ఎండాకాలం వస్తే, సగ్గుబియ్యం కావాల్సిందే!

  మృద్ధిగా ఉంటాయి. వీటికి తోడు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఇనుము వంటి ఖనిజాలన్నీ కనిపిస్తాయి. ఇక కొద్దిపాటి పీచుపదార్థం కూడా కనిపిస్తుంది. కానీ కొవ్వు పదార్థాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తాయి.   జీర్ణం జీర్ణం: సగ్గుబియ్యంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా తేలికగా అరుగుతుంది. అందుకనే జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారిని సగ్గుబియ్యం జావని తాగమని చెబుతూ ఉంటారు. విరేచనాలు, పొట్ట ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ... ఇలా జీర్ణాశయానికి సంబంధించి ఎలాంటి సమస్యకైనా సగ్గుబియ్యం దవ్యౌషధంగా పనిచేస్తుంది. పేగులలో కదలికలు సవ్యంగా ఉండేలా చూస్తూ, అవి పొడిబారిపోకుండా కాపాడుతుంది.   తక్షణ శక్తి: నీరసంగా ఉండేవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు సగ్గుబియ్యపు జావ తాగితే శక్తిని పుంజుకుంటారు. వ్యాయామం చేసి అలసిపోయిన తరువాత కూడా సగ్గుబియ్యం తగినంత శక్తిని అందిస్తుంది. రోజులో ఎప్పుడైనా సరే... అల్పాహారం కింద సగ్గుబియ్యం జావని తాగవచ్చు. దీని వల్ల అలసట దూరం కావడమే కాకుండా, ఆకలి కూడా తీరినట్లవుతుంది. తక్కువ ఆహారంతో ఆకలి తీరడం వల్ల బరువు పెరగకుండా ఉంటాము!   ఆరోగ్యం అదుపులో: సగ్గుబియ్యంలో ఒంటికి కావల్సిన ఖనిజాలన్నీ ఉన్నాయి. రక్తపోటుని నియంత్రించడంలో, ఎముకలని దృఢంగా ఉంచడంలో, కండరాలకి శక్తిని అందించడంలో ఇవి ముందుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎలక్ట్రోలైట్స్‌గా చెప్పుకొనే ఖనిజాలన్నీ సగ్గుబియ్యంలో కనిపిస్తాయి.   అందానికి మెరుగులు చాలామంది సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి చర్మానికి పట్టిస్తూ ఉంటారు. దీని వలన ఒంటి మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుందట. పైగా ఒంటి మీద ఉన్న మచ్చలూ, మడతలూ కూడా తొలగిపోతాయంటున్నారు. ఇక ఆలివ్‌ నూనెతో కలిపి జుట్టుకి పట్టిస్తే... వెంట్రుకల ఎదుగుదలకి ఢోకా ఉండదంటున్నారు. అన్నింటికీ మించి, సగ్గుబియ్యం మంచి రుచిగా ఉంటుంది. ఎలాపడితే అలా తయారుచేసుకునేందుకు వీలుగా ఉంటుంది. అందుకనే సగ్గుబియ్యంతో పాయసం దగ్గర నుంచీ వడల వరకూ ఎలాంటి వంటకాన్నయినా చేసుకుంటారు. ఇంకా తనివితీరక సగ్గుబియ్యంతో వడియాలు పెట్టుకొంటారు. సగ్గుబియ్యంలో ఉన్న అతి ముఖ్యమైన గుణం చలవ చేయడం. నీటితో కలిపి తీసుకోవడం, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండటంతో... సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో డీహైడ్రేషన్, నిస్సత్తువ వంటి సమస్యలు ఏర్పడతాయి. సగ్గుబియ్యపు జావ ఇందుకు విరుగుడుగా నిలుస్తుంది.

శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!

  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!   శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి.   ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట! - నిర్జర.    

ట్రాఫిక్తో పిల్లల డీఎన్ఏ దెబ్బతింటోంది

  కాలుష్యం గురించి కొత్తగా చెప్పుకొనేదేముంది. సరికొత్తగా తిట్టుకునేదేముంది. కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయనీ, కాలుష్యకణాలు ఏకంగా మెదడులోకి చొచ్చుకుపోతాయని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఫలితంగా ఆస్తమా మొదల్కొని అల్జీమర్స్ దాకా నానారకాల సమస్యలూ తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనతో కాలుష్యం ఏకంగా పిల్లల డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని తేల్చింది.   పిల్లల డీఎన్ఏ మీద కాలుష్య ప్రభావం తెలుసుకొనేందుకు పరిశోధకులు కాలిఫోర్నియాలోని Fresno అనే నగరాన్ని ఎంచుకొన్నారు. అమెరికాలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో Fresno ముందువరుసలో ఉండటమే ఇందుకు కారణం! దీనికోసం ఈ నగరంలో నివసించే కొందరు పిల్లలు, కుర్రవాళ్లకి సంబంధించిన డీఎన్ఏను పరిశీలించారు. మోటరు వాహనాల నుంచి వెలువడే polycyclic aromatic hydrocarbons (PAHs) అనే కాలుష్య కణాలు ఎక్కువైనప్పుడు, వారి డీఎన్ఏలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అంచనా వేశారు.   వాతావరణంలో PAH కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, డీఎన్ఏలో ఉండే telomere అనే భాగం కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆస్తమా ఉన్న పిల్లలలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపించింది. మన వయసు పెరుగుతూ వృద్ధాప్యం మీద పడేకొద్దీ ఈ telomere తగ్గిపోవడం సహజం. ఒకరకంగా ఈ telomere మనం మరణానికి చేరువవుతున్నామనేదానికి సూచనగా నిలుస్తుంది. అందుకనే కేన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ telomere తగ్గిపోతుంటుంది.   పిల్లల్లో రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు వారి అవయవాలు సున్నితంగా, చిన్నగా ఉంటాయి. వారి డీఎన్ఏలోని telomere కూడా అంతే సున్నితంగా ఉంటుంది. దాంతో ట్రాఫిక్ నుంచి వచ్చే కాలుష్యం వారిని మరింతగా పీడించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్నే పై పరిశోధన రుజువు చేసింది. కానీ ఈ పరిస్థితి నుంచి భావితరాలను కాపాడేందుకు ఏ వ్యవస్థా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే దురదృష్టం. ఇక మనమే మన పిల్లల్ని ఎలాగొలా ఈ కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి. - నిర్జర.    

విటమిన్ Kతో ఎన్ని ఉపయోగాలో తెలుసా!

