పాదయాత్రలో కాంగ్రెస్ పై నిప్పులు కురిపిస్తున్న బాబు

చంద్రబాబు పాదయాత్రకు జనంలో విపరీతమైన స్పందన కనిపిస్తోంది. అరవైఏళ్ల వయసులో బాబు ఎలా దూసుకుపోతున్నారో చూసేందుకు జనం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు చిన్నా చితకా యాత్రలు చేసినప్పటికీ ఈసారి చాలా పెద్ద పాదయాత్రని చేపట్టడంతో జనంలో క్యూరియాసిటీ బాగా పెరిగిపోతోంది. బాబు ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇదే అదనుగా భావించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేతల్ని ఉతికారేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీయే మొత్తం స్కాముల పార్టీ అంటూ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి ఎనిమిదోరోజు పాదయాత్రని ప్రారంభించిన చంద్రబాబు విరూపాపల్లిలో రాత్రిబస చేశారు. దారిపొడవునా పాదయాత్రలో చంద్రబాబు కాంగ్రెస్ పై నిప్పులు చెరగడమే పనిగాపెట్టుకున్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రానికి నాలెడ్జ్ హబ్ అనే పేరొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో అది స్కాముల హబ్ గా మారిపోయిందని తీవ్రస్థాయిలో బాబు విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మేల్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించకపోతే కాంగ్రెస్ పార్టీకి పిల్లకాంగ్రెస్ పార్టీకూడా తోడై రాష్ట్రాన్ని పూర్తిగా దోచేస్తారంటూ చంద్రబాబు కాంగ్రెస్, వైఎస్సాఆర్ సీపీ లపై ఆరోపణాస్త్రాల్ని సంధిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.