కూతురు వయసున్న అమృతతో దిగ్విజయ్ కనెక్షన్

      ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన కూతురు వయసున్న టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆమెతో దిగ్విజయ్ సన్నిహితంగా వున్న ఫొటోలు మీడియాలో లీక్ కావడం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పెళ్ళయిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు రాజ్యసభ టీవీ ఛానెల్ యాంకర్ అయిన అమృతతో గ్రంథం నడుపుతున్నాడు. తన గుట్టు మీడియాలో బయటపడేసరికి కంగుతిన్న దిగ్విజయ్ సింగ్ ఆమెను తాను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టుగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అలా తన ఘనకార్యానికి లీగాలిటీ లేబుల్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్న అమృత చేత ఆమె భర్తకి విడాకులు ఇప్పించే ప్లాన్ కూడా దిగ్విజయ్ సింగ్ దిగ్విజయంగా పూర్తి చేశాడు. త్వరలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని, ఆమెను తాను పెళ్ళి చేసుకోబోతున్నానని అయ్యగారు సగర్వంగా ప్రకటించాడు.

చంద్రబాబు, నరేంద్రమోడీ.. ఇద్దరూ ఇ.సి.కి దొరికారు

  ఇద్దరు మిత్రులు తెలుగుదేశం అధినేత, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇద్దరూ ఎన్నికల కమిషన్‌కి దొరికిపోయారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఓటు వేశాక మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ ఓటు ఎవరికి వేసింది బయటకి చెప్పకూడదు. దాంతో చంద్రాబాబు ఓటు చెల్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ప్రకటించారు. అలాగే అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడే సందర్భంలో తన చేత్తో కమలం గుర్తును పట్టుకుని మీడియాకి చూపించారు. ఈ దృశ్యాలు దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్ళలో ప్రదర్శితమయ్యాయి. ఇలా బీజేపీ గుర్తును చూపించడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిశీలించి నరేంద్ర మోడీ మీద కేసు నమోదు చేసింది. ఇలా ఇద్దరు మిత్రులూ ఒకేసారి ఇ.సి.కి దొరికిపోయారు.

కారులో కాలిపోయిన డబ్బు రెండున్నర కోట్లు: భన్వర్ లాల్

  నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర ఒక ఇన్నోవా కారులోని ఇంజన్ దగ్గర పెట్టిన డబ్బు దగ్ధమైంది. ఈ కారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన ఈ కారులో కాలిపోయిన డబ్బు కోటి రూపాయల వరకు ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు. అయితే ఇక్కడ కాలిపోయిన డబ్బు రెండున్నర కోట్లు అని తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. ఎన్నికలలో పంచేందుకు తీసుకెళ్తున్న డబ్బు పోలీసుల కంట పడకుండా వుండాలన్న ఉద్దేశంతో కారు ఇంజన్ దగ్గర పెట్టగా ఇంజన్‌లో వేడికి ఇంజన్ పక్కనే వున్న డబ్బు కాలిపోయినట్టు తెలుస్తోంది. డబ్బు తీసుకెళ్తున్న ఇన్నోవా మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి వుంది. ఈ కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి వున్నట్టు తెలుస్తోంది.

అవును.. ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నాను: దిగ్విజయ్ సింగ్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించడానికి ప్రధాన కారకుడైన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తక్కువోడేం కాదు.. గురుడు మహా గ్రంథసాంగుడే. ఆల్రెడీ పెళ్ళయిన ఈ పెద్దమనిషి అమృతా రాయ్ అనే రాజ్యసభ టీవీ యాంకర్‌తో సంబంధ బాంధవ్యాలు నెరపుతున్నాడు. ఈ విషయం మీద ఇప్పటికే రాజకీయంగా దుమారం రేగుతోంది. చాలాకాలంగా ఈ విషయం మీద రాజకీయ పార్టీలు దిగ్విజయ్‌ని విమర్శిస్తున్నాయి. తాజాగా అమృతా రాయ్‌తో దిగ్విజయ్ ‘చాలా’ సన్నిహితంగా వున్న ఫొటోలు ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇక తాను ఎంత దాచినా లాభంలేదని అనుకున్నాడేమోగానీ, దిగ్విజయ్ సింగ్ తన వ్యక్తిగత విషయాన్ని ట్విట్టర్‌లో బయటపెట్టాడు. తనకు, అమృతా రాయ్‌కి సంబంధం వుందని, ఆమెని త్వరలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అమృతా రాయ్ తన భర్తతో విడాకులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుందని కూడా ఆయన వెల్లడించాడు. తన వ్యక్తిగత విషయాలలో ఎవరైనా చొరబడితే ఒప్పుకోనని కూడా ఈ పెద్దమనిషి ట్విట్ చేశాడు.

