పలు అభివృద్ధి పనులకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో  44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను మంత్రి పార్థసారథి తెలిపారు. అమృత్ 2 లో భాగంగా 2026 మార్చి 31 కల్లా పెండింగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిందని.. అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. 

ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో E 3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించామన్నారు.

గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‍లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.532 కోట్లతో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు కల్పించింది.
 

ఈ నెల 26న రంగానాడు... పవన్, జగన్‌లపై కాపు నేతల్లో అసంతృప్తి

  వంగవీటి రంగా ఆశయ సాధనను కొనసాగించి, బడుగు బలహీన వర్గాలకు గొంతుకయ్యే లక్ష్యంతో రాధా -రంగా మిత్రమండలి, సుదీర్ఘ విరామానంతరం ‘రంగానాడు’ పేరిట భారీ బలప్రదర్శనతో బహిరంగసభకు సన్నద్ధమవటం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 26న రంగా వర్ధంతి నాడు విశాఖ తీరంలో జరగనున్న సభకు లక్షమందికి పైగా హాజరవుతారన్నది నిర్వహకుల అంచనా. ఆ మేరకు టీడీపీ-జనసేన-వైసీపీకి చెందిన కాపు-మున్నూరు కాపులతోపాటు.. మందకృష్ణమాదిగ, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావును కూడా ఆహ్వానించారు.  విశాఖ జిల్లాలోని కాపులు, విజయనగరం-శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని తూర్పు కాపులు.. సమీపంలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులతో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా, రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషించాలన్నది రంగానాడు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది కాపులకు సంబంధించిన సభ కాదు. రంగా అభిమానులది. రంగాకు అన్ని కులాల్లోనూ అభిమానులున్నారు. ఇది కులసభ కాదు. అందుకే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, బీసీ నాయకుడు, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావు హాజరవుతున్నారు. రంగా 38వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏవిధంగా కొనసాగించాలన్నదే ఈ సభ అజెండా.  ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతామని రాయలసేన కన్వీనర్ పోరుమామిళ్ల ఈశ్వర్ రాయల్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కాపుల్లో నెలకొన్న గందరగోళం, కాపు సంఘాల అసంతృప్తి పరిశీలిస్తే.. విశాఖ సభ కాపుల బలప్రదర్శనగానే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి రాకముందు తాము పెట్టుకున్న ఆశలు, అంచనాలు తల్లకిందులయ్యాయని.. తమ కులానికి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, కాపు సంఘాలు ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ మాకేదో చేస్తారని, మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారని ఆశించి జనసేన- ఆ పార్టీ మద్దతునిచ్చిన టీడీపీకి ఓట్లు వేశాం. మాకు ఇష్టం లేకపోయినా పవన్‌ను చూసి, జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీకి ఓట్లు వేశాం. కానీ అసలు పవన్ కాపు సంఘాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు. కాపు సంఘాలను దగ్గరకే రానీయడం లేదు. గతంలో మనకు టీడీపీలో ప్రాధాన్యం ఉండేది. చంద్రబాబు మనల్ని బాగా చూసుకున్నారని కాపు నేతలు అంటున్నారు. ఇప్పుడు కూటమిలో పవన్ ఉన్నందున ఆ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మనం వెళ్లి టీడీపీ కాపు ఎమ్మెల్యేలకు సమస్యలు చెబితే.. పార్టీ మమ్మల్నే పట్టించుకోవడం లేదు. ఇక మేం మీకేం చేయగలం? పరిస్థితులు అప్పటిలా లేవు. మీరు వెళ్లి పవన్‌ను కలవండి అని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పవన్ తమతో ఉన్నందున మిగిలిన కాపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధోరణిలో టీడీపీ ఉంది.  దీనితో మనం రెంటికీ చెడ్డ రేవడి అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చూస్తే జగన్ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో మీరే ఆలోచించి చెప్పండి అంటూ వనభోజనాల్లో కాపు సంఘ నేతలు, తమ కులస్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా విశాఖలో ఈనెల 27న జరగనున్న కాపునాడులో.. ఈ అసంతృప్తి ప్రతిబించబోతోందని, కాపు నేతలు జోస్యం చెబుతున్నారు.  

