ఒక్కసారి తినిచూడండి... ఆపైన!

 

వచ్చే నెల 1వ తేదీ నుండి ఎసి తరగతి ప్రయాణ టికెట్‌, రవాణా ఛార్జీలతో పాటు రైల్వేస్టేషన్లలో ఆహారపదార్ధాల ధరలనుకూడా కేంద్రం పెంచబోతోందట! రవాణా ఛార్జీలపై సేవాపన్ను నుండి ఆహారధాన్యాలు, పెట్రో ఉత్పత్తులు, కొన్ని రకాల నిత్యావసరాలు (అంటే పప్పులు, పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, చక్కెర, పిండ్లు, పొడులు, రసాయన ఎరువులు, జనుము, నూనె గింజలు, ఎండు మిరప, జీలకర్ర, మిరియాలు, పత్తి, వక్క మొదలైనవి) సర్కారు మినహాయించింది. బహుశా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను చూసి రైల్వే ప్రయాణ ధరలు, అక్కడి ఆహార పదార్ధాల ధరలు పెంచబోతోందేమో! చేతిలో కలం వుందని సంతకం పెట్టేస్తారు. పెంచేస్తారు! అయితే అసలు రైల్వే స్టేషన్‌లో ఆహార పదార్ధాలను ఎప్పుడైనా ఓసామాన్యుల్లా ఆర్డరు వేసి తిన్నారా? తిని చూడండి. ఆ తర్వాత ఆ పదార్ధాలకు పెంచడం సమంజసమో, కాదో వారికే తెలుస్తుంది. నాణ్యతలను పట్టించుకోరు. కళ్లున్న గాంధారిలా తయారయింది ఈ ప్రభుత్వం... అని వాపోతున్నారు సామాన్య ప్రజలు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.