రాజీనామాకు కట్టుబడే ఉన్నా: కావూరి

  కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనని నిర్లక్ష్యం చేసినందుకు అలిగి రాజీనామా చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావ్ ఏమాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడంలేదు. రాజీనామా విషయమై కావూరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కావూరితో భేటీ అయిన ప్రథాని ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కావూరి మాట వినలేదు. ప్రథాని మన్మోహన్ దగ్గర తన మనస్తాపాన్ని ఆయన పూర్తిగా బైటపెట్టారని పార్టీవర్గాలు చెబుతున్నాయ్. ప్రథానితో సమావేశానికి సంబంధించిన వివరాల్ని తాను బైటికి చెప్పలేనంటూ కావూరి మాట దాటేశారు.

కులరాజకీయాల పాచికలాట

        ఎన్నికలు దగ్గరికొచ్చేస్తున్నాయ్.. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి పాతా కొత్తా పార్టీలన్నీ రకరకాల పాచికల్ని ప్రయోగిస్తున్నాయ్. ప్రాంతీయ తత్వాలు, వర్గ పోరాటాలు ఒరగబెట్టే లాభం చాలా తక్కువగా ఉంటుందన్న నిజాన్ని గ్రహించాక అన్ని పార్టీలూ ఇప్పుడు కులసమీకరణాలమీద పడ్డాయ్.   పల్నాటి రెడ్లని, మాలల్ని, కన్వర్టెడ్ క్రిస్టియన్లని పూర్తిగా ఆకట్టుకోవడంలో సఫలత సాధించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనంత ఎక్కువగా కాపుల్నికూడా పోగేసే ప్రయత్నం చేస్తోంది. ఇంకా వీలైతే మైనారిటీల్నికూడా గట్టిగాలం వేసి లాగాలనే ప్రయత్నాలుకూడా ముమ్మరంగా సాగుతున్నాయ్.   వైకాపా మాలల్ని పోగేయడాన్ని చూసిన తెలుగుదేశం మాదిగల్ని భుజానికెత్తుకుంది. వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబు పూర్తిగా బీసీ, ఎస్టీల జపం చేస్తున్నారు. అధికారంలోకొస్తే మాదిగల రుణం తీర్చుకుంటానంటూ చంద్రబాబు హామీలివ్వడం, మందకృష్ణ ఆయన పాదయాత్రకి మద్దతుని ప్రకటించడం లాంటివన్నీ టిడిపి కొత్త సమీకరణాల్లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అటు రెడ్లనీ, ఇటు ఇతర వర్గాల్నీ కూడగట్టేట్టు లేదన్న నిజాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కాపుల్ని పోగేసే పనిలోపడింది. నిన్న మొన్నటిదాకా చంద్రబాబుని అస్సలు పట్టించుకోని సొంత సామాజిక వర్గం ఇప్పుడు బాబుకి ఆరునూరైనా అన్నివిధాలుగా బాసటగా నిలుస్తామని ప్రామిస్ చేసి మాటని నిలబెట్టుకుంటోంది.   గుంటూరు, బెజవాడ లాంటి స్థానాల్లో మైనారిటీల ఓట్లుకూడా కీలకం. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లోకూడా కాస్తో కూస్తో పట్టుసాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎంఐఎం. వీలైనంతగా మూడోనాలుగో ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగితే కష్టకాలంలో పార్టీలకు అడ్డంపటడేందుకు బేరం బాగా కుదుర్చుకోవచ్చన్నది ఆ పార్టీ వ్యూహం.   బీజేపీ ప్రయోగించిన తెలంగాణ అస్త్రం పేలని టపాసులా తుస్సుమంది. మరోదారి చూసుకోక తప్పని పరిస్థితి. ఎంఐఎం ఎలాగూ దూసుకుపోతూ మైనారిటీల ఓట్లని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది కాబట్టి హిందుత్వ కార్డ్ ని మళ్లీ తెరమీదికి తెస్తే సరిపోతుందని ఆ పార్టీ భావిస్తోంది. హిందుత్వ కార్డ్ వల్ల యాంటీ ముస్లిం ఓటన్నీ తమకే వస్తాయన్న ఆశతో ఆ పార్టీ ఉంది.   వెలమలంతా కెసిఆర్ వెనకుంటే, రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కోదండరామ్ పక్షాన చేరిందన్న ప్రచారం నిజంగా నిజమైతే ఇక టిఆర్ ఎస్ కుల సమీకరణాలపై పెద్దగా ఆశలుపెట్టుకోకుండా కేవలం ప్రాంతీయతత్వం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నాలు ఎంత వరకూ సఫలమౌతాయో చెప్పలేని స్థితి.    

