవాదులు, కమలనాథులు  పెద్ద ఎత్తున తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు తెలియ చేస్తున్నారు. ఇంతకు ముందు శివజ్యోతి అనే  యాంకర్ వెంకన్న సన్నిథిలో తాము రిచ్చెస్ట్ బిచ్చగాళ్లమంటూ చేసిన వ్యాఖ్యలతో భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారామె. ఇక ఒక స్వామి మాల వేసిన ఎస్సై వివాదం సంగతి సరే సరి. ఈ విషయంపై బీజేవైఎం నాయకులు ఏకంగా డీజీపీ ఆఫీసునే ముట్టడించి నానా యాగీ చేశారు. డిపార్టుమెంటుగానీ ఆయనకిచ్చిన మెమో వెనక్కు తీస్కోకుంటే మా తడాఖా చూస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు.  అలాగే దర్శక ధీరుడు రాజమౌళి  తనకు దేవుడిపై నమ్మకాలు లేవని అనడం కూడా పెద్ద రాద్ధాంతమై  కూర్చుకుంది. మాధవీ లత, చికోటి ప్రవీణ్ తో సహా అందరూ రాజమౌళిపై విరుచుకుపడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళిపై విరుచుకు పడ్డ వారి లిస్టు కొండవీటి చాంతాడంత. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ దేవీ దేవతలకు మరీ ఇంత సెక్యూరిటీయా? ఈగ వాలనీయడం లేదెవరూ? అనిపించకమానదు. సీఎం రేవంత్  హిందూ. గతంలో ఆయన ఏబీవీపీ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియని వారు కాదు. అలాంటి రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి సీఎం అయ్యారని చెప్పి ఆయనేమీ హిందూ కాకుండా పోరు. ఒక ఇన్ స్పిరేషన్ కోసం పోలిక తెచ్చి జనానికి అవగాహన పెంచడానికి అన్నమాటలను పట్టుకుని దానిని వివాదాస్పదం చేయడం ఎంత వరకూ సమంజసం అని పరిశీలకులు అంటున్నారు.  అదే విధంగా దేవుడిపై నమ్మకం ఉండటం, ఉండకపోవడం అన్నది ఎవరికి వారికి వ్యక్తిగత విషయం. దూషణ లేనంత వరకూ అటువంటి విషయాలను వివాదం చేయడం తగదంటున్నారు. ఇలా వివాదాలు సృష్టిస్తున్నవారు హేతు వాదాన్ని, హేతువాదులనూ బతకనిచ్చేలా లేరన్న మాట కూడా వినిపిస్తుంది. తెలుగువారు గర్వించదగ్గ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాలలో తనకు దేవుడిపై భక్తి లేదని ప్రకటించారు. అటువంటి ఆయన అద్భుతమైన భక్తిరస చిత్రాలలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు. అందుకే రేవంత్ కానీ, రాజమౌళి కానీ చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం సమజసం కాదంటున్నారు పరిశీలకులు. 

పవన్ పై కాంగ్రెస్ విమర్శల దాడి.. ఏ ప్రయోజనం కోసం?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇందుకు కారణం కోనసీమలో కొబ్బరి దిగుబడి తగ్గిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనం సీరియస్ గా తీసుకోలేదు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ఆ విమర్శల తీవ్రత గత రెండు రోజులుగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ సినిమాలను తెలంగాణ థియోటర్లలో ఆడనివ్వం అంటూ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు పరిశీలకులు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఏమిటంటే.. కాంగ్రెస్ ఇప్పుడు, ఈ సమయంలో ఈ స్థాయి విమర్శలకు దిగడం పూర్తిగా నిరర్ధకం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ కానీ, ఆయన జనసేన పార్టీ కానీ పూర్తిగా ఇర్రెలవెంట్. అయితే ఈ విమర్శల వల్ల తెలంగాణలో ఏమైనా జరగడమంటూ జరిగితే.. అది తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి రావడమే. అలా తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తే కాంగ్రెస్ కు రాజకీయంగా ఇసుమంతైనా ఉపయోగం ఉండదు. ఆ సెంటిమెంట్  వల్ల ప్రయోజనం అంటూ ఉంటే.. అది బీఆర్ఎస్ కు మాత్రమే. అంటే కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల వల్ల బీఆర్ఎస్ మాత్రమే లబ్ధిపొందుతుంది. ఆ పని కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నదంటూ రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు.  అన్నిటికీ మించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతోంది. అలాగే తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఓ వైపు ఇంత సందడి, హడావుడీ పెట్టుకుని కూడా కాంగ్రెస్ నేతలూ, మంత్రులూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిచడం, ఆయనపై విమర్శలు గుప్పించడం వినా తమకు వేరే పనేంలేదనేలా చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కాంగ్రెస్ పొలిటికల్ స్టాండర్డ్స్ పై అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదపడుతున్నాయి.   మీడియా పెద్దగా పట్టిచుకోవడం మానేసిన నేతలు, మంత్రులే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, కనీసం ఆ రకంగానైనా మీడియా దృష్టిలో పడి ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీకి డుమ్మా.. పార్లమెంటుకు హాజరు.. జగన్ ద్వంద్వ నీతి

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కాదు కాదు దిశా నిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడానికి బోలెడంత అవకాశం ఉన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి పార్లమెంటులో ఎంపీలను నోరెత్తి ప్రశ్నించాలని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ ప్రారంభమైంది. కేవలం తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఉన్న అవకాశాలను తోసిపుచ్చి, తానే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేల చేత సైతం శాసనసభను భహిష్కరింప చేస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలంటూ ఎలా చెప్పగలరని పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పోషిస్తున్న పాత్ర గురించి ఆ పార్టీ నేతలకు సైతం ఎలాంటి క్లారిటీ లేదని భావించాల్సి వస్తున్నదని విశ్లేషిస్తున్నారు.   2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు,   కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.   ప్రజలివ్వని హోదా కోసం మంకు పట్టు పడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత జగన్ తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు.   తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేశామని చెబుతున్న వైసీపీ అధినేత జగన్..   ప్రజా సమస్యల పై గళమెత్తడానికి అసెంబ్లీకే వెళ్లాలా? అన్న వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ప్రెస్ మీట్లలోనే ప్రభుత్వ విధానాలను ఎండగడతానంటున్నారు.  మరి ఇప్పుడు  పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర హక్కులు, సమస్యలపై గళమెత్తాలని  ఎంపీలను ఎలా ఆదేశిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర, హక్కులు, సమస్యలపై గళమెత్తడానికి అసెంబ్లీ కంటే, పార్లమెంటు ఎలా మెరుగైన వేదిక అవుతుందో జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టరు కానీ, ఆయన అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్ కు ఆయన పార్టీకీ రాష్ట్ర సమస్యలు పట్టవా? అని నిలదీస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను దుయ్యబడుతున్నారు. గత ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా, తమకు 40శాతం ఓట్లు వచ్చాయంటున్న జగన్.. మరి వైసీపీకి ఓటు వేసిన 40శాతం మంది ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ విధానాలను నిలదీయాల్సి ఉంది కదా? ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా పోరాడాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ ఏం జవాబు చెబుతారో చూడాల్సింది. 