సుప్రీం ఆదేశాల మేరకు సరెండర్ అయిన పిన్నెల్లి బ్రదర్స్

  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  నేటితో సుప్రీం కోర్టు గడువు ముగియడంతో గురువారం ఉదయం (ఈ నెల11న) మాచర్ల జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు.ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు.  తెలంగాణలోని బంధవుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి కింద పడిన ఇద్దరినీ బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

15 ఏళ్ల తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సచిన్

  భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ రంగంలో ఆయన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలవబడుతున్న సచిన్ టెండుల్కర్ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన ఎంట్రీకి సాయపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్‌ నిలబెట్టుకున్నానని సచిన్ తెలిపారు.  భారత్ తరఫున 1989 నవంబరులో సచిన్‌ టెండుల్కర్‌ పాకిస్థాన్ తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ఆ ఎంట్రీ కంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున సచిన్‌ సెంచరీ బాదారు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టారు. మ్యాచ్ లో సెంచరీ చేయకుండా ఉంటే.. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం ఆలస్యంగా జరిగేది. అయితే గురుశరణ్ సింగ్ త్యాగం కారణంగా సచిన్.. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం త్వరగా జరిగింది. ఈ విషయాన్ని సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవలే స్వయంగా వెల్లడించారు. 1989 ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్‌ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్‌ సింగ్‌ విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సచిన్‌ శతకం బాదే వరకు ఎంతో సహకారం అందించాడు. చివరకు సచిన్ శతకం చేసి.. సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. ఆ సందర్భంలో గురుశరణ్‌ సింగ్‌ త్యాగానికి ప్రతిగా.. సచిన్‌ అతడికి ఓ మాట ఇచ్చాడు.  దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. "రిటైర్‌ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్‌ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను. గురుశరణ్.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావు. అలా నువ్వు రిటైర్‌ అయ్యి బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ కోసం ప్లేయర్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతానని చెప్పాను. పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నాను. అతడి కోసం బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ ఆడాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నారు.

40 ఏళ్ల స‌మ‌స్య‌కు హైడ్రా ప‌రిష్కారం

  హైద‌రాబాద్‌ నగరంలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ ప్రాంతంలోని మ‌ణెమ్మ గ‌ల్లీ నివాసితులు హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్ ని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 40 ఏళ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారంటూ శాలువ‌ను క‌ప్పి అభినందించారు.  డ్రైనేజీ పైపులైన్లు త‌మ స్థ‌లంలోంచి వెళ్లాయ‌ని 50 ఏళ్ల క్రితం అక్క‌డివారు అడ్డుకున్నారు. అప్ప‌టి నుంచి వివాదం కొన‌సాగ‌డం.. భూగ‌ర్భ డ్రైనేజీ పైపులైన్లు దెబ్బ‌తిన‌డంతో మురుగు, వ‌ర‌ద నీరు నిలిచిపోయి ఇబ్బందులు ప‌డ్డామ‌ని.. పైపులైన్ల పైన వేసి దారి కూడా బంద్ అవ్వ‌డంతో న‌ర‌కం చూశామ‌ని కాలనీ వాసులు వాపోయారు. హైడ్రా రాక‌తో ఈ ఇబ్బందుల‌న్నీ తొల‌గాయ‌ని ఈ సంద‌ర్భంగా ప‌లువురు తెలిపారు.  గ‌త ఏడాది ఆగ‌స్టు 28న హైడ్రా క‌మీష‌న‌ర్ నేరుగా ప‌రిశీలించి స‌మ‌స్య‌ను తెలుసుకుని.. అదే నెల 30వ తేదీన ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన విష‌యాన్ని గుర్తు చేశారు. కోర్టు వివాదాల‌తో ర‌హ‌దారి, భూగ‌ర్భ డ్రైనేజీ నిర్మాణం ఆల‌స్య‌మైంద‌న్నారు. చివ‌రికి కోర్టు తీర్పుతో ఇటీవ‌ల ప‌నులు పూర్త‌య్యాయ‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. మరోవైపు మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్ స‌ర్వే నంబ‌రు 191లో 10 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ రూ. 750 కోట్లకు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఇక్క‌డ ప్ర‌భుత్వ భూమి క‌బ్జా జ‌రుగుతుంద‌ని స్థానికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు హైడ్రా క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ అధికారుల‌తో క‌లిసి విచారించింది.   ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకుంది.  హైడ్రా క‌మిష‌న‌ర్   ఆదేశాల మేర‌కు శాశ్వ‌త నివాసాల జోలికి వెళ్ల‌కుండా.. మిగ‌తా షెడ్డుల‌ను, ప్ర‌హ‌రీల‌ను తొల‌గించి.. 10 ఎక‌రాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు లు ఏర్పాటు చేసింది .  

