కేసీఆర్ కి దైవ బలం తోడవుతోందా?
posted on Oct 24, 2019 @ 4:59PM
చండీయాగం, ఆయుత చండీయాగం, రాజశ్యామల యాగం ఇలా దేశంలో ఎవరూ చేయనంత గొప్పగా కేసీఆర్ యాగాలు చేస్తూంటారు. పొలిటికల్ నిర్ణయాలకే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను కేసీఆర్ తన ప్రత్యేకతను చూపిస్తారు. తాజాగా గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమవుతున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మిస్తున్న కొత్త ఇల్లు పూర్తి అవ్వగానే ప్రయుత చండీ యాగం నిర్వహించనున్నట్టుగా సమాచారం. గతంలో నిర్వహించిన అయుత చండీ యాగానికి రెట్టింపు ఏర్పాట్లూ ఈ యాగానికి అవసరం.
తెలంగాణ సీఎం కేసీఆర్ కి దైవభక్తి చాలా ఎక్కువ. ఉద్యమకాలంలో అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీ యాగం నిర్వహించి దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాలపై చర్చ మొదలయ్యేలా చేశారు. అంత గొప్పగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిష్టతో నిర్వహిస్తారు కేసీఆర్. దైవదర్శనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ దాదాపు దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని నెలల్లోనే యాదాద్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా మహాసుదర్శన యగాన్ని జరుపుతానని గతంలోనే సీఎం ప్రకటించారు. దాదాపు పది లక్షల మందితో భారీ ఏర్పాట్లతో ఆ యాగం జరగనుంది.
అయితే అంత కంటే ముందే కేసీఆర్ వ్యక్తి గతంగా మరో యాగం చేయనున్నారు. గతంలో ఆయుత చండీ యాగం పూర్తయిన సందర్భంగా ప్రయుత చండీ యాగం నిర్వహిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ భారీ యాగాన్ని నిర్వహించనున్నారు. తన ఫామ్ హౌస్ లో కొత్తగా నిర్మించిన ఇంటి నిర్మాణం పూర్తి అవ్వగానే ఈ యాగం చేయనున్నట్లు సమాచారం. వెయ్యికి పైగా కుండలతో వేల మంది రుత్వికులు పురోహితులతో లక్షల సార్లు చండీమాత పారాయణం చేస్తారు. అత్యంత కఠిన నియమ నిబంధనలతో పరిశుద్ధమైన వాతావరణంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రయుత చండీ యాగాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేయాలి. దేశంలో ప్రయుత చండీ యాగాలు చాలా అరుదుగా జరిగాయి. ఈ జనరేషన్ లో దాదాపుగా ఇదే మొదటిది అని చెప్పొచ్చు. కేసీఆర్ ఈ యాగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.మరి ఈ యాగం ఎలా జరుపుతారు అన్నది వేచి చూడాలి.