మైనారిటీ కార్పొరేషన్ లో మరో భాగోతం

 

 

రాష్ట్ర మైనారిటి నిధుల గోల్ మాల్ వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నకిలీ ఖాతాలలో ప్రైవేటు వ్యక్తులు రూ.55.47 కోట్లు కొట్టేయగా మరో రూ.132 కోట్లు 18 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు మైనారిటీ సంక్షేమ ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడింది. వీటిలో రూ 128 కోట్లకు సంబంధించి పూర్తి వివరాలు లభ్యమయ్యాయి. మరో నాలుగు కోట్లకు సంబంధించి పూర్తి వివరాలు బయట పడకపోవడంతో అవి ఎక్కడున్నాయనే విషయంలో అనుమానం వ్యక్తం అవుతుంది. కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఇలియాస్ రిజ్వీ ఈస్థాయిలో ఎఫ్‌డీలు వేస్తున్నా సర్కారుకు సమాచారం లేకపోవడం గమనార్హం. మైనారిటీ సంక్షేమ శాఖలో బోధనా ఫీజుల విడుదలపై సాంఘిక, బీసీ సంక్షేమశాఖ అధికారులతో కూడిన టీమ్‌ల విచారణ వేగం పుంజుకుంది. సోమవారం హైదరాబాద్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు కాలేజీల్లో పరిశీలన జరిపినట్లు తెలిసింది. బోధనా ఫీజులు ఎక్కువగా మంజూరైన కాలేజీల్లోనే అధికారులు విచారణ జరుపుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.