సారీ చెప్పి యాత్ర చేసే దమ్ముందా?

 

చంద్రబాబుకి పాదయాత్రలో లభిస్తున్న విస్తృత స్థాయి ప్రజాదరణని చూసి పిల్లకాంగ్రెస్ పార్టీ భయపడుతోందని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అందుకే షర్మిల పోటీగా మరో పాదయాత్రని ప్రారంభించబోతోందని ఆరోపిస్తున్నారు. నిజంగా జనంకోసం యాత్ర చేయాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఇడుపులపాయనుంచి షర్మిల తన యాత్రని మొదలుపెట్టాలని టిడిపి నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు. ఇడుపులపాయ పక్కనే ఉన్న దళితుల భూముల్ని ఆక్రమించికుని ఏళ్లపాటు అనుభవించినవాళ్లకు ప్రజలకోసం యాత్ర చేసే అర్హత లేదంటూ విమర్శించారు. షర్మిల భర్తకి ఖమ్మంజిల్లాలో వై.ఎస్ రాసిచ్చిన ఇనుప ఖనిజం భూముల్ని తిరిగి ప్రభుత్వానికి స్వాధీననం చేయాలని డిమాండ్ చేశారు. రక్షణ స్టీల్స్ కోసం ప్రజలకు చెందాల్సిన భూమిని రాయించుకోవడం తప్పేనని ఒప్పుకుని క్షమాపణ చెప్పాకే యాత్ర మొదలుపెట్టాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.