  శరీరానికి అవసరమయ్యే విటమిన్ల పేర్లు చెప్పమంటే టకటకా A నుంచి E వరకూ వల్లెవేస్తాం. కానీ K విటమిన్‌ గురించి మాత్రం మర్చిపోతాం. మనం ఎంతగా మర్చిపోయినా... శరీరానికి మిగతా విటమిన్లు ఎంత అవసరమో కె విటమిన్‌ కూడా అంతే అవసరం అని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు! కె విటమిన్‌తో ఎముకల దగ్గర్నుంచీ గుండె వరకూ ప్రతి భాగానికీ లాభాలున్నాయని పేర్కొంటున్నాయి.   విటమిన్ కె అనగానే మనకి రక్తం గడ్డకట్టడమే గుర్తుకువస్తుంది. నిజానికి ఈ విటమిన్‌కు ‘K’ అన్న పదాన్ని సూచించడం వెనుక కూడా ఇదే కారణం. జర్మన్‌ భాషలో koagulation అంటే గడ్డకట్టడం అని అర్థం. ఈ విటమిన్‌ ముఖ్య బాధ్యత రక్తాన్ని గడ్డకట్టించడం అని జర్మన్ పరిశోధకులు కనుగొనడంతో ఆ పదంలోని మొదటి అక్షరం స్థిరపడిపోయింది. మన శరీరానికి చిన్న గాయమైనా సరే... అక్కడ రక్తం కనుక గడ్డకట్టకపోతే ఇక మనిషికి మరణమే శరణ్యం! పంక్చర్‌ అయిన ట్యూబ్‌లోంచి గాలి ఎలా వెళ్లిపోతుందో మన శరీరం నుంచి రక్తం అలా జారిపోతుంది. ఆ పరిస్థితిని అదుపుచేసేందుకు కొన్ని ప్రొటీన్లు అక్కడి రక్తం గట్టిపడేలా చేస్తాయి. ఆ ప్రొటీన్లకి విటమిన్‌ కె తగిన బలాన్ని చేకూరుస్తుంది.    రక్తస్రావాన్ని అరికడుతుంది కదా అని పెద్దలకు మాత్రమే ఇది ఉపయోగం అనుకోవడానికి లేదు. అప్పుడే పుట్టిన పసిపిల్లలలో విటమిన్‌ కె చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో చాలా తక్కువ మోతాదులో ఈ విటమిన్‌ కనిపిస్తుంది. ఈ కారణంగా వారిలో అంర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని పసిపిల్లలు పుట్టిన వెంటనే ఇంజక్షన్‌ రూపంలో కె విటమిన్‌ను అందిస్తున్నారు.   విటమిన్‌ కె కేవలం రక్తానికే కాదు, ఎముకలకు కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందన్నది నిపుణుల మాట. స్త్రీలలో కనిపించే ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి రాకుండానూ, ఒకవేళ వచ్చినా కూడా అది అదుపులో ఉంచడంలోనూ విటమిన్ ప్రభావం చూపుతుందట. ఎముకలకి తగినంత కాల్షియం అందేలా తోడ్పడటం ద్వారా... అవి పెళుసుబారిపోకుండా, దృఢంగా ఉండేలా కె విటమిన్‌ సాయపడుతుందట.   విటమిన్ కె వల్ల గుండెకు మేలు జరుగుతుందన్న విషయం చాలామందికి తెలియదు. కానీ గుండెధమనులు గట్టిపడకుండా ఉండేందుకు ఈ విటమిన్‌ దోహదపడుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అంతేకాదు! గుండె ధమనుల మీద కాల్షియం పేరుకుపోకుండా కాపాడి గుండెలకి చేరే రక్తసరఫరాలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా నివారిస్తుందట.   ఇదీ స్థూలంగా విటమిన్ కె వల్ల కలిగే కొన్ని లాభాలు! రోజులు గడిచేకొద్దీ ఈ విటమిన్‌ వల్ల ఉపయోగాలు ఇబ్బడిముబ్బడిగా బయటపడుతూనే ఉన్నాయి. ఆఖరికి కొన్ని రకాల మొండి కేన్సర్లను కూడా ఇది నివారించగలదని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఆందుకనే ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకి 120 మి.గ్రాముల విటమిన్ కె తీసుకోవాలనీ, స్త్రీలు రోజుకి 90 మి.గ్రాముల విటమిన్ కె ఉండే ఆహారం స్వీకరించాలనీ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.   ఆకుకూరలు, మాంసాహారం, సోయాబీన్స్, పాలపదార్థాల వంటి ఆహారంలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఒకవేళ శరీరంలో తగినంత విటమిన్ కె లేదని తేలినా, లేదా ఆ విటమిన్‌ను జీర్ణం చేసుకోవడంలో ఏదన్నా లోపం ఉన్నా... మందుల ద్వారా ఈ విటమిన్‌ను స్వీకరించవచ్చు. అయితే కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్‌ కె మందులు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అది ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా రక్తపోటు, కొలెస్టరాల్‌, జీర్ణసమస్యలతో మందులు వాడేవారిలో విటమిన్‌ కె సప్లిమెంట్లు దుష్ప్రభావాన్నా చూపుతాయి.   - నిర్జర.

షుగర్ వచ్చిందా..? ఈ డైట్ ఫాలో అవ్వండి

ఇటీవలి కాలంలో డయాబెటిస్ అనేది కామన్‌గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాఢపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే చాలు.. లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. అందుకే డయాబెటిస్ అంటే చాలు జనం హడలిపోతారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, స్థూలకాయం, స్మోకింగ్ తదితర కారణాలు షుగర్ రావడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత అది తినకూడదు. ఇది తినకూడదు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చట. అలాంటి ఫుడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  

ఉగాది పచ్చడితో ఆరోగ్యం

‘ఉగాది పచ్చడి’ ఉగాది పండుగకు మాత్రమే ప్రత్యేకమైన పదార్థం.. ప్రసాదం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని షడ్రుచులున్న ఉగాది పచ్చడి ఇస్తుంది.  ఉగాది పచ్చడిని శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చెబుతోంది.  ఉగాది  పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తోంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు.  ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినవలసిన ఆవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది.  శిశిరంనుంచి వసంతంలోకి అడుగుపెట్టడం అంటే చల్లని వాతావరణంలోంచి తాపం ఎక్కువయ్యే వాతావరణంలోకి రావడమన్నమాట. శరదృతువు, వసంతకాలంలో వ్యాధులు తీవ్రత ఎక్కువ. శీతాకాలంలో శరీరం స్తబ్దుగా ఉండిపోతుంది. వాత, పిత్త, కఫ, శ్వాస సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఋతువులు మారే సంధికాలంలో ఇవి మరింత విజృంభిస్తాయి. ముఖ్యంగా వసంతం వచ్చీరాగానే ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు, వీటినుండి రక్షణకు పెద్దలు ఉగాది పచ్చడిని రక్షణ పదార్థంగా అలవాటు చేశారని ప్రతీతి. ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలన్నీ ఔషధాలే. బెల్లం మహిళలు మంచిది. ఐరన్‌ ధాతువు ఉంటుంది. ఇది రక్తపుష్టిని కల్గిస్తుంది. వేపపువ్వు చేదుగా ఉంటుంది. పొట్టలోని నులి పురుగులను సంహరిస్తుంది. యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ఉప్పు వాతాన్ని హరిస్తుంది. చింతపండు, మామిడిలోని పులుపు, వగరు వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. మిరియాలు శరీరంలో వేడిని నియంత్రిస్తాయి. ఇన్ని విశిష్టతలున్నాయి కనుకే మనం ఉగాది పచ్చడిని ఇష్టంగా తిందాం.     

