పీపీపీపై న్యాయపోరాటం ఎలా? వైసీపీ మల్లగుల్లాలు!

Publish Date:Dec 20, 2025

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది.  దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది. 

బ్యాలెట్ బీజేపీకి కలిసిరాదా?

Publish Date:Dec 18, 2025

తెలంగాణ‌లో  ఎనిమిది ఎంపీ సీట్లున్న బీజేపీకి క‌నీసం 800 పంచాయితీలు కూడా ఎందుకు గెల‌వ‌లేక పోయింది?  ఇదీ ప్ర‌స్తుతం పొలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చ.   బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ  ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు.   మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దేశం కోసం కాకుండా,   మోడీ కోసం పని చేస్తోందా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు.    తెలంగాణలో మూడు విడ‌త‌లుగా జరిగిన పంచాయితీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్- 7, 093 పంచాయితీల‌ను కైవ‌సం  చేసుకోగా, బీఆర్ఎస్- 3488, బీజేపీ- 699, సీపీఐ- 79, సీపీఎం- 75, ఇత‌రులు- 1264 పంచాయితీలను గెలిచాయి.  ఈ లెక్క‌న చూస్తే బీజేపీ 10 స్ట్రైక్ రేట్ కనీసం పది శాతం కూడా లేదని తేటతెల్లమౌతోంది.  మ‌రి ఇదే  బీజేపీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  ఎనిమిది స్థానాలలో ఎలా గెలవగలిగింది అని ప్రశ్నిస్తున్నారు.  బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే ఇట్స్ నాటే జోక్. కార‌ణం ఇక్క‌డున్న‌వే  17 సీట్లు. వీటిలో 8 గెల‌వ‌డం అంటే స‌గానికి స‌గం.. గెల‌వ‌డంతో స‌మానం. అలాంటిది ప‌ది శాతం పంచాయితీలు కూడా ఎందుకు రాలేద‌ని అడిగే వారికి తెలియాల్సింది ఏంటంటే.. బీజేపీని ఓట‌ర్లు ఎంపిక చేయ‌డంలో అర్ధం.. ప్రెజంట్ సిట్యువేష‌న్ ప్ర‌కారం.. ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్క‌డి నుంచి ఎంపీల‌ను పంపిస్తే.. వారు రాష్ట్రానికి ఏదైనా సాదించి తీస్కొస్తార‌ని. ఇక్క‌డ వాస్త‌వ  ప‌రిస్థితి ఏంటి అన్న‌ది  అటుంచితే.. ఓట‌ర్ల అభిమ‌తం అయితే అదీ.  ఇక కాంగ్రెస్ కూడా బీజేపీకి మ‌ల్లే  జాతీయ పార్టీ. మ‌రి  ఆ  పార్టీకి  ఏడు వేల పైచిలుకు పంచాయితీలు రావ‌డానికి గ‌ల కార‌ణాలేంటి? అని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ  అధికారంలో ఉన్నా.. ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావ‌డం త‌ర‌త‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తున్న‌దే. ఇందులో ఎలాంటి విచిత్రం ఏమీ లేదు. గ‌తంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌పుడు కూడా ఇక్క‌డా పార్టీ స‌రిగ్గా ఇలాంటి ఫ‌లితాల‌నే చ‌వి చూసింది. బీఆర్ఎస్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడే వ‌ర‌కూ కూడా ఒక‌టీ అరా  త‌ప్పించి.. అన్ని  ర‌కాల  ఎన్నిక‌ల్లోనూ విజ‌య ఢంకా  మోగిస్తూనే వ‌చ్చింది. కేర‌ళ‌లోని ట్రివేండ్రం లోక‌ల్ బాడీ  ఎలక్ష‌న్స్ లో బీజేపీ  విజ‌య దుందుభి మోగించింది. ఈ కార్పొరేష‌న్లో అధికారం చేప‌ట్టింది.  ఇన్నాళ్ల పాటు ఇక్క‌డ హిందుత్వం గానీ ఆర్ఎస్ఎస్ వాదుల‌కుగానీ పెద్ద గొప్ప ఆస్కార‌ముండేది  కాదు.  ఆద‌ర‌ణ ల‌భించేది కాదు. పైపెచ్చు క‌మ్యూనిస్టుల చేతుల్లో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ హ‌త్యాకాండ సైతం  న‌డిచేది. ఇక్క‌డ క‌మ్యూనిస్టుల‌దే రాజ్యం. కానీ ఇప్పుడ‌క్క‌డ సురేష్ గోపీ  రూపంలో ఒక ఎంపీ గెల‌వ‌డం  మాత్ర‌మే కాకుండా.. స్థానికంగానూ స‌త్తా చాటింది బీజేపీ. అక్క‌డా బ్యాలెట్ ఓటింగే  జ‌రిగి ఉంటుంది. మ‌రి  అక్క‌డి గెలుపును వీరంతా  ఎందుకు ఒక ప్రామాణికంగా  తీస్కోరు? అన్న  ప్ర‌శ్న  వినిపిస్తోంది. నిజంగా కాంగ్రెస్ చెప్పిన‌ట్టు ఓట్ చోరీయే జ‌రిగి ఉంటే, స‌ర్ రూపంలో ల‌క్ష‌లాది ఓట్లు పోయి ఉన్న మాట నిజ‌మైతే.. ప్ర‌జ‌లు ఈ ప్ర‌చారాన్ని ఓట‌ర్లు ఎందుకు న‌మ్మ‌డం లేదు? అన్న‌దొక ప్ర‌శ్న‌. రాహుల్ మీడియా ప్రెజంటేష‌న్లు ఇచ్చి.. ఇంత నెత్తీ  నోరు బాదుకున్నా.. జ‌నం  న‌మ్మ‌లేదంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలి? ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదే బ్యాలెట్ల  రూపంలోనే ఇక్క‌డ త‌క్కువ వ‌చ్చిన బీజేపీ, కేర‌ళ‌లో విజ‌య ఢంకా మోగించిన‌దాన్ని ఎందుకు మ‌రుస్తున్నారు? అన్నది కూడా మ‌న‌మంతా ప‌రిశీలించాల్సి ఉందంటారు విశ్లేష‌కులు.

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఈ తప్పులు చేస్తే ధనవంతుడు పేదవాడు అవుతాడు.!

Publish Date:Dec 19, 2025

మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
[

Health

]

ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!

Publish Date:Dec 19, 2025

ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...