వేదిక కుప్పకూలడంతో గాయపడ్డ చంద్రబాబు

 

చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శనివారం కొనసాగడం అనుమానంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి గద్వాలలో బహిరంగసభ వేదిక ఒక్కసారిగా కూలడంతో ఆయన వెన్నుపూసకు గాయం అయింది. సభ దగ్గరనుండి ఓ కిలోమీటరున్నర నడిచిన చంద్రబాబు ఆ తరువాత నడవలేక తన వెంట వచ్చే వాహనం తెప్పించుకుని అందులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత మరి కొంత దూరం నడిచి మరింత ముందుకు వెళ్లలేక తాను బస చేయాల్సిన చోటుకంటే ముందే ఆయన ఆగిపోయారు. వైద్యుల సలహామేరకు ఆయన యాత్రకు శనివారం విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. శనివారం గద్వాల, శెట్టి ఆత్మకూర్, ఈడిగోనిపల్లి, మదనపల్లి, పెద్దపాడు, పెద్ద చింతలరేవు, జూరాల ప్రాజెక్టు వరకు యాత్ర సాగాల్సి ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎక్స్ రే తీసిన అనంతరం వైద్యులు రెండురోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ఇప్పటికే 500 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసినందున విశ్రాంతి అవసరమని చెప్పారని పార్టీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని బాబును కోరతామని ఆయన వెల్లడించారు. వేదిక కూలిన సంఘటనలో చంద్రబాబుతో పాటు గద్వాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ లత్తిపురం వెంకటరామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కల రమాదేవి, టీడీపీ జిల్లా కార్యదర్శి రాములు, చేనేత కార్మికులు గోపీనాథ్, లలితమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.