రాజకీయాల్లో పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి టైముంది: సునీత

 

 

దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు జోరుగుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పరిటాల శ్రీరాం తెరపై కనిపించడం మొదలుపెట్టాడు. దీంతో రవి అభిమానులు తమ ఆశాదీపం వచ్చిందనుకున్నారు. అక్కడక్కడా కనిపిస్తూ, అడపాదడపా రాజకీయ కార్యక్రమాల్లో మెరుస్తూ ఆశలు రేపిన శ్రీరాం గురించి ఇపుడు ఆయన తల్లి సంచలన నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరాం ఎంట్రీ ఉండబోదన్నారు. తన కొడుకు రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా టైముందని, ప్రస్తుతానికి ఏ నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. రాబోయే ఎన్నికలలో మాత్రం పరిటాల శ్రీరామ్ పోటీ చేయబోడని ఆమె స్పష్టంచేశారు. శ్రీరాం వచ్చేస్తున్నాడు అనుకున్న అభిమాలకు మాత్రం నిరాశను మిగిల్చింది. ఒకవైపు యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండగా ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదేమో అని పరిటాల కుటుంబ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.