‘వేలం’ వెర్రి తలలు!?

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లను ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుకు తీస్కెళ్లిన అభ్య‌ర్ధి ఇర‌వై వేల రూపాయ‌ల‌ను ఇంటికి తెచ్చారంటే నమ్మశక్యంగా లేదు కదూ!  కానీ అది నిజం. లాలాగే..   ఓ అభ్య‌ర్ధి    ఎన్నార్సీ కేసుల‌పైన పోరాటం చేసి జైలుకు వెడితే.. ఆయ‌న త‌రఫున ఆయన భార్య‌, త‌ల్లి ఎలాంటి  ఖ‌ర్చు లేకుండా  ప్ర‌చారం  చేశారు. ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించారు.   ఇక ఇటీవల ఇటీవల బీహార్ ఎన్నిక‌ల్లో అలీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం  నుంచి గాయిని మైథిలీ ఠాగూర్ విజయం  కూడా దాదాపు ఇలాంటిదే.   ఉత్త‌రాదిలో ఎన్నిక‌లంటే ఎమంత ఆస‌క్తిక‌రం కాదు. ఆపై అదేమంత కాస్ట్లీ  ఇష్యూ కూడా కాదు. ఖ‌ర్చు అస‌లే  ఉండ‌ద‌ని అంటాయి అక్కడి వారు.  అయితే దక్షిణాదిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి పరిస్థితులు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి  కూడా భారీ ఎత్తున  ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక  పంచయతీలో  స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.  ఔను  మహబూబ్​నగర్​ జిల్లా, హన్వాడ మండలం, టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం  కోటి వెచ్చిస్తానని ఒక వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.  కోటి రూపాయ‌ల‌కు స‌ర్పంచ్ ప‌ద‌వి అంటూ సోష‌ల్ మీడియాలో ఈ ఊరి  పేరు తెగ  మార్మోగిపోయింది.  అయితే వాస్తవమేంటంటే.. ఎన్నిక‌ల్లో వృధా ఖ‌ర్చు పెట్ట‌డం బ‌దులు ఊళ్లోని ఆంజేయస్వామి వారి ఆల‌యాన్ని  ఎవ‌రైతే పూర్తి చేస్తారో వారినే గ్రామ  స‌ర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.  ఆ ఒక్క ఆల‌యానికే సుమారు 60, డెబ్బై ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు అవుతుంద‌ని తేలడంతో.. ఆల‌య ఖ‌ర్చుల‌తో పాటు ఊరిలోని ఇత‌ర‌త్రా ప‌నుల లెక్క కూడా వేసి కోటి రూపాయ‌ల ని తేల్చారు.  అది పక్కన పెడితే సర్పంచ్ పదవుల వేలం తెలంగాణలో ఒక వెర్రిలా మారిపోయింది.  జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్​ ఆర్గనైజర్​  రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్​దొడ్డిలో రూ.57 లక్షలకు,  లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.  ఇంకా  గద్వాల మండలం, కొండపల్లిలో రూ.60 లక్షలకు నల్లదేవునిపల్లిలో.. రూ.45 లక్షలకు వేలం పాట ద్వారా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.  అదే విధంగా మల్దకల్​ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవి వేలంలో  రూ.42 లక్షలు పలికిందంటున్నారు. వీరాపురంలో రూ.50 లక్షలు,   ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, జోగ్గూడెం రూ.20 లక్షలకు సర్పంచ్ పదవులను వేలంపాటలో దక్కించుకున్నారు.  పదవుల మోజే ఈ ‘వేలం వెర్రి’కి కారణమంటున్నారు. అంత వరకూ కష్టపడి సంపాదించుకున్నది మొత్తం ధారపోసి మరీ పదవులు దక్కించుకోవడానికి పడుతున్న పోటీ విస్మయం గొలపక మనదు. వాస్తవంగా చూస్తే సర్పంచ్ పదవి పెద్ద పవర్ ఉన్న పదవి కూడా కాదు. అయితే దాని కోసం ఇంత హంగామా, తాపత్రేయం, పోటీ ఎందుకు అని ప్రశ్నించే వారూ ఉన్నారు.   స‌ర్పంచ్ ప‌ద‌వుల విష‌యంలోనే  ఇంత వేలం వెర్రి ఉంటే.. ఇక కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులకు ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుందోఅన్న చర్చ జరుగుతోంది.  ఈ వేలం ‘వెర్రి’ చూస్తుంటే రాజకీయాలు అవినీతి మయంగా మారడానికి కారణమేమిటో ఇట్టే అవగతమౌతుందంటున్నారు పరిశీలకులు.  