ఎంఐఎం తలాఖ్ వెనక అసలు కథ

        చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వ్యవహారంలో కిరణ్ సర్కారుపై అలిగిన ఎంఐఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి తలాఖ్ చెప్పేసింది. మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలన్న తలంపుతోనే తాము దశాబ్దంనుంచి కాంగ్రెస్ కి మద్దతిస్తున్నామని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పడంలేదని చెప్పుకొచ్చింది.   పైకి అసదుద్దీన్ ఇలాగే చెబుతున్నా.. లోపల మాత్రం అసలు విషయం వైఎస్ఆర్ సిపితో మ్యాచ్ ఫిక్సింగేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.. ఉపఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్ని ఆకట్టుకోవడంలో ఓ మేరకు విజయం సాధించిందనే చెప్పొచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటే లాభపడొచ్చన్నది ఎంఐఎం వ్యూహమని సీనియర్ల అంచనా..   చిరంజీవి రాజ్యసభకి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎంఐఎం నేతలెవరూ హాజరుకాకపోవడం, ఆ పార్టీ అగ్రనేతలు చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ తో ములాఖత్ అవ్వడం ఇలాంటి ఆలోచనలకు, అంచనాలకు ఊతమిచ్చే ఘటనలు. జగన్ కి అసదుద్దీన్ కి మధ్య రాజకీయబంధం ఏర్పడిందని, త్వరలోనే అది కాంగ్రెస్ కి మద్దతుపై ప్రభావం చూపించబోతోందనీ అప్పట్లోనే చాలామంది అనుకున్నారు.   రాబోయే రోజుల్లో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది అన్న దాని మీదే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజానిజాలు తేలే అవకాశం ఉందన్నది అసలు నిజం. ఒకవేళ అంతా అనుకున్నట్టుగా అసదుద్దీన్ జగన్ పార్టీకి మద్దతిస్తే రాబోయే ఎన్నికలకోసం ఇప్పట్నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టే లెక్కని రాజకీయ వర్గాల అంచనా.  

కేసీఆర్ – చంద్రబాబు బస్తీమే సవాల్

        తెలంగాణపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ టిఆర్ఎస్ నేతలు, టిడిపి నేతలు సవాల్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అంటూ కేసీఆర్ చేస్తున్న వాదనల్ని కొట్టిపారేసేందుకు టిడిపి నేతలు కొంతకాలంగా తీవ్రస్థాయిలో తిరుగు సమాధానాలిస్తున్నారు.   చంద్రబాబు చర్చకి సిద్ధమేనా అంటూ టిఆర్ఎస్ నేత హరీష్ రావ్ చేసిన సవాల్ ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న టిడిపి నేత కడియం శ్రీహరి.. కెసీఆర్, హరీష్ రావ్ ల స్థాయికి చంద్రబాబు అవసరం లేదని తాను బహిరంగ చర్చకి సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు.   అటు హరీష్ రావ్ కూడా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు స్థాయికి, కడియం స్థాయికి తాను సరిపోతానని, బహిరంగ చర్చకి కేసీఆర్ అంత పెద్దమనిషి అవసరం లేదని వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఇరువర్గాలమధ్య సవాల్ , ప్రతి సవాల్ పర్వం ఘాటుగా సాగుతోంది.  

