కన్నడనటి హేమశ్రీ కేసులో వీడిన మిస్టరీ

 

కన్నడనటి హేమశ్రీ మరణం మిస్టరీ విడిపోయింది. అనంతపురంలో కాంగ్రెస్ నేత మురళీ ఫాంహౌస్ లో ఆమెపై అత్యాచారం జరిపి హత్యచేశారని విచారణలో తేలింది. హేమశ్రీకి ఎక్కువ మోతాదులో మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేయడంవల్ల చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. స్పృహకోల్పోయిన మూడుగంటలతర్వాత ఆమెని ఆసుపత్రికి తరలించారని, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఆత్యాచారానికీ, హత్యకీ పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నారు. హేమశ్రీ భర్త సుధీంద్రతో కాంగ్రెస్ నేత మురళికి వ్యాపార లావాదేవీలున్నాయ్. చాలాకాలంగా హేమశ్రీపై కన్నేసిన మురళి ఓ పథకం ప్రకారం అత్యాచారం జరిపి, హత్యచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కిందటేడాదే సుధీంద్రతో హేమశ్రీకి పెళ్లయ్యింది. అంతకుముందే అతనికి పెళ్లైపోయినట్టు తెలియడంతో హేమశ్రీ గొడవకు దిగడంతో బంధువులు రాజీ కుదిర్చారు. అప్పట్నుంచీ ఇద్దరూ అనంతపురంలో కాపురం చేస్తున్నారు. హేమశ్రీని ఆమె భర్త సుధీంద్రే హతమార్చాడన్న వదంతులు బలంగా ప్రచారమయ్యాయి. భార్యని చావుబతుకుల్లో ఆసుపత్రిలో చేర్చిన సుధీంద్ర పోలీసులకు కీలకమైన సమాచారం అందించడంతో మిస్టరీ విడిపోయింది. పరారీలో ఉన్న నిందితులకోసం పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.