కాళేశ్వరంతో కాంట్రాక్టర్లే బాగుపడ్డారు.. కవిత నోట కాంగ్రెస్ మాట

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తన విమర్శల స్వరం పెంచింది. ఇప్పటి వరకూ కేవలం హరీష్ రావు, సంతోష్ లన టార్గెట్ చేసుకుంటూ తన విమర్శల వాణి వినిపించిన కవిత.. ఇప్పుడు తండ్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపైనా తన విమర్శలను సంధించారు. నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు. ఇప్పటి వరకూ కాళేశ్వరం నిరుపయోగం అనీ, అవినీతి సొమ్మలు వెనకేయడానికి మాత్రమే బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టు చేపట్టి అంచనాలు పెంచుకుంటూ పోయి సొమ్ములు దండుకుందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే వాణి, అదే బాణితో తన విమర్శలకు పదును పెట్టారు.   తాజాగా శుక్రవారం కామారెడ్డిలో మాట్లాడిన కవిత కాళేశ్వరంతో కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడలకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టర్లు బాగుపడటానికే తప్ప రైతులకు, రాష్ట్ర వ్యవసాయానికీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టేశారు.    కాళేశ్వరం ప్రాజెక్టు కంటే జ‌మానాలో క‌ట్టించిన నిజాం సాగ‌రే ఎంతో నయమన్నారు. అయితే ఇప్పుడు అది మట్టి కూరుకుకోయి ఉందనీ, దానిని పూడిక తీయించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.  గ‌తంలో నిజాంసాగ‌ర్ ప‌ర్యాట‌కంగానూ ఎంతోబాగుండేద‌ని ఆ దిశగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తానిప్పుడు కాళేశ్వ‌రంపై చేసిన ఈ వ్యాఖ్యలపై ఇక బీఆర్ఎస్ నేతలు  నోరేసుకుని ప‌డిపోతార‌న్న కవిత.. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పంచ్ డైలాగ్ తో చురక వేశారు.  ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలకూ, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన కవిత కాంగ్రెస్ రంగుల చీరకట్టడానికీ ముడి పెడుతూ పరిశీలకులు విశ్లేషణలకు పని చేప్పారు. ఆమె కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారనడానికి కవిత తాజా వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు.  కాళేశ్వరంపై కాంగ్రెస్  విమర్శలనే బాజాప్తుగా తాజాగా కవిత కూడా చేశారు.   ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిని కవిత తన వ్యాఖ్యలతో కల్పిస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇక కవిత విమర్శలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్, హరీష్, కేసీఆర్ లను నిలదీస్తే పరిపోతుందంటున్నారు.  పరిస్థితి చూస్తుంటే.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరడానికి అట్టే సమయంపట్టేలా లేదని కూడా చెబుతున్నారు.  

లోకం మెచ్చిన లోకేష్.. పెంపకం అంటే ఇదీ!

లోకేష్ ఎంత సంస్కార వంతుడో,  వ్యక్తిత్వ ఔన్నత్యం ఎంతటిదో ఇటీవలి కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.  విద్యా మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖను సుసంపన్నం చేస్తూ వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తిని, అనుకర్తినీ పెంచుతూనే.. తల్లిదండ్రులు తనకు నేర్పిన   స‌భ్య‌త సంస్కారాల‌ు మరింత ఇనుమడింప చేసే లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  అపకారికి ఉపకారం అన్నట్లుగా.. లోకేష్ జ‌గ‌న్ వంటి ప్ర‌త్య‌ర్ధుల ప‌ట్ల కూడా స‌హృద‌య‌త చాటుకుంటుంటూ జనం మన్ననలు పొందుతున్నారు. దీంతో లోకేష్ ద లీడ‌ర్ ఆఫ్ మాసెస్ గా జనహృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటున్నారు.  బేసిగ్గా లోకేష్   త‌ల్లిచాటు బిడ్డ‌గా  ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా  చాలా  చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు  భువ‌నేశ్వ‌రి  అని చెప్ప‌డానికి  ఎన్నో నిద‌ర్శ‌నాలు. ఆయ‌న ఇటీవ‌ల చేస్తున్న మంచి ప‌నులు  అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయ్. త‌న పెద్ద‌మ్మ పురంధేశ్వ‌రి  కాళ్ల‌కు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యానికి తెలుగు త‌మ్ముళ్లు పులకించి పోయారు. అలాగే  ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వ‌ర‌రావు కు ఇటీవల లోకేష్ పాదాభివంద‌నం చేయ‌డం కూడా ప్రజలను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఆపై పిల్ల‌ల్ని ఫ్లైట్ లో ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లిన ఘ‌న‌త లోకేష్ దే. ఇటీవ‌ల రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా  ఏపీలో విద్యార్ధుల‌తో జ‌రిగిన మాక్ అసెంబ్లీపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక విద్యా మంత్రిగా  లోకేష్ ఈ ప్రతిపాదనను అసెంబ్లీలో నే చేసి అనుమతి పొందారు. ఇక విద్యార్థులతో అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 45 వేల స్కూళ్ల  నుంచి మెరిక‌ల్లాంటి  విద్యార్ధుల‌ను ఎంపిక చేసి వారి ద్వారా జూనియ‌ర్స్ అసెంబ్లీని  అత్యద్భుతంగా నిర్వహించి భళా అనిపించింది.  ఈ విష‌యంలోనూ లోకేష్ కి మంచి మార్కులు ప‌డ్డాయి. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా  తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టు ఒకరు   అత్యుత్సాహం కొద్దీ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కోసం బాబు, లోకేష్‌, ప‌వ‌న్ కాళ్ల వేళ్లా  ప‌డి బ‌తిమిలాడుతున్నట్లుగా ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.  అయితే ఆ వీడియోను వెంటనే తీసేయాలనీ,  జ‌గ‌న్ మ‌న‌కు ఎంత  ప్ర‌త్య‌ర్ధి అయినా స‌రే వ్య‌క్తిగ‌తంగా   కించ ప‌రచడం సరికాదనీ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు హితవు చెప్పారు.  దీంతో  ఇంతటి సంస్కారం, ఔన్నత్యం, ఉదాత్త గుణాలను పెంపొందేలా లోకేష్ పేరెంట్స్ ఆయనను పెంచిన విధానం ఎంత గొప్పదో కదా అంటూ పలువురు చంద్రబాబు, భువనేశ్వరిలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.  గ‌తంలో బాబు కూడా.. జగన్ కు అర్హత లేకపోకయినా అసెంబ్లీలోకి నేరుగా కారులో రావడానికి అనుమతి ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   వైసీపీకి చెందిన వంశీ, కొడాలి వంటి నేతలు అసెంబ్లీలో లోకేష్ త‌ల్లి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ క‌నీసం ఖండించలేదు సరికదా..  మ‌రింత నవ్వుతూ , వారిని మరింత ప్రోత్సహించి, రెచ్చ‌గొట్టే ధోర‌ణితో వ్యవహరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లోకేష్ కీ జ‌గ‌న్ కీ  ఇంత తేడా ఉండటానికి వారి వారి పెంపకాలలో ఉన్న తేడాయే కారణమని పరిశీలకులు సోదాహ రణంగా విశ్లేషిస్తున్నారు.  

