ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

 

తెలంగాణలో ఉద్యోగుల జీతాలు చెల్లింపుపై  తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు శాలరీలు చెల్లించొద్దని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ వివరాలు లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. లేని పక్షంలో అక్టోబరు జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. 

సుమారు 10.14 లక్షల మంది శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. ట్రెజరీ, వర్క్స్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు అందరూ పాటించాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని వారి అక్టోబరు జీతాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సర్క్యులర్‌పై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంతకం చేశారు. ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే తీవ్రంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.

బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దౌర్జన్యకాండ

 బంగ్లాదేశ్‌లో  బంగ్లాదేశ్‌లో  హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి.  తాజాగా  సోమవారం (జనవరి 5)  ఒకే రోజు మూడు వేరువేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ఓ మహిళలకు ఘోర అవమానం జరిగింది. ఓ వితంతువుపై గ్యాంగ్,  ఓ జర్నలిస్టు, ఓ వ్యాపారి హత్య జరిగాయి. సోమవారం (జనవరి 5)ఒక్క రోజే జరిగిన ఈ మూడు ఘటనలూ బంగ్లాదేశ్ లో హిందువుల భద్రత గాలిలో దిపంగా ఉందని తేటతెల్లం చేస్తున్నాయి.  వివరాల్లోకి వెడితో..  కాళీగంజ్ లో 4‌‌0 ఏళ్ల హిందూ వితంతువుపై ఇద్దరు యువకులు సోమవారం (జనవరి 5)  సామూహిత అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి ఆమె జుత్తు కత్తిరించారు. అదే రోజు సాయంత్రం మరో ఘటనలో  జశోర్ జిల్లా కాపాలియా బజార్ లో స్థానిక దినపత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న జర్నలిస్ట్ రాణా ప్రతాప్ అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. కాపాలియా బజార్ లో ఓ ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ ను అతడి ఫ్యాక్టరీ దగ్గరే దారుణంగా కాల్చి చంపారు. ఇక అదే రోజు రాత్రి నార్సింగ్ది  లోని బ్రాహ్మండికి చెందిన శరత్ చక్రవర్తి మణి  అనే కిరాణాషాపు యజమానిపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.   పాకిస్థాన్ లో హిందువులపై ఎడతెగకుండా జరుగుతున్న దాడుల పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ దారుణాలపై అక్కడి పోలీసులు నామ్ కే వాస్తే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సోనియాగాంధీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.  దీంతో ఆమెను మంగళవారం (జనవరి 6)  ఉదయం   ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.  వైద్యుల బృందం ఆమె ఆరోగ్య సరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. కాగా సోనియాగాంధీ ఆరోగ్యంపై ఇప్పటి వరకూ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ ను విడుదల చేయలేదు. అలాగే  కాంగ్రెస్ నుంచి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.  సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది.  కాగా ఆరోగ్య కారణాలతోనే ఆమె  2017లో   కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 

ఆకు పచ్చని కోనసీమలో ఓఎన్జీసీ మంటల కొలిమి!

