పార్టీ మారే ప్రసక్తే లేదు కోమటిరెడ్డి
posted on Nov 3, 2011 8:25AM
నల్లగొండ: కాంగ్రెసు పార్టీని వీడేది లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద చేపట్టిన ఆయన ఆమరణ నిరాహారదీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకుంది. తాను పార్టీ మారుతానంటూ ప్రచారం సాగుతుందని, అందులో ఏ మాత్రం నిజం లేదని ఆయన బుధవారం సాయంత్రం అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలంగాణ కోసం ఒత్తిడి తెచ్చేందుకే తాను దీక్ష చేపట్టానని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెకు కొనసాగింపుగా ఉద్యమ వేడి చల్లారొద్దనే ఉద్దేశ్యంతోనే తాను దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని ఆయన అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానన్నారు. గాంధేయ మార్గంలో చేస్తున్న తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఒకరిద్దరు నేతలు రానంత మాత్రాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకుందన్నారు.