చంద్రబాబు యాత్రమీద భారీ అంచనాలు
posted on Oct 1, 2012 @ 5:55PM
జనంతో మమేకమయ్యేందుకు చంద్రబాబు 117 రోజుల పాదయాత్రను చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి యాత్ర మొదలవుతోంది. అక్టోబర్ రెండో తేదీన హిందూపురంలోని హనుమంతుడి ఆలయంలో పూజలు జరిపాక చంద్రబాబు యాత్రను ప్రారంభించబోతున్నారు. తొలిరోజున బావమరిది బాలయ్యబాబుతోపాటు, చిన్నబాబు లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికూడా యాత్రలో పాల్గొంటున్నారు. కోడలు బ్రహ్మణి అమెరికాలో ఉన్న కారణంగా యాత్రకు దూరంగా ఉన్నట్టు సమాచారం. తొలిరోజు యాత్రలో మొత్తం కుటుంబమంతా కలిసి పాల్గొనాలని ముందుస్తు ప్రణాళికఉన్నా అమెరికా ప్రయాణం కారణంగా కోడలు బ్రహ్మణి యాత్రలో పాల్గొనలేకపోతోంది. అక్టోబర్ రెండో తేదీ ఉదయం చంద్రబాబు తన సతీమణితో కలిసి బాపూఘాట్ ని, ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నేరుగా విమానంలో బెంగళూరుకెళ్లిపోతారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో హిందూపూర్ కి చేరుకుని యాత్రని ప్రారంభిస్తారు. మొదటి రోజు 5 కిలోమీటర్లమాత్రమే పాదయాత్ర ఉంటుందని, రాత్రికి బాబు ఓ స్పిన్నింగ్ మిల్లులో బసచేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబుతోపాటు రెండొందలమంది భద్రతా సిబ్బంది, వాలంటీర్లు, నేతలు, కార్యకర్తలు, సతీమణి భువనేశ్వరి ప్రత్యేకంగా పంపించిన ఓ వంటమనిషి, చంద్రబాబు ఆహార ఏర్పాట్లకోసం ప్రత్యేకించి ఓ బస్సు, రెండు మంచినీళ్ల ట్యాంకర్లు తరలివస్తాయి. చంద్రబాబు పాదయాత్రకోసం వందేమాతరం శ్రీనివాస్ ఆరు పాటల్ని సిద్ధం చేశారు. అనంతశ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ ఈ పాటలు రాశారు.