ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్న కిషన్‌రెడ్డి..!

  కిషన్‌రెడ్డి... ప్రస్తుత హోదా బీజేఎల్పీ నేత... అయితే ఏడాది క్రితం వరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన...  ఇంకా ఆ మూడ్‌లో నుంచి బయటికి రావడం లేదంట... కొత్త అధ్యక్షుడు వచ్చి ఏడాది దాటిపోతున్నా... ఇంకా పార్టీలో అన్నీ తానే... అంతా తానే అనే ఫీలింగ్ లో ఉంటున్నారట. సుదీర్ఘకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పనిచేసి ఉండటంతో... ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్నారట. అందుకే కొత్త అధ్యక్షుడి కింద పనిచేయలేక పార్టీ సమావేశాలను సైతం కూడా లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు.. ఆయన మీటింగ్ పెట్టిన రోజు... మరెవరూ మీటింగ్‌లు పెట్టకూడదంటూ అనధికారికంగా ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహారశైలి పార్టీ నేతలకు, శ్రేణులకు తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేకాదు చింత చచ్చినా... పులుపు చావలేదంటే ఇదేనేమో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటికీ తానే అధ్యక్షుడిననే ఫీలింగ్ లో కంటిన్యూ అవుతూ... నేను చెప్పిందే శాసనం... నేను పెట్టిందే మీటింగ్ అంటున్నారని... అంతేకాదు చిన్న చిన్న విషయాలకీ అలగడం కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందంటున్నారు.   అధ్యక్ష పదవిలో ఉన్నన్నాళ్లూ హల్‌చల్‌ చేసిన కిషన్‌రెడ్డి... పదవీకాలం ముగియగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం తగ్గించేశారని... చివరికి ఇటీవల జరిగిన అమిత్‌షా టూర్‌‌లో అంటీముట్టనట్టు వ్యవహరించారని అంటున్నారు. కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు అమిత్‌షాకి కంప్లైంట్‌ చేయడంతో... కిషన్‌కి క్లాస్‌ కూడా పీకారట. అయినా కిషన్‌రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటిలాగానే పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారని చెప్పుకుంటున్నారు. మొన్నటిమొన్న తెలంగాణ అంతటా నిర్వహించిన బీజేపీ విస్తారక్‌ కార్యక్రమానికి కూడా కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారని, అమిత్‌ షా ఆదేశించిన ప్రోగ్రామ్‌ను కూడా పట్టించుకోలేదంటే... అసలు అంత ధైర్యం కిషన్‌రెడ్డికి ఎలా వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు.   ఇక పార్టీ రివ్యూ మీటింగ్స్‌కి కూడా కిషన్‌రెడ్డి హాజరుకావడం లేదట. అంతేకాదు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరైన సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారట. మరోవైపు మీడియాకి ముందుగా సమాచారమిచ్చిన ప్రెస్‌మీట్‌‌లను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇలా రద్దు చేసుకోవడానికి... మరొకరు అదేరోజు మీడియా సమావేశం పెట్టడమే కారణమంటున్నారు. కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టిన రోజే... బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు కూడా మీడియా సమావేశం పెట్టడంతో... ఎందుకు పెట్టారంటూ కిషన్‌ రుసరుసలాడారంట. ఒకేరోజు రెండు ప్రెస్‌మీట్‌లు పెడితే పార్టీ ఇమేజ్‌ ఏం కావాలంటూ రఘునందన్‌పై కిషన్‌‌రెడ్డి ఫైరయ్యారట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహార శైలిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీలో ఏం జరిగినా తనకు చెప్పే జరగాలన్నట్లుగా కిషన్‌రెడ్డి వ్యవరిస్తున్నారని, ఇప్పటికీ తానే అధ్యక్షుడినన్నట్లుగా దర్పం ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

కిరణ్‌రెడ్డి చెప్పిన పెళ్లికూతురు తెలిసినట్లేనా? లేక ఉత్తుత్తి ప్రచారమేనా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా... గత ఎన్నికల్లో కనీసం తన సొంత నియోజకవర్గంలోనూ పట్టు నిలుపుకోలేకపోయిన మాజీ సీఎం కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి....మరోసారి వార్తల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో అసలు ప్రజల్లోకి రావడమే మానేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి..... ఈ రెండున్నరేళ్లలో రెండుమూడుసార్లు మాత్రమే మీడియాకి కనిపించారు. సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు సైతం కోల్పోవడంతో.... పొలిటికల్‌ లోప్రొఫైల్‌ పాటిస్తోన్న కిరణ్‌రెడ్డి‌.... రాజకీయంగా మళ్లీ యాక్టివ్‌ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.   బీజేపీలో చేరుతున్నారని ఒకసారి.... కాదుకాదు టీడీపీలోకి వెళ్తారంటూ మరోసారి... లేదులేదు మళ్లీ పాత గూటికే చేరతారంటూ వార్తలు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇవేమీ కాదు యువ నాయకత్వంలో కీ రోల్‌ పోషించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. గతంలో తాను తీవ్ర విమర్శలు చేసిన పార్టీల్లోకి వెళ్లడం కంటే... కొత్త పార్టీ జనసేన వైపు వెళ్లడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారన్న మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి వదంతులే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆమధ్య సొంత జిల్లా చిత్తూరులో ఓ పెళ్లికి హాజరైన కిరణ్‌‌రెడ్డి... ఇప్పటికైతే పెళ్లి కుదిరింది.... తాళిబొట్టు కట్టే తేదీ ఖరారైతే మీకందరికీ చెబుతానంటూ.... కొత్త రోల్‌పై అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. దాంతో కిరణ్‌ ఏ పార్టీలో చేరతారోనంటూ కొద్దిరోజులు చర్చ నడిచింది.   పెళ్లి కుదిరింది.... పెళ్లికూతురు మాత్రం గోప్యమంటూ.... తాను చేరబోయే పార్టీ ఫిక్సైందన్న సంకేతాలిచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.... సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ వార్తలు వచ్చినా... కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మళ్లీ పాత గూటినే ఎంచుకున్నట్లు చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిని చేసి... అందలమెక్కించిన కాంగ్రెస్‌‌లోనే తిరిగి చేరాలని డిసైడ్‌ అయ్యారట. అంతేకాదు కిరణ్‌కు ఏఐసీసీ స్థాయి పదవి కట్టబెడతారనే ప్రచారం కూడా జరిగిపోయింది. మరి ఇదైనా నిజమవుతుందో... లేక కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్‌లో కులాల కుంపటి... ఓసీ వర్సెస్‌ బీసీ...

  తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలిస్తే ఓసీ నాయకుల ప్రతిభ.. ఓడితే BC నేతల బాధ్యతా... అంటూ టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం మండిపడుతోంది. పార్టీలో కేవలం ఒక వర్గం వారే పెత్తనం చెలాయిస్తూ ఒంటెత్తు పోకడలు పోతున్నారని బీసీ నేతలు ఫైరవుతున్నారు. 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నందువల్లే పార్టీ ఓడిపోయిందని దుష్ర్పచారం చేస్తున్నార‌ని, ఇలాంటి ప్రచారం వ‌ల్ల బీసీలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంద‌ని హెచ్చరిస్తున్నారు. కొందరు ఓసీ నేతలు.... బ‌ల‌హీన వ‌ర్గాల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని, వాళ్లు తమ వైఖరి మార్చుకోకపోతే... హైకమాండ్ కి ఫిర్యాదు‌ చేస్తామని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం అల్టిమేటం ఇచ్చింది.   కాంగ్రెస్‌ పార్టీకి మొదట్నుంచీ వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలను గుర్తించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం సీట్లివ్వడమే కాకుండా... వారి గెలుపు కోసం పార్టీ కృషి చేయాలని అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న బీసీలకు పార్టీలో తగిన ప్రాతినిధ్యం ఇస్తేనే ప్రజ‌ల్లో న‌మ్మకం పెరుగుతుంద‌ని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం అంటోంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తేనే... 2019లో అధికారంలోకి వస్తామని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుకెళ్లాలని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం ఉత్తమ్‌కు సూచించింది.   టీపీసీసీతోపాటు ఏఐసీసీ పదవులు కూడా బీసీలకు వచ్చేవిధంగా చూడాలని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం డిమాండ్ చేస్తోంది. ఓవరాల్‌గా పార్టీలో బీసీలకు ప్రాధాన్యత పెంచాలని... అదే సమయంలో బలహీనవర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి బీసీ నేతల డిమాండ్లపై హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలంగాణలో మారుతోన్న రాజకీయ ముఖచిత్రం...

  తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు జరగబోతోందని అంటున్నారు. మొన్నటివరకూ ఢీ అంటే ఢీ అన్న పార్టీలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. శత్రువు శత్రువుకు మిత్రుడన్నట్లుగా... ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇదే థియరీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఈ రెండు పార్టీలూ... ఇప్పుడు ఉమ్మడి శత్రువును టార్గెట్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. అమిత్‌షా తెలంగాణ పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య కొద్దిరోజులు మాటల యుద్ధం నడిచినా... రాష్ట్రపతి ఎన్నిక వీరిద్దరినీ దగ్గర చేసిందని చెబుతున్నారు. అంశాల వారీగా కలిసి పనిచేయడం ద్వారా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌‌ను బలహీనపర్చాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది.   ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న కేసీఆర్‌... తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోడీతో ఉన్న చనువుతోనే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ ధీమాగా ఉన్నారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమైనా... తెలంగాణలో తీసుకొచ్చిన 12శాతం బీసీ-ఈ రిజర్వేషన్లకు కేంద్రం అనుమతిస్తుందన్న నమ్మకంతో కేసీఆర్‌ ఉన్నారంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో కేసీఆర్‌కి మోడీ హామీ కూడా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. మోడీ ఇచ్చిన భరోసాతోనే ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ ధీమా ఉన్నారని అంటున్నారు.   రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించిన వెంటనే అందరి కంటే ముందుగా కేసీఆర్‌ మద్దతు ప్రకటించడం, ప్రెసిడెంట్‌ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం, ఢిల్లీ పర్యటనలో మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలవడం, వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం, ఇవన్నీ టీఆర్‌ఎస్‌-బీజేపీ నయా దోస్తీకి రుజువు అంటున్నారు. కేసీఆర్‌ రియాక్షన్‌, గులాబీ నేతల సైలెన్స్‌ చూస్తుంటే... రెండు పార్టీలూ కలిసి ట్రావెల్‌ చేయడం ఖాయమంటున్నారు. అంతేకాదు ఎన్నికల వరకూ కలిసి పనిచేస్తూ... అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి... ప్రీ పోల్‌ అలయన్స్‌... లేదా పోస్ట్‌ పోల్‌ అలయన్స్‌ పెట్టుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌తో దోస్తీని తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తున్నా... భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మౌనం దాల్చుతోంది.

రాజుగారి కోటలో గంటా దూకుడు... ఆధిపత్య పోరులో అశోక్‌ సతమతం !

  శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని ఎలా అంటామో విజయనగరం జిల్లా టీడీపీలో అశోక్ ఆజ్ఞ లేనిదే కనీసం కార్పొరేటర్ కూడా కాలేరంటారు. అందుకే రాజుగారి దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడతారు. ఆయన చెప్పినదే వేదవాక్కు అంటూ చేతులు కట్టుకుని మరీ వినయంగా వింటారు. అటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున ఒక పదవి రావాలన్నా... నామినేటెడ్ పదవులు దక్కాలన్నా.... చివరికి ఎమ్మెల్యే సీటు దక్కాలన్నా అశోక్ సంప్రదింపులు లేకుండా అధిష్టానం సైతం ఎంపిక చేయదనే పేరుంది. అందుకే విజయనగరం జిల్లా టీడీపీ నాయకులకు అశోక్ గజపతిరాజు అంటే అంత హడల్. అందుకే అశోక్ ప్రసన్నం కోసం ఆయన బంగ్లా చుట్టూ చక్కెర్లు కొడతారు. రాజుగారి చూపు తనపై ఎప్పుడు పడుతుందా అంటూ వేచి చూస్తారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అశోక్‌ మాటకు అధిక విలువ ఇస్తారంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. శాసించడం... ఆదేశించడం తప్ప... తన మాటకు ఎదురేలేని కేంద్ర మంత్రి అశోక్ కోటలో ఆధిపత్య పోరు మెుదలైంది. తెలుగుదేశం పార్టీకే పెద్దదిక్కుగా ఉంటూ ఉత్తరాంధ్రలో చక్రం తిప్పే ఆయన స్పీడ్‌కు బ్రేకులు పడుతున్నాయి. విజయనగరంలో రాజుగారి సైకిల్‌ స్పీడ్‌కు ఇన్‌ఛార్జ్‌ మంత్రి బ్రేకులు వేస్తున్నారు. అదే సమయంలో అధిష్టానం దగ్గర రాజుగారి పరపతి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది.  టీడీపీలో అశోక్‌కు ప్రత్యేక స్థానమున్నా... పార్టీ అవసరాల దృష్ట్యా రాజుగారి మాటను పక్కనబెడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును టీడీపీలోకి తీసుకోవడమే కాకుండా, మంత్రి పదవి కట్టబెట్టడంలోనూ అశోక్‌ అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాదు టీడీపీ పార్లమెంటరీ భేటీల్లోనూ అశోక్‌ గజపతిరాజుకి గతంలో దక్కిన గౌరవం... ఇప్పుడు దక్కడం లేదనే మాట వినిపిస్తోంది.   అయితే విజయనగరం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త విధానాలు అనుసరిస్తూ ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజుగారి అనుచరులు మండిపడుతున్నారు. ముఖ‌్యంగా జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి గంటా చేష్టలు అశోక్‌ గజపతిరాజుకి విసుగుపుట్టిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల గంటాకి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మరోవైపు సుజయ్‌కృష్ణ, శత్రుచర్ల విషయంలో తన అభ్యంతరాలను అధిష్టానం పట్టించుకోకపోవడంతో... కంగుతిన్న అశోక్‌ గజపతిరాజు... చేసేది లేక కిమ్మనకుండా ఉంటున్నారని, కానీ ఇది విజయనగరం జిల్లాలో పార్టీకి చేటు చేస్తుందని రాజుగారి అభిమానులు అంటున్నారు.

జగన్ జాతకం చెప్పిన కేసీఆర్..

  ఏపీ రాజకీయ పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జగన్‌ వైపు కొంచెం మొగ్గుచూపించే కేసీఆర్‌... మరోసారి వైసీపీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందంటూ... జగన్‌‌పై తనకున్న మక్కువను చాటుకున్న కేసీఆర్‌... ఈసారి కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి కొంచె ఎడ్జ్‌ ఉందని చెప్పుకొచ్చారు. ఓ సర్వే మిత్రుడు చెప్పిన వివరాల మేరకు వైసీపీకి 45శాతం ఓట్లు వస్తాయని తెలిసిందన్నారు. అధికార టీడీపీకి 43శాతం, అలాగే బీజేపీకి 2.6శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందన్నారు.   ఇక వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న పవన్‌ కల్యాణ్‌కి అంత సీన్‌ లేదని, జనసేన ప్రభావం ఏపీలో ఉండబోదని కేసీఆర్‌ తేల్చిచెప్పేశారు. జనసేనకు ఒకటి... ఒకటిన్నర శాతం కంటే ఎక్కువ ఓట్లు రావన్నారు. పవన్‌ చేతులూపితే ఓట్లు రాలవన్న కేసీఆర్‌... చిరంజీవి ప్రజారాజ్యం విషమంలో ఏం జరిగిందో... అలాగే జనసేన పరిస్థితి కూడా ఉంటుందంటున్నారు. ఏ పార్టీకైనా బేస్‌ ఉండాలన్న కేసీఆర్‌... ఆ పరిస్థితి జనసేనకు లేదన్నారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్నచిరంజీవి లాంటి వ్యక్తే పార్టీని నడపలేక... కట్టెలమోపులాగా బరువు దించుకున్నారని... ఓ లక్ష్యం లేకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందన్నారు. తాను ఓ లక్ష్యంతో పద్నాలుగేళ్లు పార్టీని నడుపుతూ... ఉద్యమం చేయబట్టే నిలబడగలిగానని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.   ఇక ఏపీలో కుల రాజకీయాలపైనా కేసీఆర్‌ కీలక వ్యా‌ఖ్యలు చేశారు. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవన్న కేసీఆర్‌.... ప్రజా సమస్యలు, అంశాలవారీగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదన్నారు.

చంద్రులకు చుక్కలు చూపించిన మోడీ..!

  తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. చంద్రబాబు, కేసీఆర్‌ ఆశలపై మోడీ నీళ్లు చల్లేశారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురికి పొలిటికల్‌గా దిమ్మదిరిగే మాట చెప్పింది. 2019 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని ఆఫ్‌ ద రికార్డ్‌ తేల్చిచెప్పేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీనే దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.   ఢిల్లీ టూర్లో మోడీని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌... అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. అయితే 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని మోడీ అన్నారని కేసీఆర్‌ వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని మోడీని కోరానని, అయితే ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించినా ఎలాగూ ఐదేళ్లు పడుతుందని ప్రధాని చెప్పారని, దాంతో ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు లేనట్లేనని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అయితే నియోజకవర్గాల పెంపుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినా ప్రక్రియ పూర్తవడానికి ఐదేళ్లు పడుతుందని మోడీ చెప్పారని, కానీ మూడు నాలుగు నెలల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చని, అయితే కేంద్రం ఎందుకు సీరియస్‌గా దృష్టిపెట్టడం లేదో అర్ధం కావడం లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పైగా తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా సీట్లు పెంచాలని కోరుతున్నా... కేంద్రం పట్టించుకోవడం లేదన్న కేసీఆర్‌.... తెలంగాణ తరపున ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే... వెంకయ్యనాయుడు... ఉపరాష్ట్రపతిగా వెళ్లడం కొంత నష్టమేనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.   2019లోపు అసెంబ్లీ సీట్ల పెంపు‌నకు కేంద్రం విముఖత చూపడానికి రాజకీయ వ్యూహమే కారణమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎదగాలనుకుంటోన్న బీజేపీకి.... అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో ఒరిగేదేమీ లేదని తేలడంతోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ఇచ్చిన రిపోర్ట్‌తోనే అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం నో చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.

రాజ్యసభలో… ఇక మీద వెంకయ్య మంత్రం, అమిత్ షా తంత్రం!

  వాళ్లిద్దర్నీ చాణక్య, చంద్రగుప్తులు అనాలో, శ్రీకృష్ణార్జునులు అనాలో, శ్రీరామ, హనుమంతులనాలో… మన ఇష్టం! కానీ, మోదీ, అమిత్ షా మాత్రం ప్రస్తుతం దేశాన్ని నడుపుతోన్న బ్రెయిన్ అండ్ హార్ట్! నిజానికి షా కేంద్ర ప్రభుత్వంలో భాగం కాకపోయినా మోదీ తరువాత అంత పవర్ ఫుల్ అని అందరి ఫీలింగ్. ఆయన బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడుగానే వున్నప్పటికీ అనేక పరిణామాల్ని రిమోట్ క్రంటోల్ చేస్తున్నారు. కాని, తాజాగా కమలం పార్టీ పార్లమెంటరీ బోర్డ్ తీసుకున్న నిర్ణయం అమిత్ షాను నేరుగా పార్లమెంట్ ఆవరణలోకి తీసుకురానుంది! ఇక మీదట ప్రత్యక్ష యుద్ధమంటూ సంబరిపడిపోతున్నారు మోదీ భక్తులు!   అమిత్ షా గుజరాత్ తరుఫున రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని స్పష్టమైపోయింది. బీజేపి కంచుకోటా, మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి పోటీ అంటే.. షాకు గెలుపు నల్లేరు మీద నడకే! అయితే, పార్టీ చీఫ్ గా దూసుకుపోతున్న అమిత్ భాయ్ ని నరేంద్ర భాయ్ పెద్దల సభకి ఎందుకు తెస్తున్నారు? రీజన్ అందరికీ తెలిసిందే! 2014 నుంచీ ఇప్పటి వరకూ అనేక విజయాలతో లోక్ సభలో తిరుగులేకుండా చేసుకున్నారు నమో. కాని, సమస్యంతా రాజ్యసభలో వస్తోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు, ఇంకో వైపు తృణమూల్ నిరంతరం మోకాలు అడ్డువేస్తున్నాయి ప్రధానికి. అలాగే, శివసేన లాంటి ఎన్డీఏ పక్షాలు కూడా రాజ్యసభ మద్దతు విషయం వచ్చే సరికి బేరసారాలు, బెదిరింపులకి దిగుతున్నాయి! వీటన్నిటికి చెక్ పెట్టడానికే మోదీ తన మంత్రి లాంటి అమిత్ షాని రాజ్యసభకి తీసుకురాబోతున్నారు!   అమిత్ షానే కాదు.. రాజ్యసభ పట్టులోకి తెచ్చుకోటానికి వెంకయ్యని కూడా ప్రయోగించారు ప్రధాని. కేంద్ర మంత్రిగా యాక్టివ్ గా వున్న ఆయన్ని ఉప రాష్ట్రపతి అంటూ గౌరవించేశారు! దీంతో మోదీకి కేబినేట్లో ఒక సీనియర్ తగ్గటమే కాక రాజ్యసభకు చైర్మన్ గా వెంకయ్య లాంటి సమర్థులు దొరుకుతారు. ఇటు వెంకయ్య, అటు అమిత్ షా ఇద్దర్నీ పెద్దల సభలో మోహరించటం ద్వారా మోదీ అక్కడ వ్యవహారాలన్ని వారి భుజాల మీద పెట్టేయవచ్చు. అప్పుడు ఆయన రానున్న 2019ఎన్నికలతో సహా చైనా, పాకిస్తాన్ లాంటి తలనొప్పులు కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే, కొందరు ఊహాగానాలు చేస్తున్నట్టు అమిత్ షాని కేంద్ర కేబినేట్లోకి కూడా మోదీ తీసుకుంటే బీజేపి అధ్యక్ష బాధ్యతలు మరెవరికైనా ఇవ్వాల్సి వుంటుంది. అత్యంత తాజాగా బీహార్ ని బుట్టలో వేసుకున్న అమిత్ షా రేంజ్లో… వేరే వారు పార్టీని నడుపుతారా? ఇది పెద్ద ప్రశ్నే! తగిన జవాబు మోదీ వద్ద వుందా? కొన్నాళ్లు ఆగితే తెలిసిపోతుంది!

కేసీఆర్ ని కూడా మరిచి టీ కాంగ్ కేటీఆర్ తో యుద్ధం చేస్తోందా?

ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం ప్రధానంగా ఎవర్ని టార్గెట్ చేస్తుంది? ఉదాహరణకి ఏపీనే తీసుకుంటే… అక్కడ వైసీపీ నేతలంతా చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే, ఆయన సీఎం కాబట్టి. సీఎంని విమర్శించటం ద్వారా మొత్తం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు. దోషిగా చూపొచ్చు. అలాగే, దిల్లీలో అయితే ప్రతిపక్షాలు ప్రధానిని నిలదీస్తాయి. అలా చేయటం ద్వారా గవర్నమెంట్ మొత్తాన్ని జనం ముందు కార్నర్ చేయోచ్చు. కాని, తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది! దాంట్లోని మర్మమేంటో టీ కాంగ్ కే తెలియాలి!   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన నోరు తెరిచి తిట్టారంటే ప్రతిపక్షాలకు అది పరమ భయంకరమే! ఊరికే రాజకీయ విమర్శలు చేయటం కాకుండా కేసీఆర్ సెటైర్లతో, ఘాటు పదాలతో గడగడలాడిస్తారు. పాపం ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ కంటే మరెవరికీ బాగా తెలియదు! ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్రా నాయకుల్ని ఏ రేంజ్లో ఏకిపారేసేవారో అలాగే ఇప్పుడు టీ కాంగ్ నేతల్ని చెడుగుడు ఆడుతుంటారు కేసీఆర్. అయితే, రోజూ కేసీఆర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేయటం లేదు. అవసరం వచ్చినప్పుడు, ఇక తప్పదనుకున్నప్పుడు దుమ్ము దులుపుతున్నారు. కాని, ఆయన్ని అదే రేంజ్లో కాంగ్రెస్ నేతలు విమర్శించిన దాఖలాలు ఇంత వరకూ లేవు. ఇక ఘాటైన పదాలతో కేసీఆర్ ను తిట్టగలగటం కలలో మాటే!   కేసీఆర్ ను తగిన రీతిలో ఎదుర్కోని తెలంగాణ కాంగ్రెస్ కేటీఆర్ ని మాత్రం చెడామడా మాటలు అనేస్తోంది. అదే రేంజ్లో కల్వకుంట్ల తారక రాముడు కూడా తన వాక్కు బాణాలు ఎక్కుపెడుతున్నాడు. తండ్రి లాగే సిగ్గు, శరం వుండాలి లాంటి మాటలు… ఉత్తమ్ కుమార్ని ఉత్తర కుమారుడనటమూ… ఇవన్నీ చేస్తూనే వున్నాడు. అయితే, రాను రాను కేటీఆర్, కాంగ్రెస్ నేతల మధ్య పర్సనల్ వార్ మరీ ఎక్కువైపోతున్నట్టు కనిపిస్తోంది. కేటీఆర్ కాంగ్రెస్ వార్ని పేరు పేరున వ్యక్తిగతంగా తిట్టిపోస్తుంటే అదే భాషలో జవాబిస్తున్నారు టీ కాంగ్ వాళ్లు! తాజాగా కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ అని వెధవ అనే దాకా వెళ్లిపోయారు! ఈ వ్యక్తిగత దూషణల పర్వంలో ఇద్దరిదీ సమాన బాధ్యతనే చెప్పాలి!   కేటీఆర్ తో సంబంధాలున్న వారికి డ్రగ్ కేసుతో లింక్ వుందన్న దిగ్విజయ్ కు కూడా స్ట్రాంగ్ రిప్లై తప్పలేదు. కేటీఆర్ ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఘాటు సమాధానం ఇచ్చాడు. దీంతో తమ పార్టీలోని చిన్నా, పెద్దా నాయకులందర్నీ టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ యువరాజును ఆయన లాంగ్వేజ్ లోనే ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ వారు. కాని, ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా హరీష్ రావు, కవిత, ఆఖరుకు కేసీఆర్ కూడా కనిపించటం, వినిపించటం లేదు. కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లే యుద్దం నడుస్తోంది! సీఎం కుర్చీలో వున్న కేసీఆర్ ని వదిలేసి ఆయన కుమారుడ్ని టార్గెట్ చేయటం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి లాభం పొందుతుందో.. ఎన్నికలు వస్తేగాని తెలియదు!

