యుద్ధం అసాధ్యం.. అందుకే లొంగుబాటు!

సాయుధ పోరాటం అసాధ్యమని మావోయిస్టు అగ్రనేత బట్సే దేవా అలియాస్ సుక్కు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల లొంగిపోయన సుక్క.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమైన తరువాత ఆయన స్కథానంలో మావోయిస్టు పార్టీ ఆయుధ దళాధిపతిగా నియమితుడయ్యాడు. బట్సే దేవా అలియాస్ సుక్క తనతో పాటు 19 మంది మావోయిస్టు కేడర్లతో కలిసి 40 అధునాతన ఆయుధాలతో  ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే.  

మావోయిస్టు కేంద్ర కమిటీలో అంతర్గతంగా ఏం జరిగిందన్నది తనకు అంత స్పష్టంగా తెలియదన్న సుక్మ,  మల్లోజుల లొంగుబాటు తరువాత పార్టీ అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిందని చెప్పారు.  సాయుధ పోరాటం వీడాలన్న చర్చ పార్టీలో జరిగిందా అన్న సందేహాలు కూడా తలెత్తాయనీ,  అయితే కొన్ని రోజుల తర్వాత పరిస్థితిపై స్పష్టత వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చామని  బట్సె దేవా అలియాస్ సుక్క వెల్లడించారు. ఆ నిర్ణయానికి వచ్చిన తరువాతనే తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో లొంగిపోయినట్లు వివరించారు.   తమ వద్ద ఉన్న ఆయుధాలన్నీ దాడుల సమయంలోనే దొరికినవేనని, ఆయుధాల తయారీకి ప్రత్యేక ఫ్యాక్టరీ కూడా తమకు ఉందని పేర్కొన్నారు. కొన్ని ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునేవారమని చెప్పిన సుక్మ..  హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్న ఆయుధాలను కూడా తయారు చేశామన్నారు.  మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ  కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు.

హెడ్మా మరణం తర్వాత పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిందనీ, హెడ్మా ఎన్ కౌంటర్ కు ముందే పార్టీ తనను  పీఎల్‌జీఏ కమాండర్‌గా నియమించిందనీ, హెడ్మా ఉన్న సమయంలోనే తానా బాధ్యతలు నిర్వహించానని దేవా వెల్లడించారు. ఒకప్పుడు 400 మంది వరకు ఉన్న పీఎల్‌జీఏ కమాండర్లు ఇప్పుడు  60 మందికే పరిమితమయ్యారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ సహకారంతో లొంగిపోయిన తరువాత  పునరావాసం కల్పించారని, భవిష్యత్ లో ఎటు వెళ్లాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దేవా చెప్పారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో ఎవరు పనిచేస్తున్నారన్న విషయమూ తనకు తెలియదని దేవా చెప్పారు.  

బసవరాజు స్థానంలో దేవిజీ నియమితుడయ్యారన్న సమాచారమూ తనకు అందలేదని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు వెల్లడించలేనన్న సుక్మా మాట లతో మావోయిస్టు ఉద్యమం ప్రస్తుత స్థితిని, అంతర్గత బలహీనతలు స్పష్టంగా వెల్లడయ్యాయని రాజ కీయ, భద్రతాదళాలు భావి స్తున్నాయి. 

స్టీల్ ప్లాంట్ భూములపై లోకేష్ క్లారిటీ

  విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని  మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు.  బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని వివరించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు

ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్

  హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కల్తీ నిరోధానికి పోలీస్‌ శాఖ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠినంగా ఎస్‌వోపీ అమలు చేస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి పాల్పడే వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.  

దిల్‍సుఖ్‍నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన

  జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు  రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.  

