దీని భావమేమి..

ఈ మధ్యకాలంలో నాయకులకు తాము ఏం మాట్లాడినా చెల్లుబాటైపోతుందనుకోవడం... ఆనక... అబ్బే.. నేను అలా అనలేదు... వక్రీకరించారు... అంటూ వచనాలు పలకడం అలవాటైపోయింది. ఇది సంచలనంకోసం కొందరైతే... ఇంకొందరు అనుకోకుండా అనేసి నాలుక్కరుచుకుంటున్నారు.. వారి బాట పట్టాడు హర్యానాకు చెందిన ఓ గ్రామ పెద్ద. హర్యానాలోని జింద్‌ జిల్లాలో 28 రోజులుగా తొమ్మిది అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.  రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలపై ఖాప్‌ పంచాయతీ సభ్యుడు సుబేసింగ్‌ మాట్లాడుతూ.. అత్యాచారాలకు టి.వి.లు, సినిమాలే కారణమని,  యువత సినిమాలు, టీవీలో వస్తున్న  అశ్లీల కార్యక్రమాలతో  చెడిపోతున్నారు.  అమ్మాయిలకు 16 ఏ ళ్ళ వయసులోనే పెళ్ళి చేస్తే...   అత్యాచారాల ఘటనలు ఆగిపోతాయి.’ అన్నారు.  ఇలాంటి వ్యాఖ్యలపై అక్కడి మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.  అత్యాచారాల నివారణకు కృషిచేయాల్సింది పోయి... మహిళా హక్కుల్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  16 ఏళ్ళ దళిత బాలికను నలుగురు యువకులు బలవంతంగా సామూహిక అత్యాచారం  చేశారు. ఆమె అవమానభారంతో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు యువకులను  అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటన జరిగిన అనంతరం ఖాప్‌ పెద్ద ఈ వ్యాఖ్యలు చేయడంతో మహిళా సంఘాలు మండిపోతున్నాయి. నిజానిజాలు యెలా వున్నా... నోరు వీపుకు చేటుతేకే... అన్న సామెతను అప్పుడప్పుడు  నాయకులు... నాయకులమని భావించేవారు గుర్తుంచుకుంటే మంచిదేమో!

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.