ఇదో అమెరికన్ డ్రగ్ బానిసల స్టోరీ!

  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ చర్చలే! అందులోనూ సినిమా వాళ్లు మత్తులో జోగుతున్నారని బయటకి పొక్కటంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి బయలుదేరింది. కానీ, డ్రగ్స్ కేవలం వెనుకబడ్డ ఆఫ్రికా దేశాలు, లేదంటే ఇండియా లాంటి ఎదుగుతున్న దేశాలు… వీటిలో మాత్రమే వుంటాయనుకుంటే పొరబాటే! అమెరికా లాంటి అగ్ర దేశంలో మనకన్నా ఎక్కువ డ్రగ్స్ దందా సాగుతుంది! అక్కడ ఇక్కడి కంటే ఎక్కువ మంది డ్రగ్ ఎడిక్ట్స్ వుంటారు. ఆటగాళ్లు, పాటగాళ్లు, సినిమా వాళ్లు … ఇలా ఎవరు పడితే వారు డ్రగ్స్ బాధితులే! కానీ మన దగ్గర మరీ స్కూలు పిల్లలు కూడా మత్తు పదార్థాలకి బానిసలు కావటం అందర్నీ షాక్ కి గురి చేసింది. కాని, అమెరికాలోని ఉటా నగరంలో అప్పుడే పుట్టిన పాపకే డ్రగ్స్ అలవాటున్నట్టు తెలిసి పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది అంతా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైపోయారు!   ఇంతకీ ఏం జరిగిందంటే… అమెరికాలోని ఓ జంట… కాల్ వైల్డ్, క్రిస్టిన్సన్. ఈ భార్య, భర్తలకి ఇద్దరు బాబులు. అయితే, గత ఏప్రెల్ లో క్రిస్టిన్సన్ మరో కూతురికి జన్మనిచ్చింది. కాని, అప్పటికే డ్రగ్ ఎడిక్ట్ అయిన ఆమె గర్భంతో వుండగానే మస్తుగా మత్తు మందు పుచ్చుకుంది. భర్తతో కలిసి ఆమె చేసిన ఈ దారుణానికి పుట్టిన బిడ్డ తల్లి కడుపులోంచే డ్రగ్ ఎడిక్ట్ గా ఊపిరి పోసుకుంది. అది హాస్పిటల్ సిబ్బందికి తెలిస్తే పోలీసులకి పట్టిస్తారని భయపడ్డ క్రిస్టిన్సన్, కాల్ వైల్డ్ డ్రగ్ ఎడిక్షన్ తెలియకుండా చేసే మరో మందు తీసి పుట్టిన బిడ్డ చిగుళ్లకి పూసేశారు! కాని, ఇదంతా ఆసుపత్రి వారికి ఎలాగో తెలియనే తెలిసింది. వాళ్లిచ్చిన కంప్లైంట్ తో పోలీసులు డ్రగ్ కపుల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు!   పుట్టీ పుట్టగానే బిడ్డ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ ప్రమాదకార మందు పట్టించిన అమెరికన్ కపుల్ గతంలోనూ అనేక కేసుల్లో ఇరుక్కున్నారట. వాల్ మార్ట్ లో దొంగతనం చేస్తూ పట్టుబడటంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. మళ్లీ తరువాత ఏప్రెల్ లో అప్పుడే బిడ్డకు మందు పట్టించి అరెస్ట్ కావటంతో సదరు మమ్మీ , డాడీల ఇళ్లంతా సోదా చేశారు! వాళ్లకు దొరికిన డ్రగ్స్ చూసి అమెరికన్ పోలీసులే అవాక్కయ్యారు! హెరాయిన్ తో సహా మరో రెండు , మూడు రకాల ప్రాణాంతక మాదక ద్రవ్యాలు లభించాయి! అంతే కాదు, క్రిస్టిన్సన్ కు పుట్టిన కూతురు కంటే ముందు సంతానమైన ఇద్దరు అబ్బాయిలు కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిలిచారట! మొత్తానికి ముగ్గురు చిన్నారుల జీవితాలతో ఆటలాడిన ఆ వైఫ్ అండ్ హజ్బెండ్ ని ఇప్పుడు కటకటాల్లో వుంచి కోర్టులో హాజరుపరుస్తున్నారు. అమెరికన్ చట్టాల ప్రకారం వారు మళ్లీ బయటకి చాలా ఏళ్లే పట్టొచ్చు! అప్పటిలోగా ప్రస్తుతం క్రిస్టిన్సన్ మొదటి భర్త వద్ద పెరుగుతోన్న ఆమె నలుగురు సంతానం పెరిగి పెద్దవారు కూడా అయిపోతారు! ఇదీ ది గ్రేట్ అమెరికన్ లైఫ్ స్టైల్…

చైనాకి వెళుతోన్న ఇండియన్ జేమ్స్ బాండ్!

  నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్… ఇలాంటి పదవి ఒకటి వుంటుందని కూడా చాలా మందికి తెలియదు నిన్న మొన్నటి వరకూ! కాని, మోదీ గవర్నమెంట్ వచ్చాక అనూహ్యంగా అజిత్ ధోవల్ తెర మీదకు వచ్చారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా చక్రం తిప్పుతున్నారని మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అది నిజం కూడా! మరీ ముఖ్యంగా, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ ధోవల్ దే! ఆయన వ్యూహ రచనతోనే మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి శత్రు నాశనం చేసి విజయవంతంగా తిరిగి వచ్చింది!   పాకిస్తాన్ విషయంలో తెర వెనుక హీరో అయిన ధోవల్ ఇప్పుడు చైనా విషయంలోనూ కీలకం అవుతున్నారు. మన దేశంలో ఆయన ఇమేజ్ సంగతి ఎలా వున్నా చైనాలో మాత్రం అజిత్ ధోవల్ ఎవరో క్లియర్ గా తెలిసిపోయింది! అక్కడి మీడియా ఈ ఇండియన్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు రాస్తోందంటే ధోవల్ సత్తా ఏంటో అర్తం చేసుకోవచ్చు! చైనా లాంటి అతి పెద్ద దేశం భారత్ ప్రధాని గురించి మాట్లాడితే సహజం! అలా కాక రక్షణ మంత్రి, విదేశాంగ శాఖా మంత్రి గురించి మాట్లాడినా అర్తం చేసుకోవచ్చు. కాని, చైనీస్ మీడియా ధోవల్ పై దృష్టి పెట్టిందంటే ఈ సైలెంట్ కిల్లర్ ఎంత మొనగాడో గ్రహించవచ్చు!   చైనా వాళ్లు దోవల్ పై దృష్టి సారించటానికి మరో కారణం… ఆయన రేపట్నుంచీ రెండు రోజులు బీజింగ్ సందర్శించటమే! బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చైనా రాజధానిలో సమావేశం అవుతున్నారు. అందులో పాల్గొనటానికి , బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా దేశాల అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంగా చైనా, భారత్ ఎన్ఎస్ఏల మధ్య డోక్లామ్ సమస్య గురించి చర్చ జరగవచ్చని మీడియా భావిస్తోంది.   నిజంగా అజిత్ ధోవల్ చైనా పర్యటనతో డోక్లామ్ సంక్షోభం ఎంత వరకూ తగ్గు ముఖం పడుతుందో చెప్పలేం కాని… ఈ రాటుదేలిన మాజీ రా ఏజెంట్ అంటే డ్రాగన్ కూడా అలెర్ట్ గానే వుంటోంది. ఆయనతో డిస్కషన్ అంటే మోదీతో ఇండైరెక్ట్ గా మాట్లాడటమేనని భావిస్తోంది. చూడాలి మరి… అభిమానులు ఇండియన్ జేమ్స్ బాండ్ అని గర్వంగా పిలుచుకునే ధోవల్ చైనాలో ఏం చేస్తారో!