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  మంత్రి కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారిస్తూ, కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ, 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని కోర్టు పేర్కొన్నాది. గతంలో  అక్కినేని  నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా   తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని  అని, రేవ్ పార్టీలు నడుపారని విమర్శించారు.  టాలీవుడ్ నటులు నాగ చైతన్య-సమంతా రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు.   

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఒక ముఖ్యమైన పరిణామంగా, ప్రభాకర్ రావు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సడలించింది. కేసులో కీలక విషయాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వారం రోజులపాటు పోలీసు కస్టడీ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, రేపు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలి. రేపటి నుంచి ప్రారంభమై వచ్చే ఏడు రోజులపాటు ఆయనను కస్టడీలో ఉంచుకుని విచారణ చేయనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.అయితే, విచారణ సమయంలో ఎటువంటి శారీరక లేదా మానసిక ఒత్తిడి, టార్చర్ చేయరాదని కోర్టు పోలీసులు మరియు సిట్ అధికారులను గట్టిగా హెచ్చరించింది. కస్టడీ సమయంలో  ప్రభాకర్ రావుకు ఇంటి భోజనాన్ని కోర్టు  అనుమతించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి భోజనం, అవసరమైన మందులు అందేలా చూడాలని కూడా ఆదేశించింది. వారం రోజుల కస్టడీ పూర్తయ్యాక, విచారణలో వచ్చిన వివరాలను సుప్రీంకోర్టుకు సమగ్రంగా నివేదించాలని ఆదేశిస్తూ, అందిన సమాచారం ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ప్రభాకర్ రావు పక్షానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని న్యాయ వర్గలు వెల్లడించారు...వారం రోజుల విచారణ అనంతరం మొత్తం వివరాలను కోర్టుకు సమర్పించాలని సిట్‌కు సుప్రీంకోర్టు సూచించింది. కస్టడీ విచారణలో బయటపడే వివరాల ఆధారంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది.తెలంగాణ ప్రభుత్వం తరఫున  వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించారు. 