చింతపండు తగిలితే రక్తపోటు తగ్గిపోతుందా!

  రక్తపోటు ఉన్నవారు పులుపు ముట్టుకోకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే వేలసంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్న చింతపండుని వదులుకోవాల్సిందేనా! నానారకాల అనర్థాలకీ, అనారోగ్యాలకీ చింతపండు కారణం అవుతోందా! అంటే కాదనే అంటున్నారు నిపుణులు. చింతపండుతో రక్తపోటు పెరగకపోగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఏమేం చెబుతున్నారంటే... రక్తపోటు - చింతపండులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చింత శరీరంలోని రక్తపోటుని అదుపులో ఉంచుతుందన్నది నిపుణుల వాదన. పైగా చింతపండులో పీచుపదార్థం చాలా ఎక్కువ. చింతపండు నుంచి ఎంత గుజ్జు తీసినా కూడా ఇంకా పీచు మిగిలి ఉండటాన్ని గమనించవచ్చు. శరీరంలోని కొవ్వుని తొలగించేందుకు ఈ పీచు చాలా ఉపయోగపడుతుంది. రక్తహీనత - చింతపండులో ఇనుము (iron) శాతం కూడా చాలా ఎక్కువ. దీని వల్ల శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఆ రక్తహీనత కారణంగా వచ్చే నీరసం, తలనొప్పులూ దూరమైపోతాయి. ఊబకాయం - చింతపండులో hydroxycitric acid అనే రసాయనం ఉందంటారు. ఇది శరీరానికి అందే కార్బోహైడ్రేట్లు, కొవ్వు కిందకి మారకుండా అడ్డుకుంటుంది. పైగా చింతపండుకి LDL కొలెస్టరాల్‌ని తగ్గించే శక్తి కూడా ఉంది. వీటి అర్థం... చింతపండుతో బరువు తగ్గిపోతుందనేగా! జీర్ణశక్తి - ఇప్పుడంటే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి కానీ, చింతపండుతో చేసిన చారు లేక పులుసు లేకపోతే ఒకప్పుడు భోజనం పూర్తయ్యేది కాదు. మనం తిన్న భోజనాన్ని చక్కగా అరాయించుకునేందుకు ఈ చింతపండు చారు ఉపయోగపడుతుంది. ఇప్పటికీ జీర్ణశక్తి కాస్త మందగిస్తున్నట్లు తోస్తే తక్షణ ఉపశమనం కోసం పెద్దలు చింతపండుతో కాస్త చారుని తినమనే చెబుతారు. కాలేయం - జ్వరంతో బాధపడేవారికి చింతపండు చారునే పథ్యంగా చెబుతూ ఉంటారు. దీని వెనకాల శాస్త్రీయ కారణాలు లేకపోలేదు. చింతపండు త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు! చింతపండుకి కాలేయం నుంచి విడుదల అయ్యే పైత్య రసాన్ని (bile) నియంత్రించే శక్తి ఉంది. ఈ పైత్య రసంలో తేడాలే చాలా సందర్భాలలో జ్వరానికి దారితీస్తాయని నమ్ముతారు. బి విటమిన్‌ - బి విటమిన్లలో ముఖ్యమైన ‘థయామిన్‌’ (B1) చింతపండులో పుష్కలంగా లభిస్తుంది. మెదడు చక్కగా పనిచేయాలన్నా, ఆహారం శక్తిగా మారాలన్నా, ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కావాలన్నా, శరీరం యవ్వనంగా కనిపించాలన్నా ఈ థయామిన్‌ చాలా అవసరం. రోగనిరోధక శక్తి - కేవలం B1 మాత్రమే కాదు C,E,K విటమిన్లు... కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌ వంటి ఖనిజాలు కూడా చింతపండులో కనిపిస్తాయి. వీటన్నింటివల్లా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, ఆరోగ్యం నిలిచి ఉంటుందని వేరే చెప్పాలా!