ఛార్మీ దెబ్బకి ముద్రగడ ఔట్...

  హీరోయిన్ ఛార్మి దెబ్బకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఔటయ్యాడు. ఛార్మికి, ముద్రగడకి సంబంధం ఏంటబ్బా అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. ముద్రగడ పద్మనాభం ఈరోజు చలో అమరావతి పాదయాత్రను ప్రారంభించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు పోలీసుల అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ ముద్రగడ పాదయాత్ర చేపట్టాలని అనుకున్నారు.. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని ఇంటి గేటు వద్దే అడ్డుకొని 24 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలను కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈరోజు చార్మీ సిట్ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది మీడియా ఫోకస్ మొత్తం చార్మీ పైనే పడింది. ఉదయం ఛార్మీ సిట్ విచారణకు వచ్చింది మొదలు.. ఛార్మీ పై సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు.. ఏ ప్రశ్నలు అడిగారు అంటూ ఇలా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ.. అన్ని ఛానల్స్ చార్మీపైనే ఫోకస్ పెట్టి వార్తలు అందించాయి. దీంతో ముద్రగడ తాను అనుకున్నది.. జరిగింది ఒకటైంది. గతంలో ఆయన ఉద్యమం అంటే మీడియా కనీసం కొంత సేపైనా కవరేజ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎదో ఒక విధంగా షో చేసి మీడియా ఫోకస్ ని తన మీదకు తిప్పుకోని రాష్ట్ర ప్రజల ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న ముద్రగడ ప్లాన్ బెడిసికొట్టింది. చార్మీ హడావుడిలో మీడియా ముద్రగడను పట్టించుకోలేదు. మొత్తానికి పాదయాత్ర నేపథ్యంలో మీడియాను తనవైపు తిప్పుకోవాలన్న ప్లాన్ ను ఛార్మీ వల్ల తుస్సుమంది.

రామ్ నాథ్ కోవింద్… తొలి ప్రసంగం… మొదటి కలకలం!

  భారత పద్నాలుగవ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విజయవంతంగా వివాదాల్లోకి ఎక్కారు! ప్రమాణ స్వీకారం చేసి 24గంటలు గడవక ముందే ఆయన మీద కాంగ్రెస్ నాయకులు చిర్రుబుర్రులాడుతున్నారు! అంతా భావించినట్టుగా రామ్ నాత్ భారతదేశ రెండో దళిత రాష్ట్రపతి మాత్రమే కాదు… మొట్ట మొదటి ఆరెస్సెస్ నేపథ్యం వున్న ప్రెసిడెంట్ కూడా! ఈ కారణంతోనే కాంగ్రెస్ వారికి రామ్ నాథ్ పై కాస్త ఎక్కువే అనుమానాలు వున్నట్టున్నాయి…   2014 మే నెల నుంచి భారత రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. ఇది ఎవరు ఒప్పుకోకున్నా నిజం! ఆరెస్సెస్ స్వయం సేవక్ గా ఊరారా తిరిగిన మోదీ దేశ ప్రధాని అయ్యారు! ఈ విషయం కాంగ్రెస్ తో సహా చాలా మంది సెక్యులర్ నేతలు, మేధావులు, కవులు, రచయితలు అంగీకరించలేకపోయారు! ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. అందుకే, పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేస్తే మేధావులు అవార్డ్ వాప్సీ అంటూ కలకలం రేపుతుంటారు. ఈ తంతు ఇప్పుడు రాష్ట్రపతి విషయంలో కూడా కొనసాగేలా కనిపిస్తోంది…   రామ్ నాథ్ కూడా హిందూత్వ భావజాలం వున్న బీజేపి నేత. అందుకే, ఆయన దళితుడు అయినప్పటికీ లెప్టు పార్టీల వారు, మాయావతి మీరా కుమార్ కే మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు అనివార్యంగా రామ్ నాథ్ రాష్ట్రపతి అయిపోవటంతో కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆయన మీద అనుక్షణం అనుమానపు దృష్టితోనే ముందుకు సాగేలా పరిస్థితి కనిపిస్తోంది! ఈ కార్యక్రమం రామ్ నాథ్ తొలి ప్రసంగం నుంచే ప్రారంభమైపోయింది! పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి ఇచ్చిన స్పీచ్ లో నెహ్రు పేరు ఎక్కడా రాలేదని కాంగ్రెస్ వారు సభలో గందరగోళం చేశారు! ఇందిర పేరు కూడా రామ్ నాథ్ స్మరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు! ఏ సంబంధమూ లేని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ లాంటి వారి పేర్లను రామ్ నాథ్ తన ప్రసంగంలో చేర్చారని కాంగ్రెస్ నాయకులు గోలగోల చేశారు!   నెహ్రు తొలి ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా జాతికి చేసిన సేవ చాలా గొప్పది. అందులో సందేహం లేదు. కాని, ఆయన పేరు తన స్పీచ్ లో వుండాలా వద్దా అన్న నిర్ణయం రామ్ నాథ్ కోవిందే గాని ఇతరులు ఒత్తిడి చేయటానికి వీలులేదు. ఈ విషయం కాంగ్రెస్ వారు గ్రహించటం లేదు. పైగా కేవలం ఒక విమర్శో, కామెంటో చేసి ఊరుకోవాల్సిన అంశంపై సభను స్థభింపజేశారు. విలువైన పార్లమెంట్ సమాయాన్ని తమ పార్టీ గత ప్రధానుల కీర్తి కోసం వృథా చేశారు! ఇది పూర్తిగా కాంగ్రెస్ నేతల స్వామి భక్తే తప్ప మరొకటి కాదు. అసలు కోవింద్ ప్రసంగంపై అభిప్రాయాలు చెప్పటం గౌరవం అనిపించుకోదు. పోనీ చెప్పినా గంభీరంగా మాట్లాడటం కాకుండా అదొక వివాదాస్పద అంశంగా మార్చటం కాంగ్రెస్ కు ఏ మాత్రం శోభనివ్వదు. ఒక రాష్ట్రపతి ఎలా మాట్లాడాలో శాసించటం అంటే అది ఆ స్థాయిని అవమానించటమే అవుతుంది!   ఇప్పటికే మోదీ, రామ్ నాథ్ కీలకమైన పదవుల్ని చేపట్టగా మరో కాషాయ నేత మన వెంకయ్య నాయుడు త్వరలో ఉప రాష్ట్రపతి కానున్నారు! అంటే… రాజ్యసభ వారి చేతుల్లో వుంటుందన్నమాట! కాంగ్రెస్ , ఇతర లౌకిక పార్టీలు అప్పుడు ఎన్ని రకాల వివాదాలు లేవనెత్తుతాయో మనం ఊహించవచ్చు! కాని, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో, ప్రధాని వంటి కీలక పదవుల్లో వున్న వార్ని కేవలం వారి నేపథ్యం చూసి విమర్శించటం కాకుండా… సహేతుకంగా తప్పు పడితే ప్రతిపక్షాలకి కూడా జనంలో మైలేజ్ వస్తుంది. అలా కాకుండా ప్రసంగంలో నెహ్రు పేరు ప్రస్తావించలేదని ఆగ్రహానికి లోనైపోతే … దాన్ని సామాన్య జనం హర్షించరు. మరీ ముఖ్యంగా, అత్యున్నత పదవుల్ని వివాదాస్పదం చేస్తూ, విలువైన సభా సమయం వృథా చేస్తే ఎవ్వరూ అంగీకరించరు…

డ్రగ్స్ కేస్ పై రోజా కామెంట్స్ సబబేనా?

