కాలేజిలో స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్

 

పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిపైన విద్యార్ధి నేతలు సాముహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో బయటపడింది. తన కూతురిపై సాముహిక అత్యాచార౦ జరిపిన వారిలో తృణమూల్ కాంగ్రెసు ఛత్ర పరిషత్ నేత సామ్యో మండల్ ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ స్టూడెంట్ ను గదిలోకి తీసుకొనివెళ్ళి మద్యం తాగించే ప్రయత్నం చేశారని, దానికి ఆమె నిరాకరించడంతో ఆమె బట్టలు విప్పి సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఆ తరువాత అత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి చెప్పాడు. ఐదుగురు నిందితుల్లో సెక్యూరిటీ గార్డ్ భోల్ యాదవ్ కూడా ఉన్నాడు. మరో నలుగురు నిందితులు మండల్, అవిక్ ఘోష్, బిజయ్ సింగ్, మిథిలేష్ ఓజా పరారీలో ఉన్నారు. బాధితురాలిని చిత్తరంజన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.