వేప గురించి 15 విషయాలు

  తెలుగువారి ఉగాది వచ్చిందంటే... వేపపువ్వుతో చేసిన పచ్చడి తినందే ఆ పండుగ అసంపూర్ణమే! ఉగాది సందర్భంలో వచ్చే వేపపూలని తినేందుకు ప్రోత్సహించడమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ వేపపచ్చడి ఎండాకాలంలో రాబోయే అంటురోగాలను శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే వేపతో మన అనుబంధం కేవలం ఉగాదితో తీరిపోయేది కాదు. వేపకి ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి!   - వేపని మనం చెట్టుగా కాకుండా దేవతగా భావిస్తూ ఉంటాము. ఆ దేవత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాము. అందుకే ఉగాది వంటి సందర్భాలలోనే కాకుండా గ్రామదేవతల జాతర్లలో కూడా వేపమండలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు.   - వేపచెట్టు నుంచి వీచేగాలి, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే అవధూతలు సైతం వేపచెట్లు ఉండే ప్రాంతంలో తిరిగేందుకు ఇష్టపడతారట. వేపచెట్టు కింద నిద్రించేవారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆయుర్వేదం చెబుతోంది.   - వేప ఆకు, పూలు, బెరడు, కాయలు... ఇలా వేపచెట్టులోని అణువణువూ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చరకసంహిత వేపను సర్వరోగనివారిణిగా పేర్కొంటోంది. వేపతో నింబాదితైలం లాంటి అనేక లైపనాలు, తైలాలు, చూర్ణాలను తయారుచేస్తారు.   - రోజూ క్రమం తప్పకుండా వేపచిగుళ్లని తింటూ ఉంటే షుగర్ వ్యాధి దరిచేరదు.   - వేపచిగుళ్లని తినడం వల్ల పేగులలో ఉన్న హానికారక సూక్ష్మజీవులు, నులి పురుగులు కూడా చచ్చిపోతాయి.   - వేపపుళ్లలతో పళ్లు తోముకుంటే పళ్లు, చిగుళ్లు దృఢంగా ఉండటమే కాకుండా... పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వెంట రక్తం కారడం వంటి సమస్యలు కూడా దరిచేరవు.   - వేపలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకనే చర్మానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేపాకులను కాచిన నీటితో కానీ వేపనూనెతో తయారుచేసిన సబ్బులని కానీ రుద్దుకుంటే చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి, శరీరం దుర్గంధాన్ని నివారిస్తుంది.   - వేపలో యాంటీవైరల్ సుగుణాలు ఉన్నాయి. అందుకే పొంగు, మశూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు... రోగులను వేపమండల మీద పడుకోపెట్టేవారు.   - వేపాకుల గుజ్జుని కనుక తలకి పట్టిస్తే చుండ్రు, పేలులాంటి జుట్టుకి సంబంధించిన సమస్యలు మాయమైపోతాయి.   - వైద్యుడి సూచనల ప్రకారం వేప చూర్ణాన్ని తీసుకుంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.   - నేతిలో కాచిన వేపాకుని కానీ వేప పండ్లు లేదా ఆకుల గుజ్జుని కానీ మొటిమలు, పుండ్లు మీద రాస్తే ఒకటి రెండు రోజులలోనే ఫలితం కనిపిస్తుంది.   - వేప పండ్లు, విత్తనాల నుంచి తీసిన నూనె అద్భుతమైన క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. ఒకరకంగా ప్రకృతి సిద్ధమైన pesticide, insecticideలలో వేపదే ప్రథమ స్థానం.   - వేప పూతని ఉగాది పచ్చడిలో వాడటం మనకి తెలిసిందే. దీనిని నింబకుసుమభక్షణం అంటారు. వేపపువ్వు, వేపకాయలు, లేత వేప చిగుళ్లని ఉపయోగించి వంట చేయడం కూడా కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది.   - ఇంటికి కలపగా వాడటంలో టేకు, మద్ది తరువాత వేపకే ప్రాధాన్యత. పైగా వేపతో చేసిన కలప ఎన్నాళ్లయినా పుచ్చిపోకుండా, చెదలు సోకకుండా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.   - ఇంతటి ఘనత కలిగిన వేప మన భారత ఉపఖండంలోనే ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు తేల్చారు! - నిర్జర.    

కూలింగ్ వాటర్‌ తాగుతున్నారా! ఇది చదవండి…

    ఎండాకాలం వచ్చిందంటే చాలు... సీసాల కొద్దీ చల్లటి నీళ్లని గొంతులో ఒంపేసుకుంటాము. కానీ అదేం చిత్రమో! చల్లటి నీళ్లు ఎంత తాగినా కూడా దాహం తీరదు. పైగా దగ్గు, జలుబులాంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. కూలింగ్‌ వాటర్‌ తాగడం వల్ల ఒంటికి ఇసుమంతైనా ఉపయోగం ఉంటుందా అంటే లేదనే జవాబిస్తున్నారు నిపుణులు. పైగా నానారకాల సమస్యలనీ ప్రస్తావిస్తున్నారు. అవేమిటంటే…   అందుకే జలుబు! చల్లటి నీటి వల్ల గొంతులో మ్యూకస్‌ అనే జిగురు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల గొంతు, ఊపిరితిత్తులలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయి త్వరగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు పలకరిస్తాయి. చల్లటి నీరు తాగాక వచ్చే సమస్యలకు ఇదే కారణం!   అనవసర శ్రమ ఒంట్లోకి చేరుకునే ఏ పదార్థాన్నయినా మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో శరీరం తన శక్తిని కోల్పోతుందంటున్నారు. చాలామంది తిండి మధ్యలో ఈ చల్లటి నీరు తాగుతూ ఉంటారు. దాని వల్ల శరీరం తనకు ఆహారం ద్వారా అందుతున్న పోషకాలను జీర్ణం చేసుకునే శక్తి కాస్తా చల్లటి నీటిని వెచ్చచేసుకునే ప్రయత్నంలోనే మునిగిపోతుంది. అంటే! మనం తినే ఆహారం ఒంటపట్టదన్నమాట!   రక్తప్రసారానికి అడ్డు చల్లచల్లటి నీరు ఒంట్లోకి చేరడం వల్ల, ఒంట్లోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాని వల్ల ఒంట్లోని కణాలకు తగినంత నీరు అందక... ఇంకా దాహం తీరనట్లుగానే ఉంటుంది. చల్లటి నీరు రక్తప్రవాహం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే చల్లటి నీరు ఎక్కువగా తాగిన తరువాత ఒళ్లు తిమ్మిర్లు ఎక్కినట్లుగా అనిపిస్తుంది.   గుండె మీద భారం చల్లటి నీటి వల్ల రక్తప్రసావం తగ్గిపోతుందని చెప్పుకొన్నాం కదా! దీనివల్ల గుండె మీద భారం పడుతుంది. అంతేకాదు! చల్లటి నీరు తాగడం వల్ల గుండెకు చెందిన vagus అనే నరం పనితీరులో మార్పు వస్తుందట. దానివల్ల గుండె వేగం ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం ఒంట్లోని సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. మరి చల్లటి నీరేమో పది డిగ్రీల లోపే ఉంటుంది. అలాంటి నీరు శరీరంలోకి ప్రవేశించడం వల్ల మన జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. కొవ్వు పదార్థాలు శరీరంలోనే పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తాయి. ఒకోసారి రక్తం కూడా గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. అదెంత ప్రాణాంతకమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా!   చల్లటి నీటికి విరుద్ధంగా గోరువెచ్చటి నీటి వల్ల శరీరానికి బోలెడ లాభాలు ఉంటాయి. ఎండాకాలంలో గోరువెచ్చటి నీరు తాగే ప్రయత్నం చేయడం ఏమంత తేలిక కాకపోవచ్చు. కానీ చల్లటి నీటికి మాత్రం దూరంగా ఉండమనే చెబుతున్నారు పెద్దలు.     - నిర్జర.