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ...ఐదుగురు అరెస్ట్

  హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది. ఐటీ ఉద్యోగాలు, స్టార్టప్ కల్చర్ మాత్రమే కాదు… ‘స్టార్ హోటల్ డ్రగ్ పార్టీలకు’ కూడా గచ్చిబౌలి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తాజా ఘటన మరోసారి రుజువు చేసింది.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్‌బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ హోటల్‌లో జరిగిన డ్రగ్ పార్టీపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసుల సంయుక్త దాడులు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హోటల్ రూమ్‌లో రీయూనియన్ పేరుతో మత్తులో మునిగిపోయిన యువకుల ఆటలు, పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. 2019లో హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేసిన నలుగురు యువకులు కలిసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో రీయూనియన్ ప్లాన్ చేసుకున్నారు.  అదే సమయంలో మరో పాత స్నేహితుడు కూడా వీరిని కలిశాడు. ఈ ఐదుగురు గతంలో ఒక పెళ్లి వేడుకలో తొలిసారి గంజాయి సేవించారు. ఈరోజు అందరూ కలవడంతో మళ్లీ గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేశారు. రీయూనియన్ అంటే పాత ఫోటోలు, పాత జ్ఞాపకాలు కాదు… పాత మత్తే ప్రధాన అజెండాగా మారింది. పోలీసుల చేతికి చిక్కిన వారు హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న యువకులు వారిని చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. మణికొండ కు చెందిన మెఘేందర్ (29) – ఫ్రీలాన్సర్ బార్ టెండింగ్ గా పని చేస్తున్నాడ. కూకట్పల్లికి చెందిన తేజేశ్వర్ (28) – ఫుడ్ అండ్ బేవరేజెస్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. రామంతపూర్ కు చెందినసాయి ప్రసాద్ (28) – మనోహర్ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శేర్ లింగంపల్లి కి చెందిన రమేష్ (27) – లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు... నలుగురు యువకులు ఫుడ్ అండ్ బేవరేజెస్ మేనేజర్లు, హోటల్ మేనేజర్లు, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్లు…అతిథులకు సేవ చేసే వారు, మత్తుకు సేవ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు కలిసి జనవరి 6న హోటల్ రూమ్ నెంబర్ 309పై దాడులు నిర్వహిం చారు. రూమ్‌లో ఏడుగురు మద్యం సేవిస్తూ హంగామా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గది మొత్తం తనిఖీ చేయగా.. గంజాయి లభించకపోయినా, అనుమానం నివృత్తి కోసాం అందరికీ యూరిన్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రోజు గంజాయి సేవించినట్లు వారే స్వయంగా అంగీకరించారు.  బేగంపేట్ కు చెందిన టి. రవి (27) – ఏఆర్‌పీసీ, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్నాడు. ఇతను కూడా ఈ నలుగురితో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఏఆర్‌పీసీ స్థాయి అధికారి మత్తులో పట్టుబడటం పోలీస్ విభాగంలో కలకలం రేపింది. చట్టాన్ని కాపాడాల్సినవారే చట్టాన్ని మరిచిపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.  ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ముఖ్యంగా హోటల్, ఐటీ రంగాల్లో పనిచేసే యువత ఈ మత్తు మాయలో పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. స్టార్ హోటల్, రీయూనియన్, పార్టీ పేరుతో మత్తు పదార్థాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈగిల్ ఫోర్స్ హెచ్చరించారు.

సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు?

  రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు.. పార్టీ ఏదైనా సరే తనపై వచ్చే విమర్శలకు అంతే ధీటుగా స్పందిస్తారు. దశాబ్దా కాలంగా కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సురేష్ బాబు చెక్ పెట్టి పదవి నుంచి దించేశారు. తన వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇదంతా ఓ లెక్కైతే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడపలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జిల్లాలో దూమారం రేపుతోందట.. 2024 ఎన్నికల ముందు కడప నగరంలో నేరాలు అరికడతామని, గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు కడప రెడ్డెమ్మ. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నరగంలో సీసీ కెమెరాలు అవసరమని దాతల సహకారంతో పి4 పద్దతిలో నిధుల సమీకరణకు ఎమ్మెల్యే దంపతులు చేపట్టారంట. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సొంత పార్టీకి చెందిన మైనారిటీ నేత రబ్బానిని రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇవ్వకపోతే పార్టీకి మీతో సంబంధాలు కట్ చేస్తాం మీ కథ చూస్తాం అని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో దూమారం రేపుతోంది. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు సీసీ కెమెరాల పేరుతో వసూళ్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో మైనారిటీ నేత రబ్బాని తండ్రి జిలాని  అస్వస్ధతకు గురికావడం చర్చినీయంశంగా మారిందట. జిలానిని శ్రీనివాసులు బెదిరించడం వల్లే అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.   కడప నగరంలో సీసీ కెమెరాల వివాదం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడితున్నారు మాజీ డిఫ్యూటీ సియం అంజాద్ బాషా. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎవరు ఏం అనుకున్నా ఎన్ని ట్రోల్స్ చేసినా తగ్గేదేలే అంటున్నారు. కడప నగరం గంజాయికి అడ్డాగా మారిందని, గంజాయి ఫెడ్లర్లకు చెక్ పెట్టాలంటే ప్రతి గల్లీలో సిసి కెమెరాలు అవసరం అంటున్నారు. సీసీ కెమెరాల కోసం కోటి రూపాయలకి పైగా నిధులు అవసరం అని అందుకే పి4 మోడల్లో నిధులు సమీకరిస్తున్నామని ఆమె సమర్ధించుకుంటున్నారు.  అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాతలు ముందుకు రావాలని సీసీ కెమెరాలు అందించే కంపెనీ పేరుతో చెక్ ఇవ్వాలని కోరుతున్నారు . అయితే మీ పార్టీ అధికారంలో ఉంది... ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి కెమెరాలు ఏర్పాటు చేయాలి కానీ ఇలా బెదిరించి వసూలు చేయడం ఏంటని వైసీపీ విమర్శులు చేస్తుంది.