పచ్చటి కోనసీమను ఓఎన్జీసీ నిప్పుల కొలిమిలా మార్చేస్తోంది. ఎన్జీసీ చమురు, సహజవాయువుల అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు కొనసీమ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పచ్చగా కళకళలాడే కోనసీమ నిప్పుల కుంపటిలో భగభగలాడిపోతోంది.  ఎక్కడ ఏ చిన్న గ్యాస్ లీకేజీ జరిగినా కోనసీమ వాసులు గుండెలు గుభేలు మంటున్నాయి. మంటలు ఎగసిపడి పచ్చటి పొలాలను మాడ్చేస్తాయా, కామధేనువు వంటి కొబ్బరి చెట్లను కాల్చేస్తాయా అన్న భయంతో వణికిపోతున్నాయి.  తాజాగా  మలికిపురం మండలం ఇరుసమండ వద్ద   భారీ బ్లోవుట్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు గుండెలరచేత పట్టుకుని క్షణమెక యుగంగా గడుపుతున్నారు. సంఘటనా స్థలానికి కిలో మీటర్ దూరంలో నివాసం ఉండే ప్రజలకు ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలించారు.  స్కూళ్లలో పిల్లలు భోజనాలు చేస్తుండగా.. వారిని మధ్యలోనే లేపేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేందుకు ఘటనా స్థలానికి సమీపంలో నివాసం ఉండే ప్రజలందరినీ కేవలం ఐదంటే ఐదు నిముషాల వ్యవధిలో కట్టుబట్టలతో ఖాళీ చేయించి   లక్కవరం పునరావాస కేంద్రానికి చేర్చారు.  దట్టమైన పొగ కారణంగా తమలో కొందరికి శ్వాసకోశ జబ్బులు, దగ్గు వంటివి వచ్చాయని.. కంటికి కనిపించని పొగ కారణంగా ఎవరు ఎటు పురుగుదీస్తున్నామో అర్ధం కాని దుస్థితి తలెత్తిందని వాపోతున్నారు వీరు. ఇదిలా ఉంటే గతంలో మీరెప్పుడైనా ఇలాంటిది చూశారా అంటే లేదంటున్నారు ఇరుసమండ గ్రామస్తులు. 200 గజాల దూరంలో ఈ ఘటన జరగడంతో ఏం చేయాలో పాలుపోక తలో దిక్కు పారిపోవల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా. ఇదంతా ఇలా ఉంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో చూస్తే.. 1993లో రాజోలు మండలం, కడలి పరిధి తూర్పు పాలంలో కొమరాడ- 1 డ్రిల్లింగ్ సైట్ లో ఒక బ్లో అవుట్ ఘటన జరిగింది. ఈ స్పాట్ నుంచి ఎగబడ్డ చమురు స్థానిక కడలి డ్రెయిన్ లో కలిసి పలు చోట్ల మంటలు అంటుకోవడంతో పాటు.. వేల కొబ్బరి చెట్లు దగ్థమయ్యాయి. 26 రోజుల తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ ద్వారా బావిని పర్మినెంట్ గా మూసెయ్యాల్సి వచ్చింది. ఇక 1995లో పాశర్లపూడి ఘటన జరిగింది. పాశర్లపూడి- 19 బావిలో డ్రిల్లింగ్ టైంలో బ్లో అవుట్ సంభవించి 65 రోజుల పాటు అగ్నికీలలు ఎగసి పడ్డాయి. దీంతో ఈ ప్రాంత వాసులు అదిరిపడ్డారు. దీంతో బీఓపీ మూసి వేసి మంటలను అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. 1997లో రావులపాలెం దగ్గర్లోని దేవరపల్లిలో.. డ్రిల్లింగ్ స్టేషన్ లోని సైట్ లో  బ్లో అవుట్ ఎగసిపడింది. విపరీతమైన శబ్ధంతో ఈ గ్యాస్ చమురు చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 19న ఈ బ్లో అవుట్ వెలుగు చూడగా ఫిబ్రవరి 24 న అదుపులోకి తెచ్చారు. 2020లో కాట్రేని కోనకు దగ్గర్లోని ఉప్పూడిలో ఇక్కడి డ్రిల్లింగ్ సైట్ లో భారీ బ్లో అవుటు వెలుగు చూసింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరగులు దీశారు. ఓన్ జీ సీ నిపుణుల బృందం మూడు రోజుల పాటు శ్రమించి పరిస్థితి అదుపులోకి తీసుకురావల్సి వచ్చింది. ఇక 2014లో గెయిల్‌ విస్ఫోటంలో 22 మంది మృత్యువాత పడ్డ ఘటన ఆంధ్రులంతా అదిరిపడేలా చేసింది. మామిడికుదురు మండలం  నగరంలోని గెయిల్ కి చెందిన పైప్  లైన్ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోవడంతో పాటు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.  పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించింది. తాజాగా   ఇరుసమండ బ్లో అవుట్. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలీక ఈ ప్రాంత వాసులు గుండెలరచేత పట్టి పునరావాస కేంద్రాల్లో మగ్గుతున్నారు.

అమెరికా వర్సెస్ వెనిజువేలా భారత్ పై ప్రభావం ఎంటి?

వెనిజువేలాలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. ఆ దేశాధ్యక్షుడిని అమెరికా మెరుపుదాడి నిర్వహించి, ఏకంగా ఆ దేశ రాజధాని లోకి అధ్యక్ష భవనంలోనే బందీగా పట్టుకుని అమెరికాకు తరలించింది. ఆ తరువాత ఆ దేశాధ్యక్షురాలిగా సుప్రీం ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ, వెనిజువేలా సర్కార్ ను తాము గుర్తించబోమనీ, అక్కడ సజావుగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశ పాలనా వ్యవహారాలన్నీ అమెరికాయే చూస్తుందని అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతే కాకుండా మదురో అరెస్టునకు వ్యతిరేకంగా గళం విప్పే వారందరినీ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారి చేశారు.   రష్యా, చైనా సహా పలు ప్రపంచదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా గర్హించాయి. ఐరాస సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రం ఆచితూచి స్పందించింది. అమెరికా చర్యను నేరుగా ఖండించలేదు. మొక్కుబడి తంతు అన్నట్లు వెనిజువేలా ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అన్ని పక్షాలూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనీ సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ విషయంలో తటస్థంగా ఉండటమే భారత్ కు ప్రయోజనకరమనీ, అందుకే భారత్ కర్ర విరగకుండా, పాము చావకుండా అన్న తరహాలో స్పందించిందనీ అంటున్నారు.  ఇంతకీ అసలు విషయమేంటంటే.. వెనిజువేలా నుంచి భారత్ కు చెందిన ఓఎన్ జీసీ విదేశ్ లిమిటెడ్ కు రావాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయి ఉన్నాయి.  వెనిజువేలాలో అమెరికా జోక్యంతో పెట్రోలియస్ డి వెనిజులా రీస్ట్రక్చరింగ్ జరిగితే..  ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ కు పెండింగ్ బకాయిలు రావడమే కాకుండా  చమురు సరఫరా పెరిగితే.. అంతర్జాతీయ మార్కె ట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. అదే జరిగితే ఆ ఎఫెక్ట్ నేరుగా అమెరికాపైనే పడుతుంది.   భారత్ చమురు విషయంలో  రష్యాపై ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు వెనిజులా నుంచి కూడా చమురు సరఫరా మొదలైతే.. అమెరికా టాక్స్ టెర్రర్ నుంచి తప్పించుకోవడానికి ఇండియా రష్యా చమురు కొనుగోలును తగ్గించేసే అవకాశాలు ఉంటాయి.  అప్పుడు అమెరికా ఆంక్షల నుంచి భారత్ కొంత వరకూ బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. 

అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన

వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మదురో అరెస్టు వ్యవహారం వెనుక డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన కారణాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఆయనను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచింది. అయితే మదురో తాను నిర్దోషినని కోర్టులో వాదించారు. వెనిజువేలా రాజథాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. తాను అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిననీ,  దేశాధ్యక్షుడిననీ పేర్కొన్న మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు.  అమెరికా అక్రమంగా తనను పదవి నుంచి తొలగించినా, తానే ఇప్పటికీ వెనిజువేలా అధ్యక్షుడినని ఆయన ఉద్ఘాటించారు.   మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా కోర్టులో హాజరు పరిచారు. ఆమె కూడా  తాను వెనిజులా ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని స్పష్టం చేశారు. అమెరికా మదురోపై  నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర, విధ్వంసకర ఆయుధాలు   కలిగి ఉండటం, మెక్సికోలోని సినలోవా, జెటాస్ కార్టెల్స్, కొలంబియా తిరుగుబాటుదారులతో కలిసి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం వంటి అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఈ తప్పుడు కేసులు పెట్టిందని మదురో వాదించారు.  ఇలా ఉండగా మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యగా దీనిని పేర్కొన్నారు.    అదలా ఉంటే.. వెనిజువేలా అరెస్టు తరువాత ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా అక్కడి   అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి.  మదురోను అమె రికా బందీగా పట్టుకుని తరలించిన తరువాత ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.  వెనిజువెలాలో సక్రమంగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని పేర్కొన్నారు. కాగా వెనిజువేలాలో పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందించింది.  వెనిజువెలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది.  

యుద్ధం అసాధ్యం.. అందుకే లొంగుబాటు!