హేతురహిత వ్యాఖ్యలతో పిచ్చెక్కిస్తున్న పవన్ కల్యాణ్?!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయి. హేతు రహితంగా  చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు.  మొన్నా మ‌ధ్య ఎర్ర‌చంద‌నం చెట్ల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు వివాదానికి సైతం తావిచ్చాయి.  ఎర్ర‌చంద‌నం  చెట్ల‌కూ వెంక‌టేశ్వ‌ర‌స్వామికి అయిన గాయానికీ సంబంధం లేదు. వెంక‌న్న ర‌క్తంతో త‌డవ‌డం వ‌ల్లనే  ఎర్ర‌చంద‌నం చెట్ల‌కు ఆ ఎర్ర‌ద‌నం వచ్చిందన్నట్లుగా చేసిన ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ శాస్త్రీయ కరాణాలను వివరించారు కొందరు హేతువాదులు. ఇక తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.    ఉప ముఖ్య‌మంత్రి  స్థానంలో ఉండి  హేతురహితంగా ఆయన వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మాట జనసైనికుల నుంచే వస్తున్నది. పవన్ కల్యాణ్ ఇటువంటి కామెంట్లు చేయడమేంటన్న విస్మయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజా మన్ననలు అందుకునేలా వ్యవహరిస్తున్న ఆయన.. ఎర్రచందనానికి వేంకటేశ్వరస్వామి గాయానికీ ముడిపెట్టడం.. అలాగే కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి పొరుగురాష్ట్రం దిష్టి తగలడమే కారణమని అర్ధం వచ్చేలా మాట్లాడటం ఆయన స్థాయికి తగినట్లుగా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  

కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం క‌విత‌క్క‌?

కల్వకుంట్ల క‌విత వ‌ల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎంత చేటు వ‌చ్చిందంటే.. ఆమె ఎక్క‌డ పర్యటిస్తే.. అక్కడి కారు పార్టీ లీడ‌ర్ల‌కు గుండె దడ పెరిగిపోతోంది. మొన్న వ‌న‌ప‌ర్తికి వెళ్లిన కవిత అక్కడ,  నిరంజ‌న్ రెడ్డిని ఉతికి ఆరేశారు. వీరిద్ద‌రి మ‌ధ్యకు వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ద‌మ్ముంటే కేటీఆర్, నిరంజ‌న్ రెడ్డి.. క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. అన‌వ‌స‌రంగా లేని పోని గొడ‌వ‌ల‌కు క‌విత తావిస్తున్నారంటూ..  ఏం చేయాలో పాలు పోక త‌ల ప‌ట్టుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. క‌విత తాను చేసిన యాత్ర‌ల‌కు సంబంధించిన  ఏర్పాట్లు చేసుకోవాల్సింది  పోయి.. ఇర‌వై నాలుగ్గంట‌లూ బీఆర్ఎస్  లీడ‌ర్ల‌ను ఆడిపోసుకోవ‌డం, వారి అవినీతి బాగోతాలు బ‌య‌ట  పెడ‌తాన‌ని హెచ్చరించడమేంటి?   కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.   క‌విత ప్ర‌ధాన‌మైన ల‌క్ష్యం   బీఆర్ఎస్ లో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటోన్న వారి బారి నుంచి తన తండ్రి కేసీఆర్ ని ఎలాగైనా  త‌ప్పించాల‌న్నది కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో అవినీతిపరులకు హ‌రీష్ రావు అండ‌దండ‌లున్నాయ‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ, త‌న తండ్రి కేసీఆర్ కి ఇందులో ఎంత మాత్రం సంబంధం లేద‌ని నిరూపించాల‌ని కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇక్క‌డే ప్ర‌కాశ్ వంటి మాజీ నేత‌లు.. క‌విత చేస్తోన్న ఈ వింత ప్ర‌యోగం బెడిసికొడుతోంద‌ని అంటున్నారు. ఎందుకంటే హ‌రీష్, కేసీఆర్ ఇద్దరూ వేరు వేరు కాదు. పైపెచ్చు పార్టీలో కృష్ణార్జ‌నులుగా గుర్తింపు పొందారు. ఇద్ద‌రూ ఒక్క తాను ముక్క‌లే. హ‌రీష్ చేసే ప‌ని ఏదైనా స‌రే కేసీఆర్ కి తెలిసే జ‌రుగుతుంది. ఒక వేళ హ‌రీష్‌ ఏదైనా తెలియ‌క చేసినా కూడా అదంతా కూడా కేసీఆర్ కే త‌గిలి తీరుతుంది. ఈ విష‌యం కవితకు  తెలియంది కాదంటారు వీరు.  కాళేశ్వ‌రం విష‌యంలో క‌విత చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ హ‌రీష్ రావు మీద‌. ఈ ప్రాజెక్టు విష‌యంలో జ‌రిగిన అవినీతి మొత్తం హ‌రీష్ రావు ప‌నేనంటారామె. అయితే కేసీఆర్ కి తెలీకుండా ఇదంతా జ‌రుగుతుందా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. ఇది స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కేసీఆర్ కి తెలీకుండా హ‌రీష్ అలాంటి ప‌నులు చేయ‌గ‌ల‌రా? అంటూ నేష‌న‌ల్ మీడియా సైతం ప్ర‌శ్నిస్తోంది. ఇప్పుడీ విష‌యంలో క‌విత‌కు కూడా కౌంట‌ర్లు భారీగానే ప‌డుతున్నాయ్. ఆయా ప్రాంతాల‌కు క‌విత వ‌చ్చి నిరంజ‌న్ రెడ్డి వంటి వారి అవినీతిని  బ‌ట్ట‌బ‌య‌లు చేస్తుంటే.. వారు కూడా   రివ‌ర్స్ లో ఆమెకు కౌంట‌ర్లు వేస్తున్నారు. ఆమె ఇర‌వై ల‌క్ష‌ల వాచీ, ఆపై బంజారాహిల్స్ లో విలాస‌వంత‌మైన బంగ‌ళాల గురించి లేవనెత్తుతున్నారు.   ఇక ఢిల్లీ లిక్క‌ర్ క్వీన్ గా క‌విత తెచ్చిన చెడ్డ పేరే పార్టీని నిలువునా ముంచింద‌నీ తీవ్ర స్థాయిలో  విరుచుకుప‌డుతున్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్ర‌ధాన  ప్ర‌తిప‌క్ష‌మో కాదో అటుంచితే, బీఆర్ఎస్ కి మాత్రం క‌విత రూపంలో అతి పెద్ద ప్ర‌తిప‌క్షం త‌యారైందనడంలో సందేహం లేదు. దీంతో  ఇప్పుడు కారు పార్టీ లీడ‌ర్ల చూపు క‌విత‌పైకి మ‌ళ్లింది. వీళ్లూ వీళ్లూ కొట్టాడుకుంటుంటే కాంగ్రెస్ చేష్ట‌లుడిగి  చోద్యం చూస్తోంది. ఇది టాపిక్ డైవ‌ర్ష‌నా? లేక క‌విత మార్క్ పాలిటిక్సా,   లేదంటే..  కేసీఆర్ ఆడిస్తోన్న వింత  నాట‌కమా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

క‌విత అస‌లు వ్యూహం అదేనా?

