పట్టాలు తప్పిన కావేరీ ఎక్స్ ప్రెస్

 

రైలు మెల్లగా పోతోందిలే అనుకుని అంతా హాయిగా పడుకున్నారు. పెద్ద కుదుపు.. ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు.. కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటి.. ఏం జరిగిందో తెలీడం లేదు.. ప్రయాణికులంతా అయోమయంలో పడిపోయారు.. అర్థరాత్రి వేళ ఈ అవస్థ ఏంటి దేవుడా.. అని చాలామంది భయపడిపోయారు కూడా.. అసలెక్కడున్నారోకూడా తెలియని స్థితి.. ఎవరైనా ఆదుకోవడానికొస్తారోరారో కూడా తెలీని పరిస్థితి.. సిబ్బంది వచ్చి చెప్పాక కానీ తెలియలేదు.. రైలు పట్టాలు తప్పిందని.. విషయం తెలిశాక ఒక్కసారి గుండె ఝల్లుమంది.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు దగ్గర కావేరీ ఎక్స్ ప్రెస్ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. కొండ చరియలు విరిగిపడడంవల్లే ఇలా జరిగిందని టెక్నికల్ టీమ్ చెబుతున్నారు. ఇంకో ఆందోళనకరమైన విషయం ఏంటంటే రైలు పట్టాలు తప్పినచోట ఓ వైపున కొండ, మరో వైపున లోయ ఉన్నాయ్. ప్రయాణికుల అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది.. లేకుంటే అటు కొండకి ఢీకొట్టినా, ఇటు లోయలోకి జారిపోయినా ప్రాణ నష్టం వందల్లోనే ఉండేది.. కొండచరియ విరిగిపడ్డప్పుడు డ్రైవర్ శ్రీరామ్ చాకచక్యంగా బ్రేకులు వేయడంవల్ల పెను ముప్పు తప్పింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.