గెజిటెడ్ అధికారి ఉద్యోగాలిచ్చినా చేరలేదు

ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఉద్యోగం దొరకాలంటే పైసలు పెట్టాల్సిందే ఈ మాటలు మనం రోజు వినేవే. దీనికి పూర్తి భిన్నంగా పిలిచి గెజిటెడ్ అధికారి ఉద్యోగాలిస్తే అక్షరాల 135 మంది ఉద్యోగం వద్దని, అసలు ఆ ఉద్యోగంలో చేరడానికే రాలేదు. రాష్ట్రంలోమండల వ్యవసాయ అధికారి నియామక పత్రాలు పంపితే మొత్తం 135 మంది చేరకపోవడంతో వ్యవసాయశాఖ బిత్తరపోయింది. వారి కోసం రెండు నెలలు ఎదురుచూసి ఇక మళ్ళీ నియామకాలు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధంచేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకా 200 ఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు నెలల క్రితం 474 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. వాటిలో సాంకేతిక కారణాల వల్ల 12 పోస్టులు ని౦పడం సాధ్యం కాక పక్కన పెట్టారు. మిగతా 462 పోస్టులకు అర్హుల నుంచి 327 దరఖాస్తులు రావడంతో వారికి నియామక పత్రాలను వ్యవసాయ కమిషనర్ కార్యాలయం పంపింది. ఉద్యోగంలో చేరడానికి నెల రోజులు గడువు ఇస్తే 135 మంది రెండు నెలలైనా రాలేదు. వీటి భర్తీకి అనుమతించాలంటు మళ్ళీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడానికి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం సిద్ధమవుతుంది.      

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.