బాబు భవిష్యత్‌కు బంగారుబాట !

రాజకీయాలు అనగానే ప్రజాసేవ అన్న మాట వినిపిస్తుంది. ఈ మాట అన్ననేతలు నిజంగానే ప్రజాసేవ చేస్తున్నారా? లేదా? అన్న విషయం మాత్రం పక్కన పెడితే ప్రజల్లో ఉన్న వారికే ఆదరణ లభిస్తుందని చెప్పాలి. గత ఉపఎన్నికల ఫలితాలు ప్రజల బలం ఏమిటో తెలియజేశాయి.  అందుకని ప్రజల దగ్గరికి వెళ్లటానికి ముందు అధికారపార్టీ కాంగ్రెస్‌ ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని చేపట్టింది.  అలానే ఎటువంటి చిన్న అభివృద్థి కార్యక్రమం ఏర్పాటు చేసినా కాంగ్రెస్‌ పెద్దలు క్యూలు కడుతూ మరీ ప్రజల ముందుకు వచ్చేస్తున్నారు.  ఎందుకంటే తమ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉందన్న విషయం ఆలస్యంగా గుర్తించినా కాంగ్రెస్‌ కార్యక్రమాల ప్రణాళిక నిరంతరంగానే ఉంది. ఇక ప్రతిపక్షపార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల ప్రజలను దగ్గర చేసుకోవాలని గుర్తించింది. అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మీకోసం వస్తున్నా పాదయాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రల ద్వారా ఆయన ఇప్పటికే పలురకాల అంశాలపై అథ్యయనం చేస్తున్నారు. అలానే ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న సమస్యలపై అప్పటికప్పుడే తన స్పందనను తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బాబు పాదయాత్రలకు బలమైన స్పందన తీసుకువస్తోంది. ఈయన ముందుగా ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవిశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎటువంటి సానుభూతి చూపకుండా ప్రజలు ఓ మంచి నాయకుడిని ఆదరించినట్లు ఉండటం ఈ యాత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 62ఏళ్ల వయస్సులోనూ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని బాబు ప్రయత్నించటాన్ని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాకుండా స్వాగతిస్తున్నారు కూడా.  ఎప్పుడు రాయలసీమ వెళ్లినా చంద్రబాబు ముందుగా కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాక్షనిజం గురించి ప్రస్తావించేవారు. అయితే ఈసారి ఆయన తన ప్రసంగంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లు తెలుసుకోవటం రైతులను ఆకట్టుకుంది. అలానే వ్యాపారుల నష్టాలను అడిగి తెలుసుకోవటం వారికి ఆసక్తిని రేపింది. ఇలా తనదైన శైలిని కొంత మార్చుకుంటూ చంద్రబాబు యాత్ర ముందుకు సాగుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ యాత్ర బాబు భవిష్యత్‌కు బంగారు బాట కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

ఇక నిన్నటి దాకా కొత్తపార్టీ అనిపించుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా తమకున్న జనబలాన్ని నిలబెట్టుకోవాలని ప్రజల ముందుకు బయలుదేరింది. ఆ  పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తనకు బదులుగా సోదరి షర్మిలను పంపించేందుకు అనుమతించటంతో ఈ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. చంద్రబాబు మాదిరి సుదీర్ఘయాత్ర కాకుండా 2,500కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర ద్వారా జగన్‌ గతంలో నింపిన ఉత్సాహాన్ని మళ్లీ రేకెత్తించాలని వైకాపా ఆశపడుతోంది. అయితే జగన్‌ చంచల్‌గూడా జైలులో ఉండటం, ఇడి ఆయన ఆస్తుల సీజ్‌పై దృష్టి సారించటం కూడా స్పందన తగ్గటానికి కారణమవ్వొచ్చని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కార్యకర్తలను కాపాడుకోవటమే ఈ పార్టీ ప్రధానలక్ష్యం. ఇలా రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు ప్రజల ముందు తిరుగుతుంటే భారతీయజనతాపార్టీ మాత్రం రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునే చిన్న ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రత్యేకతెలంగాణాకు మద్దతు ఇచ్చినందుకు ఆ పార్టీ తెలంగాణాకే పరిమితం కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు కూడా ఈ పార్టీ చేయటం లేదు. ఇక కమ్యూనిస్టుపార్టీలు ప్రస్తుతం ఉద్యోగసంబంధిత అంశాలపైనే దృష్టిసారిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి రాజకీయపట్టు సాధించే దృష్టి ఈ రెండు పార్టీలకు లేకపోవటంతో ఇవి ప్రజలతో మమేకం కాకపోయినా వీటి గురించి చర్చించే వారే పెద్దగా ఉండకపోవచ్చు.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”