  ఒకే సినిమా ఇండస్ట్రీ. రెండు రకాల అభిప్రాయాలు! ఇదీ ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారణపై టాలీవుడ్లో పరిస్థితి. పూరీ, రవి, ఛార్మి లాంటి పాప్యులర్ సినిమా సెలబ్స్ ఈ కేసులో ఇరుక్కోవటంతో ఎక్కడలేని ఆసక్తి వచ్చి పడింది. అందుకు తగ్గట్టే మీడియా కూడా కాస్తంత మసాలా యాడ్ చేస్తూ కవరేజ్ చేస్తోంది. కాని, సినిమా వాళ్ల విషయంలో అది మామూలే. వారి గురించి ఎప్పుడు ఏం చెప్పినా జనం చూస్తారు కాబట్టి టీఆర్పీల కోసం మీడియా ఒకింత హడావిడి ఎక్కువే చేస్తుంది. కాని, తమ సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ బోలెడంత ఇచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసిన టాలీవుడ్ వాళ్లు ఇప్పుడు అదే మీడియా నెగటివ్ గా కవరేజ్ ఇస్తుండటంతో చిటపటలాడుతున్నారు. అయితే, అటు సిట్ కాని, ఇటు మీడియా కాని తప్పేం చేయటం లేదని అంటున్న వారు కూడా ఇండస్ట్రీలోనే వున్నారు!   ఎక్సైజ్ శాక తీరుని తప్పుబట్టిన తాజా టాలీవుడ్ సెలబ్రిటీ ఎమ్మెల్యే రోజా. ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ఆమె తనకు అలవాటున్న తీరులోనే స్పందించారు. సినిమా వాళ్ల పరువుని పోలీసు అధికారులు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రేపు డ్రగ్స్ కేసులో పూరీ, ఛార్మి లాంటి వారి తప్పు లేదని తేలితే ఆ నష్టం సిట్ పూడుస్తుందా అంటూ ప్రశ్నించారు! ఇంచుమించూ ఇలాగే వర్మ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించటం మనకు తెలిసిందే!   రోజా, వర్మా లాంటి వారు విచారణ జరుగుతున్న తీరు తప్పుబడితే పోసాని రివర్స్ గేర్ లో వచ్చారు. ముప్పై వేల మంది వున్న ఇండస్ట్రీలో పన్నెండు మందికి నోటీసులిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముందని ఆయన అడిగారు! పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు, ఆరోపణలు ఎదుర్కొన్న వారు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని… కాని, అది తప్పదని ఆయన అన్నారు. పోసాని పూర్తిగా సిట్ ను సమర్థిస్తూ అకున్ సబర్వాల్ టీమ్ సినిమా వాళ్లకు గౌరవ, మర్యాదాలు బాగానే ఇస్తోందని చెప్పారు!   పోసాని , రోజా మాటల్లో ఎవరివి కరెక్ట్? వర్మ లాజిక్ సబబేనా? సినిమా వాళ్లు కాబట్టే సిట్ హడావిడి ఎక్కువ చేస్తోందా? మీడియా కోలాహలం అవసరానికి మించి జరుగుతోందా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు! కాని, సమాధానం మాత్రం ఒక్కటే! సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన చట్టం తన పని తాను చేసుకుపోకుండా… రూల్స్ , రెగ్యులేషన్స్ పెట్టడం ఎవరి తరమూ కాదు! అందరి లాగే గ్లామర్ లోకంలోని వార్ని కూడా విచారిస్తారు. అయితే, జనం, మీడియా కొంచెం ఎక్కువ దృష్టి పెడితే ఎవ్వరూ చేయగలిగింది ఏం లేదు. గతంలో సంజయ్ దత్, సల్మాన్ లాంటి వారు కేసుల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. కాని, పోలీసులు, కోర్టులు సినిమా కన్సెషన్స్ ఏమీ ఇవ్వలేదు. చట్టం అందరికీ ఒకేలా పని చేస్తుందని తేల్చేశాయి. డ్రగ్స్ కేసు విషయంలో కూడా అంతే! రోజా లాంటి వారు ఎమ్మెల్యే పదవిలో వుంటూ మరింత బాధ్యతగా మాట్లాడితే బావుంటుంది! ఎందుకంటే, ఆమె వర్మ లాగా ఇష్టానుసారం మాట్లాడి తప్పించుకునే స్థితిలో లేదు కాబట్టి. ఆమె మాట వల్ల వైఎస్ఆర్సీపీ పై ప్రభావం పడుతుంది…

మోదీ వేట… నితీష్ వేటు… లాలూ టేన్షన్ గా వెయిటింగ్!

  లాల్ ప్రసాద్ యాదవ్ టైం బ్యాడ్ గా నడుస్తోంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. కాని, టైం ఎంత బ్యాడ్ అయినా తనదైన రీతిలో సంక్షోభం నుంచీ బయటపడే మార్గాలు కూడా ఆయన బాగానే అన్వేషిస్తుంటారు. అవసరమైతే తనకు బద్ధ శ్రతువులైన వార్ని కూడా ఆలింగనం చేసుకుని గండం నుంచి గట్టెక్కుతారు. ఒకప్పుడు అలాగే కాంగ్రెస్ ను తిట్టిపోశాడు. మళ్లీ ఆ పార్టీతో కలిశాడు. తరువాత ఉప్పు నిప్పులా వున్న నితీష్ కుమార్ తోనూ లాలూ హ్యాపీగా కలిసిపోయారు. బీజేపిని అధికారానికి దూరం చేసి బీహీర్ ని స్వంతం చేసుకున్నాడు. కాని, ఇప్పుడు మరోసారి లాలూకి అగ్నీ పరీక్ష ఎదురవుతోంది…   లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద ఏక కాలంలో అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ఆయన కూతురు అక్రమ ఆస్తుల మీద దాడులు జరుగుతుండగానే మరోవైపు కొడుకుని కూడా టార్గెట్ చేశాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇలా ఉక్కిరిబిక్కరి అవుతోన్న లాలూ ఒత్తిడిలోనూ మాస్టర్ ప్లాన్ మాత్రం వేయటం మానలేదు. తనని ఎలాగైనా వదిలించుకుని వెళ్లాలని చూస్తోన్న నితీష్ కుమార్ కి గుణపాఠం చె్ప్పేలా మరో కూటమికి తెర తీస్తున్నాడు! అందుకోసం దళిత నాయకురాలు మాయవతి, గిరిజన నాయకుడు మాన్జీలని ముగ్గులోకి దింపుతున్నాడు. పనిలో పనిగా గడ్డు కాలం ఎదుర్కొంటోన్న సమాజ్ వాదిని పార్టీని కూడా ఆయన వాడుకోవాలని ట్రై చేస్తున్నాడు!   జేడీయూ నాయకుడు నితీష్… లాలూ కుటుంబంపై వస్తోన్న అవినీతి ఆరోపణల్ని చూపి ఆర్జేడీని .ప్రభుత్వం నుంచి తొలగిస్తే… బీజేపీ మద్దతుతో మళ్లీ అధికారంలో వుండొచ్చని భావిస్తున్నాడు. కాని, ఒక్కోసారి అంచనాలు తలక్రిందులై ప్రభుత్వం కూలిపోతే మధ్యంతర ఎన్నికలొస్తాయి! అప్పుడు తన ఆర్జేడీకి మద్దతుగా మాయావతి బీఎస్పీని, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ సింగ్ మాన్జీ హిందూస్థాన్ అవామ్ మోర్చా ( హెచ్ఏఎం ) ను సిద్దం చేసుకోవాలని లాలూ వ్యూహం పన్నుతున్నాడు. అందుకే, మాయావతి రాజ్యసభ నుంచి రాజీనామా చేయగానే తమ పార్టీ తరుఫున ఆమెను పెద్దల సభకి పంపుతామని ప్రకటించాడు లాలూ. అంతే కాదు, ఉత్తర్ ప్రదేశ్ లో కూడా పుల్ పుర్ నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మాయావతిని పోటి చేయించి గెలిపించుకుందామని సమాజ్ వాదికి చెబుతున్నాడు. అటు గిరిజన నేత అయిన మాన్జీని కూడా తమతో కలుపుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్లాలని లాలూ ప్లాన్. అలా అయితే, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లన్నీ నితీష్ కు వెళ్లకుండా చూడొచ్చని ఆయన ఆలోచన!   ఎస్సీని, బీఎస్పీని, మాన్జీ పార్టీని, చివరకు కాంగ్రెస్ ను కలుపుకుంటూ పోవాలని లాలూ చేస్తోన్న యోచన అద్బుతమైందే! కాని, అలాంటిది సాధ్యపడటం చివరిదాకా కష్టమే! ఏ పార్టీ హ్యాండిచ్చినా లాలూ చేయాలనుకున్న ఆలూ ఫ్రై మాడిపోయే అవకాశముంది! మరో వైపు జనంలో మంచి పేరున్న నితీష్, ఫుల్ ఊపు మీదున్న మోదీ… ఇద్దరూ లేకుండా మాయావతి, ములాయం, రాహుల్ గాంధీ.. వీళ్లతో కలిసి లాలూ సంచలనాలు సృష్టిస్తాడా? డౌటే!

తెలుగు రాష్ట్రాల కాబోయే గవర్నర్ ను… విజయసాయి కలిశారా?

