తేల్చుకోవాలనుకుంటున్న తెలంగాణా మంత్రులు
posted on Oct 19, 2012 8:48AM
ప్రత్యేకతెలంగాణారాష్ట్రం ఇస్తారా? లేదా? అని తేల్చుకోవాలని తెలంగాణాప్రాంతానికి చెందిన మంత్రులు నిశ్చయించుకున్నారు. తాము ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన తరువాత ఇక ఆగటం ఎందుకని ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రులు చెప్పిన అన్ని అంశాలూ క్షుణ్నంగా పరిశీలించాక చివరాఖరున చూద్దామని ఓ చిరునవ్వు నవ్వారు. అలానే ఇతర నేతలు కూడా మంత్రులకు నవ్వుతూ వీడ్కోలు పలికారు. దీనికి కారణం ముందురోజు సిఎంతో సుదీర్ఘచర్చలు, తరువాత రోజు మంత్రులతో మంతనాలు వరుసగా జరగటమే. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై ఒక అభిప్రాయానికి రాలేకపోతోందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా దీని విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నా దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలెత్తే సమస్యలు పార్టీని నిశ్చితాభిప్రాయం వైపు రానీయటం లేదు. అయితే తాజాగా రాహుల్గాంధీ కూడా దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తున్నది. ఈ దశలోనే మంత్రులు ముఖేశ్, దానం నాగేందర్ మినహా మిగిలిన తెలంగాణా మంత్రులందరూ జానారెడ్డి ఆధ్వర్యాన సోనియాకు లేఖ రాశారు. సోనియాగాంధీ ఆ లేఖను పరిశీలించే తెలంగాణా మంత్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశమిచ్చారు. అయితే తెలంగాణా ఇవ్వటం కష్టమని కాంగ్రెస్ సీనియర్ నేతలు కే. కేశవరరావు, కోటమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లుగానే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఢిల్లీలో ఉండి లాబీయింగు చేసినా రాని స్పందన తెలంగాణా మంత్రులు సాధిస్తారా? లేక తేల్చుకోవాలని వెళ్లి సిఎం కిరణ్కుమార్రెడ్డి వెనుక నడవటానికి సిద్ధపడి వస్తారా? అన్న ఉత్కంఠ రాష్ట్రంలో పెరిగిపోతోంది.