వేసవి వేడిని తట్టుకొనేందుకు 7 చిట్కాలు

  ఇదేమన్నా బ్రహ్మ విద్యా! ఇంటిపట్టున కూర్చోవడం, తరచూ మంచినీళ్లు తాగడం... లాంటి చిట్కాలతో వేసవి వేడిని ఎదుర్కొంటాం కదా! అంటారా. నిజమే. కానీ మనం ఎప్పుడూ పట్టించుకోని మరికొన్ని ఉపాయాలు కూడా ఆచరించి చూడమని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటంటే... మణికట్టు చల్లగా -     మణికట్టు, మెడ భాగాలలోని రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రదేశాల మీద ధారాళంగా నీరు పోయడం, తడి బట్ట కట్టడం వల్ల... రక్తంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరం త్వరగా చల్లబడిపోతుంది. అయితే ఎండతో తిరిగి తిరిగి వచ్చిన వెంటనే ఈ పని చేయడం అంత సురక్షితం కాకపోవచ్చు.   కాఫీ, టీలకు దూరం -     వేసవిలో గొంతు ఎండిపోతోంది కదా అని రోడ్డు పక్కన ఆగి వేడివేడి టీలు చప్పరిస్తుంటారు. వేడి నీరు ఒంట్లోకి దిగగానే, వాటిని సాధారణ ఉష్ణోగ్రతలోకి మార్చుకునేందుకు శరీరం కష్టపడుతుంది. పైగా కాఫీ, టీలలో ఉండే కెఫిన్‌తో డీహైడ్రేషన్ మరింత ఎక్కువవుతుందన్న వాదనలూ ఉన్నాయి. అందుకని దాహం వేసినప్పుడు కొబ్బరినీరు, నీరు, గ్లూకోజ్‌ వంటి పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.   జుత్తుని కాస్త తడుపుకుంటే -     వేసవిలో మాడు కూడా వేడిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ కొబ్బరి నూనె పెట్టుకోమని తిడుతుంటారు పెద్దలు. మనం ఎలాగూ ఆ మాట వినం కదా! అందుకే ఇంటిపట్టున ఉన్నప్పుడు తడి చేతులని కాస్త జుత్తులోకి పోనిచ్చి చూడండి. అలా జుత్తుని కాస్త తడిగా ఉంచడం వల్ల మాడుని కాసేపటవరకూ చల్లగా ఉంచగలుగుతాము.   అలోవెరా -     ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ చవకగా అలోవెరా గుజ్జు దొరుకుతోంది. చర్మాన్ని చల్లబరిచే గుణం అలోవెరాలో పుష్కలంగా ఉంది. పైగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది.   వ్యాయామం మానొద్దు –     వ్యాయామం వల్ల స్వేదరంధ్రాలు శుభ్రపడి చెమటపొక్కుల వంటి సమస్యలు దరిచేరవు. శరీరానికి కావల్సినంత దాహం కలుగుతుంది. ఒంట్లోని ప్రతి అవయవమూ శుభ్రపడుతుంది. కాకపోతే వేసవిలో వ్యాయామం చేసటప్పడు అదనపు జాగ్రత్తలు అవసరం. నీడపట్టున వ్యాయామం చేయాలి, తగినంత విశ్రాంతి తీసుకుంటూ తక్కువసేపు వ్యాయామం చేయాలి. శరీరానికి తగినంత నీరు, ఉప్పు లభించేలా జాగ్రత్తపడాలి.   అత్యవసరం అయితేనే షూస్ –     మన ఒంట్లోని వేడిలో కొంత భాగం పాదాల ద్వారా కూడా బయటకు వెళ్తుంది. మరి ఆ పాదాలనే పూర్తిగా మూసివేస్తే.... ఒంటికి ఉక్కపోత తప్పదు. అందుకనే వేసవిలో అత్యవసరం అయితే తప్ప షూస్ ధరించకూడదు. ఒకవేళ ఆఫీసుకి షూస్‌ వేసుకుని వెళ్లాల్సి వచ్చినా... సీట్లోకి చేరగానే వాడిని విడిస్తే మేలు.   కళ్ల మీద కీరా –     వేసవిలో కీరదోసని తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. ఓ రెండు కీర ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కూడా ఒంట్లోని నిస్సత్తువ తీరిపోయిన అనుభూతి కలుగుతుంది. కీరని కళ్ల మీద పెట్టుకుంటే ఒంట్లోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది నిపుణుల మాట! - నిర్జర.

కూల్‌డ్రింక్స్‌తో మెదడు దెబ్బతింటుందా?

  ఎండాకాలం వచ్చిందంటే చాలు... దాహంతో నాలుక పిడచకట్టుకుపోతుంది. ఆ దాహాన్ని కూల్‌డ్రింక్స్‌తో తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. స్వచ్ఛమైన నీటిని వదిలేసి ఇలా చల్లటి కూల్‌డ్రింక్స్‌తో దాహం తీర్చుకోవడం ఏమంత మంచి పని కాదని నిపుణులు వాదిస్తూనే ఉంటారు. వాటివల్ల దాహం తీరకపోగా డయాబెటిస్‌, ఊబకాయం, కిడ్నీరాళ్లు వంటి సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తుంటారు. తాజాగా జరిగిన ఓ పరిశోధన మరో అడుగు ముందుకు వేసి... కూల్‌డ్రింక్స్‌తో అసలు మెదడే పాడైపోతుందని హెచ్చరిస్తోంది.   మెదడు మీద శీతలపానీయాల ప్రభావాన్ని గమనించేందుకు అమెరికాలోని శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఇందుకోసం వారు ఓ నాలుగువేల మంది ఆహారపు అలవాట్లను గమనించారు. వారానికి కనీసం మూడుసార్లన్నా శీతలపానీయాలను తీసుకునేవారిని మరికాస్త శ్రద్ధగా గమనించారు. MRI వంటి ఆధునిక పరీక్షల ద్వారా వీరి మెదడులో వస్తున్న మార్పులను పసిగట్టే ప్రయత్నం చేశారు.   కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నవారి మెదడులోని కణాలు త్వరగా నిర్వీర్యం అయిపోవడాన్ని పరిశోధకులు గమనించారు. జ్ఞాపకశక్తి క్షీణించడం, గతం మర్చిపోవడం, మెదడు కుంచించుకుపోవడం, ఏకాగ్రత నిలపలేకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది. ఈ లక్షణాలన్నీ అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.   డైట్‌ కూల్‌డ్రింక్స్ మరింత ప్రమాదం! మామూలు శీతలపానీయాలకంటే డైట్స్ కూల్‌డ్రింక్స్ సురక్షితం అన్నది ప్రజల భావన. కానీ రోజుకి ఒక డైట్‌ కూల్‌డ్రింక్‌ చప్పున తాగేవారు పక్షవాతం లేదా మతిమరపు బారిన పడే ప్రమాదం మూడురెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. డైట్‌ కూల్‌డ్రింక్స్‌లో ఉండే కృత్రిమ తీపిపదార్థాలే ఇందుకు కారణం అని భావిస్తున్నారు. కృత్రిమమైన తీపి పదార్థాల వల్ల తక్కువ కెలోరీలు లభించవచ్చుగాక. కానీ దీర్ఘకాలికంగా ఇవి వినాశనానికే దారితీస్తాయన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదనే!   ఏతావాతా మన జీవితంలో ఉప్పుతో పాటుగా, చక్కెర పదార్థాలని కూడా తక్కువగా తినాలని తాజా పరిశోధన సూచిస్తోంది. అందులోనూ ‘ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌’ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. అందుచేతా... ఎండాకాలం మాంచి దాహం వేస్తే కూల్‌డ్రింక్స్ ద్యాసని వదిలిపెట్టి చెంబుడు మంచినీటిని గొంతులో పోసుకుంటే సరి!   - నిర్జర.