చంద్రబాబు ఓటు చెల్లదు: ఇ.సి. భన్వర్‌లాల్

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూబిలీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని, అటు అసెంబ్లీకి గానీ, ఇటు పార్లమెంట్‌కి గానీ తమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో లేనందున తమ మిత్ర పక్షమైన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ ఓటు ఎవరికి వేసింది బయటకి చెప్పకూడదు. అయితే చంద్రబాబు తాను ఓటు బీజేపీకి వేసినట్టు చంద్రబాబు ప్రకటించడంతో ఆయన ఓటు చెల్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ప్రకటించారు.

కారులో కాలిపోయిన డబ్బు కోటి పైనే?

  నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర ఒక ఇన్నోవా కారులోని ఇంజన్ దగ్గర పెట్టిన డబ్బు దగ్ధమైంది. ఈ కారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందినట్టు తెలుస్తోంది. ఎన్నికలలో పంచేందుకు తీసుకెళ్తున్న డబ్బు పోలీసుల కంట పడకుండా వుండాలన్న ఉద్దేశంతో కారు ఇంజన్ దగ్గర పెట్టగా ఇంజన్‌లో వేడికి ఇంజన్ పక్కనే వున్న డబ్బు కాలిపోయినట్టు తెలుస్తోంది. డబ్బు తీసుకెళ్తున్న ఇన్నోవా మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి వుంది. ఈ కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి వున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటలో మొత్తం కోటి రూపాయలకు పైనే డబ్బు కాలిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి అరెస్టు

  మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ మీద పోటీ చేస్తున్న టీడీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్‌లో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. అయితే నిజానికి అరెస్టు చేయాల్సింది తనని కాదని, డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లని ప్రభావితం చేస్తున కేసీఆర్నేనని ప్రతాప్ రెడ్డి అంటున్నారు. పోలీసులు కేసీఆర్‌కి అమ్ముడు పోయారని ప్రతాప్ రెడ్డి విమర్శిస్తున్నారు. ప్రతాప్ రెడ్డిని ఎన్నికలు పూర్తయ్యే వరకు హౌస్ అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.

పోలింగ్ సీన్: బుద్ధిగా క్యూలో నిల్చుంటున్న ప్రముఖులు

  జూబిలీ హిల్స్ పోలింగ్ స్టేషన్‌లో క్యూలో నిల్చోకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన నటుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. చిరంజీవికి ఎదురైన అనుభవం మీడియాలో టామ్ టామ్ అయిపోవడంతో ప్రముఖులెవరూ డైరెక్ట్ గా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళడానికి సాహసించకుండా, బుద్ధిగా క్యూలో నిల్చుంటున్నారు. రాజకీయాల్లో ఎలా వుండాలో చాలామంది నాయకులు నేర్పించారు. రాజకీయాల్లో ఎలా వుండకూడదన్న విషయాన్ని నిరూపించిన చిరంజీవి, ఇప్పుడు ఓటు వేసే విషయంలో కూడా చాలామందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎలా ఓటు వేయకూడదో ప్రాక్టికల్‌గా చెప్పారు.

బ్రహ్మానందం ఓటు గల్లంతు.. నీ ఎంకమ్మ!

  తన కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టే బ్రహ్మానందాన్ని ఎన్నికల సిబ్బంది విలవిలలాడేలా చేశారు. పాపం బ్రహ్మానందం బుధవారం మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్లతో కలసి జూబిలీహిల్స్ లోని జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. బాధ్యతగల పౌరుడిలా క్యూలో నిల్చుని ఓటు వేయడానికి వెళ్ళారు. తీరా ఓటింగ్ దగ్గరకి వచ్చేసరికి బ్రహ్మానందానికి కళ్ళు తిరిగే వార్త తెలిసింది. తన ఓటు గల్లంతైపోయినట్టు తెలుసుకున్న బ్రహ్మానందం అవాక్కయిపోయాడు. మరోసారి పరిశీలించమని ఆయన ఎన్నికల సిబ్బందిని కోరారు. అయితే ఎన్నిసార్లు పరిశీలించినా లేని ఓటు ఎక్కడి నుంచి వస్తుంది? తన ఓటు గల్లంతైపోయిందని తెలుసుకున్న బ్రహ్మానందం చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు. అందరినీ నవ్వించే బ్రహ్మానందం విషయంలో భలే కామెడీ జరిగింది. కిల్‌బిల్‌ పాండే ఓటు అన్యాయంగా కిల్ అయిపోయింది. బ్రహ్మానందం ఓటు గల్లంతైన విషయాన్ని తెలుసుకున్న క్యూలో వున్నవాళ్ళు ‘నీ ఎంకమ్మ’ అనుకుంటూ నవ్వుకున్నారు.

