దొంగలకూ సెంటిమెంట్లుంటాయ్....

 

ప్రకాశ్ సాహు పేరు చెప్పగానే ఏగుడి తలుపులైనా గడగడలాడాల్సిందే. ఈ చోరశిఖామణి ఆలయాల్లో చోరీలు చేయటంలో ఆరితేరిన వాడు. విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో దొంగతనం చేసినప్పుడు బయట పడింది ఇతని పేరు. ఆతరువాత చాలా గుళ్లలో దొంగతనాల్లో పాలు పంచుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. చత్తీస్ ఘడ్ కి చెందిన ఇతగాడికి అమ్మవారి నగలంటే చాలా ఇష్టమట. అంతేకాదు సదరు సాహు అమ్మవారికి దణ్ణం పెట్టుకోందే దొంగతనం చేయడంట. ప్రస్తుతానికి ఇతని ఖాతాలో తూర్పు గోదావరి జిల్లాలో దేవాలయాల్లో జరిగిన దొంగతనాలతోపాటు, కెపిహెచ్ బిలో, జూబ్లిహిల్స్ లో జరిగిన నగల దుకాణాల చోరీలు కూడా సాహు పనేనని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఈ మధ్య జరిగిన లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి నగల్నికూడా సాహూయే కొట్టాశాడన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమౌతున్నాయి. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని నిజం రాబాట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.