సాయుధ పోరాటం అసాధ్యమని మావోయిస్టు అగ్రనేత బట్సే దేవా అలియాస్ సుక్కు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల లొంగిపోయన సుక్క.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమైన తరువాత ఆయన స్కథానంలో మావోయిస్టు పార్టీ ఆయుధ దళాధిపతిగా నియమితుడయ్యాడు. బట్సే దేవా అలియాస్ సుక్క తనతో పాటు 19 మంది మావోయిస్టు కేడర్లతో కలిసి 40 అధునాతన ఆయుధాలతో  ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే.   మావోయిస్టు కేంద్ర కమిటీలో అంతర్గతంగా ఏం జరిగిందన్నది తనకు అంత స్పష్టంగా తెలియదన్న సుక్మ,  మల్లోజుల లొంగుబాటు తరువాత పార్టీ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిందని చెప్పారు.  సాయుధ పోరాటం వీడాలన్న చర్చ పార్టీలో జరిగిందా అన్న సందేహాలు కూడా తలెత్తాయనీ,  అయితే కొన్ని రోజుల తర్వాత పరిస్థితిపై స్పష్టత వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని  బట్సె దేవా అలియాస్ సుక్క వెల్లడించారు. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాతనే తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో లొంగిపోయినట్లు వివరించారు.   తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ దాడుల సమయంలోనే దొరికినవేనని, ఆయుధాల తయారీకి ప్రత్యేక ఫ్యాక్టరీ కూడా తమకు ఉందని పేర్కొన్నారు. కొన్ని ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునేవారమని చెప్పిన సుక్మ..  హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధాలను కూడా తయారు చేశామన్నారు.  మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ  కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు. హెడ్మా మరణం తర్వాత పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిందనీ, హెడ్మా ఎన్ కౌంటర్ కు ముందే పార్టీ తనను  పీఎల్‌జీఏ కమాండర్‌గా నియమించిందనీ, హెడ్మా ఉన్న సమయంలోనే తానా బాధ్యతలు నిర్వహించానని దేవా వెల్లడించారు. ఒకప్పుడు 400 మంది వరకు ఉన్న పీఎల్‌జీఏ కమాండర్లు ఇప్పుడు  60 మందికే పరిమితమయ్యారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లొంగిపోయిన తరువాత  పునరావాసం కల్పించారని, భవిష్యత్ లో ఎటు వెళ్లాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దేవా చెప్పారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో ఎవరు పనిచేస్తున్నారన్న విషయమూ తనకు తెలియదని దేవా చెప్పారు.   బసవరాజు స్థానంలో దేవిజీ నియమితుడయ్యారన్న సమాచారమూ తనకు అందలేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు వెల్లడించలేనన్న సుక్మా మాట లతో మావోయిస్టు ఉద్యమం ప్రస్తుత స్థితిని, అంతర్గత బలహీనతలు స్పష్టంగా వెల్లడయ్యాయని రాజ కీయ, భద్రతాదళాలు భావి స్తున్నాయి. 

వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వైఫల్యమే కారణం

సిద్దిపేట మెడికల్ కాలేజీ  విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్  లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే  కులాలు వేరు అన్న కారణంతో   ప్రణయ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన లావణ్య మనస్తాపంతో  ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వైద్య విద్యార్థిని కావడంతో పాయిజెనెస్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.  లావణ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు  సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సులో సినిమాకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు

  ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అందరూ కలిసి బస్సులో ప్రయాణించి ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకుని సినిమాను వీక్షించారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ‘పూలే’ సినిమాను హిందీ భాషలో తెరకెక్కించగా 2025 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు.  జీ స్టూడియోస్, డ్యాన్సింగ్ శివ ఫిల్మ్స్, కింగ్స్ మెన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమా నిర్మితమైంది. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కుల నిర్మూలన కోసం పూలే చేసిన పోరాటం, మహిళల హక్కుల కోసం ఆయన సాగించిన ఉద్యమాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టుగా తెరపై ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతు పూలే సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశం అందించే చిత్రమని తెలిపారు. ఆ నాడు కుల వివక్షను తట్టుకుని సమ సమాజం కోసం వేసిన పునాదుల ఫలితాలను ఈరోజు అనుభవిస్తున్నామని తెలిపారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు

