కారణం ఏదైనా సభలో రగడే జరిగింది!

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజునే సభలో గందరగోళ పరిస్థితి కనిపించడంతో స్పీకర్ సభని గంటసేపు వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణకోసం వాయిదా తీర్మానాన్ని ప్రవేశెపెట్టాలని టిఆర్ ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనికి ఒప్పుకోకపోవడంతో టిఆర్ ఎస్ సభ్యులంతా తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతూ పోడియంలోకి దూసుకెళ్లారు. గంటసేపు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాతకూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. టిఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లారు. సజావుగా సాగే పరిస్థితి కనిపించకపోవడంతో స్పీకర్ రెండోసారి అరగంటపాటు సభనివాయిదా వేశారు. తిరిగి మూడోసారి సమావేశమైన తర్వాతకూడా అదే పరిస్థితి. ఈసారి సభ రేపటికి వాయిదాపడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఫీజులు, కరెంట్, రైతుల సమస్యలు, కరువు లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంమీద ముప్పేట దాడి చేయాలని గట్టిగా అనుకుని మరీ సభలోకి అడుగుపెట్టిన విపక్షాలు సభలో విలువైన ప్రజా సమస్యలగురించి చర్చించడంకంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంమీదే ఎక్కువ ధ్యాసను చూపించాయి. తెలంగాణ తీర్మానమో లేక విద్యుత్ సమస్యో.. ఏదో ఒకదానిమీద చర్చ జరిపితే ఫలితం కానీ.. సభని సమావేశ పరచలేదంటూ ముందు సొడ్లుపెట్టి, తీరా సభలోకొచ్చాక ఇలా కాలాన్ని వృథా చేయడం ఎంతవరకూ సమంజసమో ప్రజలకోసం పోరాడుతున్న, ప్రజలకోసమే పాటుపడుతున్న నేతలే ఆలోచించుకోవాలి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.