వాద్రాకి హుడా సర్కారు క్లీన్ చిట్

 

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి భూకుంభకోణంలో హర్యానా సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. వాద్రాపై వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణ జరిపిన హర్యానా ప్రభుత్వం గుర్గావ్, ఫరీదాబాద్, పల్వాల్, మెవాట్ డెప్యూటీ కమిషనర్లచేత క్లీన్ చిట్ ఇప్పించింది. రాబర్ట్ వాద్రా ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆ నివేదికల్లో స్పష్టంగా పేర్కొనడాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసిస్తున్నాయ్. వాద్రా అవినీతి బాగోతాన్ని ఎండగట్టిన కేజ్రీవాల్.. హర్యానా ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి ఖంగుతిన్నారు. వాద్రాని బైటపడేస్తారన్న విషయం తెలిసినప్పటికీ యూపీఏ సర్కారు ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తుందని ఊహించలేకపోయామంటూ కేజ్రీవాల్ బృందం మండిపడుతోంది. వాద్రాకి హర్యానా ప్రభుత్వం ఇచ్చిన క్లీన్‌చిట్‌ నమ్మశక్యకంగా లేదని, ఇది 'స్వీయధృవీకరణ' వంటిదేనని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. కార్పొరేషన్‌ బ్యాంకు నుండి వాద్రా కంపెనీ తీసుకున్న ఓవర్‌ డ్రాప్టు రుణం వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకు నుండి 7.94 కోట్ల మేర ఓడి తీసుకున్నట్లు వాద్రా కంపెనీ తన బ్యాలెన్స్‌షీట్‌లో ప్రకటించగా బ్యాంకు దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఐఎఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కాని ఉన్నపళంగా బదిలీ చేసినప్పుడే కేసుని నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విషయం స్పష్టమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయ్.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.