ఇంటిగుట్టు వ్యాధి ర‌ట్టు అంటారు.  తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత  బీఆర్ఎస్ ఇంటి  పార్టీ  గుట్టు మొత్తం బ‌య‌ట  పెట్టేస్తూ.. ఆ పార్టీ ప్ర‌త్య‌ర్ధుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా  చేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌దీశ్ రెడ్డితో క‌య్యానికి కాలుదువ్విన క‌విత తాజాగా నిరంజ‌న్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.   అయితే ఆమె ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కారణాలేంటి? వ్యూహంమేంటి? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. క మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు టార్గెట్ గా చేస్తున్న కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలపై హరీష్ రావు పెద్దగా స్పందించకున్నా.. కవిత విమర్శలకు కౌంటర్ ఇస్తున్న  జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి రెండవ శ్రేణి నాయకులపై కూడా ఆమె  విరుచుకుపడుతున్నారు. దీనిని బట్టి చూస్తుంటే.. హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.   ఇంత‌కీ మాజీ మంత్రి  నిరంజ‌న్ రెడ్డి ఏమ‌న్నారో చూస్తే.. కవితకు స‌భ్య‌త సంస్కారాలు లేవ‌ని కామెంట్ చేశారాయ‌న‌. ఎవ‌రి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారంటూ ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు వాస్తవమైతే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు.  నిరంజన్ రెడ్డిపై కవిత ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి ఇదీ కారణమంటున్నారు పరిశీలకులు.   అంగ‌డి స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన  నిరంజ‌న్ మూడు ఫామ్ హౌస్ ల‌ను క‌ట్టుకున్నారనీ,  ఆయ‌న అవినీతిని హ‌రీష్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చారనీ, ఈ వ్యవహారాన్నంతా మీడియా ద్వారా పెద్ద సార్ దృష్టికి తీసుకెడతానని హెచ్చరించారు కవిత. ఇదంతా చూస్తుంటే.. కవిత వ్యూహాత్మకంగానే నిరంజన్ రెడ్డిపై విమర్శల దాడికి దిగినట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.  ఇప్ప‌టి వ‌ర‌కూ  వీరంద‌రూ అవినీతి చేస్తున్నా.. పెద్ద సారు కేసీఆర్ కి తెలీకుండా హరీష్  అడ్డుగోడ‌లా నిలిచాడ‌నీ.. వీరి మ‌ధ్య ఉన్న అవినీతి ఐక్యతా రాగం హ‌రీష్ కి త‌ప్ప  కేసీఆర్ కి తెలీద‌న్న‌ట్టుగా  మాట్లాడుతున్నారు. దీని ద్వారా తెలుస్తున్న దేంటంటే కేసీఆర్ కి తెలీకుండా వీరంతా అవినీతి చేశారు కాబ‌ట్టి  ఒక దెబ్బతో హరీష్ ను పార్టీకి దూరం చేయడం, కేసీఆర్ ను  పులుక‌డిగిన ముత్యంగా ఎస్టాబ్లిష్ చేయ‌డం కవిత వ్యూహం అంటున్నారు. 

ఫార్ములా ఈ రేస్ తో పాటు.. కాళేశ్వ‌రం కేసులోనూ కదలిక?

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్, బీజేపీలపై గుప్పించిన ఆరోపణల్లో ప్రధానమైంది ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించడం లేదన్నదే. దానితో పాటు కాళేశ్వరం అక్రమాల కేసును సీబీఐకి అప్పగించినా ఫలితంల లేకపోయిందని కూడా రేవంత్ ఆరోపణలకు గుప్పించారు. ఈ విధంగా రేవంత్  బీజేపీ బీఆర్ఎస్ నేతలకు అండగా నిలుస్తోందన్న విమర్శలు చేశారు.  అయితే ఇప్పుడు గవర్నర్  కేసీఆర్ ప్రాసిక్యేషన్ కు అనుమతి ఇవ్వడంతో.. కాళేశ్వరం కేసు విషయంలో కూడా కదలిక వస్తుందా అన్న చర్చకు తెరలేచింది.    ఈ కార్ రేస్ వ్య‌వ‌హారంలో అవినీతి జ‌రిగిందని దర్యాప్తులో తెలిందని అధికారులు చెబుతుంటే.. కేటీఆర్ మాత్రం ఇది ఒక లొట్టపీసు కేసు అంటే కొట్టిపారేశారు.  ఇక ఇప్పుడు విషయమేంటంటే.. విచారణలో కూడా కేటీఆర్ ఇదే చెబుతారా? ఆ విషయం పక్కన పెడితే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు.  ఇప్ప‌టికే వ‌రుస  ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.  కేటీఆర్  లొట్ట‌పీసు కేసుగా కొట్టిపారేస్తున్న ఫార్ములా ఈకార్ కేసులోనే కదలిక ప్రారంభమైందంటే..  కాళేశ్వ‌రం  కేసు ప‌రిస్థితి ఏంటి? దీనిపైనా సీబీఐ ఎంక్వ‌యిరీ మొద‌ల‌వుతుందా?  అంటూ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంలో సాధార‌ణ ఈఈలే అందిన కాడికి దోచుకుని వంద‌ల వేల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన విధం క‌ళ్ల‌కు క‌ట్టింది. వీరు ఏసీబీ వ‌ల‌లో చిక్కిన అతి పెద్ద తిమింగ‌ళాలుగా వార్త‌ల‌కెక్కారు. ఇప్పుడు సీబీఐ ఎంక్వ‌యిరీ మొద‌లైతే.. ఆ తిమింగ‌ళాల‌కే గాడ్ ఫాద‌ర్లు ఎంత తిన్నార‌న్న విష‌యాలు కూడా వెలుగులోకి వ‌స్తాయంటున్నారు.  గ‌తంలో క‌విత‌ను అరెస్టు చేయ‌కుంటే బీజేపీని తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అన్న కోణంలో కొండా విశ్వేశ్వ‌రెడ్డి చేసిన‌ కామెంట్లు.. త‌ర్వాతి కాలంలో ఫ‌లితాల రూపంలో రుజువ‌య్యాయి. అప్పటి వరకూ రెండో స్థానంలో ఉన్న బీజేపీ కాస్తా.. మూడో స్థానానికి ప‌డి పోయింది. నాటి అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈ విష‌యం  కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఇక ఇప్పడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారంలో రేవంత్ కూడా  కేంద్రంలోని  క‌మ‌లం  పార్టీకి బీఆర్ఎస్ కి బీటీమ్ అంటూ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడంతో.. కమలనాథులలో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే  జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కేటీఆర్ విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించింద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక కాళేశ్వరం దర్యాప్తును సీబీఐ చేపట్టేందుకు కూడా ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని చెబతున్నారు. 

