తొలిరోజు 8.5 కి.మీ. పాదయాత్ర చేసిన బాబు

హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు అడుగడుగునా జన నీరాజనం మధ్య సాయంత్రం ఐదు గంటలకు హిందూపురం చేరుకున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, జాతీయ నాయకుల విగ్రహాలను ఆవిష్కరించి, రాత్రి 7.07 గంటలకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి రోజే విమర్శకులకు దీటైన జవాబు ఇచ్చారు. "ముఖ్యమంత్రి పదవి కోసం నేను ఈ యాత్రకు రాలేదు. అది నాకు కొత్త కాదు. దానిని నేను ఇప్పటికే తొమ్మిదేళ్ల పాటు చేశాను. పదవీ కాంక్షతో, అధికారం కోసం నేను మీ దగ్గరకు రాలేదు. రాజకీయ ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దోపిడీలను ప్రజలకు వివరించడానికే వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీపై ప్రజలను చైతన్యపరచడానికే వచ్చాను'' అని వివరించారు.

 


అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మంగళవారం రాత్రి 7.07 గంటలకు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేద పండితులు బాబును ఆశీర్వదించారు. అక్కడినుంచి పొట్టి శ్రీ రాములు సర్కిల్ మీదుగా 7.48 గంటలకు జామియా మసీదుకు చేరుకున్నారు. అక్కడ ప్రార్థనలు జరిపి ముతవలీ ఆశీస్సులు పొందారు. గాంధీసర్కిల్ మీదుగా రాత్రి 8.50 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని, బహిరంగసభలో ప్రసంగించారు. రాత్రి 9.52 గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్ మీదుగా ప్రఖ్యాత సీఅండ్ఐజీ మిషన్ చర్చికి చేరుకున్నారు. చర్చిలో ప్రార్థనలు జరిపి ఫాదర్ల ఆశీర్వాదం పొందారు. అనంతరం మేళాపురం క్రాస్‌లో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి చేనేత కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీఎంటీ లే అవుట్‌లో భోజనం చేసి బసచేశారు. పాదయాత్ర తొలిరోజు చంద్రబాబు 8.5 కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం ఉల్లాసంగా కనిపించారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.