చంద్రబాబు యాత్రమీద భారీ అంచనాలు

జనంతో మమేకమయ్యేందుకు చంద్రబాబు 117 రోజుల పాదయాత్రను చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి యాత్ర మొదలవుతోంది. అక్టోబర్ రెండో తేదీన హిందూపురంలోని హనుమంతుడి ఆలయంలో పూజలు జరిపాక చంద్రబాబు యాత్రను ప్రారంభించబోతున్నారు. తొలిరోజున బావమరిది బాలయ్యబాబుతోపాటు, చిన్నబాబు లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికూడా యాత్రలో పాల్గొంటున్నారు. కోడలు బ్రహ్మణి అమెరికాలో ఉన్న కారణంగా యాత్రకు దూరంగా ఉన్నట్టు సమాచారం. తొలిరోజు యాత్రలో మొత్తం కుటుంబమంతా కలిసి పాల్గొనాలని ముందుస్తు ప్రణాళికఉన్నా అమెరికా ప్రయాణం కారణంగా కోడలు బ్రహ్మణి యాత్రలో పాల్గొనలేకపోతోంది. అక్టోబర్ రెండో తేదీ ఉదయం చంద్రబాబు తన సతీమణితో కలిసి బాపూఘాట్ ని, ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నేరుగా విమానంలో బెంగళూరుకెళ్లిపోతారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో హిందూపూర్ కి చేరుకుని యాత్రని ప్రారంభిస్తారు. మొదటి రోజు 5 కిలోమీటర్లమాత్రమే పాదయాత్ర ఉంటుందని, రాత్రికి బాబు ఓ స్పిన్నింగ్ మిల్లులో బసచేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబుతోపాటు రెండొందలమంది భద్రతా సిబ్బంది, వాలంటీర్లు, నేతలు, కార్యకర్తలు, సతీమణి భువనేశ్వరి ప్రత్యేకంగా పంపించిన ఓ వంటమనిషి, చంద్రబాబు ఆహార ఏర్పాట్లకోసం ప్రత్యేకించి ఓ బస్సు, రెండు మంచినీళ్ల ట్యాంకర్లు తరలివస్తాయి. చంద్రబాబు పాదయాత్రకోసం వందేమాతరం శ్రీనివాస్ ఆరు పాటల్ని సిద్ధం చేశారు. అనంతశ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ ఈ పాటలు రాశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.