ఓటర్లని చావబాదారు.. గర్భిణికి గాయాలు!

  బాధ్యతగల పౌరులుగా ఓటు వేయడానికి వెళ్ళిన ఓటర్లని పోలీసులు లాఠీలతో చావబాదారు. ఈ దుర్మార్గం మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలో జరిగింది. ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గర భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో వుండటం వల్ల కొంత తోపులాట జరిగింది. దాంతో అవకాశం దొరికింది కదా అని పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఓటర్లని నిర్దాక్షిణ్యంగా లాఠీలతో బాదడం ప్రారంభించారు. దాంతో ఓటర్లు చెల్లాచెదురైపోయారు. పోలీసులతోపాటు మరికల్ ఎస్.ఐ. శ్రీధర్ కూడా తన లాఠీకి పని చెప్పాడు. ఒక గర్భిణిని శ్రీధర్ విపరీతంగా కొట్టడంతో ఆమెకి గాయాలయ్యాయి. పోలీసుల దుర్మార్గాన్ని స్థానిక ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు.

రాహుల్ ప్రచార వాహనాన్ని ఢీకొన్న రైలు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనలో ప్రచారం కాన్వాయ్‌లో వుండే జామర్ వాహనాన్ని పోలీసులు సిద్ధం చేశారు. ఈ వాహనం హిందూపురం సమీపంలోని గుడ్డం దగ్గర గేటులేని రైల్వే ట్రాక్‌ని దాటుతున్న సమయంలో బెంగుళూరు వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్ ప్రెస్ ఢీకొంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన పోలీసు సిబ్బంది సదరు వాహనంలోంచి బయటకి దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడిన జామర్ వాహనం డ్రైవర్ని హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

అవసరమైతే అర్ధరాత్రి వరకు ఓటింగ్: భన్వర్‌లాల్

  తెలంగాణలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తప్ప సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన పక్షంలో అర్ధరాత్రి వరకు అయినా పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ బూత్‌ దగ్గరకి వచ్చిన ఓటర్లందరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని, 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్ని వందలమంది ఓటర్లు ఉన్నా వారందరూ ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. అవసరమైతే అర్ధరాత్రి వరకు అయినా ఓటింగ్‌కి అనుమతి ఇస్తామని భన్వర్ లాల్ చెప్పారు.

పవన్ ఓటు సందేశం: సినిమా టిక్కెట్ల కోసం నిల్చుంటాం కానీ...

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబిలీహిల్స్ లోని గాయత్రి హిల్స్ పోలింగ్ కేంద్రంలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం మంచిది కాదని అన్నారు. మనకి ఇష్టమైన సినిమా చూడాలన్న ఉద్దేశంతో టిక్కెట్ల కోసం గంటలు గంటలు క్యూలో నిల్చుంటాం. మన భవిష్యత్తుని నిర్ణయించే ఓటు వేయడానికి మాత్రం బద్ధకిస్తాం. ఇది మంచి పద్ధతి కాదని, అందరూ తమ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలని అన్నారు.

గవర్నర్ నరసింహన్‌కీ తప్పని ఈవీఎం గండం!

  తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణలోని చాలా పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దాంతో చాలా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోవడం, లేదా ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది. ఈసీఐఎల్ కంపెనీ తయారు చేసిన ఈవీఎంలే మొరాయిస్తున్నాయని ఎన్నికల ప్రధాన అధికారం భన్వర్ లాల్ చెప్పారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఈవీఎంల బారిన పడ్డారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన ఓటు వేయడానికి అందరికంటే ముందున్నారు. రాజ్‌భవన్ ఏరియాలోని ఎం.ఎస్. మక్తాలోని పోలింగ్ కేంద్రనికి గవర్నర్ ఉదయాన్నే తన భార్యతో కలసి వెళ్ళారు. అయితే ఆయన ఓటు వేయడానిక వెళ్ళిన ఈవీఎం మొరాయించింది. దాంతో ఆయన సదరు ఈవీఎంని బాగు చేసేంతవరకూ వేచి వుండి ఆ తర్వాత ఓటు వేశారు.

పోలింగ్ సీన్: రెండు గంటల్లో 14 శాతం ఓటింగ్

  తెలంగాణ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే.. అంటే ఉదయం 9 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 14 శాతం ఓటింగ్ జరిగింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 17 శాతం ఓటింగ్ కూడా జరిగింది. హైదరాబాద్‌లో మాత్రం 11 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం మరింత పుంజుకునే అవకాశం వుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ అన్ని ఏరియాలలో ప్రశాంతంగా జరుగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని భన్వర్ లాల్ తెలిపారు.