రూ.43.5 కోట్లు చెల్లిస్తే అమెరికా పౌరసత్వం

  ట్రంప్ 2.0 పాలన పెను సంచలనాలతో సాగుతోంది. మొదటి రోజు నుంచే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ .. అమెరికా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. అమెరికా పౌరసత్వం , వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు.  ఇక అమెరికాలో పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేసి.. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ట్రంప్.. కొత్తగా కొన్ని రోజుల క్రితం గోల్డ్ కార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వం పొందడమే ఈ గోల్డ్ కార్డు పౌరసత్వం. 5 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.43.5 కోట్లు చెల్లించి ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్‌ ఫస్ట్‌ లుక్‌ను తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ విడుదల చేసి, బుధవారం నుంచి గోల్డ్ కార్డ్ ధరఖాస్తులను విక్రయానికి పెట్టారు. తాజాగా వైట్ హౌస్‌లో జరిగిన మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడి విమానం అయిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో మీడియాతో మాట్లాడే సమయంలో ట్రంప్.. ఆ గోల్డ్ కార్డును చూపించారు.  ట్రంప్‌ ఫోటోతో ఉన్న ఆ గోల్డ్ కార్డును 5 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ గోల్డ్ కార్డును ట్రంపే స్వయంగా మొదట కొనుగోలు చేశారు. అయితే రెండో గోల్డ్ కార్డును ఎవరు కొంటారు అనేది తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ గోల్డ్‌ కార్డ్‌ 2 వారాల్లో అమ్ముడు అయిపోతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ఉపయోగించి చేస్తున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు ఈ గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.  చట్టబద్ధంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి రూ.43.5 కోట్లు వెచ్చించేవారికి ఈ గోల్డ్‌ కార్డు అందిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను అమెరికాలోకి ఆకర్షించేందుకే ఈ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాంటి సంపన్నులు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్‌ వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డుకు భారీగా డిమాండ్ ఉందని ఒకేరోజు వెయ్యి కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ ఇటీవల స్పష్టం చేశారు. ఈ గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా 5 బిలియన్‌ డాలర్లు సేకరించినట్లు తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందంటున్నారు. 1990లో అమెరికా ఈ ఈబీ-5 వీసా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం కింద వేలాదిమంది ఇన్వెస్టర్‌ వీసాలను పొందారు. అయితే ఈ ఈబీ-5 వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని.. కొందరు అక్రమంగా దోచుకుంటున్నారని తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేయగా.. తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో గోల్డ్‌ కార్డును ప్రవేశపెట్టారు.  

రో-కోలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?

  టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2024 - 25 సీజన్‌లో కోహ్లీ, రోహిత్ A+ కేటగిరీలో ఉన్నారు. గత ఏడాది వీరిద్దరూ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయ్యి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2025-26 సీజన్ లో వీరిని A+ కేటగిరీ నుంచి గ్రేడ్ Aకి డిమోట్ చేసేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే వారి జీతంలో సుమారు రూ.2 కోట్లు తగ్గుతాయి.  డిసెంబర్ 22న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఈ ఇద్దరి కాంట్రాక్టులు ప్రధాన ఎజెండాగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వార్షిక కేటగిరీల వారిగా ఫీజుల వివరాలు ఇప్పుడు చూద్దాం.. A+ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు రూ.7 కోట్లు, A కేటగిరి రూ.5 కోట్లు, B కేటగిరి రూ.3 కోట్లు, C కేటగిరిలోని ప్లేయర్లకు రూ. కోటి జీతం అందుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో నాలుగు కేటగిరిల్లో ఆటగాళ్లను విభజించి వారికి బీసీసీఐ జీతాలు అందజేస్తుంది.  టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్‌కు ఈ సారి A+ గ్రేడ్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం గిల్ A కేటగిరిలో ఉండగా.. జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ఉన్నారు. డిసెంబర్ 22న జరిగే అపెక్స్ కౌన్సెల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల రెమ్యూనరేషన్ పెంపు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన అప్డేట్లు వంటి వాటిపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగిన బీసీసీఐ సంస్థాగత మార్పుల తర్వాత ఇదే తొలి సమావేశం కావడం విశేషం. బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి అపెక్స్ మీటింగ్ ఇదే. ఈ సమావేశంలో మిథున్‌తో పాటు ట్రెజరర్ రఘురాం భట్, కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, అపెక్స్ కౌన్సెల్ సభ్యుడు జయదేవ్ షా పాల్గొననున్నారు. మొత్తంగా వచ్చే సమావేశంలో ఒకవేళ కోహ్లీ, రోహిత్‌లను గనుక 'A' కేటగిరీ(రూ. 5 కోట్లు)కి తగ్గిస్తే, 'A+'కేటగిరి (రూ. 7 కోట్లు)తో వారిద్దరూ ఒక్కొక్కరు రూ. 2 కోట్లు తక్కువగా సంపాదిస్తారు.  

పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ : సీఎం చంద్రబాబు

  అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు  ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో గురువారం వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు.  వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గానూ గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఏర్పాటు అవుతున్నట్టు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి.. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు.  క్వాంటం పరిశోధనలతో బయోసెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వారికి వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే  మొత్తంగా క్వాంటం ఎకో సిస్టం అమరావతికి వస్తోందని సీఎం అన్నారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు.  ఇప్పుడు క్వాంటం గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పనిచేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటర్ కేంద్రం ద్వారా పరిశోథనలు చేసి ఔషధాలు, మెటీరియల్ సైన్స్ సహా వివిధ అంశాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటం బయోఫౌండ్రీ అనేది వినూత్న ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు.  బయోమెడికల్ రీసెర్చితో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లోని భాగస్వాములు క్వాంటం వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఎకోసిస్టం అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చి సంస్థలకు ఏక్యూసీసీ కేంద్రంగా అవుతుందని తెలిపారు.  రూ.200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటిరియల్ సైన్స్ పై పరిశోధనలు చేయనున్నట్టు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. క్వాంటం వ్యాలీతో పాటు, ఏపీలో అమలవుతున్న విధానాలను తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.  

ఇండిగో నుంచి ప్ర‌తిదీ దేశం కోసం కాదు..అదానీ కోస‌మేనా!?