  మాస్ ఫాలోయింగ్ వున్న రాజకీయ నాయకులు పాలిటిక్స్ ని ఫుట్ బాల్ గా ఆవేశంగా ఆడతారు! కాని, ప్రతీ పార్టీలోనూ కొందరు క్లాస్ నాయకులు తమదైన రీతిలో చదరంగంలా ఆడతారు! వర్కవుట్ అయినా కాకపోయినా తెలివిగా ఎత్తులు వేసే ప్రయత్నం చేస్తుంటారు! వైసీపీలో అలాంటి నేత విజయసాయి రెడ్డి! చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఆయన రాజకీయంలో కూడా లాభ, నష్టాలు బేరీజు వేసుకుని వ్యూహాలు పన్నుతుంటారు. ఈ మధ్య జాతీయ స్థాయిలో అలాంటి అడుగులు మరింత ఎక్కువయ్యాయి!   విజయసాయి రెడ్డి పేరు ఒకప్పుడు ఎవరికీ తెలియదు. కాని, తరువాత కాలంలో ఆయన వైఎస్ కుటుంబానికి ఆప్తుడుగా బయటకొచ్చారు. మరీ ముఖ్యంగా, జగన్ జైలుకి వెళ్లిన క్రమంలో ఆయన సీఏగా అందరికీ పరిచయం అయ్యారు. జగన్ పై ఆరోపణల్లో ఆయన కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి వైసీపీలో యమ యాక్టివ్ అయిపోయారు. ఫ్యాన్ పార్టీలోని తలపండిన రాజకీయ నేతలంతా ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. విజయసాయి చక్రం తిప్పుతున్నారు!   జగన్ కు ఎంతో కీలకమైన దిల్లీ ప్రభుత్వ అభయ హస్తం విజయసాయి చలువే అంటున్నారు కొందరు. మోదీని యువ నేత వెళ్లి కలుసుకోవటం, బేషరతుగా రామ్ నాథ్ కోవింద్ కు, వెంకయ్యకు మద్దతు పలకటం… ఇవన్నీ విజయసాయి ప్లాన్ లో భాగమేనంటున్నారు. అందుకు తగ్గట్టే విజయసాయి రామ్ నాథ్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక కాక ముందే ఆయన్ని కలుసుకుని వచ్చారు. ఇక ఇప్పుడు మరో కీలక బీజేపి నేతతో ఆయన సమావేశం కావటం అందరి దృష్టినీ ఆకర్షించింది!   గుజరాత్ కు సీఎంగా పని చేసిన ఆనందీబేన్ పటేల్ ను విజయసాయి కలిశారు. పెద్ద విశేషమేం ఏం లేదు… మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. కాని, ఎక్కడో గుజరాత్ లో వున్న ఆనందీబేన్ ను కలవటం ఎందుకు? విశేషమేం లేదని చెబుతోన్నా అసలు కలవటమే పెద్ద విశేషం! బహుశా ఆనందీబేన్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకీ గవర్నర్ గా నరసింహన్ స్థానంలో రావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే సేఫ్ గా వుంటుందని విజయసాయి ఆమెని ముందుగానే కలిశారని టాక్!   రామ్ నాథ్ రాష్ట్రపతి కాక ముందే ఆయన్ని,ఇప్పుడు ఆనందీబేన్ మన రాష్ట్రాలు రెండింటికీ గవర్నర్ కాక ముందే ఆమెని… కలవటం వల్ల విజయసాయికి, వైసీపీకి ఏంటి లాభం? ఈ విషయం ఇప్పుడే చెప్పలేం! కాని, వ్యాపార సూత్రాలు బాగా తెలిసిన విజయసాయి రెడ్డి ఏ లాభం ఆశించకుండా కలిసుంటారని కూడా సరిపెట్టుకోలేం! మరీ ముఖ్యంగా, టీడీపీ వారు, చంద్రబాబు నాయుడు ఈ పరిణామంపై తగినంత దృష్టి పెట్టాలి. అప్పుడే వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కోవటం సాధ్యమవుతుంది…

సినీ సెలబ్రిటీల చర్యలు, కామెంట్సే డ్రగ్స్ కేసులో గందరగోళానికి కారణమా

డ్రగ్స్ కేస్ విచారణ… ఏ ఛానల్ లోకి ట్యూన్ అయినా, ఏ పేపర్ తిరగేసినా ఇప్పుడు ఇదే వార్త! అసలు ఇంతగా కలకలం ఎందుకు రేగుతోంది? సినిమా యాంగిల్ వుండటమే! పూరీ నుంచి ఛార్మీ దాకా పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఇప్పుడే వారంతా దోషులని, కాదనీ ఏమీ చెప్పలేం. కాని, సామాన్య జనానికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుత వుంటుంది. అందుకే, మీడియా తెలిసింది, తెలియంది అంతా కలిపి కలగాపులగం చేసే వండి వడ్డిస్తోంది. అయితే, ఇదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సినిమా వారు కూడా రచ్చని మరింత పెద్దది చేసేలా వ్యవహరిస్తున్నారు. బహుశా ఇది కూడా ఓ వ్యూహమేనేమో అనుకుంటున్నారు సామాన్యులు!   రేపు విచారణకు అటెండ్ అవ్వాల్సిన ఛార్మి కోర్టు తలుపు తట్టింది. ఆమె పిటీషన్ ఆగమేఘాల మీద విచారించిన న్యాయస్థానం తను అడిగిన ప్రధానమైన వెసులుబాటు కల్పించలేదు. సిట్ ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఛార్మి తరుఫు న్యాయవాది వుండటానికి వీలులేదని తేల్చేసింది. అయితే, ఛార్మి కోరిన విధంగా సాయంత్రం 5గంటల తరువాత విచారణ చేయకూడదనీ, బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోకూడదనీ మాత్రం ఆదేశించింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఛార్మి మొదటి నుంచీ తాను విచారణకు హాజరుకానని చెప్పలేదు. విచారణకు హాజరవుతాను కాని.. నాకు ఫలానా డౌట్స్, భయాలు వగైరా వగైరా వున్నాయని ఆమె కోర్టుకు చెప్పింది!   ఛార్మి కోర్టు ఎపిసోడ్ చూశాక ఎవరికైనా ఒక అనుమానం తప్పక వస్తుంది. ఆమె నిజంగా డ్రగ్స్ కేసులో నిర్దోషి అయితే ఇంత నెర్వస్ నెస్ ఎందుకు? అలాగే, విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ కూడా మీడియాని, ఇండస్ట్రీలోని పలుకుబడి గల వార్ని టార్గెట్ చేశాడు. ఆయన కూడా ఇంచుమించూ సిట్ ను తప్పుబట్టినట్టే మాట్లాడాడు. ఇక వర్మ సంగతైతే సరేసరి! ఓ సారి సినిమా వాళ్లలా డ్రగ్స్ తీసుకున్న చిన్న పిల్లల్ని కూడా 12గంటలు విచారించండి అంటాడు. ఇంకోసారి సినిమా వాళ్లని అకున్ సబర్వాల్ టార్గెట్ చేశారంటాడు. ఇక తాజాగా కేసీఆర్, టీఆర్ఎస్, హైద్రాబాద్ ప్రతిష్ఠ మసకబారుతోందని ఫేస్బుక్ లో వాపోయాడు. అసలింకా ఏ సినిమా వాళ్లనీ, ఏ డ్రగ్స్ పెడ్లర్స్ ని కోర్టులో హాజరపరచలేదు, ఎవరికీ శిక్షలు పడలేదు… అప్పుడే కేసీఆర్ పేరు పాడైపోవటం ఏంటి? అసలు వర్మ అంత తీవ్రంగా సిట్ పైన మాటల దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకే తెలియాలి…   భారీగా బ్యాక్ గ్రౌండ్ వున్న టాలీవుడ్ వాళ్ల మీద డ్రగ్స్ కేసు ఎపెక్ట్ పడలేదు. అది అందరూ ఒప్పుకునేదే. కాని, అంత మాత్రం చేత ఎక్సైజ్ శాఖ చేస్తోన్న విచారణే వద్దన్నట్టు, లేదంటే మేము చెప్పినట్టే సాగాలన్నట్టు వర్మ లాంటి వారు మాట్లాడటం గందరగోళం సృష్టించటమే అవుతుంది. అలాగే ఛార్మి కోర్టుకు వెళ్లి తన ప్రధానమైన డిమాండ్ సాధించుకోలేకపోయింది. కాని, జనంలో మాత్రం ఆమె అంతగా భయపడటానికి కారణం ఏంటనే కీలకమైన అనుమానం రేకెత్తింది. కనీసం ముందు ముందు అయినా సినిమా వాళ్లు విచారణను ప్రభావితం చేసేలా చర్యలు, కామెంట్లు చేయకుండా వుంటే గౌరవంగా వుంటుంది. ఎందుకంటే, మన దేశంలో తప్పు చేసిన సామాన్యులకి శిక్షలు పడటమే చాలా కష్టం. అటువంటిది నిజంగా ఏ తప్పూ చేయకుంటే సినిమా సెలబ్రిటీలు నిర్దోషులుగా బయటపడటం పెద్ద కష్టమేం కాదు. అసాధ్యం అంతకన్నా కాదు.