హిడ్మా ఏపీకి ఎలా వచ్చాడు?.. ఎలా చిక్కాడు?

హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత.. రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే. ఇన్నాళ్లూ దొరకని వ్యక్తి.. ఇప్పుడెలా దొరికాడు? దాదాపు 26 సార్లు భద్రతా దళాలపై దాడులు చేసినోడు.. ఒక్కసారి కూడా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నోడు.. ఇప్పుడెలా దొరికాడు? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వ్యూహకర్తగా ఉన్న హిడ్మా.. ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే.. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత.. మావోయిస్టులకు గడ్డుకాలం మొదలైంది. అడవిలో సీన్ మారింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఎంతోమంది మావోయిస్టులు.. ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. కానీ.. వాటన్నింటిలో హిడ్మా ఎన్‌కౌంటరే అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఎందుకంటే.. హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. అంతకుమించి.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్‌కి.. కమాండర్. సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. దేశంలో మావోయిజాన్ని రూపుమాపేందుకు.. భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ క్రమంలో.. వందల మంది పోలీసులు, కేంద్ర బలగాల ప్రాణాలు తీసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడన్న వార్త.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించినప్పటికీ.. ఒక్క హిడ్మా మరణమే ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. మావోయిస్ట్ పార్టీలో అతనికి ఉన్న ట్రాక్ రికార్డే. పార్టీలో అతని హోదా, హిడ్మా చేపట్టిన గెరిల్లా దాడులు, ఇన్నాళ్లూ భద్రతా బలగాలకు దొరకకుండా తప్పించుకున్న చరిత్రే.. హిడ్మాపై ఇంత చర్చ జరిగేలా చేస్తోంది. అయితే.. హిడ్మాని రౌండప్ చేయడానికి దారితీసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయ్. అతను భద్రతా దళాలకు చిక్కకుండా ఇన్నేళ్లూ తప్పించుకోగలిగాడంటే అందుకు ప్రధాన కారణం.. అతని చుట్టూ ఉన్న మూడంచెల భద్రతా వ్యవస్థే! స్థానిక గిరిజనుల సహకారం, అడవులపై అతనికి ఉన్న తిరుగులేని పట్టు, చుట్టూ ఉండే సెక్యూరిటీ రింగ్ వల్లే.. హిడ్మా ఇన్నాళ్లూ సేఫ్‌గా ఉన్నాడు. అయితే.. కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన వ్యూహాత్మక ఆపరేషన్ల కారణంగా.. హిడ్మా ట్రాప్‌లో పడ్డాడనే వాదన వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో.. భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయ్. దశాబ్దాలుగా మావోయిస్టులను పట్టుకోవడంలో ఎదురైన వైఫల్యాలను అధిగమించేందుకు.. భద్రతా బలగాలు లేటెస్ట్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాయి. డ్రోన్‌లు, శాటిలైట్ మ్యాపింగ్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కదలికలను నిరంతరం ట్రాక్ చేయగలిగారు. దాంతో.. హిడ్మా ఆపరేషనల్ పాయింట్ అయిన దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలు కష్టమయ్యాయి. అన్ని వైపుల నుంచి నిర్బంధం పెరగడంతో.. హిడ్మా తన భార్య మడకం రాజే సహా కీలక రక్షణ దళ సభ్యులతో కలిసి.. షెల్టర్ జోన్ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే.. హిడ్మా బృందం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లోకి ప్రవేశించింది. ఈ ప్రాంతం ఎప్పటి నుంచో మావోయిస్టులకు ఓ షెల్టర్‌జోన్‌గా ఉండేది. అలా.. ఈసారి కూడా ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకు, కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండేందుకు.. మారేడుమిల్లికి వచ్చినట్లు సమాచారం. అయితే.. హిడ్మా కదలికలపై ఏపీ ఇంటలిజెన్స్ బ్రాంచ్‌కి, తెలంగాణ ఇంటలిజెన్స్‌కి కచ్చితమైన సమాచారం అందింది. అలా హిడ్మా బృందం మారేడుమిల్లి అటవీప్రాంతంలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయ్. మావోయిస్టుల అంతర్గత సమాచారాన్ని ఛేదించడమే.. ఈ ఆపరేషన్‌కు కీలకంగా మారింది. హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే నిఘా సమాచారం అందిన వెంటనే.. ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, జిల్లా పోలీసు బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా ఆపరేషన్ ప్రారంభించాయ్. కూంబింగ్ మొదలుపెట్టి.. పక్కాగా ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆరున్నర నుంచి 7 గంటల మధ్య.. హిడ్మా బృందం అటవీప్రాంతంలో హిడ్మా బృందం భద్రతా బలగాలకు ఎదురుపడింది. దాదాపు అరగంట నుంచి గంట పాటు పోలీసులు, హిడ్మా దళం మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మా తన రక్షణ దళంతో పోరాడినా.. చివరికి పోలీసు బలగాల వ్యూహానికి చిక్కక తప్పలేదు. ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు అతని భార్య  సహా మొత్తం ఆరుగురు కీలక మావోయిస్టులు మరణించారు. వారంతా.. హిడ్మా రక్షణదళంలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే అనేక ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీకి.. హిడ్మా ఎన్‌కౌంటర్ కోలుకోలేని దెబ్బగా మారింది. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మావోయిస్టుల నివాసాల వివరాలు, సంప్రదింపుల కోడ్‌లు, ఆయుధాల డంప్‌ల గురించి తెలుసుకున్నారు. దాంతో.. నాలుగు రాష్ట్రాల్లో ఆయుధాల డంప్‌లని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. హిడ్మా మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగానే కాదు.. పీఎల్‌జీఏ బెటాలియన్ నెంబర్ వన్‌కి కమాండర్ కూడా. ఇది.. మావోయిస్ట్ పార్టీలో అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన దళం. హిడ్మా జరిపిన అనేక దాడుల్లో.. ఎంతోమంది పోలీసులు, భద్రతా దళాల సిబ్బంది మరణించారు. మావోయిస్ట్ అగ్రనేతల్లో ఎక్కువమంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు కాగా.. హిడ్మా బస్తర్ ప్రాంతం నుంచి కేంద్ర కమిటీకి ఎంపికైన.. ఏకైక గిరిజన నాయకుడు. ఇది.. అతని ప్రభావాన్ని, స్థానికంగా ఉన్న పట్టుని సూచిస్తుంది. హిడ్మా మరణం.. మావోయిస్ట్ పార్టీ సామర్థ్యం, అంతర్గత వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు. యువతని రిక్రూట్‌ చేయడంలోనూ, దండకారణ్యంలో దాడులను సమన్వయం చేయడంలో హిడ్మాకు తిరుగులేదు. అలాంటి వ్యక్తి ఎన్‌కౌంటర్.. మావోయిస్ట్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా, భద్రతా బలగాలకు చరిత్రాత్మకమైన విజయంగా విశ్లేషిస్తున్నారు.

