అలిగి అసెంబ్లీ ఎక్కిన నన్నపనేని

రాష్ట్రంలో రైతులుపడుతున్న అవస్థల్ని చూసి టిడిపి నేతలు అల్లాడిపోతున్నారు. రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో  నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపాలన్ననిర్ణయం జరిగిపోయింది. పోలీసులు అక్కడికి వెళ్లనివ్వలేదు. గాంధీ బొమ్మ విగ్రహం ఉన్న ప్రాంగణానికి తాళంవేశారు. టిడిపి నేత నన్నపనేని రాజకుమారికి సర్రున కోపం ముంచుకొచ్చింది. అధికారుల వైఖరిపై అలిగిన ఆమె వెనకాముందూ చూసుకోకుండా అసెంబ్లీపైకి ఎక్కేశారు. అక్కడే కూర్చుని నిరసన తెలపడం మొదలుపెట్టారు. అధికారులకు కంగారు పుట్టుకొచ్చింది. అమ్మా, తల్లీ.. కిందకి దిగితే కోరినవన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్లినిస్తామన్నారు. పట్టుబట్టి కూర్చున్న నన్నపనేని కాస్త ఆలోచించారు. అధికారులు అరెస్ట్ చేస్తే నిరసన తెలపడం కష్టమౌతుందనుకున్న ఆమె.. అందరితో కలిసి గాంధీ విగ్రహంముందు ధర్నా చేయొచ్చన్న ఆశతో కిందికి దిగొచ్చారు. రైతుల కష్టాలగురించి చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని, అసెంబ్లీలో రైతుల సమస్యలగురించి ఉన్నపళంగా చర్చించాలని నన్నపనేని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.