  ఇండిగో వ్య‌వ‌హారం  వెన‌క అదాని  ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయా? అస‌లు అదానీకి  మోదీకి ఉన్న సంబంధ బాంధ‌వ్యాలేంటి?  సీ పోర్ట్, ఎయిర్ పోర్ట్,  రోడ్లు, విద్యుత్ ఇలా రంగ‌మేదైనా  స‌రే, అదాని  ప‌రం చేయ‌డానికే మోడీ ఇదంతా  చేస్తున్నారా? అంటే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన  ప‌రిణామ క్ర‌మం ఏంటో ఒక‌సారి ప‌రిశీలించాల్సి వ‌స్తుంది. తాజాగా త‌లెత్తిన ఇండిగో వ్య‌వ‌హారంలో అదానీ సంస్థ‌ల‌ పాత్ర బ‌హిర్గ‌త‌మైంది. అదెలాగంటే అదానీ ఏవియేష‌న్, పైల‌ట్ ట్రైనింగ్ లోకి అడుగు పెట్టారు. అదానీ ట్రైనింగ్ సెంట‌ర్లో ఇబ్బ‌డి  ముబ్బ‌డిగా పైల‌ట్ ట్రైనింగ్ కి  జ‌నం చేరాలంటే అందుకు త‌గిన విధంగా రూల్స్ అండ్  రెగ్యులేష‌న్స్ మార్పించాలి. అందులో భాగంగానే డీజీసీఏ ద్వారా  పైల‌ట్ల  ప‌ని గంట‌లపై ఒక రూల్ పాస్ చేశారు. దీంతో ఇండిగోకి వేలాది  మంది  పైల‌ట్ల అవ‌స‌రం ఏర్ప‌డింది. అలా ఇండిగో  సంక్షోభం త‌లెత్తింద‌ని ఒక‌ అంచ‌నా. కేవ‌లం ఈ ఒక్క అంశం మాత్ర‌మే కాదు.. డిమానిటైజేష‌న్, రైతుల గిట్టుబాటు ధ‌ర‌ల విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని చెప్పాలంటారు ప‌లువురు ప‌రిశీల‌కులు. అదానికి లాభం చేకూర్చ‌డ‌మే ధ్యేయంగా ఈ మొత్తం  నెట్ వ‌ర్క్ ప‌ని చేస్తుందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఒక‌ప్పుడు బీజేపీ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి మొత్తం  నాగ్ పూర్ లో కేంద్రీకృత‌మ‌య్యి ఉండేది. అదే, 2014 నుంచి ఈ గ్రావిటీ మొత్తం గుజ‌రాత్ త‌ర‌లి వెళ్లింది. మ‌రీ ముఖ్యంగా మోడీ, షా ఎక్క‌డుంటే అక్క‌డ కేంద్రీకృతం కావ‌డం ప్రారంభ‌మ‌య్యింది. ఇంకా జూమ్ వేసుకుని చూస్తే.. ప్ర‌స్తుత బీజేపీ పాల‌న మొత్తం అదానీ కేంద్రంగా న‌డుస్తున్న‌ట్టుగా బ‌య‌ట ప‌డుతుందంటారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు వీరు ఎవ‌ర్నైనా బ‌లి పెట్టేస్తార‌న‌డంలో ఎంత మాత్రం అనుమానం లేద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం ఇండిగో వ్య‌వ‌హారంలో దేశం ప‌రువు ప్ర‌తిష్ట‌లు ఎంత‌గా మంట గ‌ల‌సి పోతున్నా స‌రే, లెక్క చేయ‌కుండా అది మిస్ ఫైర్ కావ‌డంతో వెంట‌నే కోలుకుని ఆ నింద మొత్తం ఒక‌రిపై నెట్టేయ‌డం అంటే అది మాములు విష‌యం కాదు. అందుకే ఆ వ్య‌క్తికి అంత‌టి మంత్రి ప‌ద‌వి ఇచ్చారా? అన్న డౌట్ కూడా వ‌స్తుంది.  మోడీని గుడ్డిగా న‌మ్మే వారికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులు అదానీకి రాసిచ్చేశారు. విశాఖ గంగ‌వ‌రం పోర్ట్, వైజాగ్ పోర్టు ప్ర‌స్తుతం అదానీ గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. గాజువాక స్టీల్ ప్లాంట్ భూముల విష‌యానికి వ‌స్తే.. ఒక సిమెంటు కంపెనీకి ప్లాంట్ కోసం భూమికావాలి. అందుకోసం ఏకంగా విశాఖ ఉక్కునే అమ్మేయాల‌న్న  ప్ర‌తిపాద‌న‌లు వెలుగు చూశాయి.  