రెండు గ్యాస్ కనెక్షన్లిస్తారట

 

ఒక ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే.. ఇది చాలాకాలంగా స్ట్రిక్ట్ గా అమలౌతున్న లేదా చమురు కంపెనీలు గట్టిగా అమలు చేయాలని చూస్తున్న పాలసీ.. ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలుంటే పరిస్థితేంటి అని చాలామంది చాలాకాలంగా ఆవేదన చెందుతున్నారు. ఒకే కుటుంబంలో తల్లీతండ్రీ, పెళ్లైన కొడుకూ కోడలూ విడివిడిగా ఉంటున్నా రెండు కనెక్షన్లు ఇవ్వలేమని గ్యాస్ కంపెనీలు తేల్చి చెప్పాయి. కేంద్ర తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల చాలామందికి వంటగ్యాస్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కచ్చితంగా గ్యాస్ కావాలంటే అయినవాళ్లని వదులుకుని మరో చోట వేరే కాపురం పెట్టక తప్పనిపరిస్థితి. ఇకపై అలాంటి భయాలేవీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు మార్కెటింగ్ శాఖలు సామాన్యులకు చిన్నపాటి భరోసా ఇస్తున్నాయి. ఒకే ఇంట్లో రెండు వంటగదుల్ని చూపిస్తే రెండు కనెక్షన్లకు ఢోకా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయ్. ఇది నిజంగా నిజమైతే బాగుండని లక్షలాది కుటుంబాలు కోరుకుంటున్నాయ్. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఒకే ఇంట్లో ఉంటున్న రెండు కుటుంబాలకు రెండు కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావొచ్చని అధికారులు చెబుతున్నారు. కాకపోతే రెండు వంటగదుల్ని తప్పని సరిగా చూపించాలన్న నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించి తీరాలట.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.