హురియత్ నేతలు జైలుకి! వేర్పాటువాదం కథ కంచికి

గతంలో ఎప్పుడూ లేనంతగా కాశ్మీర్ అల్లోకల్లోలం అవుతోంది. అయితే, చరిత్రలో ఎప్పుడూ జరగనవి కూడా కాశ్మీర్లో ఇప్పుడు జరుగుతున్నాయి! నిన్న అరెస్ట్ చేసిన హురియత్ కీలక నేతల్ని ఇవాళ్ల దిల్లీ కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు! ఇది అస్సలు సాధారణ విషయం కాదు. అసలు ఇలాంటి చర్య కాశ్మీర్ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు. 1990ల తరువాత నుంచీ హురియత్ నేతలు అడ్డూ అదుపు లేకుండా వేర్పాటువాద ఉపన్యాసాలు, నినాదాలు చేస్తూ స్వైర విహారం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు మోదీ సర్కార్ తొలి సారి వేర్పాటువాదులపై వేటు వేసింది! ఇక ఇప్పుడు అసలు ఆట మొదలైంది…   హురియత్ అంటే కాశ్మీర్లోని వేర్పాటు వాద సంస్థ. ఒక్కటిగా లేకుండా మూడు ముక్కలైన హురియత్ మొత్తం మీద మాత్రం భారత్ కు వ్యతిరేకం. హురియత్ నేతల్లో కొందరు అతివాదులు, కొందరు మితవాదులు, కొందరు పూర్తిగా పాకిస్తానీ చెంచాలు. ఎవరు ఏది అయినా… అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే! భారత్ నుంచి కాశ్మీర్ ను విడదీయటం. అయితే, 2106నుంచీ పదే పదే కొనసాగుతోన్న హింసాత్మక రాళ్లు రువ్వే దుశ్చర్య వీరి పన్నాగమే. ఆ విషయం తేల్చేలా ఖచ్చితమైన ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ ఇప్పడు హురియత్ ప్రధాన నేతల్ని అరెస్ట్ చేసింది. అందులో హురియత్ అత్యున్నత నాయకుడైన సయ్యద్ గిలానీ అల్లుడు కూడా వున్నాడు. వీరందర్నీ జైలుకి తరలించటం, త్వరలో ఇంటరాగేట్ చేయనుండటం… అతి పెద్ద పరిణామం అనే చెప్పాలి…   హురియత్ పైకి కాశ్మీరీ స్వాతంత్ర్యం అని కబుర్లు చెప్పినా దాని అసలు ఉద్దేశం పాకిస్తాన్ కు సాయపడటం. ఎలాగైనా కాశ్మీర్ ను ఇండియా నుంచి విడదీయాలని కలలు కనే పాక్ నిరంతరాయంగా ఈ హురియత్ వేర్పాటువాద నాయకుల్ని మేపుతూ వుంటుంది. అలా వారికి లభించిన పాకిస్తానీ నిధుల్లోంచే వారు మధ్య స్థాయి హురియత్ నేతలకి డబ్బుల మూటలు అందించారు. అవ్వి తరువాతి దశలో కింది స్థాయి కాశ్మీరీ రాళ్లు రువ్వే అల్లరి మూకలకి అందాయి. ఇంత కాలం దీన్ని మాటల్లో చెప్పిన మన దర్యాప్తు సంస్థలు గత కొన్ని నెలల్లో పక్కా ఆధారాలు సంపాదించాయి. రాళ్లు రువ్వుటంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన దాదాపు 50మంది కాశ్మీరీ యువత హురియత్ నేతలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఎన్ఐఏ రికార్డ్ చేసింది. పదే పదే వారు చేసిన కాల్స్, అలాగే, కాశ్మీర్లోని అనేక సమస్యాత్మక ప్రాంతాల నుంచి అదే స్టోన్ పెల్టర్స్ హురియత్ వాళ్లతో మాట్లాడటం పోలీసుల అనుమానాలు నిజం చేసింది. కాశ్మీర్లో రాళ్లు రువ్వటం ఊరికే జనం ఆవేశంతో చేస్తున్నది కాదు. అంతా వ్యూహాత్మకంగా డబ్బులిచ్చి చేయిస్తున్న కుట్ర. ఇది నిరూపించే ఆధారాలు దొరకటంతోనే హురియత్ నేతల్ని అరెస్ట్ చేశారు…   హురియత్ వేర్పాటు వాద నాయకుల తరువాత రాళ్లు రువ్వటంలో పాల్గొన్న అల్లరి మూకల్ని అరెస్ట్ చేసే అవకాశం వుంది. అంతే కాదు, రానున్న కాలంలో వేర్పాటు వాదం పేరుతో పాకిస్తాన్ కు సాయపడుతున్న హురియత్ నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్ కూడా వంది. అతి త్వరలో గిలానీ, యాసిన్ మలిక్ లాంటి సీనియర్ హురియత్ నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకుంటారని అంటున్నారు. అదే జరిగితే వేర్పాటు వాదం తీవ్రంగా నష్టపోక తప్పదు. రాళ్లు రువ్వే అల్లరి మూకలు కూడా తోకలు ముడవాల్సి వస్తుంది…

అంబానీ భార్య వాడే ఫోన్ ధర… అమ్మో అనిపించకమానదు!

అంబానీ… ఈ పేరు ఇండియాలో డబ్బుకి మారు పేరు! మనీ అన్నా, అంబానీ అన్నా ఒకేలా ఫీలవుతారు మన వాళ్లు! నిజంగానే… అంతలా డబ్బు సంపాదించేశారు అంబానీ ఫ్యామిలీ వారు! ఇక ఈ మధ్య జియోతో మరోసారి తన సత్తా చాటారు ముఖేష్ అంబానీ. 4జీ స్మార్ట్ ఫోనుని ఉచితంగా ఇస్తానంటూ మొబైల్ బిజినెస్ లో గేమ్ రూల్స్ అన్నీ ఛేంజ్ చేసేశారు. అది ఆయన ప్రొఫెషనల్ లైఫ్లోని లేటెస్ట్ న్యూస్. కాని, ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడూ సంచలనం రేపుతుంటాయి. అటువంటిదే తాజాగా ఒకటి బయటకొచ్చింది…   అంబానీ భారతదేశంలోనే అ్యతంత ధనికుడు. మరి ఆయన లైఫ్ స్టైల్ కూడా అందుకు తగ్గుట్టుగానే వుంటుంది కదా! ఆ మధ్య ఆయన ఇల్లు కట్టారు. ముంబైలోని ఆ మహల్ ధర 12వేల కోట్లు! మరోసారి 25కోట్లు పెట్టి కార్ కొన్నారు ముఖేష్ అంబానీ. ఇక ఆయన దగ్గర మొత్తం 160కార్లు వున్నాయని ఓ టాక్! అంతే కాదు… ఆ మధ్య ఓ సారి తన భార్య నీతా అంబానీకి ముఖేష్ బర్త్ డే గిఫ్ట్ గా ఏమిచ్చారో తెలుసుగా? షిప్ బహుమతిగా ఇచ్చారు! అవును… వందల కోట్ల విలువైన షిప్పును ముఖేష్ … నీతాకి బహుమానంగా ఇచ్చారు!   అంబానీల ఖరీదైన విలాసల గురించి ఇప్పుడు మరోసారి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే … జియో బంపరాఫర్ కింద 15వందల రీఫండబుల్ అమౌంట్ తో 4జీ ఫోన్ ఉచితంగా ఇస్తోన్న ముఖేష్ అంబానీ … భార్య నీతా అంబానీకి ఏ రేంజ్ ఫోన్ కొన్నిచ్చాడో తెలుసా? మిసెస్ నీతా ముఖేష్ అంబానీ వాడుతోన్న ప్రస్తుత ఫోన్ ఖరీదు 312 కోట్లు! మీరు విన్నది కరెక్టే! అక్షరాలా 312కోట్లు విలువ చేసే ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్6 పింక్ డైమండ్ ఫోన్ ఆమె వాడుతున్నారట! ఈ కాస్ ట్లీయస్ట్ ఫోన్ స్పెషల్ ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తారు. పూర్తిగా బంగారంతో తయారైన నీతా అంబానీ ఫోన్ వెనుక భాగంలో పింక్ కలర్ డైమండ్ కూడా వుంటుంది! మరిక వజ్రం బంగారంలో పొదిగిన అంబానీల ఫోన్ 312కోట్లు ఖరీదు చేయటం… ఆశ్చర్యమేముంది?