క్యా సీన్ హై?

హైదరాబాద్ ప్రగతి, పురోగతిలో చంద్రబాబు ముద్ర చెరిపివేయలేనిదని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. అయితే రాజకీయ కారణాలతో ఆ విషయాన్ని బాహాటంగా చెప్పడానికి ఇష్టపడరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు దూరదృష్టితో చెప్పిన మాటలకు వక్రభాష్యం చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలన్న చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివన్నారు. ఆ మాటలకు వక్రభాష్యం చెప్పి చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ ప్రచారం చేశారు.  రాష్ట్ర విభజన తరువాత కూడా  అవసరమైన, అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సెంటిమెంటును బయటకు తీసి.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.  అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనమై రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకార భావన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.    అయితే.. ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు, విభజన సమస్యల పరిష్కారం విషయాలు పూర్తిగా కొలిక్కిరాకపోవడంతో తెలంగాణ వాదం ఒక సెంటిమెంటుగా ఇంకా సజీవంగా ఉంది. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికీ అవకాశం ఉన్నా లేకున్నా.. ఆంధ్రా బూచి అంటూ తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ మనుగడ కాపాడుకోవాలనీ, ఉనికి చాటుకోవాలనీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశంతో జట్టు కట్టేందుకు ఆ పార్టీలు ఒకింత జంకుతున్న పరిస్థితి ఉంది. చివరాఖరికి బీజేపీ కూడా తెలంగాణలో తెలుగుదేశంతో చెట్టాపట్టాలేసుకు తిరగడం సంగతి అటుంచి.. అలాంటి పరిస్థితి ఉందన్న భావన కూడా తెలంగాణ ప్రాంతంలో కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం అత్యంత కీలక భాగస్వామి. అయినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తెలుగుదేశంకు దూరం మెయిన్ టైన్ చేస్తున్నది. అందుకు తాజా ఉదాహరణే ఇటీవలి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తెలుగుదేశం మద్దతు కోరకపోవడమే.  ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో వేదిక పంచుకోవడం, ఆయనతో కలివిడిగా మాట్లాడటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ ముచ్చట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  రామోజీ రావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.  దీంతో చంద్రబాబు గతంలో చెప్పినట్లు రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలిసి ఉందా. కలిసి రెండు రాష్ట్రాలనూ అభివృద్ధి చేసుకుందాం అన్న మాటల ఇప్పుడు మరో సార బలంగా రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నాయి. ఆ దిశగా రెండు రాష్ట్రాలూ ముందుకు సాగుతాయన్న ఆశాభావాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలలో కలిగించాయి.  

కాంగ్రెస్ ఇక క‌నుమ‌రుగేనా?

