కేంద్రం జగన్‌తో లాలూచీ పడిందా?

 

కేంద్రం జగన్‌తో లాలూచీ పడిందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయి, చంచల్‌గూడా జైల్లో ఉన్న జగన్‌తో కేంద్రం లోపాయి కారీగా ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానం చంద్రబాబు మాటల్లో వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి ఎన్నికల వరకూ జగన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం అనంతర పరిణామాల ఫలితంగా కొంతమేరకు సానుకూల దృక్పధంతోనే ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. సిబిఐ న్యాయవాదులను మార్చడం ద్వారా జగన్‌ కేసును నీరుగార్చడం ఇందులో ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఇది విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ` జగన్‌ అక్రమాస్తుల కేసులో సిబిఐ తరఫు న్యాయవాదుల్ని ఎందుకు మార్చవలసి వచ్చిందో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయవాదుల్ని మార్చవద్దంటూ సిబిఐ చేసిన విజ్ఞప్తులను కేంద్రం ఏకపక్షంగా ఎందుకు పక్కన పెట్టిందో వివరించాలన్నారు. అవినీతి పరులపై కేసులు నమోదు చేయించి. లోంగదీసుకుని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకే  కేంద్రం ఇటువంటి ఎత్తుగడలు వేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాబోయో రోజుల్లో జగన్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి! చూద్దాం... ఏం జరుగుతుందో...

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.