లగడపాటి దిష్టిబొమ్మ దహనం, ఉస్మానియాలో ఉద్రిక్తత

తెలంగాణ మార్చ్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మారోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఉస్మానియా యూనివర్సిటీని మూసేయాలంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు వర్సిటీ విద్యార్ధులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రెచ్చిపోయిన విద్యార్దులు ఉస్మానియా పోలీస్టేషన్ పై రాళ్లు రువ్వారు. లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మని తగలబెట్టారు. గుంపుని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. తెలంగాణ వేడి రాజుకున్నప్పుడల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తడం సర్వసాధారణంగా మారిపోయిందని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ అదనపు బలగాల్ని వర్సిటీలో మోహరించి రెచ్చిపోతున్న విద్యార్ధుల్ని అదుపుచేయడానికి ప్రయత్నించడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. విద్యార్ధుల ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు యూనివర్సిటీలో తిష్టవేశాయన్న ఆరోపణలుకూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్ నేపధ్యంలో యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంటుందని ముందుగానే ఊహించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి విద్యార్ధులు విధ్వంసానికి దిగకుండా అడ్డుకున్నామని పోలీసులు అంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.