కేజ్రీవాల్ కీ రాఖీసావంత్ కీ లింకు

  ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్త కేజ్రీవాల్ కి, ఐటెం గర్ల్ రాఖీ సావంత్ కీ లింకు పెట్టేశారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. రాఖీ ఎప్పటికప్పుడు తన పేరు హైలైట్ అయ్యేలా తనకి తానుగా వివాదాలు సృష్టించుకుని ఎప్పుడూ వార్తల్లో నిలబడే ప్రయత్నం చేస్తుందని, ప్రస్తుతం కేజ్రీవాల్ వ్యవహారం కూడా అలాగే ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు.   కేవలం ప్రచారం కోసం కేజ్రీవాల్ రాజకీయ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప, ఆయన ఆరోపణల్లో పస లేనేలేదని దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేస్తున్నారు. రాఖీ సావంత్ కూడా అచ్చం ఇలాగే ప్రచారంకోసం పాకులాడుతుందని, ఇద్దరిమధ్యా చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల రాఖీ హర్టయితే తనకి ఏకిపారేస్తుందన్న ఆలోచన వచ్చిందేమో మళ్లీ దిగ్విజయ్ సింగ్ తాను చేసిన వ్యాఖ్యలపై నాలిక్కరుచుకున్నారు. కేజ్రీని రాఖీతో పోల్చాల్సి రావడం దురదృష్టకరమంటూ ఆమెకి క్షమాపణకూడా చెప్పారు. రాఖీకి నేను వీరాభిమానిని అంటూ 65ఏళ్ల వయసున్న దిగ్విజయ్ ట్వీట్ చేయడం మరో విచిత్రం.   దిగ్విజయ్ తనపై అనవసరంగా కామెంట్ చేశారని, అసలు తనకి కేజ్రీవాల్ కి దిగ్విజయ్ కి సంబంధం ఏంటో చెప్పాలని రాఖీసావంత్ మండిపడింది. దిగ్విజయ్ కోసం ఇప్పుడు కొత్తగా తనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ రీ ట్వీట్ చేసి రిటార్డ్ ఇచ్చింది.

కిరణ్ సర్కారుపై అసదుద్దీన్ ఆగ్రహం

  హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం వ్యవహారంపై ఎంఐఎం అలిగింది. కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తామంటూ అల్టిమేటమ్ జారీ చేసింది. ఎంఐఎం పార్టీకి 7గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. వీళ్లతో కలిపి ప్రస్తుతం కాంగ్రెస్ బలం 158. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 151కి పడిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 148. వాస్తవానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరిస్తే కాంగ్రెస్ కి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ లేదు.. కానీ.. పార్టీల బలాబలాల్లో తేడాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్. మారిన సమీకరణాలను బట్టి ఎవరైనా జగన్ పార్టీలోకి దూకడమో లేక మరే ఇతర ప్రయత్నం చేయడమో చేస్తే కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల ఎవరికీ ఏలాభం లేదు కాబట్టి ఎవరూ దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి లేకపోయినా ఓ విధంగా చూస్తే కాంగ్రెస్ బలం ఎంఐఎం మద్దతు ఉపసంహరణవల్ల తగ్గినట్టే. అసలే చిక్కుల సుడిగుండలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఇది మరో దెబ్బ. అసలు పరిస్థితి ఇంతవరకూ ఎలా వచ్చిందని అధిష్ఠానం నిలదీసే పరిస్థితి..

కుంభకోణాలకు అడ్డగా హైదరాబాద్: చంద్రబాబు

    హైదరాబాద్ ప్రస్తుతం కుంభకోణాలకు రాజధానిగా మారిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పేదల పేరును అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ధనాన్ని అడ్డంగా దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. జన౦ అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని బాబు అన్నారు. మోసం ఎప్పటికీ దాగదని, జనాల్ని మోసం చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పించుకోలేరనిని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. ఇప్పటికే జనాన్ని మోసం చేసిన వాళ్ళు జైళ్లో వూచలు లెక్కబెడుతున్నారని, కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. అవీనీతి ప్రభుత్వానీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.         కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని, ధరలు తగ్గాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యత్ ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోతే పట్టించుకొనే నాధుడే లేడన్నారు. కనీసం తాగునీటి బోర్లు కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులను 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.   

బాల్ ఠాక్రే పరిస్థితి విషమం

  శివసేన అధినేత బాల్ ఠాక్రే పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. బాల్ ఠాక్రే ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బాంద్రాలోని ఠాక్రే ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ సమయంలో ఆమెతో పాటు శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఉన్నారు. బాల్ ఠాక్రే ఆరోగ్యం బాగు పడాలంటూ ఆయన మేనల్లుడు రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన కార్యకర్తలు పలు దేవాలయాల్లో పూజలు చేశారు.   దసరా వేడుకల్లో బాల్ ఠాక్రే పాల్గొనకపోవడంతో అప్పటి నుంచే ఆయన ఆరోగ్యంపై సందేహాలు తలెత్తడం ప్రారంభించాయి.  ఆయన ఉద్ధవ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు తెలిసింది.  ఆయన అనారోగ్య కారణాలతో జూలైలో ఆసుపత్రిలో చేరారు.