వేసవిలో దాహం తీర్చుకోవడం ఓ కళ!

  వేసవి మొదలైపోయింది. అది కూడా ఉధృతంగా! ఇంతటి వేసవిని ఎదుర్కోవాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని అందరూ చెప్పేమాటే! ఒంట్లో తగినంత నీరు లేకపోతే ఇంటపట్టునే ఉన్నా సమస్యలు తప్పవు. చెమటపొక్కుల దగ్గర్నుంచీ విరేచనాల దాకా.... నీరు తాగకపోవడం అనే సమస్య ఒకోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. మరి ఈ చిక్కుని విప్పాలంటే...   మద్యంతో అసలుకే మోసం – వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది చల్లటి బీరు తాగితే చాలనుకుంటారు. ఆల్కహాల్‌తో శరీరానికి నీరు దొరక్కపోగా, ఉన్న నీరు కూడా పోతుందంటున్నారు నిపుణులు. మద్యం మన శరీరంలో ఉండే anti-diuretic అనే హార్మోను మీద ప్రభావం చూపుతుందట. దీని వల్ల శరీరం అవసరమైనదానికంటే అదనపు నీటిని కోల్పోతుందంటున్నారు. అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని వేరే చెప్పాలా!   లెక్కలు పక్కన పెట్టండి – రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలా? రెండు లీటర్ల నీరు తాగాలా? లాంటి సందేహాలను పక్కన పెట్టండి. దాహం వేసినప్పుడల్లా కావల్సినంత నీరు తాగాలి. దాహం వేయనప్పుడు కూడా తరచూ నీరు తాగుతూనే ఉండాలి.   కూల్‌డ్రింక్స్‌ దండగ – ఎండాకాలం వచ్చిందంటే మనకి శీతల పానీయాలే గుర్తుకువస్తాయి. వీటిలో ఉండే చల్లదనం వల్ల, కార్బన్‌డయాక్సైడ్‌ వల్ల దాహం తీరినట్లు తోస్తుంది. కెఫిన్‌, చక్కెర వంటి పదార్థాల వల్ల తాత్కాలికంగా ఉత్సాహం కలుగుతుంది. ఫలితంగా మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. శీతల పానీయాల వల్ల శరీరానికి తగినంత నీరు దక్కదు సరికదా... రక్తపోటు, కిడ్నీల సమస్యలు కూడా రావచ్చు.   వాటర్‌ బాటిల్‌ వెంట ఉండాల్సిందే – ఎండాకాలం బయటకి వెళ్లేటప్పుడు, పనిలో మునిగిపోయినప్పుడు దాహం వేయడం సహజం. పక్కన మంచినీళ్ల బాటిల్‌ లేకపోతే తరువాత తాగొచ్చులే అన్న నిర్లక్ష్యం ఏర్పడిపోతుంది. ఒకోసారి అప్పటికే ఒంట్లో జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోతుంది. మన ఒంట్లో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. ఈ నీటి శాతంలో మార్పులు వచ్చినప్పుడు తిప్పలు తప్పవు.   పోషకాహారం – మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సత్తువ ఎలాగూ ఉంటుంది. ఇక తాజా పండ్లు, కూరగాయల సలాడ్స్, వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తినడం వల్ల వాటి ద్వారా కావల్సినంత నీరు కూడా ఒంట్లోకి చేరుతుంది.   సూచనలు పట్టించుకోండి – మూత్రం పచ్చగా రావడం, నోరు పొడిబారిపోవడం, తలనొప్పి, కళ్లు మంటలు, చర్మం గరుకు తేలడం వంటి సవాలక్ష సూచనల ద్వారా మన ఒంట్లో తగినంత నీరు లేదని శరీరం సూచిస్తూ ఉంటుంది. వీటిని విస్మరిస్తే మరింత తీవ్రమైన సూచనలకు సిద్ధంగా ఉండాల్సిందే!   వ్యాయామంతో జాగ్రత్త- ఎండాకాలం వ్యాయామం చేసినప్పుడు చెమటతో పాటుగా నీరు, సోడియం రెండూ కూడా బయటకు వెళ్లిపోతాయి. అందుకని వ్యాయామం చేసే ఒక గంటకు ముందు పుష్కలంగా మంచినీరు తాగాలి. అలాగే వ్యాయామం చేసిన తరువాత కాసేపటికి కూడా నీరు తాగాలి. నీటికి బదులుగా కొబ్బరినీళ్లు, పళ్లరసాలు తీసుకుంటే మరీ మంచిది. - నిర్జర.

రక్తం చూస్తే కళ్లు తిరుగుతున్నాయా?