అది కాంగ్రెస్ కాదు.. ఖాన్ గ్రెస్ అని  సంఘ్ ప‌రివార్ చేస్తున్న ప్ర‌చార‌ ప్ర‌భావ‌మో.. లేక  రాహుల్ చేత‌గాని త‌న‌మో, ఖ‌ర్గే శక్తికి  మించిన ప‌నిత‌న‌మో, మ‌రో మ‌న్మోహ‌న్ సింగ్ దొర‌క‌ని వైన‌మో.. తెలీదు కానీ ప్ర‌తి ఎన్నిక‌లోనూ కాంగ్రెస్ ఓటమి   ఎదుర్కొంటూనే  వ‌స్తోంది. తాజాగా బీహార్ లోనూ బొక్క బోర్లా  ప‌డింది కాంగ్రెస్ నాయ‌క‌త్వంలోని  మ‌హా ఘ‌ట్ బంధ‌న్. విచిత్ర‌మైన  విష‌య‌మేంటంటే  ఓట్ చోరీ అంటూ  పెద్ద ఎత్తున  ప్రెజంటేష‌న్లు ఇచ్చి, ఆపై పాద‌యాత్ర‌లు చేసి  అటు పిమ్మ‌ట  స‌ర్ అనే విధాన‌మే త‌ప్పుల  త‌డ‌క  అంటూ  టాంటాం చేస్తే  లాస్ట్ కి కాంగ్రెస్ సార‌ధ్యంలోని  మ‌హా ఘ‌ట్ బంధ‌న్ కే రాం  రాం చెప్పేశారు బీహారీ జనం. పైపెచ్చు త‌మ‌ను ఎప్ప‌టి నుంచో స‌జావుగా ప‌రిపాలిస్తున్న నితీష్ నాయ‌క‌త్వంలోని  ఎన్డీయే  కూట‌మికే జై కొట్టారు. ఇప్పుడు చూస్తే ద‌క్ష‌ణాదిలో తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో త‌ప్ప మ‌రెక్క‌డా  అజా  ప‌జా లేదు కాంగ్రెస్. ఊపూ  రూపు షేపు లేదు హ‌స్తం పార్టీకి. జ‌నానికి తాము హ్యాండిద్దామ‌ని చూస్తుంటే వాళ్లే రివ‌ర్స్ లో వ‌చ్చి హ్యాండ్ పార్టీ షేక‌య్యేలా చేస్తున్నారు. అలాంటి ఘోర ప‌రాజ‌యాలు త‌ర‌చూ ఎదుర‌వుతున్నాయి హ‌స్తం పార్టీకి. ఈ పార్టీ హ‌స్త‌రేఖ‌లు అంత‌గా తారుమారై పోయాయి. ఏ జ్యోతిష్కుడికి  చూపించి వీటిని స‌రి చేసుకోవాలో తెలీక తిక‌మ‌క ప‌డిపోతోంది కేడ‌ర్ మొత్తం.  ఇక్క‌డ తెలంగాణ‌లో ఉప  ఎన్నిక‌తో స‌హా విజ‌య దుందుభి  మోగించిన కాంగ్రెస్ అన్న వార్త విన‌డానికి కూడా మ‌న‌సు రావ‌డం లేదు.. రాహుల్ ప‌రిస్థితి అయోమ‌యం జ‌గ‌న్నాథంగా మారింది. ఇప్ప‌ట్లో ఆయన జాత‌కం పార్టీ భ‌విత‌వ్యం మారేలా  క‌నిపించడం లేదు. అంత‌గా డీలా ప‌డిపోతోంది పార్టీ మొత్తం. మాములుగా  ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డితే ఫ‌లితాలు వాటంత‌ట అవే  వ‌స్తూ ఉంటాయి. అదే రాహుల్ గాంధీ క‌ష్ట‌ప‌డితే రావాల్సిన  రిజ‌ల్ట్స్ కూడా రాకుండా వెన‌క్కు వెళ్లిపోతున్నాయ్. అంత ఘోరంగా రివ‌ర్స్ లో తిరుగుతోంది కాంగ్రెస్ అదృష్ట చ‌క్రం. మొన్న‌టి వ‌ర‌కూ రాజ‌స్థాన్, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఉన్న‌ట్టు క‌నిపించిన కాంగ్రెస్ ఇప్పుడు చూస్తే వాటిలోనూ  గుండు సున్నా చుట్టేసి.. ఉత్త‌రాదిలో దాదాపు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా పోయింది. శూన్య హ‌స్తం మిగిలింది. ఒంట‌రిగా  పోటీ చేస్తే గెటాన్ కాలేక పోతున్నాం.. క‌నీసం  కూట‌మి  క‌ట్టి విజ‌యాల‌ను సాధిస్తామ‌ని భావిస్తే అక్క‌డా జీరో బ్యాలెన్సే చూపిస్తోంది పార్టీలోని సీట్ అకౌంట్. దీంతో ఏం చేయాల్రా కాంగ్రెస్ భ‌గ‌వంతుడా అని త‌ల ప‌ట్టుకోవ‌ల్సి వ‌స్తోంది  రాహుల్ గాంధీ. ఒక‌ప్పుడు దేశంలోని రాష్ట్రాల‌న్నిటినీ హ‌స్త‌గ‌తం చేసుకున్న  కాంగ్రెస్ నేడు చూస్తే, ఆ చేతుల‌ను ఎవ‌రో తీసేసిన‌ట్టు దారుణ ప‌రాభ‌వాల‌ను మూట‌గ‌ట్టుకుంటూ వెళ్తోంది. పార్టీ ఫెయిల్యూర్స్ లోనే స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తూ వ‌స్తోంది. ఈ ప‌రాజ‌య  ప‌రంప‌ర  ఏ  తీరాల‌కు చేరేను? అన్న‌ట్టుగా  మారింది ప‌రిస్థితి. సమకాలీన రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమౌతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలనే తపనతో మెజారిటీ వర్గాలకు దూరమవుతోంది. ముస్లిం, మైనార్టీలకు అండగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తోంది. ఒకప్పుడు యూపీ, బీహార్ లో ఠాకూర్ లు , రాజపుత్రులు కాంగ్రెస్ కు అండగా ఉండేవారు. ఇప్పుడు వారంతా బీజేపీ గూటికి చేరారు. మధ్యప్రదేశ్ లో రాజవంశాలు అన్నీ కాంగ్రెస్ కు దూరమయ్యాయి. రాజకీయాల్లో రాణించడానికి వ్యూహాలు బలంగా ఉండాలి. నేల విడిచి సాముచేస్తే విజయాలు రావు. పార్టీ లో సీనియర్లు అంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. చివరకు పార్టీ కూడా కనుమరుగు అవుతుందా అన్నట్లుగా తయారైంది పరిస్థితి.ఫ్యూచ‌ర్లో క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లోనూ ప్ర‌భుత్వాలు క‌నుమ‌రుగైతే.. ఇక కాంగ్రెస్ జీరో స్టేజీకి చేరి క‌మ్యూనిస్టు పార్టీల స‌ర‌స‌న కూర్చోడానికి పెద్ద‌గా  టైం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. చివ‌రాఖ‌రికి రాహుల్ గాంధీకి  త‌మిళ‌నాడు ఒక్క‌టే దిక్కుగా  క‌నిపిస్తోంది. ఇక్క‌డ స్టాలిన్ పార్టీతో జ‌త‌గ‌ట్టి  అధికారంలోకి రావాల‌ని తెగ ఉబ‌లాట ప‌డుతోంది. కానీ విజ‌య్ పార్టీ ఎఫెక్ట్ ఎలా  ఉంటుందో తెలీడం  లేదు. దీంతో ఈ రాష్ట్రంపైనా ఆశ‌లు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఒక వేళ ఇక్క‌డ డీఎంకే గెలిచినా అది కాంగ్రెస్ కి అధికార  యోగాన్నిచ్చేదేం కాదు. దీంతో రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలోనికాంగ్రెస్  ప‌రిస్థితికి నానాటికీ తీసికట్టు సామెతగా మారుతోంది.