జేసీతో జగన్ కి చెక్!

ఏపీలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై వై.ఎస్ మార్క్ ని తొలగించేందుకు ఆమె విశ్వప్రయత్నం చేస్తున్నారు. కిందటి ఉపఎన్నికల్లో వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనంలో
దక్కిన ఆదరణ చూశాక సోనియాకి కంటిమీద కునుకురావడంలేదు. ఎలాగైనా ఏపీలో జగన్ కి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిని మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో అధిష్ఠానం పరిశీలనలో ఉన్న పోటీదారుల లిస్ట్ లో రాయలసీమ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ పార్టీకి , జగన్ వర్గానికి చెక్ పెట్టాలంటే కాస్త గట్టి ప్రత్యర్థినే ఎంపికచేయాల్సుంటుందని సోనియా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో కిరణ్ కుమార్ రెడ్డి జరుపుతున్న సీరియస్ చర్చలు ప్రచారంలో ఉన్న ఊహలకు రెక్కలు మొలిపిస్తున్నాయి. ఏదెలా ఉన్నా..జగన్ వర్గాన్ని గట్టిగా ఎదుర్కోవడానికే అధిష్ఠానం ఇష్టపడుతుందని పార్టీలో సీనియర్లు అంటున్నారు.
 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.