క‌రోనా టైంలో కూడా లాభాల్లో ఉంటే.. దాని ఫ‌ర్నీసులు కొంత  కాలం  నిలిపేశారు. అట్లుంట‌ది మోడీతో అనంటారు. విశాఖ‌లో అదానీ సెంట‌ర్ కోసం వంద‌ల ఎక‌రాల భూములిచ్చేస్తున్నారు. ఇలా నేరుగా చేస్తే వ్య‌తిరేఖ‌త వ‌స్తుంద‌ని భావించి గూగుల్ ముసుగు వేశార‌ని చెప్పుకొస్తున్నారు. వ‌చ్చే రోజుల్లో విశాఖ‌ప‌ట్నం కాస్తా అదానీ ప‌ట్నంగా మారినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. దేశంలో ఆహార గోదాముల‌న్నిటినీ అదానీకి రాసిచ్చేయ‌డం వెన‌క‌.. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల్లేకుండా కేవ‌లం  కార్పొరేట్ కంపెనీలు మాత్ర‌మే బాగు ప‌డాల‌న్న ఉద్దేశం దాగి ఉంద‌ని అంటారు. రైతులు ఢిల్లీలో ఘోర‌మైన చ‌లిలో ఉద్య‌మం చేశారు. ఆ రైతుల్లో కొంద‌రు చ‌లికి త‌ట్టుకోలేక మ‌ర‌ణించాక‌.. అప్పుడు రైతు గిట్టుబాటు ధ‌ర‌ల చ‌ట్టం చేశారు.   ఇక ల‌డ‌ఖ్ లో 45 వేల ఎక‌రాల భూమి వ్య‌వ‌హారం. అక్క‌డంతా కొండ‌ల మ‌యం. ఆ భూమిని కూడా అదానీ ప‌రం చేసేశారు. సోలార్ ప‌వ‌ర్ కోసం క‌ట్ట‌బెట్టేశారు. అందుకే ఆర్టిక‌ల్ 370 ర‌ద్ద‌య్యింద‌న్న విష‌యం ఎంత మందికి తెలుసు?  ఇదంతా గుర్తించ‌ని గుజ‌రాతీ మార్క్ భ‌క్త జ‌నం.. హిందూ- ముస్లిం, భార‌త్- పాక్ మాయ‌లో ప‌డిపోతుంటారు. దీంతో ల‌ఢాఖ్ భూముల విష‌యంలో పోరాడుతున్న సోనం వాంగ్ చుక్ అనే సైంటిస్టును విల‌న్ గా చిత్రీక‌రిస్తారు. అత‌డ్ని జైల్లో పెట్టినా.. అంతా దేశం కోస‌మే అనుకుంటారు. కానీ, ఇదంతా అదానీ కోస‌మ‌ని తెలుసుకోలేని పిచ్చిత‌నం ఈ జ‌నానిద‌ని చెప్పుకొస్తారు కొంద‌రు ప‌రిశీల‌కులు. ఇక మ‌ణిపూర్ అల్ల‌ర్ల సంగ‌తి  స‌రే స‌రి. ఈ ప్ర‌పంచానికి తెలియ‌దు.. అక్క‌డ ఎంత‌టి ర‌క్త‌పాతం జ‌రిగిందో. ఇదంతా ఎందుకంటే అక్క‌డ అద్భుత‌మైన  లిథియం ఉంది. దీన్ని కూడా అదానీకి  రాసివ్వ‌డంలో భాగం. అందుకే ఆర్టిక‌ల్స్ ర‌ద్ద‌వుతుంటాయి. కొత్త కొత్త చ‌ట్టాలు పుట్టుకొస్తుంటాయి. ఎవ‌రైనా ఎదురొడ్డి పోరాడితే వారి  ప్రాణాలు సైతం పోతుంటాయ‌ని అంటారు కొంద‌రు విశ్లేష‌కులు. ఛ‌త్తీస్ గ‌ఢ్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఎన్ కౌంట‌ర్లో చ‌నిపోయిన హిడ్మా ఉదంతం తీస్కుంటే.. న‌క్స‌లైట్ల  ఉనికి లేని స‌మ‌యంలో కూడా అతి పెద్ద ఉద్య‌మం తీసుకొచ్చారు. అదే  2026 మార్చి నాటికి న‌క్స‌లైట్ ఫ్రీ స్టేట్ గా చేయ‌డం. దీని వెన‌క అస‌లు ఉద్దేశం ఏంటో చూస్తే.. హిడ్మా ఇక్క‌డ అడ్డుగా  ఉన్నాడ‌ని చెప్పి