తెలంగాణ మార్చ్ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికే లాభం
posted on Oct 8, 2012 @ 5:52PM
తెలంగాణ మార్చ్ కోసం కోదండరామ్ తెగ ఊగిపోయారు. ఎలాగైనా మార్చ్ ని విజయవంతం చేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరారు. మార్చ్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుకూడా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా మ్యానేజ్ చేయగలిగింది. గత అనుభవాల్ని దృష్టిలోపెట్టుకుని పోలీసులు పక్కా వ్యూహంతో ఆందోళనకారుల్ని కట్టుదిట్టం చేయగలిగారు. ముందునుంచీ మార్చ్ కి వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ ఈ విషయంలో సంతృప్తిగానే ఉన్నా తనకి పెద్దగా ఒరిగిందేం లేదు. మరి తెలంగాణ మార్చ వల్ల లాభపడిందెవరు? నూటికి నూరు శాతం కిరణ్ కుమార్ రెడ్డే.. అని ఈ ప్రశ్నకి సమాధానం అశేష తెలుగు ప్రజానీకంనుంచి గట్టిగా వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమం పేరుతో గతంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాల విధ్వంసం ఎపిసోడ్ ని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమేకాక ఓ పద్ధతిలో ముందుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి.. మార్చ్ తూతూమంత్రంగా ముసిగిపొయ్యేలా చేయగలిగారని కాంగ్రెస్ వర్గాలు బాహాటంగా చెప్పుకుంటున్నాయ్. దీనివల్ల అధిష్ఠానం దృష్టిలో కిరణ్ కి మంచి మార్కులేపడ్డాయి. లా అండ్ ఆర్డర్ చేయిజారిపోయిందన్న వాదనలకు ఈ మార్చ్ ని కంట్రోల్ చేయడంద్వారా కిరణ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టగలిగారని సోనియాతోపాటు ఢిల్లీ పెద్దలంతా భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఊపునే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలవరకూ కిరణ్ సీటుకి ఢోకా లేదని హస్తినలో పెద్దలు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎన్నిరకాల విశ్లేషణలు ఇచ్చినా, ఎన్నిరకాలుగా రాజకీయ సమీకరణాలగురించి అంచనాలు గుప్పించినా తెలుగువన్ డాట్ కామ్ మాత్రం ముందునుంచీ కచ్చితమైన విశ్లేషణని అందిస్తోంది. 2014 ఎన్నికలవరకూ కిరణ్ కుర్చీకి వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలుగువన్ డాట్ కామ్ ముందునుంచీ చెబుతూనే ఉంది.