టెంపో డ్రైవ‌ర్ టు...శంఖ్ ఎయిర్ ఓన‌ర్ వ‌ర‌కూ

  ఇటీవ‌ల కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్ర‌వ‌ణ్ కుమార్. దీంతో ఈయ‌న దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నారు. ఒక టెంపో డ్రైవ‌ర్ స్థాయి నుంచి విమాన‌యాన సంస్థ ఓన‌ర్ వర‌కూ ఎలా ఎదిగాడ‌న్న‌దే ఇప్పుడు అంద‌రి ముందున్న ప్ర‌శ్న‌. మ‌ధ్య త‌ర‌గ‌తి విమాన యాన క‌ల‌ను ఎలాగైనా స‌రే సాకారం చేయాల‌న్న దృక్ప‌థంతో శ్ర‌వ‌ణ్ ఈ రంగంలో అడుగు పెట్టిన‌ట్టు చెబుతున్నారు. యూపీ నుంచి వ‌స్తోన్న తొలి విమాన‌యాన సంస్థ‌ను ప్రారంభించారు. శ్ర‌వ‌ణ్ తొలుత సిమెంట్, స్టీల్, ర‌వాణా రంగాల్లో వ్యాపారాలు చేశారు. 2026లో దేశీయ విమాన సేవ‌లు ప్రారంభించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు శ్ర‌వ‌ణ్. శ్ర‌వ‌ణ్ విశ్వ‌క‌ర్మ నేప‌థ్యం ఏంటో చూస్తే సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చారు. చిన్న‌త‌నంలోనే చ‌దువుకు విరామం ప్ర‌క‌టించి టెంపో న‌డ‌ప‌టం స్టార్ట్ చేశారు. తొలుత లోడ‌ర్ గా త‌న కెరీర్ మొద‌లు పెట్టారు శ్ర‌వ‌ణ్. ఆ త‌ర్వాత అంచ‌లంచెలుగా ఎదిగి  ర‌వాణా నుంచి స్టీల్ కి ఆపై సిమెంట్, మైనింగ్ రంగాల్లో విజ‌య‌వంత‌మైన  వ్యాపార నిర్వ‌హ‌ణ  చేశారు. శ్ర‌వ‌ణ్ చిన్న‌ప్ప‌టి క‌ల విమాన‌యానం. దీంతో ఈ రంగంలో అడుగు పెట్టి శంఖ్ ఎయిర్ ప్రారంభించారు. దీని ప్ర‌ధాన  ల‌క్ష్యం.. మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండేలాంటి ధ‌ర‌లు. సామాన్యులు కూడా ఎంతో సాదా సీదాగా విమాన‌యానం చేసేయ్య‌డ‌మే శ్ర‌వ‌ణ్ త‌న ముందు పెట్టుకున్న టార్గెట్. తొలిగా మూడు ఎయిర్ బ‌స్సుల‌తో శ్ర‌వ‌ణ్ త‌న శంఖ్ ఎయిర్ ని  ప్రారంభించారు. లక్నో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలను కనెక్ట్ చేయడం, పండుగల సమయంలో కూడా ధరలు పెరగకుండా చూసుకోవడం. త‌న ప్ర‌యారిటీస్ గా పెట్టుకుందీ సంస్థ‌.   ఇదంతా ఇలా ఉంటే ఇలాంటి విమాన యాన సంస్థ‌లు ఎన్నో పుట‌కు రావ‌ల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంది.. కార‌ణం మొన్న‌టి ఇండిగో వ్యవ‌హారం చూస్తూనే ఉన్నాం. ఈ సంస్థ గుత్తాధిప‌త్యం కార‌ణంగా దేశ‌మే స్తంభించి పోయిన ప‌రిస్థితి  క‌నిపిస్తోంది. కాబ‌ట్టి.. యువ కేంద్ర మంత్రి తెలుగు తేజ‌మైన రామ్మోహ‌న నాయుడి అధ్వ‌ర్యంలో శ్ర‌వ‌ణ్ లాంటి మ‌రి కొంద‌రు ఈ రంగంలోకి రావాల‌ని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ టు శంఖ్ ఎయిర్- శ్ర‌వ‌ణ్  అంటూ ఆల్ ఓవ‌ర్ ఇండియా కూడా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతోన్న విధం క‌నిపిస్తోంది.

మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

  మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి... ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.  ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.