లక్ష్యంమంచిదే!

మురికి కూపాలుగా... రోగాలకు నిలయాలుగా మారుతున్న నగరాలను క్లీన్‌సిటీస్‌గా మార్చేందుకు  దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖ క్లీన్‌సిటీ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు శ్రీకారం చుట్టింది.  మహానగరాలనుండి చిన్న పట్టణాలవరకు చెత్తకు నివాసాలుగా మారిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ముదావహం.   డోర్‌ టూ డంపింగ్‌ యార్డు’ పేరుతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది.  ఈ పోటీలకు వేదిక వరంగల్‌ జిల్లా.  10నుండి 17వ తేదీ వరకు హైదరాబాద్‌ మినహా అన్ని తెలంగాణా జిల్లాలలోని 65 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్ల నుండి సుమారుగా వెయ్యిమంది  ఈ ఛాంపియన్‌ షిప్‌కు హాజరవుతున్నారు. రోడ్డుపై చెత్తవేయకుండా నేరుగా డంపింగ్‌యార్డులోకి తరలించడమే  ఈ పోటీల ముఖ్యఉద్దేశ్యం.  నిజంగా ఇది అభినందించదగ్గ విషయం.  రోగాలకు రెండొంతులు కారణం ఈ చెత్తే అని చెప్పుకోవాలి.  మున్సిపల్‌ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. ఇటువంటి కార్యక్రమాలపై పేరున్న కళాకారులు, పెద్దలు తమ వంతుగా దీన్ని మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగితే ప్రజల్లో తప్పకుండా అవగాహన కలుగుతుంది.  దీనికి తోడు మున్సిపల్‌ శాఖ, రహదారులు వంటి ఇతర శాఖలు కూడా చేయికలిపి  విజయవంతం చేయాలని ఆశిద్దాం. కేవలం పోటీలలో పాల్గొనటమే కాకుండా ఒక సంఘంగా    కాలనీల పరంగా ఏర్పాటై.. ఆయా కాలనీలలో రోడ్లపై చెత్తలేకుండా...చూడగలిగితే... ఈ కార్యక్రమం ఎంచుకున్న లక్ష్యం నెరవేరినట్లేనని ప్రకృతి ప్రేమికుల ఉవాచ.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.