ఎమ్మెల్యే కుమారుడి కీచక పర్వం...!

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ శాసనసభ్యుడి తనయుడు కామంతో కళ్ళు మూసుకుపోయి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కొడుకు తన అనుచరులతో కలిసి పదిహేడేళ్ల బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితారాలి ఫిర్యాదు మేరకు ముజఫర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ అహ్మద్ కొడుకు నయీమ్, ఎమ్మెల్యే బావమరిది నామన్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బసారియా గ్రామం నుంచి ఆ మైనర్‌ను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. విషయం బయటపెడితే చంపేస్తామని నిందితులు బాధితురాలని హెచ్చరించారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అహ్మద్ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.

నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తు౦ది: కేజ్రీవాల్

  వారానికి ఒకరిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరో అవినీతి బాగోతాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దేశంలో నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై చర్చ జరుతోందిగానీ, ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయడంలేదని ఆయన ధ్వజమెత్తారు. స్విస్ బ్యాంక్‌లో 700 మంది భారతీయులకు ఎకౌంట్లు ఉన్నాయని చెప్పారు. వారికి రూ. 6000 కోట్లు విలువచేసే ఖాతాలు ఉన్నాయని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ పని తీరు చాలా దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 25 లక్షల కోట్లు విదేశీ బ్యాంక్‌లో మూలుగుతున్నాయని, ఓ సీబీఐ మాజీ అధికారి చెప్పారని అన్నారు. ఆ రూ. 25 లక్షల కోట్లలో ఆరువేల కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటూ, అందుకు సంబంధించిన ప్రతాలను కేజ్రీవాల్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.   ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు స్విస్ బ్యాంక్‌లో చెరో వంద కోట్లు జమచేశారని, వారి తల్లి కోకిలా బెన్‌కు కూడా స్విస్ బ్యాంక్‌లో ఎకౌంట్ ఉందని కేజ్రీవాల్ తెలిపారు. మరి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ళ నివాసాల్లో ఎందుకు సోదాలు చేయరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందని, అందుకు హెచ్.ఎస్.బీ.సీ. అధికారులే సూత్రధారులని ఆయన మండిపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంవాద్ బైఠక్ అను మేథోమథనం

    కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఏపీకి పెద్దపీట వేశామనిపించుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఇక రాష్ట్రం విషయాన్ని పెద్దగా పట్టించుకునే సూచనలు కనిపించడం లేదు. సూరజ్ కుండ్ లో జరిగిన మేధోమథనంలో దీనికి సంబంధించి స్పష్టమైన సూచనలు కనిపించాయి. రాష్ట్రంలో రగులుతున్న తెలంగాణ అంశంగురించి ఈ మేధోమథన సదస్సులో నామమాత్రమైనా చర్చ జరగనే లేదు. అసలు అదో పెద్ద విషయంకూడా కాదన్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం ధోరణి కనపడింది.   సూరజ్ కుండ్ లో పార్టీ కాన్ సన్ ట్రేషన్ పూర్తిగా 2014 ఎన్నికలమీదే కనిపించింది. మిగిలిఉన్న సమయం చాలా కీలకమని, గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలని సోనియా చెప్పారు. ఈ సదస్సులో యువనేత రాహుల్ కి కీలక బాధ్యతలు అప్పజెబుతారంటూ వినిపించిన వార్తల్లో మాత్రం వాస్తవం కనిపించలేదు.   ధరల పెరుగుదలని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సోనియా ఈ సదస్సులో గట్టిగా కోరారు. సబ్సిడీ సిలిండర్ల ధరని 6 నుంచి 12 కి పెంచాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులకు మాత్రమే ఆహ్వానం అందడంవల్ల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లలేదు. పిసిసి చీఫ్ బొత్సకూడా ఇదే కారణంవల్ల దూరంగా ఉన్నారు. లండన్ పర్యటననుంచి వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈ సదస్సుకి హాజరుకాలేకపోయారు.  