రూ.43 వేల కోట్ల బంగారం వెనిజులా నుంచి స్విస్‌కు తరలింపు

  వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు రూ.43,000 కోట్ల పైచిలుకు విలువైన బంగారాన్ని వెనిజులా నుంచి స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. నికోలస్ మదురో 2013లో వెనిజులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళంలో పడింది. ఆ మూడేళ్ల కాలంలోనే దాదాపు 113 మెట్రిక్ టన్నుల స్వచ్ఛమైన బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించారు.  వెనిజులా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న నిల్వల నుంచే ఈ బంగారం తరలిపోయినట్లు స్విస్ బ్రాడ్‌కాస్టర్ 'ఎస్‌ఆర్‌ఎఫ్' ధ్రువీకరించింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి, నగదు లభ్యత కోసం ప్రభుత్వం ఈ బంగారాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే గోల్డ్ రిఫైనింగ్‌కు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రం కావడంతో.. అక్కడ శుద్ధి చేయడం, ధ్రువీకరణ పొందడం కోసం ఈ బంగారాన్ని పంపినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల జనవరి 3న కరాకస్‌లో జరిగిన ఆకస్మిక దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌ కోర్టులో డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో-టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదురోతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన మరో 36 మందికి సంబంధించిన ఆస్తులను స్విస్ బ్యాంకులు స్తంభింపజేశాయి.  అయితే వెనిజులా సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలిన బంగారానికి, ప్రస్తుతం ఫ్రీజ్ చేసిన ఆస్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  వెనిజులా ప్రజలు తీవ్ర ఆకలితో, ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సమయంలోనే ఇంత భారీ సంపద దేశం దాటడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ బంగారం ఆసియా మార్కెట్లలో విక్రయించబడిందా లేక ఆర్థిక సంస్థల వద్దే ఉండిపోయిందా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

బంగ్లాలో హిందువులను ఓటింగ్‌కు దూరం చేయడానికి కుట్ర..!

  ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా? మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు ఓటింగ్లో పాల్గొనకుండా చేయడానికే ఈ మారణకాండ కొనసాగుతుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గడిచిన 31 రోజుల్లో ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యలు, లూటీలు, అత్యాచారాలతో బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా హిందువుల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి.  కొత్త ఏడాదిలోనే ఇదే పరిస్థితి కొనసాగుతుండతో సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి దిక్కుతోచకుండా తయారైంది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది.  ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలపాలవుతోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు కనిపించడం లేదని, ఆంక్షలు విధించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు కుట్రగా కనిపిస్తోంది.

బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం

  హైదరాబాద్‌ నగరంలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. జంతు హింసతో పాటు డ్రగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఒక ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ కంపెనీపై విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించగా, భారీగా రక్త నిల్వలు బయటపడ్డాయి. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారుల కంటపడిన దృశ్యాలు విస్మయానికి గురి చేశాయి. గోదాములలో ప్యాకెట్ల రూపంలో భారీగా గొర్రె, మేక రక్తాన్ని నిల్వ చేసి ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు వెయ్యి లీటర్లకు పైగా రక్తంను ప్యాకెట్లలో భద్రపరిచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ రక్తాన్ని నిల్వ చేయడం, తరలించడం పూర్తిగా అక్రమమని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. రక్తానికి సంబంధించిన అన్ని ప్యాకెట్లను సీజ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ రక్తాన్ని హర్యానాలోని పాలీ మెడికూర్ అనే కంపెనీకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ పేరుతో రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ, ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు అనుమాని స్తున్నారు. అసలు గొర్రె, మేకల రక్తాన్ని ఏ అవసరానికి వినియోగిస్తున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఈ రక్తాన్ని క్లినికల్ ట్రయల్స్‌, ఔషధ తయారీ లేదా బయో–మెడికల్ ప్రయోగాల కోసం అక్రమంగా ఉపయోగిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు కొనసాగించారు.  దీనికి సంబంధించిన పత్రాలు, లైసెన్సులు ఏవీ కంపెనీ వద్ద లభించలేదు. CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీ లో ఉన్నాడు. గత రెండు రోజులుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నికేష్‌ను అదుపులోకి తీసుకుంటే రక్తం సేకరణ, నిల్వ, సరఫరా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రాంతాల్లో గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం లభించింది. ఎలాంటి వెటర్నరీ పర్యవేక్షణ లేకుండా, జంతువులకు తీవ్ర హింస చేస్తూ ఈ రక్తాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జంతు సంక్షేమ చట్టాలకు పూర్తి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో కేంద్ర డ్రగ్ కంట్రోల్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశ ముంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, జంతు హింస నిరోధక చట్టం, అక్రమ రవాణా నిబంధనల కింద కేసులు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అక్రమ రక్త వ్యాపారం వెనుక మరిన్ని కంపెనీలు, వ్యక్తులు ఉన్నారా? దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడికి ఈ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసా గుతోంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదు నగరంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రియులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు... అసలు ఈ రక్తంతో ఏం చేస్తున్నారనే పూర్తి వివరాలు నిందితుల అరెస్టులతోనే వెలుగులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్  నోటీసులో పేర్కొన్నాది. రేవంత్‌ రెడ్డి  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్‌ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్‌ కోరినట్లు సమాచారం. ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి.  మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్‌ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును సిట్‌ రెండు దఫాలుగా కస్టోడియల్‌ విచారణ పూర్తి చేసింది.