సుప్రీం ఆదేశం ఈటీవీ ప్రసారాలకు రిలీఫ్

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో ఈటీవీ ప్రసారాలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈటీవీ ప్రసారాలకు కల్పించిన అడ్డంకులను తొలగించాలని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భావప్రకటనా స్వేచ్ఛ పవిత్రతను కాపాడాలని సుప్రీంకోర్టు ఈటీవీకి సూచించింది. మీడియా ఆపరేషన్స్‌కు అవసరమైన పరిధిలో వ్యక్తీకరణ ఉండాలని సూచించింది. ముఖ్యమంత్రి బంధువులకు మైనింగ్ లీజులు కట్టబెట్టారనే వార్తను ప్రసారం చేసినందుకు ఈటీవీ ప్రసారాలకు అడ్డంకులు కల్పించారని ఈటీవీ తరఫు న్యాయవాది ఎఎం సింఘ్వీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈటీవీ ప్రసారాలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ మేరకు భావప్రకటనా స్వేచ్ఛ కింద అభిప్రాయాలను వ్యక్తం చేసే విషయంలో కూడా కొన్ని పరిమితులుంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఈటీవీ ప్రసారాలకు ఆటంకం కల్పించిన ముఖ్యమంత్రి, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Teluguone gnews banner