శ్రీలక్ష్మికి బెయిల్ దొరికింది
posted on Oct 9, 2012 @ 10:56AM
సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ఓఎంసీ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మికి ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మహిళా జైలులో చేసిన నిరీక్షణకు తాత్కాలికంగా తెరపడింది. శ్రీలక్ష్మికి మూడున్నర నెలల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. మూడున్నర నెలల తర్వాత, అంటే వచ్చే ఏడాది జనవరి 20 వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. బెయిల్ ఇస్తూ శ్రీలక్ష్మికి షరతులు విధించింది. పాస్పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని, శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. శ్రీలక్ష్మి పూచీకత్తుల సమర్పణ ఆలస్యమవడంతో సోమవారం సాయంత్రం విడుదల కాలేదు. మంగళవారం ఉదయం బెయిల్ పత్రాలు జైలుకు అందిన తర్వాతే ఆమె విడుదల కానున్నారు.