‘ప్రతిజ్ఞ’ చేయాలి... తప్పదు!

భారతదేశము నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు.. నేను నా దేశమును ప్రేమించుచున్నాను...అంటూ విద్యాలయాల్లో పిల్లలచేత ప్రతిజ్ఞచేయించడం  అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో చేయిస్తున్నారంటే... అనుమానించాల్సిందే!  వందేమాతరం  వ్రాసింది ఎవరంటే బకించంద్ర అంటారు, జనగణమన ఎవరంటే రవీంథ్రనాథ్‌ ఠాగూర్‌ అంటారు. మరి ప్రతిజ్ఞ ఎవరు వ్రాశారంటే... దానికి ప్రతివారి ముఖం ప్రశ్నగుర్తుగా మారుతుంది! అది ఎవరూ వ్రాశారో తెలియదు కనుక. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కనుక. అయితే ఆ ప్రతిజ్ఞను వ్రాసింది మన తెలుగువాడు అన్న విషయం తెలిస్తే ప్రతి తెలుగు గుండె ఆనందంతో ఉప్పొంగుతుందేమో. ప్రతిజ్ఞ రచయిత నల్గొండ జిల్లాకు చెందిన పైడిమర్రి  వెంకటసుబ్బారావని 1962లో విశాఖపట్నంలో వృత్తిరీత్యా డిటివొగా బదిలిఅయినప్పుడు అక్కడే ఈ  రచన చేశారని తెలుస్తోంది.  1962లో ఈ గీతాన్ని వ్రాసి నాటి  పార్లమెంట్‌ సభ్యులు  తెన్నేటి విశ్వనాథంకు వినిపిస్తే మెచ్చుకుని నాటి విద్యాశాఖామంత్రి పి.వి.జి.రాజుగారికి చూపిస్తే ఆయన దాని భావాన్ని, రచనను మెచ్చుకుని  ప్రతి పాఠశాలలోను ఈ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీచేశారుట.  మొదట విశాఖలోని పాఠశాలలో ఈ గీతం ఆలపించడం జరిగింది. తర్వాత 1965 జనవరి 26వ తేదీ ప్రతి పాఠశాలలో ఉదయాన్నే  విద్యార్ధుల అసెంబ్లీ సమయంలో  ఆలపించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, దీనిపై అధ్యయనం చేసిన ఉత్తరాంధ్ర కన్వీనర్‌  ఎస్‌.ఎస్‌. శివశంకర్‌ తెలిపారు. క్రమంగా ఇది అన్ని భాషల్లోను అనువదించబడిరది.  పైడిమర్రి వెంకట సుబ్బారావు 1988 ఆగస్టు 13  చనిపోయారు. ఈయన కుమారుడు తన తండ్రి పేరు పాఠశాల పుస్తకాల్లో  రచయితగా ప్రచురించే వరకు పోరాడతానని అంటున్నారు.  నిజంగా ఇది ఆనందించదగ్గ విషయం.  అయితే దేశ చరిత్రలోకాని, రాష్ట్ర చరిత్రలోకాని తెలుగువాడికి గుర్తింపు లేదు, రాదన్నది ఎవరూ కాదనలేని నిజం.!  కనీసం ఈ విషయంలోనైనా వాస్తవాలను గుర్తించి మన తెలుగువాడికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషిచేసేందుకు, ప్రతిజ్ఞ చేయాలని ఆశించడం కన్నా మనం ఏం చేయలేం!

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.