అత‌డ్ని ఎన్ కౌంట‌ర్ చేయించారు. ఎప్పుడైతే హిడ్మా అడ్డు తొలిగిందో.. ఆనాటి  నుంచి అదానీ సంస్థ‌ అక్క‌డ అడ‌వుల‌ను న‌రికి బొగ్గు త‌వ్వ‌కం ప్రారంభిస్తుంది. అందుకే తీవ్రంగా ఉద్య‌మిస్తున్నారు స్థానిక ఆదివాసీలు. అంతెందుకూ ఏపీలో అదానీ స్మార్ట్ మీట‌ర్స్ సంగ‌తే తీస్కుంటే  ఎంత దోపీడీ జ‌ర‌గ‌నుందో ముందు ముందు తెలుస్తుంద‌ని అంటారు. ఇక కేజీ బేసిన్ వ్య‌వ‌హారం విష‌యానికి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి గుజ‌రాత్ కి పైపులైన్లు వేసి మ‌రీ తోడేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాటి సీఎం ఏమ‌య్యారో విధిత‌మే.  ఇక్క‌డ జ‌నం ఎక్క‌డ మోస‌పోతుంటారంటే.. నాణానికి ఒక వైపు మాత్ర‌మే చూడ్డం వ‌ల్ల‌. మోడీ అండ్ కో ఆడించే  హిందూ- ముస్లిం, భార‌త్- పాక్ వంటి రాజ‌కీయ నాట‌కాలు మ‌రుగున  ప‌డిపోతుంటాయ్. ఒక వైపు బొమ్మ మాత్ర‌మే చూపించి మ‌రో వైపు అంబానీ, అదానీల‌కు ఈ దేశ ఆదివాసీల సంప‌ద దోచి పెట్టేస్తుంటార‌ని అంటారు ఈ వ్య‌వ‌హారాలు తెలిసిన‌ వారు. పాక్ అంటే మ‌న‌కు మాత్ర‌మే శ‌తృత్వం. అదే మోడీకి కాదు. అందుకే  ఆయ‌న ఎవ‌రికీ తెలీకుండా ఆ దేశం వెళ్లి విర్యానీలు భోం చేసి వ‌చ్చేస్తుంటారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో పాక్ ని ఒక శ‌తృదేశంగా చిత్రీక‌రించి జ‌నాన్ని ఆ మాయ‌లో ప‌డేలా  చేస్తుంటార‌న్న‌ది ఇక్క‌డ స్ప‌ష్టాతి స్ప‌ష్టం. కానీ దాన్నెవ‌రూ ప‌ట్టించుకోకుండా టోట‌ల్ బ్ల‌ర్.. చేసి బొమ్మ చూపిస్తారన్న  ఆరోప‌ణ‌లున్నాయ్.  బీహార్లోనూ అంతే ల‌క్ష  ఎక‌రాల భూమిని కేవ‌లం రూపాయ ధ‌ర‌కు అంబానీ ప‌రం చేసేశారు. అదేమంటే జ‌నం ఇళ్లు, గుడులు కూల‌దోస్తున్నారు దీంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ టైంలో మోడీ భూటాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.. అయితే ఇక్క‌డికి మోడీ ఎందుకెళ్లారో చూస్తే.. ఆ వెంట‌నే ఆ దేశంలో అదానీ ప్ర‌త్య‌క్ష‌మై.. అగ్రిమెంట్ చేసుకున్నారు.  ఇదే కాదు దేశ‌మేదైనా.. స‌రే, మోడీ ఏదైనా విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తే.. ఆ వెన‌క‌ అదానీ వ్యాపార అగ్రిమెంట్లు దాగి ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇది నిన్న‌మొన్నటి ఇండిగో అయినా, మ‌రొక‌టైనా అంతా దేశం కోస‌మ‌ని అంటారు కానీ, అదానీ కోస‌మేన‌ని తెలుస్తోంది. కానీ ఈ వ్య‌వ‌హార‌మేదీ జ‌నానికి  ఎందుకు తెలీదంటే, దేశ వ్యాప్తంగా ఉన్న 13 మీడియా సంస్థ‌లు అదానీ చేతిలో ఉండ‌గా.. అంబానీ చేతిలో 21 ఉండ‌టంతో ఇదంతా క‌నిపించ‌ని మ‌హామాయ‌గా జ‌రుగుతూనే వస్తోంది. ఇలాంటివి ఇంకెన్ని.. సంక్షోభాలు చూడాలో ఆ పైవాడికే  ఎరుక‌!!!