Vasovagal syncope- ఈ పేరు మనం ఎప్పుడూ విని ఉండము. కానీ మనలో దాదాపు 15 శాతం మందికి ఈ సమస్య ఉంటుంది తెలుసా! రక్తం చూడగానే కళ్లు తిరిగి పడిపోవడం ఈ వ్యాధి లక్షణం. చూసేందుకు చాలా చిన్నగా కనిపించినా... చెప్పుకోవడానికి చాలా వివరాలే ఉన్నాయి.   ఆదిమానవుల జ్ఞాపకాలు రక్తం చూడగానే కొందరికి కళ్లు ఎందుకు తిరుగుతాయో సరైనా కారణాలు ఇప్పటికీ తెలియవు. ఒక ఊహ ప్రకారం ఈ వ్యాధి మన పూర్వీకుల నుంచి వస్తూ ఉండవచ్చు. ఆదిమానవులు వేటాడేటప్పుడో, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడో తీవ్రంగా గాయపడతారు కదా! అలా గాయపడినప్పుడు వారు జంతువులు లేదా శత్రువుల బారిన చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు వారు స్పృహ తప్పి పడిపోవడం వల్ల చనిపోయినట్లుగా కనిపిస్తారు. వారు నిజంగానే చనిపోయారనుకుని శత్రువు తన దారిన తను వెళ్లిపోతాడు. కాలం మారినా.... రక్తానికి స్పృహ తప్పే జన్యువులు ఇంకా కొందరిలో ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తోందని భావిస్తున్నారు. మరో అంచనా ప్రకారం దెబ్బ తగిలిన తర్వాత కళ్లు తిరిగిపడిపోవడం, రక్తస్రావం ఆగిపోయేందుకు దోహదపడుతుంది.   సమస్యలు లేకపోలేదు ఈ వ్యాధి ఉన్నవారిలో రక్తం చూడగానే రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. గుండె బలహీనంగా కొట్టుకుంటుంది. దాంతో మెదడుకి వెళ్లే రక్తప్రసారం కూడా తగ్గిపోతుంది. చర్మం పాలిపోవడం, కళ్లు బైర్లు కమ్మడం, తల భారంగా మారడం, చెమటలు పట్టడం.... లాంటి లక్షణాలు కనిపించి మనిషి ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఇలా కళ్లు తిరిగి పడిపోయిన మనిషి కాసేపటిలోనే మళ్లీ మామూలు మనిషి అయిపోతాడు కాబట్టి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడటం వల్ల తీవ్రమైన గాయాలు కావచ్చు, ఎదుటివారికి తీవ్ర గాయమైన సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన మనమే కళ్లు తిరిగి పడిపోవచ్చు. గుండె బలహీనంగా ఉండేవారిలో ఒక్కసారిగా ఇలా రక్తపోటు పడిపోవడం వల్ల ప్రాణాంతకంగానూ మారవచ్చు. కాబట్టి ఈ వ్యాధి నిరుపాయకరం అనుకోవడానికి వీల్లేదదు.   ఇలా చేయాలి! రక్తం చూస్తే కళ్లు తిరుగుతున్నట్లు ఉంటే... వెంటనే పడుకోవడం చాలా అవసరం. దీని వల్ల రోగికి విశ్రాంతి లభించడమే కాకుండా, మెదడులోని రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలా కాకుండా వెంటనే బలవంతంగా నిలబడే ప్రయత్నం చేస్తే... మళ్లీ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. Vasovagal syncope తాత్కాలికమే! కానీ దీని నుంచి ఉపశమనం పొందాలనుకుంటే మార్గాలు లేకపోలేదు. applied tension అనే ఒక చికిత్స ద్వారా వైద్యులు ఈ వ్యాధిని తగ్గించగలరు. ఇందులో భాగంగా ఒక 10 నుంచి 15 సెకన్ల పాటు కండరాలని బిగపట్టమని చెబుతారు. దాని వల్ల రక్తపోటు కాస్త పెరుగుతుంది. ఆ వెంటనే రక్తాన్ని గుర్తుచేసే దృశ్యాలను చూపిస్తారు. ఇలా రోగిని నిదానంగా రక్తాన్ని ‘కళ్ల చూసే’ పరిస్థితికి తీసుకువస్తారు.   మన చుట్టపక్కల ఎవరికన్నా రక్తాన్ని చూస్తే కళ్లు తిరిగే సమస్య ఉంటే... వారిని ఎగతాళి చేస్తుంటాం. వారు మానసికంగా బలహీనమైనవారని అంచనా వేస్తుంటాం. కానీ ఇది కూడా ఒక సమస్య అని గుర్తించిన రోజున వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలుస్తుంది.   -నిర్జర

ఎక్కిళ్ళు

చాలామందికి సడన్ గా ఎక్కిళ్ళు వస్తాయి... కానీ అవి ఎందుకు వస్తాయి...దాని పర్యవసానం ఏమిటి అన్నది చాలామందికి తెలీదు. విదాహకర పదార్ధములు, మలబంధకర పదార్ధములు, చల్లని అన్నము తినుట చల్లని నీటిని తాగటం వలన ప్రాణవాయువు కంఠమందలి ఉదానవాతముతో చేరి హిక్ అను శబ్దముతో ప్రేవుల నుండి బయటకు వస్తుంది. మూత్రపిండాలు చెడిపోయిన కారణంగా వచ్చే ఎక్కిళ్ళను కష్టసాధ్యంగా పరిగణించాలి ఇలా వచ్చిన ప్పుడు తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు: స్వేదనము, వమనము, సస్యకర్మ ధూమపానము, విరేచనము, నిద్ర స్నిగ్ధములును, మ్రుదువులుపు, లవణ మిశ్రితములైన పదార్ధములను భుజించుట, పాతవియగు ఉలవలు, గోధుమలు, శాలిధాన్యము పష్టికధాన్యము, పెసలుభుజించుట. వేడినీరు, మాదీఫలము, పొట్లకాయలు, లేతముల్లంగి, వెలగపండు, వెల్లుల్లి తేనె అనునవి హిక్కారోగులకు హితము చేకూర్చును.   మందుజాగ్రత్తలు: నెమలి ఈకల భస్మము, పిప్పలీ చూర్ణములను కలిపి తేనెలో కలిపి సేవిస్తే ప్రబలమైన ఎక్కిళ్ళు శ్వాస భయంకరమైన వమనము శమిస్తాయి. పిప్పళ్ళు, ఉసిరిక వరుగు శొంఠి వీని చూర్ణమందు చక్కెర తేనె కలిపి చాలాసార్లు  సేవిస్తే హిక్కా శ్వాసలు నశిస్తాయి. అతిమధుర చూర్ణమందు తేనె కలిపి తీసుకోవచ్చు. పిప్పలీ చూర్ణమునందు తేనె కలిపి సేవించవచ్చు. వెచ్చని నేతిని గానీ వెచ్చని పాలను గాని రసాన్ని గాని పానం చేస్తే అన్నికరాల ఎక్కిళ్లు నశిస్తాయి...

