కర్నాటక ఎమ్మెల్యే ఇంట్లో భారీగా ఆస్తులు
posted on Dec 20, 2011 9:17AM
బెంగళూరు: ఉత్తర బెంగళూరులోని యెలహంక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కర్నాటక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విశ్వనాథ్ ఇంట్లో సోమవారం లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. లోకాయుక్త కోర్టు ఆదేశాల మేరకు విశ్వనాథ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లోకాయుక్త భారీగా ఆస్తులు గుర్తించింది.లోకాయుక్త ఎస్పీ శివశంకర్, డిఎస్పీ గిరి నేతృత్వంలో జరిగిన ఈ సోదాలో ఆయన ఇంట్లో 1.1 కిలో బంగారు ఆభరణాలు, 11 కిలోల వెండి వస్తువులు, రూ.40 లక్షల విలువైన గృహోపయోగ సామాగ్రి, రూ.1.71 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువైన విదేశీ మారక ద్రవ్యం, పలు చోట్ల భవనాలు, 65 ఎకరాల వ్యవసాయ భూమి, ఖరీదైన కార్లు, ట్రాక్టర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఆయన భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను తెరవడంతో మరికొంత బంగారం, నగదు బయటపడినట్లుగా తెలుస్తోంది.
కాగా విశ్వనాథ్ ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారంటూ శశిధర్ అనే వ్యక్తి సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కోర్టు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. కాగా ఇదే కాకుండా అప్పటికే లోకాయుక్త కోర్టులో మరో ఫిర్యాదు నమోదై ఉంది.