ఘనంగా గరుడ సేవ – శ్రీవారి మోహినీ రూపం

 

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. తిరుమాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగాయి. మలమప్పస్వామికి మూలవర్ల ఆభరణాల్ని అలంకరించారు. గరుడసేవ ప్రారంభమయ్యే సమయానికి జోరున వర్షం.. శ్రీవారి గరుడసేవని చూడవచ్చిన భక్తకోటి పాపాలను కడిగిపారేయడానికా అన్నట్టు వరుణుడు ఆకాశగంగని కురిపించాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం. గరుడుడు శ్రీవారి వాహనం. ఓ కాలిని మడిచి మరోకాలిపై నిలిచి స్వామి ఎప్పుడు అనుజ్ఞ ఇస్తారా అని రెప్పవాల్చకుండా ఎదురుచూసే నిజమైన భక్తుడు గరుడుడు. శ్రీవారిని, దేవేరినీ సకలలోకాల్లో విహరింపజేయగల భాగ్యం ఒక్క గరుత్మంతుడికే దక్కింది. తల్లి దాస్యాన్ని విముక్తి చేసి ఆమెకు సద్గతిని కలిగించిన అఖండ శక్తిశాలి గరుత్మంతుడు. గరుత్మంతుడిని సేవించుకుంటే అఖండమైన శక్తి సంప్రాప్తమవుతుంది. సకల నాగదోషాలూ పటాపంచలైపోతాయ్. అనంతుణ్ణి తన వీపుపై మోసే గరుత్మంతుణ్ణి దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. మోహనరూపుడైన శ్రీనివాస విభుడు శుక్రవారం ఉదయం మోహినీ రూపంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనాన్ని ప్రసాదించారు. మోహినీ రూపంలో శ్రీవారిని చూసి సకలచరాచర సృష్టీ మోహపరవశంలో మునిగితేలింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.