అతిసార వ్యాధి

విరేచనాలు అధికముగా అయ్యేవ్యాధిని అతిసార వ్యాధి అని అంటారు. ఇది వచ్చేముందు ఉదరము, పొత్తికడుపు యందు నొప్పి, అసానవాతము బయలు వెడలకుండుట, మలబంధము, కడుపుబ్బరము, అజీర్ణము అను లక్షణాలు కలుగుతాయి. కొందరిలో నురుగుతో కూడిన విరేచనాలు మరి కొందరిలో రక్తవర్ణమలము, లేదా చిక్కని కఫముతో దుర్గంధయుక్తముగా విరేచనాలు అవుతాయి.    ముందుజాగ్రత్తలు: లంఘనము, పమనము, నిదురబోవుట, ప్రాతవియగు శాలిధాన్యము, షష్టిక ధాన్యము, విలేపి,పేలాలగంజి, చిరుశనగల కట్టు, కందికట్టు, కుందేలు, జింక, లావకపిట్ట, లేడి, కాజు వీని మాంసరసములు, చిన్నవి యాగు చేపలు దుప్పి తైలము, మేక, ఆవు, ఈ జంతువుల యొక్క నెయ్యి,పాలు, పెరుగు, మజ్జిగ, పెరుగు నుండి తీసిన వెన్న పాలలో తీసిన వెన్న, లేత అరటికాయ అరటి పువ్వు, పొట్లకాయ, తేనె, నేరేడు పండ్లు, అత్తికాయలు, అల్లము,శుంఠి, తెల్లతామరగడ్డలు, వెలగ పొగడ, మారేడు, తుమికి పండు,పుల్లదానిమ్మ. తియ్యదానిమ్మ ఎర్రతామరగడ్డ, బూరుగ, పులిచింతాకు, గంజాయి ఆకు, మంజిష్ట, జాజికాయ,నల్లమందు జీలకర్ర, కొడిశపాల, ధనియాలు, తురకవేప, వగరు గల అన్ని పదార్ధములు. అగ్ని దీప్తిని కలిగించునవి. లఘువుగ ఉండెడునవియు అగు పదార్ధములు. అన్నియు అతిసార వ్యాధి హితకరములు. మందుజాగ్రత్తలు:  మారేడు గుజ్జు చూర్ణము బెల్లముతో కలిపి సేవిస్తే కడుపునొప్పి మలబంధము, కడుపుబ్బరము, అతిసారములు హరిస్తాయి. ధనియాలు శుంఠి కషాయం ఆకలిని పెంచుతాయి. కొడిశపాలపట్ట, అతివస వీని చూర్ణము తేనెలో కలిపి సేవిస్తే అతి సారశమిస్తుంది. కరిక పిందెలు, జీలకర్ర వీనిని కొంచెము వెచ్చచేసి చూర్ణించి బియ్యము కడుగు నీళ్ళతో సేవిస్తే అతిసారం నశిస్తుంది.మారేడు గుజ్జు మామిడి జీడి దీని కషాయమందు తేనె చక్కెర కలిపి సేవిస్తే వాంతి విరేచనాలు హరిస్తాయి.  

మలబద్ధకము

           ఆకలి వేస్తే తినడానికి ఎంత ఉవ్విళ్ళూరుతామో.... తిన్నది అరిగి బయటపడకపోతే అంత అల్లాడిపోతాము. మనం తిన్నది... జీర్ణం కాక... శుష్కించి వుండలు గట్టి మలమార్గం నుండి సునాయాసంగా బయటకు రాకుండా ఉంటే దాన్ని  అనాహము మలబద్ధకము అంటారు. నడుము, వీపు యందు పట్టుకొని నట్లు ఉండటం వలన కడుపునొప్పి, ఆయాసం, వాంతి లాంటివి మలపవ్రుత్తి జరగకపోతే వస్తాయి. దప్పిక జలుబు, శిరస్సునందు మంట, కడుపునొప్పి రొమ్ము పట్టినట్టు ఉండటం, త్రేనుపులు పైకి రాకుండటం వంటి లక్షణాలు కొందరిలో ఇలా కనబడతాయి.   ముందుజాగ్రత్తలు:  ఇలా వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఏమిటంటే.....లేతముల్లంగి, మునగ ఆకులు, మునగకాయ, కాకరకాయ, పొన్నగంటికూర, ద్రాక్ష, వెల్లుల్లి, ఆవుపాలు, ఆముదము, లవల కట్టు ఏడాది దాటిన బియ్యం హితకరములు వగరు రుచిగల పదార్ధాలు, కషాయరసము గలవి మలబద్ధకము గల వారు విసర్జించాలి. మందుజాగ్రత్తలు:    హింగుత్రిగుణ తైలం రెండుచెంచాలు తీసుకొని పాలలో కలిపి సేవిస్తే గుణకారిగా ఉంటుంది. రాత్రిపూట త్రిఫలా చూర్ణం, ఒకటి రెండు చెంచాలు వేడి నీటిలో సేవించాలి. అభయారిష్ట లేదా ద్రాక్షారిష్ట  కొద్దిరోజులు సేవించాలి. అపత్తిక చూర్ణం ఒకటిరెండు చెంచాలు సేవిస్తే బావుంటుంది.  

కడుపు నొప్పి

కడుపునొప్పి ఉన్నాదా కడుపు నొప్పి... చెప్పండి నోరు విప్పి..... శూలము గుచ్చినట్టు సడన్ గా నొప్పి కలగటం వలన... శరీరాన్ని చీల్చినట్టు బాధ కలగటం వలన.. ఈ వ్యాధికి శూలవ్యాధి అనిపేరు వచ్చింది.  పొట్ట  పై భాగంలో నాభి ప్రాంతంలో, హ్రుదయము, పార్శ్వము వీపు వెన్నెముక కింది భాగము, కంఠము, పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కడైనా నొప్పి రావచ్చు. ఆహారం తినేటప్పుడు లేదా జీర్ణమయ్యే టప్పుడు కూడా నొప్పి రావచ్చు.  ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు:  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తికూర, మునగకూర, ఉప్పు వెల్లుల్లి సంవత్సరము దాటిన పాతబియ్యం ఆముదము, గోమూత్రము, వేడినీరు, నిమ్మపండ్లరసము సేవించాలి. రాత్రుల యందు నిద్రమేల్కొనుట, చేదురసం గల పదార్ధములు శీతల పదార్ధములు, వ్యాయామము, సంభోగము మద్యపానము, పప్పుదినుసులు, కారము గల పదార్ధములు తీసుకోకూడదు. దు:ఖము,కోపము, ఆవలింత, నవ్వు ఆకలి అపాన వాయువు, తుమ్ము లాంటివి నిరోధించాలి. మందుజాగ్రత్తలు:   ఆవు సంచితంలో కరక్కాయను ఉడికించి ఎండించి చూర్ణించి దాంట్లో బెల్లం, లోహభస్మం కలిపి సేవిస్తే కడుపులో మంటతో కూడిన నొప్పి వెంటనే తగ్గుతుంది. మజ్జిగలో భాస్కరలవణము, అజామోదార్కము, శంఖవటి అను ఔషధాలు బాగా పనిచేస్తాయి. హింగుత్రిగుణ తైలం ఒకటి రెండు చంచాలు వేడి నీరు గానీ లేదా పాలతో సేవిస్తే కడుపుబ్బరం, నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది. ఇంటికి చూసుకొనేది వీధి శూల... ఒంటికి చూసుకొనేది వ్యాధి శూల...