కాకినాడకు పొంచి ఉన్న ప్రమాదం

 

ఒకవైపు జీవవైవిద్య సదస్సుజరుగుతున్నా, దానికి సంబంధించిన ప్రచారానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం క్రియలపై మాత్రం ఏమాత్రం శ్రద్ద చూపటం లేదు. అందుకు ఓ మంచి ఉదాహరణ కాకినాడ బీచ్ తవ్వకాలు. కాకినాడ బీచ్ ప్రాంతాన్ని ఎన్నడూ లేని విధంగా గ్యాసు తవ్వకాలపేరుతో గుల్లచేస్తూ సముద్ర తీరానికి చేటుతెస్తున్నారు. కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ లో జరుగుతు ఈ ట్రెడ్జింగ్ పనుల వల్ల రానున్నరోజుల్లో సముద్రంలో ఏ ఉపద్రవం తలెత్తినా కాకినాడ వాసులకు ముప్ఫు తప్పదని పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నా ఇలాంటి పనులకు అడ్డుకట్టపడడంలేదు. గతంలో వచ్చిన సునామీ కాకినాడను ముంచెత్తకుండా ఉండడానికిగల ఏకైక కారణం హోప్ ఐలాండ్ మాత్రమేనని పర్యావరణ శాస్త్రవేత్తలు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. గ్యాస్ తవ్వకాల పేరుతో జరుగుతున్న అరాచకాలవల్ల చేపలవేటకు వెళ్తున్న జాలర్లు ఉట్టి చేతుల్లో తిరిగొస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నరోజుల్లో సముద్ర తీర ప్రాంతాలయిన ఉప్పాడ, ఏటిమొగ్గలతోపాటు కాకినాడకు కూడా భారీ స్థాయిలో ముప్పు పొంచి ఉందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు గాల్లో కలిసిపోతున్నాయ్. ఇంత పెద్దఎత్తున పర్యావరణానికి నష్టం కలుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని కోస్తావాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.