స్విస్ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్

    వారానికి ఒకరిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరో అవినీతి బాగోతాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దేశంలో నల్లధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై చర్చ జరుతోందిగానీ, ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయడంలేదని ఆయన ధ్వజమెత్తారు.   స్విస్ బ్యాంక్‌లో 700 మంది భారతీయులకు ఎకౌంట్లు ఉన్నాయని చెప్పారు. వారికి రూ. 6000 కోట్లు విలువచేసే ఖాతాలు ఉన్నాయని, ఆ వివరాలు తమ వద్ద ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. జెనీవాలోని హెచ్ఎస్‌బీసీ పని తీరు చాలా దారుణంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 25 లక్షల కోట్లు విదేశీ బ్యాంక్‌లో మూలుగుతున్నాయని, ఓ సీబీఐ మాజీ అధికారి చెప్పారని అన్నారు. ఆ రూ. 25 లక్షల కోట్లలో ఆరువేల కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటూ, అందుకు సంబంధించిన ప్రతాలను కేజ్రీవాల్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు స్విస్ బ్యాంక్‌లో చెరో వంద కోట్లు జమచేశారని, వారి తల్లి కోకిలా బెన్‌కు కూడా స్విస్ బ్యాంక్‌లో ఎకౌంట్ ఉందని కేజ్రీవాల్ తెలిపారు. మరి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాళ్ళ నివాసాల్లో ఎందుకు సోదాలు చేయరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందని, అందుకు హెచ్.ఎస్.బీ.సీ. అధికారులే సూత్రధారులని ఆయన మండిపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కనికరించు సత్తెన్నా..!

  ఆకాశమంత పందిరి, భూదేవంత పీట.. పెళ్లి మండపం తయారీ ఖర్చే దాదాపు రెండు కోట్ల రూపాయలు.. అతిరథమహారథులైన అతిథులు.. పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు కూతురు పెళ్లి ఇలా అంగరంగ వైభవంగా జరిగింది. పిలిచినవాళ్లూ, పిలవని వాళ్లూ, సత్తెన్న కూతురు పెళ్లి చూసొద్దామని వెళ్లొచ్చినోళ్లూ.. అంతా సంతోషించారు. వేడుకకూడా ముచ్చటగా పూర్తైంది.   కానీ.. పెళ్లి కోసం బలవంతంగా లాక్కున్న ప్రైవేట్ వాహనాల యజమానులు మాత్రం మా వాహనాలు మాకిప్పించు సత్తెన్నా అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. అద్దెమాట దేవుడెరుగు, ముందు ఆర్సీ పుస్తకాలతో సహా తమ వాహనాల్ని తమ చేతిలో పెడితే గిరాకీల్ని కాపాడుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుంటామని మొరపెట్టుకుంటున్నారు.   సత్తిబాబు కూతురు పెళ్లికోసం ఆర్టీయే అధికారులు ఆర్సీ పుస్తకాలతో సహా చాలామంది దగ్గర ప్రైవేట్ వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీయే అధికారులు రోజుకి చెల్లించే అద్దె వెయ్యిరూపాయలు, ఇండికాకైతే 3 0 లీటర్లు, ఇన్నోవాలాంటి పెద్ద వాహనాలకైతే 40 లీటర్లు డీజిల్ ఇస్తారు. డ్రైవర్ కి రోజుకి 200 రూపాయల బేటా.. ఇవన్నీ లెక్కేసుకుంటే అధికారుల అధీనంలో ఉన్న వాహనాలకు ఇప్పటికే దాదాపు లక్షన్నరకు పైగా అద్దె కట్టాల్సుంది.   పెళ్లిళ్ల సీజన్ లో బండ్లు లేక వాహనాల యజమానులు యమ యాతన పడుతున్నారు. ఇవ్వాల్సిన డబ్బు సంగతి తర్వాత చూసుకుందాం.. ముందు మా బళ్లు మాకిచ్చేస్తే పెళ్లిళ్ల సీజన్ లో నాలుగురాళ్లు సంపాదించుకుంటామంటూ వాహనాల యజమానులు కాళ్ల చెప్పులరిగేలా సత్తిబాబు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు.

ఇక నరసింహావతారమే..!

  మరోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్మించి దగా చేసిందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర సాధనకు ఇకపై డెడ్ లైన్లుండవని, పూర్తిగా డెత్ లైన్లే ఉంటాయని హెచ్చరించారు. టిఆర్ ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధిష్ఠానంనుంచి కనీస స్పందన కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ దెబ్బతో టిఆర్ఎస్ కి కాంగ్రెస్ శని వదిలిపోయిందని, నల్గొండజిల్లా సూర్యాపేట సభలో ఆ పార్టీకి నీళ్లొదులుతామని కేసీఆర్ ప్రకటించారు. కరీంనగల్ లో జరిగిన రెండు రోజుల మేధోమథనంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని కెసిఆర్ చెప్పుకొచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పాటుని ఎవరూ ఆపలేరంటూ సవాల్ చేశారు.   2014 ఎన్నికల్లో సిపిఐతో సహా ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా నేరుగా ఎన్నికల్లో నిలబడతామని కెసీఆర్ తేల్చి చెప్పారు. ఇకపై కాంగ్రెస్ లో టిఆర్ ఎస్ విలీనం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టారు. “ కేసీఆర్ మౌనం వీడి మార్కెట్లో రిలీజైండు. ఇగ నరసింహావతారం చూస్తరు, రోజూ కార్యక్రమాలుంటయ్.. తెలంగాణ భవన్ ల సందడే సందడి “ అంటూ ఉత్సాహంగా సమరనాదం చేశారు.

కాంగ్రెస్ మేధోమథన సదస్సు ప్రారంభ౦

  త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. లోకసభ ఎన్నికలు ము౦దస్తుగా జరగొచ్చన్న ఉహాగానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీనీ పటిష్టం చేసేందుకు బలహీనంగా ఉన్న స్థానాల్లో బలాన్ని పుంజుకునే౦దుకు మేధోమథనం అవరసమని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందుకోసం సూరజ్‌కుండ్‌లో భారీ సదస్సును ఏర్పాటు చేసింది. ఢిల్లీ శివారులోని సూరజ్‌కుండ్‌లోకాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలంతా సమావేశమౌతున్నారు. యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పూర్తిస్థాయి అంతర్మథనమిది. ఈ సదస్సులో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యువ నేత రాహుల్,19 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 16 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 23 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు, 12 మంది స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులతో పాటు మొత్తం 70 మంది పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ కీలకమైన ఉపన్యాసం చేస్తారు. దాని ఆధారంగానే చర్చ మొదలౌతుంది. తర్వాత ప్రధాని ప్రసంగిస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు లాకులు ఎత్తడం, డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల కోత వంటి కఠిన నిర్ణయాలపై వివరణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశానికీ ఇది పరీక్షా సమయమని, విధిలేని పరిస్థితుల్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి చిదంబరం ప్రసంగం ఉంటుంది.

చంద్రబాబు పై బాంబు దాడి, ఇద్దరికి ఏడేళ్ళు జైలు

  2003 అక్టోబర్ 1 తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పై మావోయిస్టులు జరిపిన బాంబుదాడి కేసులో నాగార్జున, రామస్వామి అనే ఇద్దరికి ఏడేళ్ళు జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాల్గో అదనపు జడ్జి ఈశ్వరరావు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మరో ఇద్దరు మావోయిస్టునేత సాగర్ అలియాస్ (పాండురంగారావు), గంగిరెడ్డిలను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. అయితే సాగర్‌పై ఇతర కేసులు ఉన్నందున ఆయనను అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకు కోర్టు ఆదేశించింది.       2003 అక్టోబర్ 1న నాటి ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుపతిలోని అలిపిరి వద్ద మావోయిస్టులు బాంబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు సజ్జల గోపాలకృష్ణ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు గాయపడ్డారు. 2004లో దీనిపై ఛార్జీషీటు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి 2004లో 33 మందిపై పోలీసులు కేసు నమోదుచేస్తూ చార్జీ షీటు దాఖలు చేశారు. అందులో 24 మంది ఆచూకి పోలీసులు కనుగొనలేకపోయారు. మిగిలిన ఐదుగురిలో కేసు విచారణలో ఉండగా ఒకరు మృతి చెందారు. నలుగురిలో ఇప్పుడు ఇద్దరికి శిక్ష పడగా మరో ఇద్దరికి విముక్తి కలిగింది.