షర్మిల ప్రజాప్రస్థానం టార్గెట్ తెలుగుదేశం

కడప ఎంపి వైఎస్జగన్మోహనరెడ్డి సోదరి, వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్రమరో ప్రజాప్రస్థానంపేరిట ప్రారంభమైంది. ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఘాట్లో నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖరరెడ్డి తన రాజకీయజీవితంలో మలుపు కోసం చేపట్టిన రాజకీయప్రస్థానాన్ని తలపించేలా షర్మిల తన పాదయాత్రకు పేరు పెట్టించుకున్నారు. ఈ ప్రస్థానంతో ఆమె రాజకీయజీవితంలో ఎదగగలరో? లేదో? కూడా తేలిపోనుంది. ఈమె ఏకైక టార్గెట్తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం వస్తున్నా పాదయాత్ర. అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రి తరహాలో చంద్రబాబుని విమర్శించడం షర్మిల స్టైల్. అయితే అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ, నేడు ఆయన ప్రతిపక్షనేత. అందువల్ల వెనుకడుగువేయాల్సిన పని లేదని చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. తాను ఎటువంటి ఆరోపణపైనైనా సమాధానమివ్వటానికి సిద్ధమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబును ఎదుర్కోటానికి షర్మిల కూడా సిద్ధమయ్యారు. తన తల్లి, సోదరుడు ఆరోపించినట్లు కాకుండా విధానపరమైన చంద్రబాబు లోపాలపై ఆమె ఇప్పటికే పలువురు నాయకులతో చర్చించారట. ఈ చర్చల్లో తేలిన అంశాల ఆధారంగా బాబును ఇరకాటంలో పెట్టేందుకు షర్మిల సిద్ధంగా ఉన్నారు. అలానే తమ పార్టీ రాజకీయనేత, రచయిత యండమూరి వీరేంధ్రనాధ్తోనూ, సినీరచయిత, నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతోనూ షర్మిల ఎటువంటి విమర్శలు బాగా ప్రాచుర్యం పొందుతాయో కనుక్కొన్నారు. వాటికి మాత్రమే షర్మిల ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా పోటీపాదయాత్రల ఘట్టం ప్రారంభమైంది.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.